లేబుళ్లు

30, జులై 2025, బుధవారం

                                                                        శిశిరం

                   (ఈ కధ 'మే' నెల, 2013 - ఆంధ్రభూమి మాస పత్రికలో ముద్రితమైనది )   
     
                  అర్ధరాత్రి దాటింది. ఎంతకూ నిద్ర రావడం లేదు. అలసటగావుంది. రెండ్రోజుల్లో హైదరాబాదులో వుంటామనుకుంటేనే గుండెల్లోంచి తన్నుకు వస్తోంది ఒణుకు. బెడ్  మీద నుంచి లేచి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని ఆలోచనలో పడ్డాను. 
'హైదరాబాద్  వెళ్ళాక ఎక్కడో ఒకచోట కలవక పోతామా? ముందుగా నేనే వెళ్తాను. అమ్మా, నాన్న ఎలా స్పందిస్తారో. అసలు ఇంట్లోకి రానిస్తారా?' అన్న ప్రశ్నలు నామెదడుని  తొలిచేస్తున్నాయి. ఇన్నేళ్ళ తరువాత  తిరిగి హైదరాబాదుకి వెళుతున్నామని తెలిసిందగ్గర నుంచి  మనసుతో ఇదే తంతు.
                                                                  * * * * *
తొమ్మిది సంవత్సరాలయింది అమ్మా, నాన్నలని వదిలి అమెరికా వచ్చి. ఎన్నిసార్లు ప్రయత్నం
చేశానో మాట్లాడుదామని. ఫోను నంబరు మార్చుకున్నారు. నా స్నేహితులన్న వారిని దగ్గరికి రానివ్వలేదు. అమ్మ నా మాట వస్తేనే మాట మార్చేసేదట.
వాళ్ళ సంగతులు  కొద్దో, గొప్పో మొదట రెండు మూడేళ్ళు తెలిశాయి. ఎన్ని లెటర్లు వ్రాసినా సమాధానం లేదు. ఇక ఇమెయిల్స్ అయితే లెక్కే లేదు ! 
తరువాత మా స్నేహితురాలు చెప్పింది అమ్మవాళ్ళు ఇంట్లోలేరని!
''ఇంట్లో లేరంటే ఏమిటే? ఎక్కడికైనా వెళ్ళారా... సరిగ్గా కనుక్కోలేకపోయావా? ఎక్కడికి వెళ్తారు?
వెళ్ళినా ఎన్ని రోజులు ఉంటారు? నువ్వెన్నిసార్లు వెళ్లావు ?" అని వివరాలడిగితే దాని దగ్గరనుంచి  మారు సమాధానం లేదు.
అమ్మా, నాన్నకి బాగా తెలిసిన నా ఫ్రెండ్స్ ఇద్దరు 'లావణ్య,లత.
''నన్నడకే వాళ్ళ సంగతులు. మీ ఇంటికి వెళ్లాలంటే నాకు చచ్చే  భయం!'' అని ఖరాకండిగా చెప్పింది లావణ్య. ఇక మిగిలింది లత.
అది కూడా నేను అమెరికా వచ్చిన రెండేళ్ళ తరువాత నాతో పూర్తిగా మాటే మానేసింది. అది 
ఇప్పుడు ఎక్కడుందో, ఏంచేస్తుందో తెలీదు. అలా ఫ్రెండ్స్ తో  కూడా టచ్ పోయింది. 
ఈ తొమ్మిదేళ్ళు ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు.
అమ్మా, నాన్న, తమ్ముడు గుర్తు వస్తే చాలు ఆరోజంతా మనశ్శాంతి వుండేది కాదు.
నిద్ర పట్టేది కాదు. ఏ పని మీద దృష్టి ఉండేది కాదు. ఆఫీసులో చాలాసార్లు మేనేజరు మందలించేవాడు పని మీద దృష్టి ఉంచమని.
నా పరిస్థితి చూసి ''బ్రేక్ తీసుకో శిశిరా!" అని సలహా ఇచ్చాడు శశాంక్
తరువాత వరుసగా బాబు, పాప.  ఆ పై నేను, నా సంసారం, నాపిల్లలు, నా ఇల్లు! 
అయినా ఇన్నేళ్ళలో ఒక్కక్షణం కూడా అమ్మ,నాన్న,తమ్ముడిని తలవని క్షణం లేదు. 
'వాళ్ళకేనా, పట్టింపు, నాకు లేదా' అనిపించేది ఒక్కోసారి!
మన జీవనగమనంలో ఒడిదుడుకులొచ్చాయని కాలమేమీ ఆగదుగా!
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. వెనక్కి చూసుకుంటే కాలచక్రంలో తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి.
                                                                     * * * * *
నాతరువాత పన్నెండేళ్ళ తేడాతో పుట్టాడు తమ్ముడు 'రాజేష్'. ఇప్పుడు ఇరవై రెండేళ్ళువాడికి.  నాకు అమ్మకంటె నాన్నతో ఎంతో కలివిడి. నాన్న ఎన్నడూ గట్టిగా కోప్పడినట్లుగా గుర్తు లేదు.
నేను చదువులో ఎప్పుడూముందే. ఇంజినీరింగ్ ఎంట్రెన్సులో ఆరు వేలలో 'రేంకు' వచ్చినప్పుడు ''ఏం సరిగ్గా ప్రిపేరు కాలేదా'? టి.వి చూడ్డం ఎక్కువయిందా?" అని మందలించారు అంతే! 
అప్పుడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడున్నాయి? దాంతో నేను సిటి వదలి ఇంజనీరింగ్ బయట చెయ్యాల్సి వచ్చింది. నాన్ననాకు ఇరవై ఒక్క సంవత్సరాల వరకూ ఒక మంచి స్నేహితుడు లానే వున్నారు.
ఆయన దగ్గర దాచి, ఆయనకు తెలీకుండా నేను చేసిన ఒకే ఒక్క పని ప్రేమ,పెళ్ళీ! 
పెళ్లి చేసుకుని శశాంక్ తో మా ఇంటికెళ్ళి నప్పుడు నాన్న నోటి మాట రాక, నిశ్చేష్టులై, షాకులో కూడ అన్న ఒక్కటే మాట. 
''గాడ్ బ్లెస్ యు బోత్!" అని లోపలి కెళ్ళివచ్చి ఒక 'కవరు' నా చేతికిచ్చారు. 
"ఏదైనా పెళ్లి కెళితే నేను ఇలాగే బహుమతి ఇస్తానమ్మా! అలాగే నీకు ఇచ్చాను'' అన్నారు కళ్ళజోడు క్రిందగా జారిన  రెండు కన్నీటి ధారలు తుడుచుకుంటూ అన్నారు.
''ఈ అబ్బాయి ఇంట్లోవాళ్లకైనా మీ పెళ్లి విషయం తెలుసా?'' అనడిగారు నాన్నగారు.'
ఆయన ముఖంలోకి చూసే ధైర్యం లేక నేను సమాధానం చెప్పలేదు.
శశాంక్  కల్పించుకుని "తెలుసండీ. మా వాళ్ళే చేశారు పెళ్లి'' అన్నాడు.
''ఓ అలాగా!" అంటూ నా వంక చాలా బాధగా చూశారు నాన్న.
ఆ 'చూపు' నా గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. చేసిన పెద్ద తప్పుకు 
విల విల్లాడుతూ బాధగా తలవంచుకోవడం మినహా నేనేమీ మాట్లాడలేకపోయాను.
నాకిప్పటికీ నాన్నగారు బాధగా చూసిన 'ఆ చూపు' గుర్తుంది. అది నన్నునీడలా వెంటాడుతూనే ఉంది. 
'ఏం తప్పు చేశామని మాకు ఈ శిక్ష వేశావు' అని  ఆయన నన్ను గుచ్చి, గుచ్చి అడిగినట్లుగానే అనిపించేది నాకు.
''దాని నగలు దానికిచ్చి బొట్టు పెట్టి పంపించు!'' అని అమ్మతో చెప్పి లోని కెళ్ళి మేము   వెళ్ళిన దాకా ఆయన బయటకు రాలేదు.
ఆక్షణంలో, నేను నా అపరిపక్వ నిర్ణయంతో ఆ ఇంటికి పరాయిదాన్నయిపోయాను. ఆరోజు నాన్నగారితో చనువుగా మాట్లాడలేక పోయాను. అమ్మ అరుస్తూనే వుంది. 
స్వతంత్రించి నేను వారికీ చెప్పకుండా చేసుకున్న కులాంతర వివాహానికి తట్టు కోలేక పోయారు.   నా నగలన్నీ నాకిచ్చేసి లోనికి వెళ్ళింది అమ్మ. తమ్ముడు ఇంట్లో లేడు. 
అలా ఆనాడు ఇంటినుంచి వెనుతిరిగి మళ్ళీ ఇన్నేళ్ల తరువాత హైదరాబాద్ తిరిగి వస్తున్నాను. 
                                                                 * * * * *
అప్పుడు అమెరికా బయలుదేరే ముందు ఫోన్లో నాన్నతో మాట్లాడి నప్పుడు ఒక్కటే అన్నారు.
''నన్ను మోసం చేసిన వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం వుండదమ్మా! ఆ సంగతి నీకు బాగా తెలుసు. ఇదే చివరిసారి, ఇక ఎప్పుడూ నాతో  మాట్లాడాలని ప్రయత్నించకు. నన్నుబాధ పెట్టకు. ఇప్పటికే సగం చచ్చిపోయాను. 'మాఇంటికి' చాలా మంది వచ్చి వెళుతుంటారు. 
నిన్నుఆ అతిధి కోవలో చూడలేను. అలాగని నిన్ను పరాయిదానిలా చూడడం నావల్ల కావడంలేదు. ఇంతటితో మమ్ముల్ని వదిలేయ్. పిల్లా, పాపలతో కల కాలం హాయిగావుండు! ఎన్నడూ నాదగ్గరికి  రావద్దు. ప్రయత్నం కూడా చేయకు.
"ఒక్క విషయం ఎప్పటికీ గుర్తుంచుకో. నువ్వు కులాంతర వివాహం చేసుకున్నావని కాదు ఈ ఆంక్షలు. నన్ను శత్రువు కన్నాఎక్కువ మోసం చేశావు, అందుకు నిన్ను క్షమించలేను. దిక్కులేనిదానిలా నువ్వు నీ స్వంత  నిర్ణయం తీసుకున్నావు. అలాగే స్వతంత్రం గానే వుండు'' అని కరకుగా మాట్లాడారు నాన్నగారు.
తరువాత  నాన్నగారు నాతో మాట్లాడ లేదు. నా తప్పు నన్ను కసిగా వెంటాడుతూనే వుంది. 
కని పెంచిన వారిని, తోబుట్టువును వదిలేసి మూర్ఖంగా నా స్వార్ధం చూసుకున్నాను. అందుకే జీవితంలో తల్లీ, తండ్రీ లేని దాన్నయ్యాను. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడని క్షణం లేదు.
'ఇప్పడు హైదరాబాద్ వెళ్తున్నాము.స్వామీ కరుణించి నాన్నగారి మనసు మారేలా చూడు.నాకు వాళ్ళు కావాలి'  అని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్ధించాను.  
                                                                 * * * * *
నాన్నగారు వాళ్ళు వుండేది అమీర్ పేటలో. మేముండబోయేది 'గచ్చిబౌలి' లో.
ఇంతలో చిన్నది నిద్ర లో  లేచి మంచం దిగి ''డాడీ...డాడీ'' అంటోంది. ఒక్క అంగలో లేచి  వెళ్లి దాన్ని అందుకుని 'క్రిబ్' లో పడుకో బెట్టాను. వెంటనే నిద్రపోయింది.
పెద్దవాడు బాబు. ఆరు సంవత్సరాలు. చిన్నదానికి మూడు సంవత్సరాలు..టైము చూశాను. రాత్రి  ఒకటయింది. 'శశాంక్' లేచి తనూ  పనిచేసు కుంటున్నాడు.
''పడుకో శశాంక్ ! రేపే ప్రయాణం'' అని చెప్పి వచ్చి పడుకున్నాను.
                                                                 * * * * *
'లుఫ్తాన్సా' ఎయిర్ లైన్స్  విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో  ఆన్ టైం లేండ్ అయింది. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలన్నీ ముగించుకుని  సూట్ కేసులన్నీ తీసుకుని బయటకు వచ్చేసరికి దాదాపు నాలుగయింది.
శశాంక్ తమ్ముడు  'శాయి'వచ్చాడు ఎయిర్ పోర్ట్ కి. కంపెనీ కారు వచ్చింది. లగేజి అంతా కారులో డిక్కీలో, వెనక  సదిరి డ్రైవర్ బయలుదేరాడు.
'శాయి' మరో కారులో మావెనకే వచ్చాడు. నాలుగు బెడ్ రూముల ఫ్లాటు. చాలా బావుంది. 
ఏడో అంతస్తు.  ఖరీదైన ఇంటీరియెర్! దగ్గర్లో ఏదో స్టేడియం కనిపిస్తోంది!
ఎటు చూసినా మంచి 'వ్యూ' ఉన్న ఫ్లాటు.
శశాంక్ వాళ్ళ తమ్ముడు, మరదలు ఇద్దరు,  ఉదయానే మళ్ళీ వస్తామని వెళ్ళారు. 
అలసి పోయామేమో అందరం వెంటనే నిద్ర పోయాము.
                                                                 * * * * *
'కాలింగ్ బెల్' మోతకు దిగ్గున లేచాను. టైం చూశాను. ఉదయం పది గంటలు దాటింది. 
బాబోయ్, ఎంత నిద్ర పోయాము అనుకుంటూ లేచాను. జుట్టు సరిచేసుకుని తలుపు తీశాను.
శశాంక్ వాళ్ళ  తమ్ముడు అతని భార్య అనిత.
''అక్కా! కాలింగ్ బెల్, తలుపు, చాల సేపునుంచి కొడుతున్నాం. సారీ అక్కా! నిద్ర పాడు చేసినట్లున్నాం'' అంది లోనికి వస్తూ.
''భలేదానివి' రండి! పిల్లలు, శశాంక్ సరైన తిండి తిని రెండుమూడు రోజులైంది.
ముందు వాళ్లకి టిఫిన్ చేయాలి. శశాంక్ ఆకలికి అసలు ఆగలేడు" అంటూ లోపలి కొచ్చాను.
''అక్కా! మేము వస్తూ, హోటల్ నుంచి టిఫెన్,  ఇంటి నుంచి భోజనం క్యారియర్  తీసుకుని  వచ్చాము'' రెండు మూడు రోజులు భోజనం పంపిస్తాను. ఇప్పుడే వంట మొదలెట్టకు.
ముందు సెటిల్ కండి కంగారేమీ లేదు" అంది అనిత.
''లేదు, అనితా! ఇవాళ నుంచి వంట కుర్రాడు వస్తాడు. నేను జాబు మానేసాను. పిల్లలతో కుదరడం లేదు". 
''అయ్యో! అంత డబ్బు ఎందుకు వదులుకోవడం.ఇక్కడ ఐదారు వేలు ఇచ్చామంటే మనుషులు  దొరుకుతారు. నువ్వు హాయిగా జాబులో చేరవచ్చు అక్కా!'' అంది అనిత.
''లేదు, అనితా! పిల్లలు కొద్దిగా ఎదిగిన దాక నేను జాబు మానేద్దామని ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నాము. శశాంక్ వాళ్ల కంపెనీ  వైస్ ప్రెసిడెంటుగా వచ్చాడు ఇక్కడికి. మంచి జీతం. నేను కూడా జాబు చేయవలసిన అవసరం  లేదు. మీరు  కూర్చోండి'' వాళ్లకి  సోఫా చూపించి నేను బెడ్ రూమ్ లోకి వచ్చిశశాంక్ ని, పిల్లల్నిలేపాను.
లేవడమే ఆలస్యం పిల్లలు  ''మామ్  ఆకలి" అంటూ గొడవ మొదలెట్టారు.
పిల్లలు, శశాంక్  బ్రష్ చేసుకుని  టిఫెన్ తినేశారు. శ
శాంక్ వాళ్ళతో  కాసేపు మాట్లాడి 'లేప్ టాప్'   ముందేసుకుని కూర్చుని, ఫోన్లో మాట్లాడుతున్నాడు. కొద్ది సేపటికి ఇద్దరు మనుషులు వచ్చారు. ఒకరు కుక్, ఇంకొకరు 'బోయ్'. 
కుక్ ఉదయం, సాయంత్రం వస్తాడట . ఇద్దరు  తెలుగు వాళ్ళే. బావుంద నుకున్నాను.
సాయంత్రానికి కూరలు, సామానులు ఏమి కావాలనో లిస్టు రాసిస్తే, కిందనే షాపు ఉందట. తెస్తామన్నారు. .
వెంటనే శశాంక్ కి చెప్పాను. కేష్ కావాలని. పని కుర్రాడు చెప్పాడు కిందనే ఎ టి ఎం  వుందని.  హైదరాబాద్ ఎంత మారిపోయిందనుకున్నాను.
శశాంక్ గ్రౌండ్ ఫ్లోర్ కి  వెళ్లి కేష్ తెచ్చాడు. కావలసిన సామాను తెప్పించాను. 
అనితకు చెప్పాను. ఇక భోజనం పంపించవద్దని. వాళ్ళు సాయంత్రం వరకు వుండి వెళ్లారు.
                                                                * * * * *
అప్పుడే వారం రోజులయింది హైదరాబాద్ వచ్చి. పిల్లలు సెటిల్ అయ్యారు.
ఇద్దరు పిల్లలకి అపార్టుమెంటులో స్నేహితులు బాగానే తయారయ్యారు. కిందనే ఉన్న  సమ్మర్ స్కూల్ లో ఇద్దరినీ చేర్పించాను. 'స్విమ్మింగ్ క్లాస్' కి, ఆటలకు వెళుతున్నారు. 
                                                                * * * * *
ఆరోజు ఆదివారం!
శశాంక్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. వంటతను టిఫెన్ చేయడంతో అందరి బ్రేక్ ఫాస్ట్ అయింది, వంట మొదలెట్టాడు. కానీ మనసు బాలేదు. వచ్చి  వారం రోజులయినా ఇంతవరకు ఎవరినీ కలవ లేదు.నేను హైదరాబాద్   మేము హైదరాబాద్  షిఫ్ట్  అవుతున్నట్లు ఎవరితోనూ చెప్పలేదు. 
'అమ్మవాళ్లతో  పరిచయమున్నస్నేహితులు ఇంకెవరు హైదరాబాద్ లో ఉన్నారా?' అని అలోచించాను. 
ఎంత అలోచించినా ఉన్నది ఇద్దరు స్నేహితులే. వాళ్ళ 'పేరెంట్స్' కూడ అమ్మా వాళ్లకి బాగా పరిచయమే. వాళ్ళ ఇళ్ళు తనకి తెలుసు. 
ముందు ఇంటికి వెళ్లి చూసి అమ్మ వాళ్ళ  ఆచూకీ తెలియకపోతే  తరువాత వాళ్ళ దగ్గరికి  వెళదామని నిర్ణయించుకున్నాను. ఈ రోజు ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి అని దృడంగా మనస్సులో అనుకున్నాను.
ఇంతలో శశాంక్ "ఇదుగో శశీ! ఇవాళ నేను పిల్లల్ని చూసుకుంటాను. నువ్వు బయటకు వెళ్లదలుచుకుంటే వెళ్ళు. కారు, డ్రైవరు రెడీ'' అన్నాడు శశాంక్.
తను మనస్సులో ఏమి ఉంచుకుని చెప్పాడో అర్ధం అయింది నాకు.
ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చి గదిలోకి వచ్చితలుపు వేసుకున్నాను.
శశాంక్ నా వెంటనే లోనికి వచ్చాడు.
''శశీ! ఇలా చూడు. నాకు తెలీదా, నీ బాధ?'' దగ్గరికి తీసుకుని వీపు రాస్తూ అన్నాడు శశాంక్ .
ఒక్కసారిగా బోరు మన్నాను.కంగారు పడి పోయాడు శశాంక్.
 నాకళ్ళు తుడిచి ''వెళ్లి  అందరినీ కలిసిరా 'అల్ ది బెస్ట్'! నేను  తరువాత వస్తాను'' అన్నాడు శశాంక్. త్వరగా తెమిలి కింద పార్కింగ్ కి వచ్చాను.
                                                                        * * * * *
ముందుగా  శ్రీనగర్ కాలనీలో 'లావణ్య' పేరెంట్స్ ఇంటికి వెళ్లాను. లావణ్య వాళ్ళాయన 
తలుపు తీసి ''ఓ మీరా!'' అని నన్ను అదోలా చూస్తూ లావణ్యని పిలిచాడు.
అది నన్నుచూసి బిత్తరపోయి, ''ఏంటే, ఎప్పుడొచ్చావు ? ఎక్కడ దిగావు? బాగున్నావా?
ఎన్నిసంవత్సరాలయిందే నిన్ను చూసి!" అంది గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది.
''మేము హైదరాబాద్  షిఫ్ట్ అయ్యాము. గచ్చిబౌలిలో ఇల్లు తీసుకున్నాము. నువ్వు, మీఆయన ఇక్కడ ఉన్నారేంటి? 'మీ అమ్మా, నానా వాళ్ళెక్కడ ? నన్ను చూస్తూనే  మీయన అదోలా ముఖం పెట్టాడు? అంతలా మోశావేంటి?" పాత రోజులు గుర్తుకి తెచ్చుకుంటూ అడిగాను దాన్ని. .
''ఛీ! అదేంటే అలా అంటావు. అమ్మావాళ్ళు అమెరికా లో అన్నయ్య దగ్గర సెటిలయ్యారు. వాళ్లకి 'గ్రీన్ కార్డు' వచ్చింది. ఏడేళ్ల క్రితమే వాళ్ళు అమెరికా వెళుతూ మమ్ముల్నిఈ ఇంట్లోకి 'షిఫ్ట్' కమ్మన్నారు" అని విశదంగా చెప్పింది లావణ్య.
"మిగతా సంగతులన్నీ తరువాత మాట్లాడుదాం! ముందు మా అమ్మావాళ్ళ సంగతి చెప్పు! నువ్వువాళ్ళని కలిసి ఎంత కాలమైంది? వాళ్ళెలా వున్నారు? తమ్ముడేం చేస్తున్నాడు? డాడీ, ఎలావున్నారు?" అంటూ నాన్న వాళ్ళ గురించి ఆరా తీస్తూ అడిగాను లావణ్యను
''నేను మీ పెళ్లి అయిన  ఓ సంవత్సరం తరువాత నా పెళ్లికి పిలవడానికి వెళ్లాను. మీ అమ్మ నా ముఖం వాచేలా చివాట్లు పెట్టింది. నేను పారిపోయి వచ్చేశాను. తరువాత వాళ్ళని కలవలేదు" అంది లావణ్య 
"లత పెళ్లి అయిందా? అదెక్కడ ఉంది? దాని అడ్రెస్ ఉందా?" అడిగాను. 
''అది పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడది పెద్ద సోషల్ వర్కర్. ఇంట్లో దొరకడం కష్టమే. టూర్లు వెళుతూ వుంటుంది. ముందు ఫోను చేద్దాం. ఇంట్లో వుంటే ఇద్దరం వెళదాం'' అంది లావణ్య.
''దాని ఫోను నంబరు నాకు ఇవ్వు" అని ఫోను నంబరు తీసుకుని తరువాత కలుస్తానని చెప్పి  లేచాను. 
''అయ్యో! అదేంటే అప్పుడే వెళతావా? భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకుందాం'' అంది లావణ్య.
''లేదే... ఇప్పుడు నాకు వేరే పనుంది. తరువాత తీరిగ్గా కలుద్దాం.ఇక్కడే వుంటాను కదా" అని అక్కడ నుంచి  బయలుదేరాను. 
                                                                    * * * * *
కారు ఎక్కి డ్రైవర్నిపేరడిగాను. 
''అష్రాఫ్''  అన్నాడతను. 
''అమీర్ పేట వెళ్ళాలి'' అన్నాను.
అర్ధగంటలోపే  ''అమీర్ పేట వచ్చామమ్మా'',అన్నాడు అష్రాఫ్. 
మెయిన్ రోడ్డు చాలా మారి పోయింది. "ముందుకు వెళ్లి అక్కడ లెఫ్ట్ కి వెళ్ళు!" అని చెప్పి రోడ్డు వంక చూస్తున్నాను. మా ఇల్లు దగ్గరవుతున్నకొద్దీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఒళ్ళంతా చెమటతో తడిసి పోయింది.
''అష్రాఫ్! మెల్లగా వెళ్ళు''అన్నాను.
''ఏందమ్మా?".నా మాట గొంతు దాటి రాలేదని అర్ధమైంది. గొంతు పూర్తిగా గీర పోయింది.
కూడ తీసుకుని ''మెల్లగా వెళ్ళు'' అన్నాను.
''సరే అమ్మా!", అని బాగా మెల్లగా వెళ్తున్నాడు.
కుడి పక్కన రోడ్డుకి  తిరుగుతూనే కారు పక్కన పార్క్ చేసుకొమ్మని చెప్పి కారు దిగాను. 
మాఇల్లు అలాగే ఉంది. బాగా పాత బడింది.
పోషణ లేని మనిషిలా, మోడైన చెట్టులా, జరిగిన విషయాలకి సాక్షిలా అలా నిలబడి ఉంది.
'రంగులు వేసి ఎన్ని సంవత్సరాలయిందో' అనుకున్నాను.
గేటు పక్కనే వెలిసిన పాత బోర్డు.
"ప్రభుత్వ  బాలల సంరక్షణాలయం" డిపార్ట్ మెంట్  అఫ్ సోషల్ వెల్ ఫేర్, గవర్నమెంటు అఫ్ తెలంగాణ, బోర్డు చదివి కారు దిగి లోనికి వెళ్లాను.
''ఎవరూ కావాలమ్మా ?" అడిగాడు వాచ్ మెన్ . 
''ఇక్కడ వెంకటరావుగారు వాళ్ళు ఉండాలే? వాళ్ళ ఇల్లు కదా ఇది?"
''అదేందమ్మా! చానా సంవత్సరాలు అయినాది నేను ఈడ  వాచ్ మెన్ గా చేయబట్టి. ఈడ దిక్కులేని పిల్లలుంట రమ్మ. మీరు అడిగేటోళ్ళు ఎవరూ ఈడ లేరమ్మా'' అన్నాడు వాచ్ మెన్.
పక్కన వాళ్ళను కనుక్కుందామంటే ఇంటికి రెండువైపులా అపార్ట్ మెంటులు వెలిశాయి.  .
అంతా అయోమయం. ఏమీ తోచడం లేదు. తల తిరిగి పోతోంది. 
''సరేలే బాబూ' అని చెప్పిమళ్ళీ ఇంటి వంక చూసి కారు ఎక్కాను. 
నాకు తెలీకుండానే కళ్ళనుంచి నీరు చిందుతోంది. కళ్ళు తుడుచుకున్నాను.
''కళ్ళలో దుమ్ము పడిందామ్మా ?" అనడిగాడు అష్రాఫ్.
నేనేమీ సమాధానం చెప్పలేదు. మనసు, మనసులో లేదు, భారంగా వుంది .
'ఏమయ్యారు...అమ్మా,నాన్నా?' కీడు శంకిస్తోంది మనసు .
'లేదు, లేదు... '  వేరే ఇంటికి  'షిఫ్ట్' అయి వుంటారు' మనసుకు సర్ది చెప్పాను.
మనసు ఊరుకోవడం లేదు. 'షిఫ్ట్' కావడమేమిటి సొంతిల్లు కదా!' అని ప్రశ్నిస్తోంది. 
'అవునూ, ఇల్లు వదిలి ఎక్కడి కెళ్ళినట్లు? దీనికంతా నేనే కారణమా?' మనసు తొలిచేస్తోంది.
తల పగిలిపోతోంది. పిచ్చిఎక్కేలా వుంది. 
'అమ్మో, పిల్లలు, శశాంక్' మనసు హెచ్చరించింది. ఇంటికి చేరుతూనే స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చి దేవుణ్ణి మనస్పూర్తిగా ప్రార్ధించాను. శశాంక్ పిల్లలిద్దరికి అప్పటికే అన్నం తినిపించాడు. 
ఏమయిందన్నట్లుగా  నావంక ప్రశ్నార్ధకం గా చూసాడు శశాంక్ నావంక. .
మౌనంగానే సమాధానం చెప్పాను 'ఏమీ కాలేదని'!
''ఏమిటి  ఏమయింది, శశీ?" అంటూ దగ్గరి కొచ్చాడు,శశాంక్.
''మా ఇంట్లో ఓ అనాధ శరణాలయం వుంది. అదీ అయిదారు సంవత్సరాల నుంచి ఉందట.  
మా ఇంటికి  రెండువైపులా అపార్ట్ మెంటులు కట్టారు. పాత వారెవరూ కనిపించలేదు.
లావణ్యను కలిశాను. తనకి అమ్మా వాళ్ళు ఎక్కడికెళ్లిందీ తెలియదంది. లతని కలవాలి. 
సరే గాని నువ్వు తిన్నావా?" అని శశాంక్ ని అడిగి నేను కాసేపు పడుకుంటానని చెప్పి వచ్చి బెడ్ మీదకు చేరాను. పడుకోవడానికి మనస్కరించలేదు. లేచి 'లత'  నంబరు డయలు చేశాను.
''హలో, ఎవరూ'? "అవతలి గొంతు గుర్తు పట్టాను. వేరే పరిస్థితి అయితే కాసేపు ఆట పట్టించే దాన్నే.
''ఏయ్, లతా,ఎలా ఉన్నావే?"అడిగాను నేనెవరో చెప్పకుండా.
''ఎవరు, మాట్లాడేది?" లత గొంతులో అసహనం. 
నేను 'శిశిర' ను అన్నాను. 
''ఎవరూ?"
''నేనే, లతా! 'శిశిర' ను''.
''గాడ్! నువ్వా...ఎక్కడనుంచి  ఇండియాకి  ఎప్పుడొచ్చావు?" అంది ఉద్వేగంగా లత.
"హైదరాబాదులోనే వున్నాను. లావణ్య దగ్గర నుంచి నీ నంబరు తీసుకున్నాను"
''నువ్వెక్కడ?" అడిగాను నేను.
"ఇప్పుడే ఇంటికి చేరాను. జుబిలీ హిల్స్ లో ఇల్లు అడ్రస్ చెప్పింది.
''ఓ...పాతిల్లే కదా! నేను గంటలో వస్తానే, ఫరవాలేదా ? రావచ్చా'?"అడిగాను .
''రా! త్వరగా వచ్చేయ్ ! వెయిట్  చేస్తుంటాను'' హుషారుగా అంది లత.
ఒక గంటలో వస్తానని శశాంక్ తో  చెప్పి వెంటనే బయలు దేరాను.
క్రిందకు వచ్చేసరికి డ్రైవర్ లేడు. లంచ్ కి వెళ్లాడేమోనని అక్కడున్నసెక్యూరిటీ వాళ్ళని అడిగాను.
''బయట బడ్డీ కొట్టుకి  చాయ్ తాగనీకి పొయిండేమో... ఇప్పుడే పిలుస్తనమ్మా'' అంటూ సెక్యూరిటీ గార్డ్  పరుగెత్తి వెళ్లి అతన్ని పిలుచుకొచ్చాడు.
''చాయి తాగుదామని ఇప్పుడే ఎల్లినానమ్మా'' అన్నాడు డ్రైవర్.
''ఫరవాలేదు. జూబిలీ హిల్స్ వెళ్ళాలి'' అని చెప్పి కారెక్కి డోర్ వేశాను.
అడ్రస్ చెప్పాను డ్రైవర్ కి. పదిహేను నిముషాల్లోనే ''వచ్చిన మమ్మా! ఇదే ఇల్లు" అన్నాడు డ్రైవర్.
ఇల్లు గుర్తు పట్టాను. చదువుకునే రోజుల్లో చాలా సార్లు వచ్చాను.
ఇంటికి పెద్ద గేటు. సెక్యూరిటీ గార్డ్ ఎవరని అడిగాడు 
పేరు చెప్పాను. సెల్యూట్ చేసి గేటు తెరిచాడు, కారు లోన పార్క్ చేసుకోమన్నాను. .
ఇంటి ముందు పెద్ద గార్డెన్. అందంగా వుంది. అంతా  తిరిగి  చూడాలనిపించినా సమయంలేక చూడలేదు. కారు దిగి ఇంటి వైపు చక చకా నడిచాను.
లత బయటే వుంది. ''ఏయ్! శశీ...ఎలావున్నావే?" ఆత్రంగా పరుగెత్తి వచ్చి కౌగలించుకుంది. ఇద్దరమూ కాసేపు అల్లాగే ఉండి పోయాము.
''ఇంట్లోకి వెళ్లి మాట్లాడు కుందాం" అంది లత నా చేయి పట్టుకుని లోనికి నడుస్తూ.
''అమ్మా, నాన్నా,అన్న వాళ్ళు ఎలాఉన్నారు? ఇక్కడే వున్నారా?" లోనికి నడుస్తూ అడిగాను. .
''అందరం ఇక్కడే ఉన్నాము"
"నువ్వేంటి పెళ్లి.. '' నేనింకా అడగదలిచింది పూర్తిగాకుండానే ''నేనింకా పెళ్లి చేసుకోలేదు. చేసుకోను'' అంది ఖచ్చితంగా.
''అమ్మా, నాన్నా,అన్నయ్య, వదినా, పిల్లలు అందరు ఇక్కడే వున్నారు. చాలా? ఇవన్ని ఎలాగు అడుగుతావని ముందే చెప్పేశాను! 'కాఫీ, టీ, కూల్ డ్రింకా...  ఏం తాగుతావు ?" నర్మగర్బంగా అంది తన గదిలోకి నడుస్తూ. అదే గది! 
"కాఫీ తాగుదామే" అన్నాను నేను.
పై నుంచి రెండు కాఫీ తెమ్మని పురమాయించింది ''ఊ' ఇక చెప్పు!" అంది నా వంక సాలోచనగాచూస్తూ.
నేనే మొదలెట్టాను. వచ్చివారమయిందని, ఫ్యామిలీ విషయాలు, లావణ్యను కలిసింది అన్నీ క్లుప్తంగా చెప్పాను.
లత కూర్చున్నదల్లా లేచి కిటికీ దగ్గరికి వెళ్లి 'లాన్' లోకి చూస్తూ అంది.
"అమ్మను కలిసావా?" అడిగింది లత.
నా మనసు కీడు శంకించింది. నన్ను నేను తమాయించుకున్నాను. 
''లేదు.కలవలేదు! కలుద్దామని ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు లేరు. సరికదా ఆఇంట్లో
శరణాలయం ఉంది. అక్కడ ఎవరూ అమ్మా వాళ్ళ సంగతి ఎవరికీ తెలీదన్నారు'' నాకు తెలీకుండానే నాగొంతు గద్గద మయింది.
''వాళ్ళ సంగతి కనుక్కుందామనే నీ దగ్గరికొచ్చాను. నాకసలు దిక్కు తోచడం లేదు.
తొమ్మిది సంవత్సరాలయింది వాళ్ళని కలిసి. నా అంత దురదృష్టవంతులెవరైనా ఉంటారా?
ఎంత మంది ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు... కలిసి పోలేదు ? అంతా నా దురదృష్టం. 
నా గొంతు పూర్తిగా బొంగురు పోయింది. కళ్ళవెంట నీళ్లు ధారలుకట్టాయి. 
"అవును శిశిరా! దేవుడు అందరి నుదుటా ఒకేలా వ్రాయడు కదా!" అంది లత నిర్వికారంగా. .
కాఫీ వచ్చింది ఇద్దరం తాగాము.
''అమ్మ, వృద్ధాశ్రమంలో ఉంది. కేశవగిరి దగ్గర !" అంది లత చాలా నార్మల్ గా. లత మాట  
వింటూనే  కాళ్ళ క్రింద భూమి జారి పోతున్నట్లు అనిపించింది.
'లత' కిటికి లో నుంచి బయటకు చూస్తూ మాట్లాడుతోంది ఇంకా.
''మొన్నీమధ్యనే వెళ్ళింది తను అక్కడికి. చాల కాలంనుంచి ఆ ఆశ్రమం లో వృద్ధుల సేవలో మమేకమైంది. రాజేష్  రెండు నెలల క్రిందనే ఎం ఎస్  చేయడానికి.అమెరికా వెళ్ళాడు  తమ్ముడటు వెళుతూనే అమ్మ  అపార్టుమెంటు నుంచి ఆశ్రమానికి షిఫ్ట్ అయింది. ఆశ్రమం నడపడంలో తనది చాల చురుకైన పాత్ర. అమ్మ అక్కడ ఒక్క రోజు లేకున్నాఆ వెలితి పూడ్చలేనిది అంటారు ఆశ్రమ నిర్వాహకులు'' అని ముగించింది లత.
నాకళ్ళ వెంట ధారలు కారుతున్నాయి కన్నీరు. తుడుచుకునేందుకు కూడ ప్రయత్నం చేయలేదు. 
''నాన్నగారు ఎక్కడున్నారు? అమ్మ ఆశ్రమంలో చేరడమేమిటి?" భయపడుతూ అడిగాను. 
''శశీ! నాకు నువ్వు చాలా సార్లు ఫోను చేశావు. ఇక్కడ జరిగిన సంగతులన్నీ నీకు చెప్పినా, నువ్వు బాధ పడడం మినహా చేయ గలిగిందేమీ లేదు. అందుకే విషయాలు నీ నుంచి దాచాను" అంది లత తలవంచుకుని 'శిశిర' ముఖం వంక చూడకుండా.
''మీ అమ్మా, నాన్నా, నిన్ను పూర్తిగా విస్మరించారు. శిశిర అని ఒక కూతురు ఉందని ఉచ్చరించడం మానేశారు. నువ్వు వెళ్ళిన తరువాత మీ అమ్మానాన్న పరిస్థితి బాలేదని తెలిసి మీ ఇంటికి  చాలా సార్లు కలిశాను. నీ పెళ్లయిన కొన్ని నెలలకే మీ నాన్నగారు వ్యాపారం మానేశారు. ఇల్లు ప్రత్యేకంగా అనాధ పిల్లల సంరక్షణాలయం పెట్టాలని షరతుపెట్టి 'డొనేట్' చేశారు.
ఉన్న డబ్బంతా తమ్ముడి పేరున, తన చదువుకి కావలసినదంతా బ్యాంకులో వేశారు.
ఇప్పుడు అమ్మ ఉన్న వృద్ధాశ్రమం స్థాపించి భారీగా ధన సహాయం చేశారు. అక్కడ వంద మందికి పైగా వృద్ధులు, దిక్కులేని వయసు మళ్ళిన అనాధలుంటారు. అమ్మ  నాతో స్వయంగా చెప్పింది.  నువ్వు వెళ్ళినతరువాత కొన్నినెలలు పాటు మీనాన్నగారు నిద్ర పోలేదు. నేను ఆయన్ని చివర రోజులు దగ్గర్నుంచి చూశాను. ఎప్పుడూ నిన్ను గురించే పలవరించేవారు. .
ఒక రోజు నన్ను అడిగారు ''నేను దానికి ఏం తక్కువ చేశాను? ఏనాడు అది అడిగింది కాదనలేదే? ఇలా ఎందుకు చేసింది? నా పెంపకం లోనే ఏదో పెద్ద తప్పు వుంది. నేనేదో తప్పు చేశాను. లేకుంటే నాకూతురు అలా చేసి వుండేది కాదు'' అని కుమిలి, కుమిలి ఏడ్చారు. 
ఆయన్ని అలా చూడలేకపోయాను. అప్పట్లో నిజంగా నీ మీద చాలా కోపం వచ్చింది.  
తినేవారు కాదు. చిక్కి శల్యమయ్యారు. ఆరోగ్యం చెడింది. నీకు ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడి విషయాలు  చెప్ప వద్దని తన మీదనే  ప్రమాణం చేయించుకున్నారు. అలాగయితేనే నన్ను ఇంటికి రమ్మన్నారు. తరువాత నీ వెళ్ళిన  మరుసటి సంవత్సరమే ఆయన పోయారు. 
''అప్పుడు నాకనిపించింది ఇక్కడి సంగతులు నీకు చెప్పేకన్నా బాధలో ఉన్న వారికి చేతనైన సేవ చేస్తూ వారికి దగ్గరగా ఉండడమే మేలనిపించింది. మా  నాన్నగారు కూడా అన్నారు.  వెంకటరావు కూతురుకి చాలా 'అట్టాచ్డ్' కదా లతా! అతను ఈ 'షాక్' నుంచి కోలుకున్న దాకా వాళ్ళింటికి వెళ్తూఉండమని ! నువ్వేమీ అనుకోవద్దు. నేను జరిగింది జరిగినట్లుగా చెబుతున్నాను. నీ పెళ్లి మీ కుటుంబంలో సమ్మూల మార్పులు తెచ్చింది. నా ఈ ప్రస్తుత జీవితానికి కూడా నాంది పలికాయి. అంటే నేనేదో నీ వల్ల సన్యాసిని నయ్యాను అనడం లేదు. నాకిష్టమైన జీవితం గడుపుతున్నాను. నేను నాపట్ల, నాజీవితం పట్ల పూర్తి అవగాహనతో, సంతోషంగా ఉన్నాను. ఒక విధంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ప్రస్తుత జీవితంతో నిస్సహాయులకు సాయ పడుతున్నాను. కొన్ని దారి తప్పిన జీవితాలకు మార్గదర్శకం చేస్తున్నాను. నా జీవితంలో ఒక స్థిర నిర్ణయం తీసుకోవడానికి నీ జీవితం నాకు మార్గదర్శక మైంది. నిన్నుతప్పుపడుతున్నానుకోవద్దు. 
నిన్ను అంతగా  ప్రేమించిన తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు. 
నీ ఇష్టప్రకారం నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళినంత మాత్రంతో 'మాజీవితం ఇక వ్యర్ధం' అనుకుని చేజేతులా  పచ్చని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకోవడం పెద్దవాళ్ళ తప్పు. అన్నట్లు మరిచి పోయాను. ఇంకొక ముఖ్యమైన విషయం. 
నువ్వెప్పుడైనా తారసపడితే  నీకివ్వమని రాజేష్  ఒక లెటరు ఇచ్చాడు. వాడు ఎం.ఎస్  చేయడానికి అమెరికా వెళ్ళేటప్పుడు ఇచ్చివెళ్ళాడు. వాడు నన్ను'అక్కా'అని పిలుస్తాడు.
నీ పిల్లల్నినిన్ను,శశాంక్ ని, నాదగ్గర ఫోటోలలో చూస్తూనే వున్నాడు. వాడు నాకూ సొంత తమ్ముడే. వాడి విషయాలు కూడ కొన్నినీకు చెప్పాలి. కానీ వాడు నీకు ఇమ్మని ఇచ్చిన  లెటరు ముందు  ఇస్తాను. అది చదువు. తరువాత మిగతా విషయాలు మాట్లాడుదాం" అని వెనక్కి తిరిగి 'శిశిర' వంక చూసింది లత.
రెండు చేతులతో ముఖం కప్పుకుని కంటికి,మింటికీ ఏక ధారగా ఏడుస్తోంది శిశిర. ఆక్షణంలో తనో దుఃఖ దేవత లా కనిపించింది. 
''ఏయ్ శశీ! ఏమిటది? తమాయించుకో. అయిందేదో అయింది. అంతా విధి వ్రాత!
''లత ఏమిటి, వేదాంతం ఏమిటి' ? అనుకుంటున్నావా? నేను నీకు తెలిసిన పాత లతను కాను. ముందు ఈ నీళ్లు తాగు" అని గ్లాస్ నీళ్లు అందించింది. 
పక్కనే కూర్చుని 'శిశిర' భుజాల చుట్టూ చేతులు వేసి వీపు రాస్తూ వుంది. చిన్న పిల్లలా  దాని ఒదిగి పోయాను. పెద్దగా ఏడ్చేశాను. బాధలో వున్నప్పుడు ఎవరైనా కొద్ది సానుభూతి చూపిస్తే, కన్నీళ్లు ఇదిగో మేము వున్నాం, అని వర్షిస్తాయి.
"శశీ! ఇదే జీవితం"అంటూ లేచి బీరువా నుంచి అంటించి ఉన్న ఎన్వలప్ ఇచ్చింది.
కవరు మీద  ఎర్ర అక్షరాలతో రాసి వుంది.
"అక్క కాని అక్కకు!"  అని వ్రాసి వుంది.
 నా మనసే కాదు. ఒళ్ళంతా చాలా భారమైంది. ఆ కవరు అటు, ఇటు  తిప్పి చూశాను. అప్పటికప్పుడే కవరు  తెరిచి చదివే ధైర్యం చాలలేదు.
''శశీ, లెటరు ఇప్పుడు చదవకు. ఇంటికి వెళ్లి మెల్లగా చదువు. ఒక్కటి గుర్తుంచుకో ... స్నేహితురాలిగా ఒక సలహా ! ఈ పరిణామాల ప్రభావం నీ కుటుంబం మీద పడకుండా చూసుకో. 
తప్పులు చేస్తాం. మనం చేసిన  తప్పుఇంత పెద్దదా? ఇన్ని జీవితాలమీద  దాని ప్రభావం ఉంటుందా? ఇన్ని జీవితాల గమనం మారుస్తుందా? అన్న ఆలోచనముందే వస్తే మనం తప్పు చెయ్యం కదా! అందుకే మళ్ళీ మళ్ళీ గట్టిగా చెబుతున్నా! నేను చెప్పడమే కాదు. 
నిన్ను హెచ్చరిస్తున్నాను కూడా! 
అమ్మ దగ్గరికి రేపు వెళదాం. ఉదయం ఎనిమిది గంటలకల్లా నేను మీయింటికి వస్తాను. తయారై వుండు'' అంది లత  నా భుజం తడుతూ. .
మంత్రముగ్ధలా తలఊపాను నేను.   
''బయలుదేరు. రేపు కలుద్దాం!'' నా ముఖం లోకి  సూటిగా చూస్తూ అంది లత.
వెళ్లి కారెక్కి  ''ఇంటికి వెళదాం'' అన్నాను డ్రైవర్ తో..
అర్ధగంటలో ఇంటికి వచ్చాను. లత చెప్పిన మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
లేని హుషారు తెచ్చు కున్నాను. ముఖం మీద ఖేదం కన్పించకుండా జాగ్రత్త పడ్డాను.
బయటి  తలుపులు దగ్గరికి వేసి వున్నాయి. లోపలకి వెళ్ళానో లేదో, పిల్లలు చుట్టేసుకున్నారు.
'ఎక్కడికి వెళ్ళావమ్మా, ఇంత సేపు' మేము నీ కోసం ఎంత వెతికామో తెలుసా'? అన్నాడు బాబు.
శశాంక్  'లేప్ టాప్ ' తో  సహా బయటకు  వచ్చాడు.
''అదేంటి శశాంక్ పిల్లల్ని చూసుకుంటానన్నావు" ఏమిటి వీళ్ళ గోల అన్నాను మామూలుగా
ఏమీ లేదు. ఇప్పడి దాకా నాతోనే ఆడుతునే ఉన్నారు.
ఈ వెధవ అమ్మ కూచి. వందసార్లడిగాడు నువ్వెక్కడికి వెళ్ళావని. 'వీ' గేము ఆడాము.అది నిద్ర పోయి ఇప్పుడే లేచింది. 
''వెళ్ళిన పని ఏమయింది? కలిశావా అందరిని ? అమ్మా, నాన్నా, తమ్ముడు ఎలావున్నారు?"అని  అడిగాడు శశాంక్ .
నేను మౌనంగానే ఉండడంతో ''సరే, మేడం! మీ ఇష్టం వచ్చి నప్పుడు చెప్పండి'' అన్నాడు శశాంక్. నా మౌనానికి అర్ధాన్ని వెతుక్కుంటూ.
''ఒక్కటి చెప్పు' అంతా బావున్నారా?"
''లేదు. తరువాత చెపుతానన్నాను కదా!''.
వెళ్లి తల స్నానం చేసి, వేడిగా కాఫీ తాగి పిల్లలకి డిన్నర్ పెట్టేసి వచ్చి హాలులో శశాంక్ దగ్గర కూర్చున్నాను.
''భోజనం చేయలేదు, ఆకలిగా లేదా?" అన్నాడు శశాంక్.
''ప్చ్....లేదు శశాంక్! ఆకలి లేదు.మనశ్శాంతి లేదు. అంతా నావల్లే ...!" అన్నాను ఏడుస్తూ.
ఊహించని పరిణామంతో కంగారు పడ్డాడు శశాంక్. .
''నాన్నగారు పోయారు''
"వ్హాట్?" తను దిగ్గున లేచాడు. ఒళ్లోని 'లేప్ టాప్'  క్రిందకు జారింది. 
దాన్నిక్రింద పడకుండా ఒడిసి పట్టుకుని సోఫాలో పెట్టి ''ఏమైంది...ఎప్పుడు? ఎలా?" అని ఆరాతీశాడు చాల బాధతో ఆత్రుతగా.
''అమ్మ వృద్ధాశ్రమంలో చేరింది. తమ్ముడు అమెరికా వెళ్ళాడు" అంది శిశిర. 
శశాంక్ అడిగిన ప్రశ్నకు సమాధాన మివ్వ కుండానే!
''సారీ, శశీ! ఐ యాం  ఎక్సట్రీమ్లీ సారీ! ఓహ్ 'గాడ్!" అని అంటూనే  రెండు చేతులతో
తలపట్టుకుని ఒక్కసారిగా సోఫాలో కూలబడ్డాడు.
శిశిర' వంక సూటిగా చూడలేక పోతున్నాడు. శిశిర కళ్ళలో నీరు ప్రవాహంగా ధారలుగా స్రవిస్తూనే వుంది. తను వంచిన తల ఎత్తలేదు.
"నా వల్ల నా వాళ్ళు చెట్టు కొకరు, పుట్టకొకరు అయ్యారు. పచ్చని కుటుంబం నిలువునా కూలిపోయింది. నాన్న.. నా ప్రియమైన నాన్న...బోరు మంది శిశిర. 
ఇప్పుడు చేయడానికి ఇంక మిగిలిందేమీ లేదు. శశాంక్ ! అమ్మని కలిసి  తను ఒప్పుకుంటే మనింటికి తీసుకువస్తాను.ఏమంటావు?" అంది శిశిర' అభ్యర్ధనగా.
శశాంక్  తల ఎత్తి ''సారీ శశీ! మన పెళ్లి వల్ల  ఇన్ని దుష్పరిణామాలుంటాయని కలలోకూడా ఊహించలేదు. ఎప్పటికయినా కలుస్తారులే అనుకున్నా గాని, మీ కుటుంబం ఇంతగా విడిపోతుందని ఊహ కూడా రాలేదు. అలాకాదు శశీ ! తను ఒప్పు కుంటే తీసుకురావడం కాదు. అమ్మని  తప్పక తీసుకు రావాలి. మనవల్ల  ఆవిడ ఆశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా ఎవరికీ జరగ కూడదు. నేనూ వస్తాను మీ అమ్మగారి దగ్గరికి. ఆవిడను ఒప్పించే  ప్రయత్నం చేస్తాను. 
అది కూడ చేయకపోతే మనం మనుషుల కింద లెక్కరాము. ఈ బాధ మన జీవితాంతం నీడలా వెన్నంటే వుంటుంది. ఆ బాధ భరించడం నావల్ల కాదు. నీ వల్ల అసలే కాదు. మనం ఆవిడను ఒప్పించి తీసుకు రావాల్సిందే" ధృడంగా  అన్నాడు శశాంక్.
''లేదు, శశాంక్, అమ్మరాదు. మన దగ్గర వుండదు. తన మనసు విరిగి పోయింది నాకు తెలుసు.
ఈ జన్మకు ఈ బాధనుంచి విముక్తి లేదు' అంది శిశిర నిర్వేదంగా. 
''తప్పు చేశాం. దిద్దుకోవడానికి  మనస్ఫూర్తిగా ప్రయత్నం చేద్దాం. అధైర్య పడకు, అమ్మని తప్పక తీసుకు వద్దాం'' అన్నాడు శశాంక్. శశాంక్ మాటలు టానిక్ లా పనిచేశాయి.
శిశిర కు కొద్దిగా ధైర్యం వచ్చింది.
తమ్ముడి లేఖ శాంశాంక్ కి  చూపించడమా, లేదా? మనస్సులోనే తర్జన, భర్జన పడుతోంది శిశిర.
''ఇదిగో! ఇప్పుడేగా చెప్పాను, మళ్ళీ ఏమిటా ఆలోచన?" అన్నాడు శశాంక్.
''రేపు నీకు కుదురుతుందా శశాంక్  అమ్మ దగ్గరికి  రావడానికి ?  లత ఉదయాన్నే వస్తానంది. 
తనే అమ్మదగ్గరికి తీసుకెళ్తానంది. రేపు ఎనిమిది గంటలకల్లా తయారుగా ఉండమంది. 
ఆశ్రమం చాలా దూరమట. ఎక్కడో కేశవగిరి దగ్గరట!" అంది శిశిర
''కేశవగిరి దగ్గరా... ఆశ్రమం ?  చాలా దూరం. నేను వస్తాను.
''సరే, పిల్లల సంగతి ? ఓ పని చేద్దాం. అందరం కలిసే వెళదాం.  పిల్లల్ని అమ్మగారికి చూపించవచ్చు'' తనే అన్నాడు శశాంక్.
''మరి నీ ఆఫీసు? నా ఆఫీసు నాకు వదిలేయ్, నీకెందుకు చింత? సరేనా!"' అని లేప్ టాప్  ముందేసుకుని పనిలో పడ్డాడు శశాంక్.
తను చెప్పింది బాగానే వుందనిపించింది. అయినా మనసులో ఏదో శంక. ఎందుకయినా మంచిది.
లతతో చెపుతే మంచిది కదా, అని ఫోను చేసింది. ఎంతకూ తను ఫోను ఎత్త లేదు.
''భోజనం చేద్దాం శశాంక్!" ఆకలవుతోంది అంది శిశిర.
''నువ్వు తినేయ్ శశీ ! ప్లీజ్, నాకు పని వుంది నేను కాసేపాగి తింటాను' అన్నాడు శశాంక్.
శిశిర భోజనం త్వరగా ముగించేసి, చేసి పిల్లల గది లోకి వెళ్లి, దుప్పట్లు సరిచేసి,
గదిలోకి వచ్చి తమ్ముడి లేఖ తీసి కవరు తెరిచి బెడ్  మీద పడుకొని చదవడం ప్రారంభించింది.
                                                                     * * * * *
                                  ''అక్కా! నిన్నుఇలా సంభోదించడం కూడా నాకు ఇష్టం లేదు. 
ఎంత కాదనుకున్న నువ్వు తోబుట్టువ్వే కదా.  లతక్కే నాకు నిజ మైన అక్క అయితే బాగుండేదని  చాలాసార్లు అనిపించింది. కానీ దేవుడు మనం అనుకున్నవన్నీఇవ్వడుగా. నీ లాంటి వాళ్ళు దేవుడితో పోట్లాడి అయినా కావలసింది సాధించుకోగలరు. నాకంత శక్తి లేదు.
నేను లతక్కకి చాలా ఋణపడి వుంటాను. జీవితంలో నేను మనిషిగానిలబడి ఈ రోజు  ఎం ఎస్   చేయడానికి  అమెరికా వెళుతున్నానంటే ఇదంతా తన చలవే! 
నిజంగా నువ్వంటే నాకు కోపమేమీ లేదు. నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికొచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఆరోజున మొదలయింది నా పతనం. నాన్నగారు ఆరోజు తరువాత తిరిగి మళ్ళీ మామూలు మనిషి కాలేక పోయారు. ఇల్లు నరకం గా ఉండేది. ఒకళ్ళతో ఇంకొకరు మాట్లాడే వాళ్ళం కాదు. ఉన్నది ముగ్గురం. ఇంట్లో ఎప్పుడూ  భయంకర నిశ్శబ్దం.
ఓ పండుగా లేదు. ఓ సెలేబ్రేషను లేదు. నేను మాట్లాడినా ఏదో ముక్తసరిగా మాట్లాడే వాళ్ళు.
డబ్బుకు తక్కువ లేదు. నాన్నగారు అడగ్గానే ఇచ్చేవారు. జాగ్రత్తగా చదువుకో, అనేవారు. 
ఆమాటొక్కటే అయన నాతో చనిపోయే వరకు మళ్ళీ,మళ్ళీ మాట్లాడిన మాట. 
అమ్మకు పూజలు,ఆశ్రమాలు ఎక్కువయ్యాయి. ఇంటిపట్ల ఉండేదికాదు. 
నాన్నగారు ఇల్లు దానం ఇచ్చేశారు. వేరే ఇంటికి మారేము. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే వాడిని. నాకు కాకూడని అలవాట్లు అయ్యాయి. ఒక సారి మోటర్ సైకిల్ ఆక్సిడెంట్ అయింది. నాకు ఒళ్ళంతా గాయాలు నాలుగు ఫ్రాక్చర్లు అయ్యాయి. లతక్క వాళ్ళ అన్న నన్నుహాస్పిటల్ లో చేర్పించారు. అక్క నన్ను చూడ్డానికి తరచూ హాస్పిటల్  కి వచ్చేది.  నాకు  గాయాలు మానిన   తరువాత మూడు నెలలు పాటు  'రిహేబిలిటేషన్'  ట్రీట్ మెంటు ఇప్పించింది.
నీ పెళ్ళయిన  దగ్గరనుంచి నీవు 'లతక్క'తో కాంటాక్ట్ లో వున్నట్లు, తనతో తరచూ  మాట్లాడుతున్నట్లుగా కూడా అక్క చెప్పింది. తాను నీతో మాట్లాడమంది. నేనే నీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఈ లెటరు నీకు ఇమ్మని చెప్పాను. 
ఈపాటికి నీకు సంగతులన్నీ తెలిసి వుంటాయి. జరిగిన ఈ పరిణామాలన్నిటికీ నువ్వే బాధ్యురాలివని నేను అనడం లేదు. 
ఈ విషయమై  నేను, లతక్కా చాలా సార్లు వాదించుకున్నాము. లతక్క ఎప్పుడు నీ పక్షాన వాదించేది . ఈ విషయం ఎప్పుడూ నాకూ అర్ధం అయి కానట్లుగానే వుండేది. దాన్ని అలాగే వదిలేశాను. మనం ఎప్పుడయినా కలుస్తామా లేదా అన్నది కూడ నాకు ఊహకు అందని విషయం.
అందుకే అన్నీ కాలానికి వదిలేయడమే మంచిది! పిల్లలకి నేను తెలుసా ? 
శశాంక్ గారిని అడిగినట్లు చెప్పగలవు. ఇక వుంటాను.
తమ్ముడు.
                                                                       * * * * *
లత ఉదయం  సరిగ్గా ఎనిమిదిగంటలా కల్లా వచ్చింది. 
తను వస్తూనే ''హాయ్, లతా! ఎలా వున్నారు? " కుశల ప్రశ్నలు వేశాడు శశాంక్.
''ఐ  యాం  ఫైన్'' అంటూ ఇన్ని సంవత్సరాల తరువాతనా ఇండియా కి వచ్చేది?" అంది లత సరదాగా.
"అవును. రాలేక పోయాము'' అన్నాడు శశాంక్ నొచ్చుకుంటూ.
''కాని లతా! మీరు చాలా అన్యాయం చేశారు మాకు.శిశిరతో కాంటాక్ట్ లో ఉండి కూడా ఇక్కడ విషయాలు ఏమీ తనతో చెప్పలేదు. కనీసం వాళ్ళ నాన్నగారు.... '' అన్నాడు  శశాంక్  సీరియెస్ గా.  .
నేను కల్పించుకుని ''లేదు శశాంక్! తన తప్పు లేదు. అమ్మా వాళ్ళు ఇక్కడి విషయాలు నాతో ఏమీ చెప్పవద్దని తన దగ్గర మాట తీసుకున్నారు '' అంది శిశిర.
''అయితే మాత్రం.తను నీ క్లోజ్  ఫ్రెండ్  కదాతాను ! నాన్నగారు చనిపోయిన విషయం కూడా చెప్పలేనంత దాపరికమా ? లతా! మీరు ఆ ఒక్క కబురయినా తనకు చెప్పాల్సింది. 
తను జీవితాంతం బాధపడే విషయమది'' నిక్కచ్చిగా అన్నాడు శశాంక్.
శశి వారించ బోయి ఏమనుకుందో ఊరుకుండి పోయింది.
''నిజమే... అది నా తప్పే! వాళ్ళ కిచ్చిన మాట ఈ ఒక్కవిషయం లోనైనా నేను ఖాతరు చేసి వుండాల్సింది కాదు. నువ్వన్నది కరెక్టే ... శశాంక్! నేను చేసింది ముమ్మాటికి పెద్ద తప్పే'' నొచ్చుకుంటూ అంది లత. .
''సారీ లతా! మిమ్ముల్నినొప్పించాలని కాదు. నాకే ఆవార్త పెద్ద షాకు. ఇక శిశిర విషయం వేరే చెప్పాలా... " అన్నాడు శశాంక్.
''టైం అవుతోంది. ఇక బయలుదేరుదామా'?" అంది లత టాపిక్ మారుస్తూ.
''లతా! పిల్లలూ, శశాంక్ కూడా వస్తారు అమ్మదగ్గరకు'' అంది శిశిర.
''నేనూ అదే చెబుదామనుకున్నా'' అంది లత.
''అందరం మా కారులో వెళ్దాం''! అన్నాడు'' శశాంక్.
దాదాపు గంట పైన పట్టిందిఆశ్రమం చేరే సరికి. కారు పార్క్ చేసి అందరం దిగాము.
యధాప్రకారం నాకు గుండె దడ మొదలయింది. నేను బాబు చేయి పట్టు కుని నడుస్తున్నాను. శశాంక్ పాపని నడిపిస్తున్నాడు. 
ఆశ్రమం ప్రశాంతంగా వుంది. త్రోవ రెండు వేపులా పెద్ద చెట్లు. వాటి మొదళ్ళ చుట్టూ అరుగులు,
ఆ అరుగుల మీద కొందరు కూర్చుని, ముడుచుకుని పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు.
కొందరు న్యూస్ పేపర్లు చదువుతున్నారు. కొందరు 'కేరమ్స్' ఆడుతున్నారు. చిన్నచిన్న కుటీరాల్లా కట్టారు. ఆశ్రమం చాల పెద్దది. మూడు పెద్ద బిల్దింగులు, చిన్న చిన్న కుటీరాలు చాలానే  వున్నాయి. లత ఆఫీసు వైపు నడుస్తోంది. లోపల దాదాపు వంద గజాలు నడిచి ఉంటాము.
పాపని ఎత్తుకుని నడుస్తూ నన్నేగమనిస్తున్నాడు శశాంక్.
'లత' ఆఫీసు లోనికి వెళ్లి రెండు మూడు నిముషాలయింది. తను ఒక్కతే తిరిగి వచ్చి మమ్ముల్నిఒక  రూముకి  తీసుకు వచ్చింది.లోపల చల్లగా వుంది చుట్టూ చెట్లు వుండడం వల్ల అనుకుంటాను. లోపల రెండు బెడ్స్, ఒక టేబులు,రెండు కుర్చీలు వున్నాయి. .
బాత్ రూం వుంది. రూము చాలా శుభ్రంగా వుంది. 
నా మనసంతా ఉద్విగ్నంగావుంది. అమ్మ ఎలా రియాక్ట్  అవుతుందో, నేను ఎలా రియాక్ట్ అవాలో అర్ధం కావడం లేదు. దానికి తోడు కడుపులోనుంచి తన్నుకొస్తున్న బాధ. ఏడుపు!
పావుగంట పైన అయింది. ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. ఎవరో కుర్రాడు వచ్చిమంచినీళ్లు,టీ,బిస్కట్స్ఇచ్చివెళ్ళాడు.బయటనుంచి మాటలు వినబడుతున్నాయి. ఒకరి మాట అమ్మదే. గుర్తించాను. మాటలు ఆగిపోయాయి. 
అమ్మలోనికి వచ్చింది. ఆమె ముఖం ప్రశాంతంగా వుంది. 
ఎటువంటీ భావనా అమ్మ ముఖంలో నాకు కనుపించలేదు. 
నాకు ఏడుపు ఆగడం లేదు. కళ్ళ వెంట నీరు కారుతూనే వుంది.
''శిశిరా బావున్నావా అమ్మా! ఇద్దరు పిల్లలు కదా!" లత చెప్పింది.
''బావున్నావా బాబూ? ఎప్పుడు వచ్చారు హైదరాబాదు?" శశాంక్ ని పలకరించింది అమ్మ.
శశాంక్ వంగి అమ్మ కాళ్ళకు నమస్కరించి పిల్లలిద్దరితోను నమస్కారం చేయించి ''అమ్ముమ్మ'' అని చెప్పాడు. అమ్మ పాపని దగ్గరకు తీసుకుని ''నీ పేరేంటి ?" అని అడిగింది.
అది వాళ్ళ నాన్న కాళ్ళని చుట్టేసుకుంది.
''నీ పేరేంటి బాబూ?"బాబుని అడిగింది అమ్మ. 
''వెంకట్'' వెంటనే సమాధాన మిచ్చాడు వాడు స్పష్టంగా.
''అమ్మా!'' అన్నాను నేను. నా వైపు చూసింది అమ్మ.
అమ్మ కలివిడి చూసి నాకు దుఃఖం పొంగుకు వచ్చింది.
నేను నాకు తెలీకుండానే లేచి అమ్మా కాళ్ళు  చుట్టేసుకుని ''నన్ను క్షమించమ్మా!"అని బోరుమన్నాను.
అమ్మ చాలా సున్నితంగా మందలిస్తూ ''లే శిశిరా! ఏమిటిది?  పిల్లలు భయ పడతారు" అంటూ భుజాలు పట్టుకుని లేపింది నా వీపు నిమురుతూ. ఆ క్షణం నేను పొందిన ఆనందం, అమ్మ స్పర్శ  అనిర్వచనీయం. ఈ 'ఆనందం' కోసం ఈ తొమ్మిదేళ్లు ఎదురు చూశాను.
నేను కళ్ళు  తుడుచుకుని ''అమ్మా! క్షమించమని అడిగే హక్కు లేదు నాకు. నా మూలంగానే ఇన్ని అనర్ధాలు జరిగాయి. కుటుంబం మొత్తం ఇలా చెట్టు కొకరమయ్యాము'' అన్నాను నేను బాధగా తలవంచుకుని.
''ఎందుకు అలా అనుకుంటున్నావు?"
''ఇలా జరిగేవన్నీమనవల్ల వల్ల జరిగాయనుకుంటే ఇక దేవుడు... సృష్టి అంతా మనచేతుల్లో ఉన్నట్లే గదమ్మా! మీ లాగా ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు? అందరికీ ఇలాగే అయిందా.... 
లేదు కదా! ప్రతిమనిషికి  నొసటన  ఏమి వ్రాసివుందో అదే జరుగుతుంది. తెలీసీ, తెలియక ఎన్నో అనుకుంటువుంటాం. అల్పులం కదా!" అంది  అమ్మ చాలా మామూలుగా.
అమ్మ మాట్లాతున్నంతసేపు అమ్మనే చూస్తూ వున్నా. ప్రశాంతంగా ఉందామె. 
''నేనిప్పుడే .పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకు వస్తాను" అంటూనే  బయటకు వెళ్ళింది అమ్మ.
నాకు నెత్తి మీదనుంచి వేయి ఏనుగుల బరువు దించి నట్లయింది. మనసు కొద్దిగా కుదుట పడ్డది.
ఒ పావు గంట తరువాత అమ్మ వచ్చింది. అందరికి టిఫెన్లు వచ్చాయి.
''అమ్మా! నీతో కొద్దిగా మాట్లాడాలి. చేసిన తప్పుకు ఫలితంగా నాన్నను పోగుట్టుకున్నాను. తమ్ముడు, నువ్వు, మన కుటుంబం కోల్పోయిన దానికంతా నేనే బాధ్యు రాలిని. ఆ తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయను. ఎవరు కాదన్నా నాకు నేను దోషినే''.దానికి ఫలితం నేను  అనుభవించాల్సిందే!
లత, శశాంక్ ఇద్దరు లేచి బయటకు వెళ్ళడానికి  ఉద్యుక్తులయ్యారు.
"ఎవరు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. అమ్మా! నీతో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు"
'నేను,శశాంక్, నిన్ను  ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాం. నీతోనే మేముండాలని మాకోరిక!
"అవును ఆంటీ! మా తెలిసీ తెలియని నిర్ణయంతో ఏమి కోల్పోయామో, కోల్పోయిన దాకా తెలవలేదు.మమ్ముల్ని మేము క్షమించుకోలేని ఈ క్షణం వస్తుందని ఎప్పుడూ వూహించలేదు.
మిమ్ముల్ని క్షమించమని అడిగే అర్హత మాకు లేదు. దానికి పరిహారంగా మిమ్ముల్ని మాదగ్గరికి రమ్మని అంటున్నామని మీరు అనుకోవద్దు.మిమ్ముల్ని కాపాడు కోవడమే మా బాధ్యత. .
ఇప్పటికే మామయ్యగారిని, కుటుంబాన్ని కోల్పోయారు మీ రందరు. ఇక నైనా సంతోషంగా వుండాలని మాకోరిక. అందుకే మీరు ఇక్కడ అంతా సెటిల్ చేశాక అందరం కలిసి ఉండాలని మా కోరిక. మీరు దయచేసి  రాను అనవద్దు" వేడికోలుగా అన్నాడు శశాంక్.
శిశిర కృతజ్ఞతాపూర్వకంగా చూసింది శశాంక్ వంక.
''పిల్లలూ! వినండి. నేను ఇందాక చెప్పాను, ఇదివరకు లతతో చెప్పాను.
శిశిర మీద నిజంగా నాకు కోపం ఏమీ లేదు. అప్పుడేమైనా అని ఉంటే అది ఆక్షణం వరకే.
జరగవలసినది జరిగింది. అందులో మీ తప్పు, నాతప్పు అని ఏమీ లేదు.
ఎవరి కర్మ ఎలావ్రాసివుందో అలా జరిగింది. జరుగుతుంది. ఇది వేదాంతం కాదు.
ఇంత కంటే ఏమీ చెప్పదలుచుకో లేదు. ఇక నేను ఇక్కడనుంచి షిఫ్ట్ కావడమంటూ జరిగేపనికాదు. అది సాధ్యం కాదు. ఇక్కడ నాకు చాలా బాధ్యతలు వున్నాయి. దిక్కులేని వాళ్ళు ఈ ఆశ్రమంలో చాలామంది ఉన్నారు. ఇక్కడి విషయాలన్నీ లతకు విపులంగా తెలుసు. 
పిల్లలు పట్టించు కోని తల్లులు, తండ్రులు, అనాధలూ, అన్నీవుండి ఆదరణ కరువైన వాళ్ళు ఇలా చెబుతూపోతే  వినడానికే బాధగా వుంటుంది. ఇంకొక విషయం నిర్మొహమాటంగా చెపుతాను.
ఇక్కడ వీళ్ళందరికీ నా అవసరం వుంది.
నా కోసం, నా సుఖం కోసం, నేను ఇప్పుడు ఎక్కడికీ రాలేను. నా కేమి బాధల్లేవు. నాకు ఇక్కడ మనశ్శాంతి వుంది. ఇంకొంతమందికి మనశ్శాంతి కల్పిస్తున్నామని నా విశ్వాసం.
మీ ఈరాక తో, మీ పిలుపుతో నన్ను, నావిశ్వాశాన్ని సడలించే ప్రయత్నం చేయకండి.
వీలున్నప్పుడు తప్పక మీ ఇంటికి వస్తాను. పిల్లలతో గడుపుతాను. మీకు వీలున్నప్పుడు ఇక్కడికి  ఎప్పుడయినా రావచ్చు. నా ఈ శేష జీవితం ఈ ఆశ్రమానికే అంకితం! 
మళ్లీ, మళ్ళీ చెబుతున్నాను శిశిరా! నీ మీద నాకు కోపం లేదు. నువ్వుకూడా జరిగిన దానికి 'నేనే'  బాధ్యురాలినని నిందించుకోవద్దు. ఆత్మనింద మంచిది కాదు. నేను ఇప్పుడు చెపుతున్న ప్రతి మాట నిష్కల్మషంగా చెపుతున్నవే.
ఇంకొక విషయం శిశిరా!. తమ్ముడు యు.ఎస్. వెళ్ళాడు తెలుసుకదా!
వాడి భవిష్యత్తు ఇక మీ బాధ్యత. వాడితో మాట్లాడుతాను. నీతోమాట్లాడమని, నీతో కాంటేక్టులో ఉండమని చెబుతాను.
''శిశిరా! ఇది పిల్లలకి'' అంటూ ఒక కవరు ఇచ్చింది అమ్మ, నా చేతికి. ఇక వెళ్తాను. నాకు పనులున్నాయి" అని తను వెళ్లి పోయింది.
అమ్మలో ఎంత మార్పు. ఎంత ప్రశాంతత! 
"థాంక్ యు లతా! నీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు" అని లతని కౌగలించుకుంది శిశిర. 
"ఇక బయలుదేరుదామా?" అంది బయటకు నడుస్తూ లత 
"గాడ్! అ యామ్ సో గ్రేట్ఫుల్ టు యు!" అనుకుంటూ అమ్మ వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉండి పోయాను. శశాంక్ నన్ను భుజం తట్టాడు బయటకు నడుస్తూ. 
                                                 
                                                         --------సమాప్తం--------

రచన:-  
కేశిరాజు వెంకట వరదయ్య.
mob.no..9849118254

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి