లేబుళ్లు

14, సెప్టెంబర్ 2021, మంగళవారం


                                                                   ఆపన్నులు 
                                                                  ==========  

సరిగ్గా రాత్రి ఎనిమిదిన్నర గంటలు. రాజగోపాలస్వామి గుడి గంట ఠంగ్…ఠంగ్ మంటూ వాయులీనమైన ప్రతిధ్వనితో మ్రోగింది. ఆరోజుకిక గుడి ద్వారం మూసి తాళంవేసి భక్తులందరూ వెళ్ళారా లేదానని చూశాడు పూజారి తిరువనంతాచార్యులు. లైట్లన్నీఆర్పి ఆలయపు ఆవరణలోనే మిద్దెపైనున్ననివాసానికి వెళుతూ చావడి మూలన ఏదో ఆకారం కదిలినట్లనిపించి లైట్ వేశాడు. ఎవరో వ్యక్తి  గోడనానుకుని కాళ్ళు జాపి కూర్చుని జోగుతున్నట్లనిపించి ''ఎవరదీ?" గద్దించి అడిగాడు పూజారి. అతన్నుంచి సమాధానం లేదు.  
''గుడి మూశాను ... ప్రసాదం అయిపోయింది. అందరూ వెళ్లారు. మీరు కూడా వెళితే బయట తలుపులు మూస్తాను" అన్నాడు పూజారి. 
అతనిలో కదలిక లేదు. కంగారుగా నాలుగంగల్లో అతన్ని చేరి మసక వెలుతురులో పరికించాడతణ్ణి. వయస్సు సుమారు ఏభై ఐదు, అరవై సంవత్సరాల మధ్య ఉంటాయి. పొట్టి లాల్చీ, జీన్స్ ప్యాంటులోఉన్నాడు.
చేతికి ఖరీదయిన వాచీ, ఉంగరపు వేలుకి వజ్రపుటుంగరం. పక్కనే బ్యాక్ ప్యాక్. 
ఉన్నవాడిలా కన్పించాడతను. తక్షణం అతని చేయి నందుకుని 'నాడి' పరీక్షించాడు.  మెల్లగా కొట్టుకుంటోంది. ఆయుర్వేద వైద్యంలో ప్రవీణుడయిన పూజారి తిరువనంతాచార్యులకి స్పష్టమయింది ఆవ్యక్తి  తినక నీరసంతో స్పృహకోల్పోయాడని.
భార్య పారిజాతంను కేకేసి "త్వరగా గ్లాసెడు మంచినీళ్లు తీసుకురా" బిగ్గరగా అరిచాడు పూజారి, మిద్దెపైనున్న భార్యకు వినిపించేలా. పరుగున మంచినీళ్ళు తెచ్చిందావిడ. 
నీళ్లు చిలకరించాడతని మొహాన పూజారి. 
అతని కనురెప్పలు కదిలాయి. మెల్లగా కదిలాడు. కదులుతున్న కనుగుడ్ల ఆనవాలు కనురెప్పలపైనుంచి పసిగట్టి, గట్టిగా తడుతూ అతన్నిస్పృహలోనికి రప్పించే ప్రయత్నం చేశాడు పూజారి. 
నీరసంగా కళ్లు తెరుస్తూనే పూజారి వంక చూస్తూ ''అనంతూ!'' అన్నాడతను హీన స్వరంతో. 
ఆ పిలుపుకు అనూహ్యంగా స్పందించింది అనంతాచార్యులు హృదయం. 
మనసు ఉత్తేజితమయిందిఒళ్ళు గగుర్పాటు చెందింది. వివశుడయ్యాడు పూజారి.         
ముప్ఫై అయిదు సంవత్సరాలపైమాటే అతనా పిలుపువిని. 
"ప్రకాశం...నువ్వా."!? ఒళ్ళు తెలియని ఉద్వేగంతో లేచి ఒంగుని ప్రకాశం భుజాలు పట్టుకుని కుదుపుతూ మోకాళ్ళమీద నిలిచి, అతని తల వెనకాలగా ఎడమచేతిని ఊతంగా చేర్చి కాసిన్ని మంచినీళ్లు పట్టాడతనికి.  
కొద్దిగా తేరుకుని కళ్ళు తెరిచి కొద్దిగా వెనక్కి జరిగి నీరసంగా గోడకు జేరగిలబడ్డాడు ప్రకాశం. 
"పారిజాతం! కొద్ది పంచదార వేసి త్వరగా వేడిపాలు తీసుకురా" అని భార్యకు చెప్పాడు 
తిరువనంతాచార్యులు. 
వేడి పాలుత్రాగి కొద్దిగా తేరుకున్నతను "అనంతూ... నీలో పెద్దమార్పేమీ లేదు. వయస్సు ఛాయలు కనబడుతున్నాయి. అంతే! నన్ను గుర్తించలేదు కదూ!" రహస్యం చెబుతున్నట్లుగా మెల్లగా అన్నాడు ప్రకాశం
"తరువాత మాట్లాడదాం ప్రకాశం! ఎప్పుడు తిన్నావు?" ప్రశ్నించాడు తిరువనంతాచార్యులు.
"నిన్నఉదయం భోజనం చేశాను. తరువాత ఏమీ తినలేదు. గుడి లోనికి వస్తూనే కళ్ళు తిరిగినట్లనిపించింది. ఈ మూలకు వచ్చి గోడకానుకుని కూర్చున్నాను. తరువాత ఏమైందో తెలియదు" అన్నాడు ప్రకాశం. 
"నీరసంగా ఉన్నావు. కొద్దిగా తిని, విశ్రాంతి తీసుకుందువుగాని. ఉదయాన్నే మాట్లాడుకోవచ్చు" అంటూ ప్రకాశానికి చేతినందించి మిద్దె పైన తనింటికి  తీసుకెళ్లాడు తిరువనంతాచార్యులు. 
                                                                   * * * * *        
తెల తెలవారుతూనే గుడి గంటలు, సుప్రభాత మంత్రాలు వినబడ్డాయి ప్రకాశానికి. లుంగలు చుట్టిన పాత దూది పరుపు మీద చిరుగుల తెల్లటి చలువ దుప్పటి, కొసలు వ్రేలాడుతున్న తెల్లటి గలీబులో గట్టి పల్చని దిండు. పేదరికం తాండవిస్తూ కనిపించిందా ప్రదేశం. పక్కనే ఇంకొక పరుపు చుట్టేసి ఉంది. 
'ఓ! ... రాత్రి అనంతు ఇక్కడే పడుకుని లేచి వెళ్లినట్లుంది' అనుకుంటూ రాత్రి జరిగినదంతా మననం చేసుకుని, లేచి కూర్చుని పరిసరాలు పరికించి చూశాడతను. 
గోడలకి తాపడం చేసిన చైనా పింగాణీ టైల్స్, బెల్జియం అద్దాలతో నిగలాడుతూ ఉండే ఆ అద్దాలచావడిని శిధిలావస్థలో చూసి చలించిపోయాడు ప్రకాశం. 
గోడలుకున్న టైల్స్ ఊడి సున్నపు తాపడం పెచ్చులు ఊడుతున్న గోడలు, 
నెర్రెలు బాసి ఎర్రటి తారసు బిళ్ళలు జారి ఊడి పడేట్లుగా ఉన్న పైకప్పు, జీవంపోయి ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా వుంది. మాసిన చావడిలో మూసివున్న రెండు పడక గదులు.  ఇంకొక పక్క నల్లమద్ది భోషాణం, పాత పందిరిమంచం, మూలగా చేతులు విరిగిన టేకు కుర్చీల కుప్ప, ఆ మిద్దె  ఒకప్పటి వైభవానికి సాక్షీభూతంగా పడివున్నాయి. కిటికీ నుంచి కనిపించే పూలతోట, తులసి వనం, పెద్ద నందివర్ధన చెట్టు మాయమయ్యాయి. తోట చుట్టూవున్న ప్రహరీ గోడ ఆనవాళ్లులేవు. 
పిల్లల ఆటస్థలమైనట్లుగా వుంది. వేప, రాగి, ఉసిరి వృక్షాల ఉనికే లేదు. 
అదే ఆవరణలో బాల్యంలో తిరుగాడిన జ్ఞాపకాలు దొంతర్లుగా ప్రకాశం బుర్రలో తిరుగాడాయి.
                                                            * * * * *
"అనంతూ! ఈ రోజు సినిమాకెళదాం" పన్నెండో తరగతి సంవత్సర చివరి పరీక్షవుతూనే అన్నాడు ప్రకాశం. 
"వెళదాం గాని ఏమైంది మీ నాన్నగారి తిరుగు ప్రయాణం?"  అన్నాడు అనంతు 
"అదే అనంతూ ! ఎలా చెప్పాలో అర్ధంగావడం లేదు. నాన్నగారొక్కరే అమెరికా వెళతారనుకున్నాను. కాదట! కుటుంబం అందరం వెళ్ళితున్నామట. ఇక నా చదువక్కడే. 
మళ్లీ వస్తామో, రామో... తెలీదనంతూ !" అంటూ అతన్నిచుట్టుకుని బావురుమన్నాడు ప్రకాశం.   అనంతు ముఖం ఒక్కసారిగా వివర్ణమైంది. 
ప్రాణస్నేహితుడు తనని వదలి వెళ్లిపోతున్నట్లుగా అర్ధమయింది. కాళ్లక్రింద భూమి 
కదులుతున్నట్లనిపించిందతనికి. 
'నాచదువంతటితో ముగిసినట్లేనా ? ఇన్నాళ్లు ఖర్చు భరించి చదివించిన స్నేహితుని తండ్రి వెళ్లిపోతున్నారు. భవిష్యత్తు అర్ధం కావడంలేదు' అనుకుంటూ  
"కలిసి బి.ఇ చేద్దామనుకున్నాం కదా! చదువక్కడే అంటావేంటి ? తిరిగి రావడంలేదా?  
మరి ఆస్తి, ఇల్లు, గొడ్లు... ?" తిరిగివస్తామని చెబుతాడేమోనన్న గంపెడాశతో అన్నాడనంతు.   
మౌనంగా నేలచూపులు చూస్తున్న ప్రకాశాన్ని చూసి "అవును కదా! ఆవిషయాలు నీకెలా తెలుస్తాయి? మన చేతిలో ఏముంది. పెద్దవాళ్ళ నిర్ణయం. మనమేం చేయగలం" అన్నాడు అనంతాచార్యులు పరిస్థితనవగతం చేసుకుని నిట్టూరుస్తూ. 
"నిజంగా ఆవిషయాలు నాకు తెలియవనంతూ! నాన్నగారినడిగాను, నీ చదువుగురించి ఫీజులగురించి..." మొహమాటంగా అన్నాడు ప్రకాశం. 
"ఆయనేమన్నారు ?"
"నీ వెంతవరకు చదివితే అంతవరకూ తనే చదివిస్తానన్నారు. వెళ్ళేలోపు కొంత డబ్బు మీ నాన్నగారికిచ్చి నీ చదువు విషయం మాట్లాడతానన్నారు" అన్నాడు ప్రకాశం. 
అనంతు ముఖం వికసించింది.        
ఆ వారం రోజులు సినిమాలు, షికార్లు ఒకర్నొకరు వదలకుండా తిరిగారిద్దరు స్నేహితులు.
                                                                * * * * *
ప్రకాశం వెళ్లే రోజు రానేవచ్చింది. తిరువనంతాచార్యుల చదువుకయ్యే మొత్తం ఖర్చుతనే భరిస్తానని భరోసాఇచ్చి, చదువు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపవద్దని చెప్పి కొంత డబ్బు ఇచ్చివెళ్లారు ప్రకాశం నాన్నగారు. చిన్ననాటి నుంచి కలిసి చదుకున్నప్రాణస్నేహితులు అలా విడిపోయి 
'చికాగో' వెళ్ళిన ప్రకాశం ఇప్పడిలా ప్రత్యక్షమయ్యాడు దేవాలయంలో.   
                                                               * * * * *
ప్రకాశం నిద్రలేచాడో లేదో చూద్దామని అక్కడికొచ్చిన పారిజాతం 
"లేచారా బాబూ! గుడి వెనకాల చేద భావి ఉంది. బ్రష్ చేసుకుని వస్తే కాఫీ ఇస్తాను" అని చెప్పివెళ్ళింది పారిజాతం.  
"అలాగేనమ్మా!" అంటూ లేచి పక్కబట్టలు మడత బెట్టి బ్యాగ్ తో కిందకు వెళ్లి బ్రష్ చేసుకుని, మొండిగోడల బాత్రూమ్ లో స్నానం చేసి పైకి వచ్చేసరికి  గుళ్లో పూజ ముగించుకుని వచ్చాడు తిరువనంతాచార్యులు.
తేరిపార చూశాడు ప్రకాశం స్నేహితుని వంక.  
రాని వయస్సు ముఖంలో కనబడుతున్నా తరగని ముఖ వర్చస్సు, చెరగని చిరునవ్వు, ఉంగరాలు తిరిగి భుజాలమీదకు జారిన వత్తైన నల్లటి జులపాల జుట్టు, నిగ నిగలాడే నల్లటి విగ్రహం, దిద్దిన  తిరునామాలు! 
అప్రయత్నంగా లేచి నిలబడి తలవంచి రెండుచేతులు జోడించి నమస్కారం చేశాడు ప్రకాశం. 
ప్రతి నమస్కారం చేసి రెండుచేతులు పైకెత్తి "ఆయుష్మాన్ భవ'' అని అలవాటుగా  దీవించి, ప్రకాశం చేతిని పట్టుకుని పరీక్షించి "నాడి నిక్షేపంలా వుంది. ఇక చెప్పరా... ప్రకాశం!" అన్నాడు తిరువనంతాచార్యులు . 
ఇంతలో పారిజాతం కాఫీ తేవడంతో ఇద్దరు కాఫీ ముగించుకుని హాలులో కూర్చున్నారు. 
"నోరు జారాను. ఏమీ అనుకోవద్దు ? ఏమిటీ రాక ? ఎక్కడనుంచి ? ఎక్కడ దిగావు ? అమెరికానుంచెప్పుడొచ్చావు?" చొరవగాఅడిగాడు తిరువనంతాచార్యులు.   
"ఏం ఫరవాలేదు. నువ్వెలా పిలిచినా నాకిబ్బంది లేదు. అలాగే పిలువు ! మనసుకు హాయిగా ఉంది. ఇండియా వచ్చి రెండు వారాలైంది. కాశీనుంచి కన్యాకుమారిదాకా తిరిగి చివరిగా తిరుపతి నుంచి ఇక్కడికి వచ్ఛాను. నా సంగతలా ఉంచు. నేను వెళ్లిన దగ్గరినుంచి నీచదువు, పెళ్లి, పిల్లలు ...అన్ని విషయాలు చెప్పు" అన్నాడు ప్రకాశం.
"ఒక్కడివే వచ్చావా? భార్యా పిల్లలెవరూ రాలేదా? ఎలావున్నారు వారంతా ? నువ్వేమీ బాధల్లో లేవు కదా ? " ప్రశ్నార్థకంగా చూశాడు తిరువనంతాచార్యులు. 
"ఒక్కడినే వచ్చాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. భార్య తెలుగమ్మాయే. అందరూ బావున్నారు. బాగా సంపాదించాను. ఎలాటి బాధలూ లేవు. ఒక ముఖ్యమైన పని మీద వచ్చానిక్కడికి. నీ కథంతా విన్నాక నా విషయాలన్నీ చెబుతాను. ముందుగా నీ వంతు!" అన్నాడు ప్రకాశం.
"ఇన్ని సంవత్సరాలు మాతృదేశానికి, మాతృభాషకు దూరంగా అమెరికాలో ఉన్నా నీ తెలుగుభాషా ఉఛ్ఛారణలో ఏమాత్రం తేడా రాలేదే!"
నవ్వి ఊరుకున్నాడు ప్రకాశం.    
 "నా చదువుకి మీనాన్నగారిచ్చిన డబ్బు ఇంటి అత్యవసరాలకి ఖర్చు చేశారు. బి.ఇ లో సీట్ వచ్చింది. చేర్పించలేదు. నా మాట వినేవారు లేకపోయారు. చదువాగిపోయింది. 
పూజాదికాలు మొదలెట్టాల్సివచ్చింది. మామయ్య కూతురు పారిజాతంతో పెళ్లయింది. 
ఇద్దరు మగపిల్లలు. ఇంటర్ తోనే చదువాపేశారు. ఈవృత్తి వద్దు ... చదువుకొమ్మని చెప్పినా ఇద్దరూ పెడచెవిన బెట్టారు. చదువబ్బలేదు. వృత్తి విద్యకే తల ఒగ్గారు. ఇద్దరూ పూజారులే. పట్నంలోవారి బ్రతుకులు వారీడుస్తున్నారు. ఇక నా సంగతి కొస్తే ... అదిగో! ఆయన, మేము ఒకలాగే ఉన్నాము'' అన్నాడు తిరువనంతాచార్యులు గుడివైపు చూపిస్తూ. 
అతని కళ్ళలో, మాటల్లో చెప్పలేని, వ్యక్తీకరించని లోతైన వైరాగ్య భావన, బాధ ప్రస్ఫుటంగా  కన్పించింది.  
"సంపాదన గురించేకదా నువ్వలా అన్నది ... ఎందుకలా అన్నావు? నాకర్ధంకాలేదు. వివరంగా చెప్పు!"
"కాలంతో పరుగెత్తడం నేర్చుకోలేదు. వస్తున్నది ... భగవంతుడిస్తున్నదంతే నని నమ్మకం.     
అది తప్పో, ఒప్పో తర్కించే తత్వంకాదు నాది ! ఈ మాట నా నోట మొదటిసారిగా బయటకన్నాను. బ్రతకీడ్చడానికి సరిపుచ్చుకునే సంపాదన. 
ఇంగ్లీషులో అంటారుకదా 'స్ట్రగుల్ ఫర్ సర్వైవల్'... అదే మా పరిస్థితి!' 
ఆయుర్వేద వైద్యం చేస్తాను. ఆ వైద్యాన్ని, నన్ను నమ్మేవారు ఒకరో, ఇద్దరో రోగులు. వారేమైనా ఇస్తే పుచ్చుకుంటాను.    
దేవుడి మాన్యం రెండెకరాల పొలం కౌలు వస్తే వచ్చినట్లు. చేతికొచ్చిందాకా గండమే. తుఫాన్లు మింగుతాయో తెలియదు. కౌలుదారు దయ. మా ప్రాప్తం! ఎంతిస్తాడో, ఎగ్గొడతాడో తెలియదు.  
అది తప్ప వేరే చెప్పుకోతగ్గ ఆదాయం లేదు.  
పారిజాతం ముప్పూటలా కష్టపడుతుంది. ఎంబ్రాయిడరీ, టైలరింగ్ చేస్తుంది. నర్సింగ్ చేస్తుంది. పిండి వంటలు చేస్తుంది. నిజం చెప్పాలంటే తన సంపాదనే మా సంసారానికి అండ, అక్కర.  ఇన్నేళ్ళలో తనకి ఖరీదైన బట్ట, నగ ఒక్కటీ కొనిబెట్టలేకపోయాను. 
ఈ ఊళ్ళోనే కాదు. ఎక్కడో ఒకటి, అరా తప్ప అంతటా దేవాలయాల పరిస్థితి,  
పూజారుల పరిస్థితిదే !" అన్నాడు తిరువనంతాచార్యులు.
"అంటే ఆర్ధికంగా పుష్టి లేదనే కదా నీ వనేది"
"అవును! తరాలు మారాయి. నమ్మకాలు సడలాయి. విశ్వాసాలు మారాయి. మారుతున్నాయి.
ఇదివరలో రైతులు కూరగాయలతో సహా ఇంటికి సంబారాలు పంపేవారు. అన్నీ ఆగిపోయాయి. 
దీప, ధూప నైవేద్యాలకే నెలకు రెండు వందలన్నారు. ఇప్పటికి ఏడేళ్లుగా అదీ రాలేదు. జీత భత్యాలంటూ లేవు. హారతి పళ్లెంలో కానుకలు అరుదే. తరచూ దేవాలయానికి వచ్చే మనిషి ఇంటనే దణ్ణం పెట్టుకుంటున్నాడు. గుడికి రావడం తగ్గింది. పుట్టినరోజునో లేక పండగకో, పబ్బానికో మాత్రమే గుడికి రావడం. అదీ సమయం దొరుకుతే ! గుళ్లోనుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుకు ఊళ్ళోకెళ్ళి పదేళ్ల పైగా అయింది. ఇకముందు వెళతాయన్న నమ్మకం లేదు. దానికి తోడు ఏదో అంటు రోగంతో మేటి ప్రపంచమే ముడుచుకు కూర్చుంది. ఇక మా బోటి వారెంత ?" 
"అంటే జనాలలో మార్పు వచ్చిందనా నువ్వనేది ?"
"పూజారిగా నేను ఆ విశ్లేషణ చేయతగనేమో!"
"అనంతూ ! నాకో ఇల్లు కావాలి" హఠాత్తుగా టాపిక్ మారుస్తూ అన్నాడు ప్రకాశం. 
"ఇల్లేమిటి ? అద్దెకా ...  కొనడానికా? అమెరికా తిరిగి వెళ్లడంలేదా ?"ఆశ్చర్యంగా అడిగాడు తిరువనంతాచార్యులు 
"ఇప్పుడే వెళ్ళను. కొన్నాళ్లపాటిక్కడే, ఈ ఊళ్ళోనే ఉందామనుకుంటున్నాను"
"మీ నాన్నపాలికి వచ్చిన పాత పెంకుటిల్లు ఎన్నోఏళ్లుగా తాళం వేసి ఉంది. నువ్వుండడానికి బాగుండదేమో! ఆస్తి పంపకాలలో మీ తాతగారు మీ నాన్నపేరిట విల్లులో వ్రాసిన ఇల్లది. 
ఆలనా పాలనా లేక పాడుబడింది. బాగు చేయించుకుని ఆ ఇంటే ఉండొచ్చేమో చూడు!"
"అలాగా! నాన్నగారనలేదు. నాకు తెలియదు. తాతగారు పోయారుగా? మా పెదనాన్న, చిన్నాన్న వాళ్ళెవరూ ఆ ఇంటిని అట్టేపెట్టుకోలేదా ? ఇల్లు మాపాలికి వచ్చినా సరే... ఖాళీగా ఉంటేనే చూద్దాం. ఎవ్వరినీ నొప్పించవద్దు"
"మీ వారెవరూ ఆ ఇంట నివసించడం లేదు. అందరు భవంతులు కట్టుకున్నారు. అతిధుల కోసం ప్రత్యేకించిన ఇల్లట" 
"అలా బయటకెళదాం !" అన్నాడు ప్రకాశం ఇంటి వివరం వినడం ఇష్టంలేనట్లుగా 
"టిఫిను చేసి వెళదాం" అంటూ లోనికి వెళ్ళాడు తిరువనంతాచార్యులు. 
                                                                   * * * * *  
"ఇదే ఆ ఇల్లు ! ఇంటి తాళంచెవి ఉందేమో మీ అన్నగారింట్లో కనుక్కుందాం! అలాగే వారింటికి వెళ్లినట్లుంటుంది. నువ్వు వారిని పలకరించి నట్లుంటుంది" అంటూ  దేవాలయానికి దగ్గరలోనే ఉన్న ఇంటి గేటు తీసి పెద్ద భవంతిలోకి నడిచాడు తిరువనంతాచార్యులు. అతన్ననుసరించాడు ప్రకాశం. 
పలకరింపులు, కాఫీలయ్యాక "ఏరా! బాబాయి, పిన్ని అంతా బావున్నారా ? తోట,ఇల్లమ్మడానికి వచ్చావా ?" అన్నాడు ప్రకాశాన్ని ఉద్దేశించి పెదనాన్న కొడుకు.
"ఇంటి తాళం చెవి ఉందా?" అన్నాడు ప్రకాశం అతని ప్రశ్నకు సమాధాన చెప్పకుండా.
"అదిగో! ఆ గుంజ మేకుకి తగిలించి వుంది. ఇన్నేళ్ళలో ఎవరూ దాన్ని ముట్టుకోలేదు. నువ్వే అందుకో !" అన్నాడు తేలికగా.  
"ఇంటి పేపర్లు... ?" అన్నాడు ప్రకాశం 
"ఉంటావా రెండ్రోజులు ... ఎప్పుడొచ్చావు. ఎక్కడ దిగావు ? రాత్రి  భోజనానికి రా! ఏదైనా ఎవ్వారం ఉంటే మాట్లాడుకోవచ్చు.పేపర్లు తీసిఉంచుతాను. ఇంటితో బాటు మీనాన్న పాలికి రెండెకరాల మావిడి తోట కూడా వచ్చింది. దాని తాలూకూ డబ్బు, లెక్క నాదగ్గరే ఉన్నాయి. పట్టుకెళ్ళు" అన్నాడు అన్న.  
"వస్తాను" తాళంచెవి తీసుకుని బయటకు వచ్చి పక్కనే ఉన్న లోగిలికి  తుప్పుపట్టిన పాత గేటు తీసుకుని లోనికి నడిచారు వారిద్దరు.  
"వస్తానన్నావు ... ?" అన్నాడు తిరువనంతాచార్యులు ప్రకాశం మొహంలోకి సాలోచనగాచూస్తూ. 
"భోజనానికి"... 
ఇంటి తాళం తీసి "లోపల, వెనకాల పెరడు చూస్తూవుండు. పాతిల్లు, జాగ్రత్త!
చూసి నడువు పురుగు, పుట్ర ఉండగలవు. కూలి మనుషుల్ని, సుతారిని పిలుచుకొస్తాను. 
ఇల్లు శుభ్రం చేయించి నివాసయోగ్యంగా మరమ్మత్తులు చేయిద్దాము" అంటూ బజారు కెళ్ళాడు తిరువనంతాచార్యులు.     
                                                                     * * * * * 
ఇంటి మరమ్మత్తులు అదే రోజు వేగంగా మొదలయ్యాయి. 
ముందుగా ఇంటావరణలో ఉన్నపెద్ద వేపచెట్టు చుట్టూ నెర్రెలు బాసిన గుండ్రటి అరుగు, ఆపైన గోడల మరమ్మత్తులయ్యాయి. పట్నం నుంచి ఆటోల్లో పనివారు వచ్చి, వెళుతున్నారు. ఇంటికప్పు పూర్తిగా తిరగవేశారు. పడకగదులకు ఎ.సి లు బిగించారు. వంటిల్లు నిత్య నూతనంగా తయారయింది. బావికి మోటార్, కుళాయిలు ఏర్పాటయ్యాయి. చూస్తుండగానే  రెండు వారాల్లో ఇల్లంతా హంగులతో కళకళ్ళాడింది. ఇంటి బయట సున్నం, లోన రంగులు అయ్యాయి. 
'డబ్బుంటే కొండ మీది కోతైనా దిగి వస్తుందనే నానుడి కర్ధం ఇదేనేమో ! పాడుపడిందనుకున్న ఇల్లు వసతులతో కళకళలాడుతోంది' అనుకున్నాడు తిరువనంతాచార్యులు.
"ఇంటి మరమ్మత్తులన్నీ పూర్తయ్యాయి. ఇల్లిప్పుడు నివాసయోగ్యమే. నువ్వు, చెల్లాయి ఈ ఇంట్లో గృహప్రవేశంచేయాలి అనంతూ !" అన్నాడు ప్రకాశం. 
"మేమా? ఎందుకు? ఇంటిపై బోలెడంత ఖర్చుచేశావు. అంత ఆడంబరం భరించే శక్తి నాకు లేదు" నిరాసక్తిగా, ఒకింత ఆశ్చర్యంగా అన్నాడు తిరువనంతాచార్యులు. 
"నిన్నీ ఇంట్లోకి రమ్మనడానికి కారణం ఒకటి కాదు. మూడున్నాయి. తరువాత చెబుతాను"  
"నాకు గుడి, మడి, ఆచారం ఉన్నాయి"
"ఎప్పటిలానే పాటించు ! ఎవరు కాదన్నారు ?"
"గుడి నెవరు చూస్తారు ?"
"పూజారులంతా ఆలయావరణలలో నివసిస్తున్నారా? అందరికీ వసతుల్లేవే. అలాగే నువ్వు. 
గుడి కాపలా నీ బాధ్యతెలా అవుతుంది ?" ఆలోచనలో పడ్డాడు తిరువనంతాచార్యులు.     
"నాకయోమయంగా ఉంది. ఇప్పటికిప్పుడే  నిర్ణయం తీసుకోలేను. ఊహకందని మార్పు! 
పూర్వా పరాలు ఆలోచించుకునే అవకాశమివ్వు. నీకు ముందే చెప్పాను. కాలంతో పరుగెత్తడం నేర్చుకోలేదని ... "
"నీకు నువ్వుగా పరుగెత్తడం లేదే ! కాలమే మార్పులను తీసుకొస్తుంది. మన ప్రమేయం లేకుండానే  కొన్నిఅమరుతుంటాయి. కొన్ని అంది పుచ్చుకోవాలి. 
కొందరికి కర్మఫలం సఫలం, మరికొందరికి విఫలం! 
అదేమిటో, ఎందుకో ... అర్ధమయిన్నాడు మనిషికి పగ్గాలుండవుకదా! నీ శుశ్రూషకు ఫలంగా నీ రాజగోపాలస్వామే ప్రసాదించాడనుకోవచ్చుగదా! ఇలాటి మాటలు భక్తులెందరితోనో 
అనుంటావు. నీ సిద్ధాంతమే నీకు వర్తించదా!?"
"ప్రకాశం!  కొద్ధి సమయమివ్వు. మాటలతో మభ్యపెట్టకు. మానసిక దౌర్బల్యానికి గురిచేయకు!" అని చప్పున గుడి వైపు వడి వడిగా అడుగులేశాడు తిరువనంతాచార్యులు.     
                                                                      * * * * *
రాత్రి ఎనిమిదిన్నర గంటలు. గుడికి వచ్చాడు ప్రకాశం. ఇద్దరు గుడి చావడిలో కూర్చున్నారు. 
"ప్రకాశం ! ఏమిటిదంతా... ? అసలు నువ్వెందు కొచ్చావు ? కారణం చెబుతావా ? మన స్నేహితం మీద ఆన.  దేవాలయంలో కూర్చున్నావు. నిజం చెప్పు" 
"నువ్వా  ఇంట్లోకి మారతావా లేదా ? ముందుగా చెప్పు!" 
"ఇదేదో నాకు గోపాలస్వామి పెట్టిన పరీక్షలా ఉంది. చూశావుగా... ఆలయ పరిస్థితి. శిధిలావస్థలో ఉంది. ఉద్ధరణకు నడుంకట్టే మహానుభావుడెవరో రావాలి ! ఆనాటి దాకా  దేవాలయాన్ని వదిలి నా స్వసుఖం కోసం నీయింటికి రావడం అసమంజసం, అనైతికం. భక్తుల విశ్వాశాన్ని, నమ్మకాల్ని వమ్ము చేయను. దేవునికే గాదు, నామనః స్సాక్షికీ  సమాధానం చెప్పుకోలేను. నువ్వు గొప్ప స్నేహితుడివి. దైవ కార్య, కర్మల కంకితమైన నన్నాయనముందు దోషిగా నిలబెట్టకు! నిన్నర్ధిస్తున్నాను. 
కుచేలుని ఉద్ధరించడానికి వచ్చిన శ్రీ కృష్ణునిలా వచ్చావని అర్ధమైంది.నేనేమీ ఆచించలేదు. నేనీ మార్పునాకాంక్షించలేదు. అంగీకరించలేను. నన్ను క్షమించు" అతని గొంతు గాద్గగమైంది.
                                                                   * * * * *
ప్రకాశం దగ్గరిగా జరిగి స్నేహితుడి భుజం చుట్టూ చేయివేసి ఆప్యాయంగా వీపురాస్తూ 
"అనంతూ ! ధర్మాధర్మచింతన గురించి నీకు చెప్పేంత వాడి ఉన్నవాడిని గాను. అయినా అవసరం, సమయం, సందర్భం వచ్చింది కాబట్టి గీతలో శ్లోకం ఒకటి గుర్తుచేస్తాను.
 
సహజం  కర్మ  కౌంతేయ  సదోషమపి  న  త్యజేత్
సర్వారంభా  హి  దోషేణ  ధూమేనాగ్నిరివావృతా ||

దోషముతో కూడినదైనా సహజ కర్మను త్యజింపరాదు. నిప్పుని పొగ ఆవరించినట్లు మన  కర్మలలోను ఏదో ఒక దోషము ఉంటుందనే కదా శ్రీకృష్ణభగవానుడు చెప్పింది. 
మనం చేస్తున్నది అసహజ కర్మ కాదని నా ఉద్దేశ్యం! 
తిరువనంతాచార్యులు చకితుడై చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. 
"ఇప్పుడు సమయం వచ్చిందనంతూ! నువ్వాఇంట్లోకి ఎందుకు మారాలో మూడు కారణాలున్నాయన్నాను కదా... చెబుతాను. విను!
మొదటిది. మనం బాల్యంలో తిరుగాడిన ఈ దేవాలయం, మిద్దె పైన అద్దాలగది నన్నుగత కొన్నేళ్లుగా కలలో వెంటాడుతున్నాయి. గర్భగుడిపై గుమ్మటం నుంచి సున్నం, ఇటుక పెల్లలు రాలుతూ కనిపించేవి. నువ్వు వాటిని శుభ్రం చేస్తూ కన్పించేవాడివి. 
నేనిక్కడికొచ్చిన రోజు అద్దాలగదిలో నేను పడుకున్న చోట తెల్లారేసరికి సున్నం పెచ్చులు, ఇటుక పెల్లలు పైకప్పునుంచి రాలి పడ్డాయి. అదే దృశ్యం నాకు కలలో పదే పదే కన్పించేది. 
ఈ దేవాలయాన్ని, నువ్వుండే మిద్దెను పునర్మించడానికే వచ్చాను. నా కల అంతరార్ధ దైవేచ్ఛను నెరవేరుస్తాను. మిద్దె పునర్మితమయ్యాక నువ్వు, గ్రామ పెద్దలు కలిసి దాన్ని గ్రామ ప్రజల హితానికి, ప్రయోజనానికి ఉపయోగించండి. ఇది భగవత్పేరిత నిర్ణయం.  
రెండవది. ముఖ్యమైంది. నేను మరమ్మతులు చేయించిన ఇల్లు మాది కాదు. మీదే !
సరిగ్గా ఆరవై సంవత్సరాల క్రితం శార్వరి నామ సంవత్సర విజయదశమి రోజున ఆ ఇంటిని రాజగోపాలస్వామి దేవాలయ పూజారి పేరిట వ్రాసిన దస్తావేజు దఖలు పత్రం నా దగ్గర ఉంది. ఈ గుడి పూజారుల నివాసం కోసం ప్రత్యేకంగా మా తాతగారు నిర్మించిన ఇల్లది. 
ఇన్నేళ్లు ఈ విషయం ఎందుకు, ఎవరి స్వార్ధంతో మరుగున పడ్డదో, ఆ ఇల్లు మాకుటుంబ  స్వాధీనంలో ఎందుకు ఉందో కారణాలు నాకు తెలియవు. 
రాత్రి అన్న ఇచ్చిన ఆస్తుల వీలునామా పత్రంతో పాటు ఆ ఇంటి పాత దఖలు దస్తావేజు కూడా ఉంది. దీన్ని చూడు!  తెలిసీ స్వార్ధపూరితంగా ఇల్లు నాన్నపేరిట వీలునామా వ్రాశారు తాత! 
ఆ విషయమిప్పుడు,ఇక, అప్రస్తుతం ! 
ఈ క్షణంలో స్వామివారి సమక్షంలో మీకు చెందిన ఆ ఇంటిని నీకు దఖలు చేస్తున్నాను" అంటూ ఆ పాత పత్రాలు, స్నేహితుని పేరిట వ్రాసిన కొత్త పత్రాలు తిరువనంతాచార్యుల చేతిలో పెట్టాడు ప్రకాశం.  
ఇక మూడవది, చివరిది స్నేహధర్మం.  
నువ్వు అన్యధా భావించవద్దు! ఈ పాత పత్రాలు లేకున్నాఆ ఇల్లు, మామిడితోట నీ పరంచేసి వెళ్ళేవాడిని. అందుకే వచ్చాను. నాన్నగారితో మాట్లాడాను. సంతోషపడ్డారు. ఆయన సంతోషంగా తన అంగీకారాన్ని తెలియచేశారు.  
గీతానుసారం సహజ కర్మలను త్యజించరాదు కదా అనంతూ !" వినమ్రంగా, అనునయంగా సందర్భాన్ని అన్వయిస్తూ తలవంచి రెండుచేతులు జోడించి అన్నాడు ప్రకాశం .  
ఉద్వేగంతో లేచి నిల్చుని భగవత్ప్రసాదాన్ని స్వీకరించాడు తిరువనంతాచార్యులు అశ్రునయనాలతో.  

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254