లేబుళ్లు

9, జులై 2025, బుధవారం

అనూహ్యం


                                                                     
                                                                       అనూహ్యం
                                                                    ---------------------
  (ఈ కథ ప్రముఖ అంతర్జాల పత్రిక 'రవళి' లో ఏప్రిల్ '25 మాసములో ప్రచురింపబడింది)

శశాంక్ కి  రెండు సంవత్సరాలు నిండాయి. ఇంకా మాటలు రాలేదు. కనీసం 'అమ్మ' అని పలకడం  రాలేదన్నచింత నిలవనీయడం లేదు తల్లి సుష్మను. ఇంటికి దగ్గరలో ఉన్న ఎం.బి.బి.ఎస్ డాక్టర్ కి ఇప్పటికే రెండు, మూడు సార్లు చూపెట్టింది.
"బాబు బాగున్నాడమ్మా... ఏమీ ప్రాబ్లెమ్ లేదు. కొందరికి మాటలు మెల్లగా వస్తాయి. కంగారు పడకండి" ఆమె ఆందోళనను కొట్టిపారేశాడు డాక్టర్. 
ఆ డాక్టర్ మీద నమ్మకం కుదరలేదు. సాయంత్రం భర్త మీద కోపం ప్రదర్శించింది సుష్మ. 
"శశాంక్ ని చిల్డ్రన్ స్పెషలిస్ట్ కి చూపిద్దామంటే మీనమేషాలు లెక్కెడుతున్నావు. చాల రోజులనుంచి గమనిస్తున్నాను. ఈ మధ్య మరీనూ... ఉన్నట్లుండి దీర్ఘాలోచనపడిపోతావు. ఉలకవు పలకవు. ఏదైనా ప్రాబ్లమా అంటే ఏమీలేదంటావు. చిన్నవాడికేదైనా హెల్త్ ప్రాబ్లెమ్ ఉందేమోనన్న ఆనుమానానికి తోడు నీ ప్రవర్తన అర్ధంగాక భయపడి చస్తున్నాను'' ఆందోళనగా అంది సుష్మ. 
"ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి భయపడతావు. పిల్లల్లో కొందరికి మాటలు, నడక ఆలస్యంగా వస్తాయి. నావరకు నాకు, ఆ రెండూ ఆలస్యమేనని మా అమ్మ అంటూవుండేది.
నా కేమయింది ? దుక్కలా ఉన్నాను. అనవసరపు ఆలోచనలు పెట్టుకోకు " అన్నాడు జితేంద్ర భార్యను అనునయిస్తూ.
"ఇదిగో ఇలా ఏదోవొకటిలా సర్ది చెప్పి మాయచేస్తావు. పిల్లాడిని స్పెషలిస్ట్ డాక్టర్ కి చూపిద్దామని మాత్రం అనవు. వాడి సంగతి పట్టించుకోవు" నిష్ఠూరంగా మాట్లాడి, భార్య కంట నీరు పెట్టుకునే సరికి అప్పటికప్పుడు 'పెడియాట్రిషియన్'  అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు జితేంద్ర.  
"రేపుదయం పదకొండు గంటలకు అప్పాయింట్మెంట్. వెళదాము" అని భార్యతో చెప్పి గదిలోనికి వెళ్లి బెడ్ మీద వాలిపోయాడు జితేంద్ర. 
"ఏమిటో ఈ మనిషి ..." అని భారంగా నిట్టూర్చింది సుష్మ.  
                                                                        * * * * *         
మరుసటిరోజు పదకొండున్నర గంటలకు శశాంక్ ని పరీక్షిస్తూ  "చెప్పండి, కంప్లైంట్ ఏమిటి ?" అన్నాడు పెడియాట్రిషియన్. 
"శశాంక్ కి రెండు సంవత్సరాలు నిండాయి. సాధారణంగా ఈవయసు పిల్లలు తల్లితో కబుర్లు చెబుతారు. వీడి దగ్గరనుంచి ఏ స్పందన లేదు. నవ్వుతాడు. కాని ఆ నవ్వు నన్నుచూసి కాదు. మమ్ముల్ని సూటిగా చూడడు. వెఱ్ఱి చూపులు చూస్తూ ఉంటాడు" అంది సుష్మ 
డాక్టరు శశాంక్ ని  నిశితంగా పరీక్ష చేశాడు. 
"ప్రాబ్లెమ్ ఉంది. అది ఏమిటనేది ఇప్పుడే పూర్తిగా డయాగ్నైజ్ చేయడం కుదరదు. 
'ఆటిజం' లక్షణాలు ఉన్నాయి. మీ కుటుంబాలలో ఎవరికైనా 'ఆటిజం వుందా?" అడిగాడు డాక్టరు.
"లేదు డాక్టర్ !" ఖచ్చితంగా అంది సుష్మ.  
"నువ్వలా ఉండు! భార్యను వారిస్తూ..."ఈ జబ్బు హెరిడెటెరిగా వస్తుందా డాక్టర్ ?" సీరియస్ గా  ప్రశ్నించాడు జితేంద్ర.  
"జన్యుపరంగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగని, ఖచ్చితంగా చెప్పలేము" ఇతమిద్ధంగా  ఏదీ తేల్చకుండా అన్నాడు డాక్టర్  

''... ఎందుకలాడిగావు?" అన్నట్లు ప్రశ్నార్థకంగా తలఎగరేసి చూసింది సుష్మ భర్త వైపు. 

మౌనంగా ఉన్నాడతను. 

"ఎనీ థింగ్  ఎల్స్ ... మిస్టర్... ?"
"... జితేంద్ర" అంది సుష్మ.  
"మై యంగర్ బ్రదర్ హేడ్ సచ్ ప్రాబ్లెమ్" అన్నాడు జితేంద్ర.  
"ఏం మాట్లాడుతున్నావు జితేంద్రా...నీకో తమ్ముడు ఉన్నాడా!?" అంది సుష్మ. డాక్టర్ ఛాంబర్ లోనే  ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చి చూస్తూ భర్త చెబుతున్నది నమ్మశక్యం కానట్లుగా. 
"ఓకే. డీటెయిల్స్ చెప్పండి" జితేంద్ర వంక చూస్తూ అన్నాడు డాక్టర్. 
"విజయేంద్ర నా స్వంత తమ్ముడు. నాకంటే ఐదేళ్లు చిన్న. వాడికి ఐదుసంవత్సరాలు వచ్చేవరకు కొద్ది మాటలే వచ్చాయి. పిలిస్తే పలికేవాడు కాదు. వెర్రి చూపులు చూసే వాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఏమాత్రం శబ్దాన్ని భరించేవాడు కాదు. ఒంటరిగా ఉండేవాడు. 
కొత్త వారినెవరినీ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. బొమ్మల్ని, వస్తువుల్ని విసిరేవాడు. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేసేవాడు. నా చిన్నతనంలో నేనే వాడితో ఆడుకోవాలన్నా, ఒంటరిగా వాడితో ఉండాలన్నా బెరుకుగా అనిపించేది" బాధగా చెప్పాడు జితేంద్ర 
"ఇప్పుడెలా ఉన్నాడతను... ?"
"తెలియదు..." నిర్వికారంగా అన్నాడు జితేంద్ర.   
భర్త తనకో స్వంత తమ్ముడున్నాడని చెప్పడంతో సుష్మకి కలిగిన విస్మయం కంటే అతనా విషయం దాచినందుకు వచ్చిన కోపాన్ని దాచుకోలేకపోయింది. హాస్పిటల్లో కోపగించడం బాగోదని, సభ్యత కాదని మౌనంగా ఉండిపోయింది సుష్మ. 
"బాబు ఎదుగుదల నార్మల్ గా ఉంది. పిరియాడికల్ గా చూద్దాం" అని వేరే స్పెషలిస్ట్ డాక్టరుకి రిఫర్ చేస్తూ మరుసటిరోజు ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పి, ప్రిస్క్రిప్షన్ వ్రాసిచ్చాడు డాక్టర్. 
భార్యాభర్తలు ఇంటికి తిరిగి వచ్చారు. తోవలో ఒకరితోనొకరు మాట్లాడుకోలేదు. 
బద్దలవ్వబోయే అగ్నిపర్వతంలా సుష్మ, బద్దలయ్యి 'లావా, మేగ్మా' ను చిందించి, శాంతించిన అగ్నిపర్వతంలా జితేంద్ర, చెరొక గదిలో గడిపారు. ఇద్దరూ ఎంగిలి పడలేదు. 
కాసేపటికి ఏడ్చి, ఏడ్చి కళ్ళు ఉబ్బి గదిలోనుంచి బయటకు వచ్చింది సుష్మ. అదే సమయానికి జితేంద్ర బయటకు వచ్చాడు. 
"నీకో స్వంత తమ్ముడున్నాడన్న విషయాన్నినా దగ్గర దాచావు ? ఇంకెన్ని విషయాలు దాచావు?" కోపంగా అంది సుష్మ.   
"మన పెళ్ళికి ముందే మీ అన్నయ్యకు చెప్పాను. నీతో చెప్పే అవకాశం రాలేదు. మీ అన్నయ్య మీ ఇంట్లో చెప్పాడనే అనుకున్నాను. నీతో నేను ఆ విషయాన్ని చెప్పకపోవడం నా తప్పో, బలహీనతో నాకు తెలియదు. ఎందుకని ప్రశ్నిస్తే  నా దగ్గర సమాధానం లేదు" వంచిన తల ఎత్తకుండా సమాధానం చెప్పాడు జితేంద్ర. 
"నిన్నని ప్రయోజన మేముంది. స్వంత అన్నే తెలిసీ చెప్పలేదు ... కనీసం ఇప్పుడైనా  'విజయేంద్ర' ఎక్కడున్నాడో చెబుతావా.... ఆరోగ్యం ఎలావుంది? ఏం చేస్తున్నాడు...? 
అతని బాగోగులు ఎవరు చూస్తున్నారు? చివరిగా అతన్ని ఎప్పుడు చూశావ్ ?" ప్రశ్నల వర్షం కురిపించింది సుష్మ 
"విజయేంద్ర, రాజారావు చిన్నాన్న దగ్గర మా ఊళ్ళో ఉన్నాడు. పన్నెండేళ్ల క్రితం నేను ముంబై వచ్చాక తిరిగి ఆ ఊరెళ్ళలేదు. విజయేంద్రను చూడలేదు" అపరాధభావంతో అన్నాడు జితేంద్ర  ఆమె సూటి చూపులను తప్పించుకుంటూ.  
"విజయేంద్రతో గాని, మీ బాబాయిగారి తోనూ కాంటాక్టులో లేవా?!"
"లేదు. చాలా లెటర్స్ వ్రాశాను. మాట్లాడడానికి ఎన్నోసార్లో ప్రయత్నించాను. బాబాయి దగ్గరి నుంచి ఎటువంటి సమాధానం లేదు. నన్ను ఆవూరినుంచి ముంబై పంపించిన రోజున, తిరిగి ఆవూరికి రావద్దని గట్టిగా చెప్పి నా దగ్గర మాట తీసుకున్నాడు బాబాయి. అందుకే వెళ్ళలేదు" అన్నాడు జితేంద్ర. 
అతని సమాధానం విన్న సుష్మ మాన్పడిపోయింది. కాసేపటికి తేరుకుని  
"మామయ్య గారు వద్దంటే మాత్రం ... నువ్వసలు మనిషివేనా? మానవత్వం లేదా? స్వంత తమ్ముడు, అందునా మానసిక వైకల్యం ఉన్నతమ్ముణ్ణి వదిలేసి ఇన్నేళ్ళు యథేచ్ఛగా ఎలా ఉన్నావు ? నీదింత రాతి హృదయమని  గుర్తించలేక పోయాను... " కరకుగా అంది సుష్మ.
''నీకేం తెలుసు సుష్మా! ఈ పన్నెండేళ్ళుగా నేను ఎంత నరకం అనుభవించానో! 
శశాంక్ ఎదుగుతున్నకొద్దీ, రూపంలోనూ, చేష్టలలోనూ విజయేంద్రను పోలి ఉండడంతో ప్రతిక్షణం తమ్ముడు గుర్తుకు వచ్చి ఆవిషయాన్ని మింగాలేక, కక్కాలేక ప్రతిక్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నాను'' అని అన్నాడు జితేంద్ర కిటికీ లోనుంచి బయటకు చూస్తూ  
సుష్మ అప్పటికే లోనికి వెళ్ళిపోయింది. ఆమె తన మాటలు వినలేదన్న నిజాన్ని అతను గ్రహించలేదు. 
కొద్దిసేపటికి సూట్ కేసు సర్దుకుని, బాబుని తీసుకుని పుట్టింటికి  వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి బయలుదేరింది సుష్మ. 
జితేంద్ర ఎంత ప్రయత్నించినా సుష్మ ఆగలేదు. 
"డ్రాప్ చేస్తాను ఉండు!" అని జితేంద్ర చెప్తున్నా వినకుండా "నీడ్ ఏ బ్రేక్" అంటూ టాక్సీ లో  
వెళ్ళిపోయింది.
వెంట వెళ్లి భార్యను సమాధానపరిచే సాహసం కూడా చేయలేకపోయాడు జితేంద్ర. 
ఆమె కోపం జితేంద్రకు తప్పుగా అనిపించలేదు.  
తమ్ముడి విషయం  భార్యకు ఇన్నేళ్లు ఎందుకు చెప్పలేకపోయాడో అన్న స్పష్టత అతనికే లేదు. అది యాదృచ్ఛికం కాదు, స్వయంకృతం అని అతనికి తెలుసు. బాబాయి అన్నమాట మనసు పొరల్లో దాగి అతని మీద భావాధిపత్యం కొనసాగించింది. 
మనిషులు అవసరమైనప్పుడు అవసరాలకు, మనుగడకు అబద్ధమాడడం స్వాభావికం. 
కానీ, మనిషి దాచిన నిజాన్ని, దాని భౌతికతను శాశ్వతంగా దాయడం అసాధ్యం.  
మానసిక వైకల్యం వున్న తమ్ముడు వున్నాడని చెప్పడంవల్ల తన ఆస్తిత్వానికి ఎక్కడ హాని జరుగుతుందేమోనన్న భ్రమలో ఉండిపోయాడతను. ఆ ఆత్మన్యూనత వేటకుక్కలా జితేంద్రను వెంటాడుతూనే వుంది. సుష్మ తనని అసహ్యించుకోవడమే గాక లోకమంతా ఏకమై తనని వెలేసినంత ఏహ్యభావన తనని నిలువెల్లా కలిచివేస్తోంది. 
కళ్ళు మూసుకుని సోఫాలో ఒరిగాడు. అతని ఆలోచనలు వేగంగా గతంలోకి వెళ్లాయి. 
                                                                   * * * * * 
జితేంద్రది బందరు దగ్గర ఒక కుగ్రామం. చిన్న కుటుంబం. తల్లి, తండ్రి, తమ్ముడు. స్వంతిల్లు. రెండెకరాల పొలం. అదీగాక వేరే ఐదెకరాల మెట్ట భూమి కౌలుకి సాగు చేసేవాడు తండ్రి. సంతోషంగా సాగుతున్నరోజులు. జితేంద్రకి ఐదేళ్ల తేడాతో తమ్ముడు పుట్టాడు. ముట్టుకుంటే మాసిపోయే ఛాయ. ఎంత అందంగా ఉన్నాడో అనుకున్నారందరూ. 
రెండున్నర సంవత్సరాలు దాటినా విజయేంద్రకి  మాటలు రాలేదు. పెద్దాసుపత్రికి వెళ్లి డాక్టరుకు చూపించారు. ఆయన ఇంకొక స్పెషలిస్ట్ డాక్టరు దగ్గరికెళ్ళమన్నాడు.
బాబుకి 'ఆటిజం' అన్నారు. మూణ్ణెల్ల కొకసారి చూపించమన్నారు. అయిదు సంవత్సరాలకు కొన్ని  మాటలు వచ్చాయి. పిలిస్తే పలికేవాడు కాదు. స్కూల్లో చేర్పించారు. ఒక్క లెక్కల సబ్జెక్టులో అసామాన్య ప్రతిభ చూపేవాడు. మిగతా సబ్జెక్టులలో అంతంత మాత్రంగా ఉండే వాడు. 
జితేంద్రను ఇంటర్ కి వచ్చాడు. 
విజయేంద్రను హైదరాబాద్ లో స్పెషల్ స్కూల్లో చేర్పించమని స్పెషలిస్ట్  డాక్టర్ చెప్పాడు. తనని తీసుకుని హైద్రాబాదు వెళ్లి వచ్చాడు తండ్రి. తల్లితో ఏదో చెబుతూ తండ్రి కంట నీరుపెట్టుకోవడం చూశాడు జితేంద్ర. డబ్బు లేదని అర్ధమైంది జితేంద్రకు. జితేంద్ర చదువుకు, విజయేంద్ర వైద్యానికి అప్పులయ్యాయి. కనీసం వడ్డీ కట్టలేని స్థితి వచ్చింది. వరుసగా రెండుసంవత్సరాలు తుఫాను తాకిడికి పంట చేతికి రాలేదు. అప్పుల బాధతో వారికి నిద్రపట్టేది కాదు. కాలం గడ్డుగా గడిచేది. ఎకరం పొలం అమ్మి అప్పులు తీర్చాడు తండ్రి. జితేంద్ర ఇంటర్ పరీక్షలు అయ్యాయి. 
ఒకరోజు పొలంపనికి వెళ్లిన తలితండ్రులు ఇంటికి తిరిగి రాలేదు. పిడుగుపాటుకి ఇద్దరూ ఒకేసారి  చనిపోయారు. వారి దినవారాలయ్యాయి. ఊరి పెద్దాయన జితేంద్రను ఉద్దేశించి మాట్లాడుతూ
''ఈ పిచ్చోడికి  మీ చిన్నాయన రాజారావు ఓ ముద్ద పడేయకుండా ఉండడులే గాని వాడి మానాన వాడిని వదిలి, నువ్వయినా చదువుకుని ప్రయోజకుడివి కావాలి. ఉద్యోగం వచ్చాక వాడి మంచి, చెడు చూసుకోవచ్చు" అని జితేంద్రకు సలహా పడేశాడు. 
తమ్ముడ్ని పిచ్చోడు అనేసరికి జితేంద్రకు కోపం వచ్చింది.పేదవాడి కోపం పెదవికి చేటు కదా! గుడ్లనీరు కుక్కుకోవడం మినహా ఏం చేయలేకపోయాడు. 
ఇంత జరుగుతున్నా, విజయేంద్ర వాడి మానాన వాడు ఒకమూలన కూర్చుని ఆడుకునే వాడు. 
తల్లి, తండ్రీ కన్పించకపోవడంతో అన్న జితేంద్రను ఓ కంట కనిబెడుతూ, వదిలేవాడు కాదు. 
'నువ్వుకూడా నన్నొదిలి వెళ్తావా ?' అన్నట్లుగా వెంటాడేవి వాడి 'వాడి' చూపులు. 
జితేంద్ర చిన్నాన్నరాజారావు మిగిలి ఉన్న ఎకరం పొలం అమ్మి అప్పులు తీర్చి మిగిలిన డబ్బు విజయేంద్ర వైద్యానికి తనదగ్గరే ఉంచుతానని చెప్పాడు. శలవులయిపోయాయి. 
ఇంటర్ పాసయ్యాడు జితేంద్ర. 
                                                                     * * * * *
ఆ ఊరి కరణం గారబ్బాయికి ముంబైలో ఇంపోర్ట్స్ ఎక్సపోర్ట్స్ వ్యాపారం. చేతికిందకి నమ్మకమైన, చదువుకున్న కుర్రాడెవరైనా ఉంటే తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తానన్నాడు. జితేంద్ర గురించి చెప్పాడు రాజారావు. 
"ఉద్యోగం ఇచ్చి ముంబైలో ఉండడానికి వసతి ఇస్తాను. మీ అన్న కొడుకు బాధ్యత ఇక నాది" రాజారావుతో అన్నాడు కరణంగారి అబ్బాయి. సంతోషంగా ఇంటికి వచ్చాడు రాజారావు.   
"నీ ఇంటర్ అయిందిగా. పైచదువు చదివించే స్థోమతలేదు. కరణంగారబ్బాయి నీకు  ఉద్యోగం ఖాయం చేశాడు. ఊళ్ళోనే ఖాళీగా ఉన్నావంటే ఈ వయసులో అల్లరి చిల్లర తిరుగుళ్ళు అలవాటవుతాయి. నీ తమ్ముడిని అంటున్నట్లుగానే నీకూ 'పిచ్చోడి అన్న' అని  జనం నీకూ ముద్ర వేస్తారు . బతుకు ఛిద్రం అవుతుంది. ఈ ఊరు వదిలి వెళ్ళు. మరి రాకు!
బాబాయి ఊరి నుంచి తరిమేస్తున్నాడని అనుకోవద్దు. నీ భవిష్యత్తు కోసమే నేనీ నిర్ణయం తీసుకున్నాను. తమ్ముడి గురించి చింతపడకు. వాడిక మాబిడ్డ" అని చెప్పి ఆ మరుసటి రోజే జితేంద్రని స్నేహితునితో ముంబై పంపించాడు రాజారావు. 
అతని దగ్గర ఇంపోర్ట్స్, ఎక్సపోర్ట్స్ వ్యాపారంలో సహాయకుడిగా చేరి, ఐదేళ్లలో మంచి జీతంతో ముంబైలో సెటిలయ్యాడు జితేంద్ర. 
తమ్ముణ్ణి తీసుకెళ్తానని బాబాయికి ఉత్తరం రాశాడు. కరణంగారబ్బాయితో కూడా కబురుచేశాడు జితేంద్ర. తిరుగు టపాలో రాజారావు దగ్గర్నుంచి సమాధానం వచ్చింది. 
"ముంబయి లాటి మహాపట్నంలో విజయేంద్రను నీదగ్గర పెట్టుకోవడం, వైద్యం, విద్య అంత సులభంకావు. నీ రోజువారి జీవితానికి, నీ ఉద్యోగానికి వాడు అడ్డంకి అవుతాడు. ఇద్దరికీ ఇబ్బంది అవుతుంది. నా మాట విను. విజయేంద్ర బాగున్నాడు. వాడిని మా స్వంత బిడ్డలా సాకుతాము. 
వాడి గురించి ఆలోచన మానెయ్!  ఇక్కడ మంచి పంతులుగారు వచ్చారు. వాడు తప్పక మెరుగవుతాడని నమ్మకం ఉంది. ఇదే విషయం మీ యజమానితో చెప్పాను. ఇదంతా నీ మంచికే చెబుతున్నానని గ్రహించు" అనునయంగా ఉత్తరం రాశాడు రాజారావు. తరువాత జితేంద్ర వ్రాసిన ఉత్తరాలకి సమాధానం రాలేదు. 
కాలక్రమేణా వారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. కరణం గారబ్బాయి అహ్మదాబాదు కొత్త బ్రాంచిలో సెటిలయ్యాడు. ఫలితంగా జితేంద్రకు ఊరి సంగతులుకూడా తెలియరాలేదు. పన్నెండేళ్ల కాలం గడిచిపోయింది.   
అలా, ఆనాటి నుంచి ఈనాటి వరకు విజయేంద్ర ఎలా ఉన్నాడో జితేంద్రకు తెలియ రాలేదు.  
                                                                    * * * * *
ముంబైలో తనతో పనిచేసే ఓ తెలుగు స్నేహితుని చెల్లెలు సుష్మను పెళ్లిచేసుకున్నాడు జితేంద్ర.  వారింట్లో ఒంటరివాడిగా పరిచయమయ్యాడు జితేంద్ర.
                                                                    * * * * *  
డాక్టరు అడిగిన కారణంగా జితేంద్ర తమ్ముడి విషయం వెలుగు చూడడంతో సుష్మ షాక్ కు గురయింది. భర్త అంతటి ముఖ్య విషయాన్ని తననుంచి దాచడంతో భర్త మోసం చేశాడన్న భావనకు లోనయింది.
జితేంద్రకు సంజాయిషీ ఇచ్చుకునే సమయం, అవకాశం ఇవ్వలేదు. పిల్లాడితో పుట్టింటికి వెళ్లడంతో అతనికి ప్రపంచమంతా శూన్యమనిపిస్తోంది.     
                                                                    * * * * *
భార్య కోపంతో పుట్టింటికి వెళ్లిన రోజే జితేంద్ర అత్యవసర ఆఫీసు పనిమీద వారం రోజులు అహమ్మదాబాదు వెళ్లాల్సి వచ్చింది. క్యాంపుకు వెళ్లేముందు, తరువాత ఎన్నిసార్లు ఫోను చేసినా సుష్మ ఫోను ఎత్తలేదు. బావమరిదితో మాట్లాడుదామనుకున్నాడు. ప్రయోజనమేముంటుందన్న మీమాంశలో పడ్డాడు. జరిగిన తప్పిదాన్ని పదే పదే తవ్వుకోవడంకన్నాసరిదిద్దుకుని, ముందుకు పోవడమే మేలనుకున్నాడు. 
ఊరినుంచి తమ్ముడిని తీసుకునివచ్చి, అప్పుడు భార్య ముఖం చూడాలని నిర్ణయించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు జితేంద్ర. 
                                                                   * * * * *
ఫ్లైట్లో విజయవాడకు వచ్చి అక్కడనుంచి క్యాబ్ లో ఊరికి చేరాడు. స్వంత ఇంటి ఆనవాలే లేదు. అదే స్థలంలో పెద్ద భవంతి వచ్చింది. గేటులోనుంచి ఇంటిముందు ఆవరణలో పచ్చటి చెట్లతో, పూలమొక్కలతో గార్డెన్ కళకళ లాడుతూ కన్పించింది. ఆ ఇంటికి ఆనుకుని ఉన్న బాబాయిగారి పాత పెంకుటింటి వైపు నడిచాడు. ఇంటి తలుపు బార్లా తెరిచేఉంది. ఇంట్లో పనివాళ్ళు  వున్నారు. ఒక పనివాడు జితేంద్రను గుర్తించాడు. 
"మీరు జితేంద్రబాబు గారు కదా...చిన్నప్పుడెప్పుడో చూశాను. మీ చిన్నాయన పక్కన భవంతిలో వుంటారు. రండి వెళదాం" అన్నాడు. 
జితేంద్ర చేతినుంచి బ్యాగ్ అందుకుని రాజారావు ఇంటి ఆవరణ లోనికి నడిచాడు. పనివాడు "రాజారావు గారూ!" బిగ్గరగా పిలిచాడు పనివాడు.   
రాజారావు బయటకు వస్తూనే జితేంద్రను గుర్తించి "ఎన్నేళ్ళకొచ్చావురా జీతూ!" అంటూ  గట్టిగా కౌగలించుకున్నాడు.  
"నీ మాటకాదని మన ఊరికి వచ్చాను. క్షమించు బాబాయ్!" అన్నాడు జితేంద్ర. 
"మాట తప్పి మర్యాద దక్కించుకున్నావురా! ఆనాటి గడ్డు పరిస్థితుల్లో 'ఊరికి రావద్దు' అన్నంత మాత్రాన ఇన్నేళ్లు రాకపోవడమేమిట్రా? బాబాయి మీద అంత కోపం వచ్చిందా" అన్నాడు రాజారావు గద్గద స్వరంతో కళ్ల నీళ్లు పెట్టుకుని. 
"నీ మీద నాకు కోపం ఏంటి బాబాయ్? నువ్వు, పిన్నిగాక మాకింకెవరున్నారు?" అన్నాడు జితేంద్ర. 
"నిన్ను నీ తమ్ముడికి ఇన్నేళ్లు దూరంగా ఉంచాను. నాది పెద్ద తప్పిదమే!
అన్న, వదినా అకాలంగా పోయారు. ఆనాటి గడ్డు పరిస్థితుల్లో నీ భవిష్యత్తు దృష్ట్యా నిన్నిక్కడ నుంచి తరిమేశాను. ఇక్కడికి రావద్దన్నాను. నాకంతకన్నా వేరేమార్గం తోచలేదు. మీ తల్లి తండ్రులు చేసుకున్న పుణ్యాన, భగవంతుడు పంపినట్లుగా నువ్వెళ్లిన తరువాత ఈ ఊరికి ఒక మంచి పంతులు గారొచ్చారు. ఆయనకు మానసిక వైకల్యం ఉన్న  కొడుకుండేవాడు. విజయేంద్ర వయసే. ఆయన వీళ్ళిద్దరికే ప్రత్యేకంగా చదువు చెప్పాడు. అలా వాడికి చదువు ఒంటబట్టింది. వయసు పెరిగే కొద్దీ, వెన్ను ముదిరే కొద్దీ కుదురుకున్నాడు. నిలకడ వచ్చింది. డిగ్రీ అయింది. ప్రయోజకుడయ్యాడు. 
అవసరమున్న లేకున్నా, ఊళ్లు వదిలి పట్నాలకు పరుగెత్తే వారికి ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. వాడిని, వాడు సాగుచేసే తోటను, పొలాలను, సేంద్రీయ పంటలను చూసి తీరాల్సిందే!" విజయేంద్ర విజయాల గురించి ఏకరువు పెట్టాడు రాజారావు. 
సంతోషం పట్టలేక "ఇంతకీ తమ్ముడేడి బాబాయ్ ?" అన్నాడు జితేంద్ర 
"కొత్తగా పళ్ళ తోట కొన్నాడు. నెలరోజుల్నుంచి తోటపని లోనే తలమునకలై ఉన్నాడు. రెండు, మూడు రోజుల పాటు అక్కడే ఉంటానన్నాడు" అన్నాడు రాజారావు 
"అక్కడికి వెళదాం బాబాయ్. తమ్ముడిని అర్జెంటుగా చూడాలి" అన్నాడు జితేంద్ర. 
స్కూటర్ తీశాడు రాజారావు.  
మట్టిరోడ్డు మీద అర్ధగంట ప్రయాణంచేసి వారిరువురు తోటకు చేరారు.  
తోట కంచె పక్కగా తోవకు రెండువైపులా పేర్చిన ఎర్రటి ఇటుకల మధ్యగా ఎర్రటి గరుసుమట్టి తోవ. లోనికి వెళితే గాని కనుపించని చిన్న ఫామ్ హౌస్ ముందు ఆగింది స్కూటర్. స్కూటర్ దిగాడు జితేంద్ర. ఫామ్ హౌస్ కి ఎడంగా ఉన్న పూలతోట మధ్యలో శశాంక్ ని ఎత్తుకుని ఆడిస్తున్న విజయేంద్రను చూపాడు రాజారావు. తలలు ఊపుతూ గులాబీ పరిమళాల గుబాళింపుతో వీస్తున్న గాలితో ఊసులాడుతున్న గులాబీ పూల మొక్కలను చూసి కేరింతలు కొడుతున్నాడు శశాంక్ విజయేంద్ర చేతుల్లో. 
ఊహించని ఘటనతో ఆశ్చర్యంతో నిశ్చేష్ఠుడై  రాజారావు వంక చూశాడు జితేంద్ర. విజయేంద్ర పరుగున వచ్చి జితేంద్రను కౌగలించుకున్నాడు 
"అంతాపైవాడి లీల. మీ ఇద్దరి జీవితాల్లో ఈ రోజువరకూ అన్ని సంఘటనలు అనూహ్యంగా జరిగాయి. నీ భార్య బంగారం. మరిది ఉన్నాడని తెలిసిన మరుక్షణం రెక్కలుగట్టుకుని ఇక్కడవాలింది. భగవంతుడు ఎప్పుడూ, ఎవరికీ అన్ని తలుపులు మూయడు. నీ తమ్ముడిని క్షేమంగా నీ కప్పచెబుతున్నాను. నా బాధ్యత తీరింది" గాద్గదికంగా అన్నాడు రాజారావు.  
                                                                    * * * * *

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నంబరు : 9849118254









 

6, జులై 2023, గురువారం

 


                                                                      ఋణానుబంధం

                               ( ఈ కధ 'స్వాతి'  'అక్టోబరు' నెల 2012  సచిత్ర మాస పత్రికలో  ముద్రితమైనది)

                     మధ్యాహ్నం దాదాపు మూడున్నర గంటలవుతోంది. భోజనం చేసి ఇట్లా నడుం వాల్చానో లేదో కాలింగ్ బెల్ ఒకటే మోత. 
'పిల్లలు అప్పుడే వచ్చేశారా ?' అనుకుంటూ తలుపు తీశాను. 
ఎవరో పెద్దావిడ. దాదాపు 55 సంవత్సరాల పైనే వుంటాయి. 
ఒక్కసారి ఆవిడ ఒంక తేరిపార చూశాను. 
పసిమి వంటి ఛాయ. కళ్ళ కింద నల్లటి జీరలు. తైల సంస్కారం లేని జుత్తు. ఒక ప్రక్కనే అరిగిపోయిన రెండు రబ్బరు చెప్పులు. జీవంలేని జీవిలా ... చూస్తేనే తెలుస్తోంది బాగా బతికి చెడ్డవారిలా.
పాపం ఎండలో నడిచి వచ్చిందో ఏమో చెమటలు కారుతున్నాయి. రెండు చేతుల్లో పెద్ద ఖాకి సంచులు. సంచుల నిండా ఏవో ప్లాస్టిక్, స్టీల్ డబ్బాలు. చూస్తేనే తెలుస్తోంది. ఏవో అమ్ముకునేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సంచులు అతిజాగ్రత్తగా కింద వుంచి కుడిచేత్తో ఎడమ భుజాన్ని వత్తుకుంటూ, చెమట కొంగుతో తుడుచుకుంటూ నన్ను ఉద్దేశించి 'ప్రసాదరావు గారి ఇల్లు ఇదే కదమ్మా' అనడిగింది'. నేను 'అవునంటూ' తలూపుతూ తలుపు పూర్తిగా తెరిచి "మీకు మంచినీళ్ళు కావాలా?" అని అడిగి ఆవిడ సమాధాన మిచ్చేలోపునే చల్లటి మంచినీళ్లు తెచ్చి 
ఇచ్చాను. ఆవిడ రెండు గ్లాసుల నీళ్లు తాగి ''రక్షించావు తల్లీ! ఎంత దాహంగా ఉందో. అప్పుడే ఎండలు మండి పోతున్నాయి. నా పేరు జానకమ్మ తల్లీ'' అంటూ 'ప్రసాదరావు, నన్ను... " అంటూ ప్రారంభించి నా ముఖ కవళికలు చూసి ఏకవచనంతో మాట్లాడానని గ్రహించి,''క్షమించమ్మా'' ప్రసాదరావుగారు ఇంటికి వెళ్ళమని చెప్పారమ్మా. మిమ్ముల్ని ఫోను చేయమన్నారు'' అందావిడ కొంగుతో మొహం వత్తుకుంటూ.
''ఇన్నాళ్ళు ఆఫీసు దగ్గరే వడియాలు,అప్పడాలు ఇచ్చేదాన్నమ్మా. ప్రసాదరావు గారే ఇప్పట్నుంచి ఇంట్లోనే ఇవ్వమన్నారమ్మా. అందుకే ఇలా వచ్చాను'' ఆయాసపడుతూ చెప్పిందావిడ.
''ముందు మీరిలా కూర్చుని కొద్దిగా విశ్రాంతి తీసుకోండి''....అని ఆవిడను డ్రాయింగ్ రూం సోఫాలో కూర్చోబెట్టి లోనికివచ్చి ఆయనకు ఫోను చేసి మాట్లాడి తిరిగి వచ్చిఆవిడ దగ్గర వడియాలు, అప్పడాలు, చల్ల మిరపకాయలు, ఆవకాయ ఇంక వేరే పచ్చళ్ళు కావలసినవి తీసుకుని ఆవిడకు డబ్బు ఇచ్చేసి, ఆయ చెప్పినట్లు మా కాలనీలో వేరే ఇద్దరికీ  పరిచయం చేసి వాళ్ళు కావలసినవి తీసుకుంటుంటే నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు స్కూళ్ళ నుంచి వచ్చేశారు. ఆవిడ దగ్గర తీసుకున్న వన్నీ సదిరి పిల్లలకు వాళ్ళ కిష్టమయిన స్నేక్స్ పెట్టి ఇక సాయంత్రం వంటకుపక్రమించాను.
వంట చేస్తుంటే ఆ పెద్దావిడ గుర్తు కొచ్చి మనసు ఏదోలా అయింది.
'ఏం బ్రతుకులో.... ఏమిటో? భగవంతుడు చల్లగా చూడకపోతే అలానే వుంటుంది' పాపం ఆ పెద్దావిడ కృష్ణా ... రామా.....అంటూ ఇంట్లో ఎవరైనా చేసి పెడితే కూర్చుని తినే వయస్సులో ఇలా ...' అనుకుంటుండగా ఆవిడ...' ప్రసాదరావు'..... అని ఏకవచనంతో సంభోదించి మాట్లాడబోయి తమాయించుకుని 'ప్రసాదరావు' అనడం గుర్తు వచ్చి, ఆయనను ఏకవచనంతో మాట్లాడే చనువు, పరిచయం ఆవిడకు ఉండి ఉంటుందా ? లేక పెద్దావిడ కదా, అకస్మాత్తుగా నోరుజారి అలా పొరపాటుగా అన్నదా, తేల్చుకోలేకపోయాను.
'సరే, ఆయన్నే అడుగుతే పోలా' అనుకుని వంట పనిలో మునిగిపోయాను.
పిల్లలు ముగ్గురు నిశ్సబ్దంగా కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్నారు.
అర్ధగంటలో నేను కూడ వంట పూర్తి చేసి ఫ్రెష్ అయి వచ్చి పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసే సరికి ఆయన వచ్చేశారు. ఆయనకు యధాప్రకారం ఫిల్టర్ కాఫీ ఇచ్చి వేడి నీళ్లు కూడా రెడీ చేసి వచ్చి పిల్లల దగ్గర కూర్చున్నాను. వాళ్ళతో ప్రతి రోజు కాసేపు కాలక్షేపం చేసే టైం అది. ఆయన కూడ కాఫీ తాగుతూ కాసేపు పిల్లలతో టైం పాస్ చేసి, ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి మా'టీం' లో చేరతారు. ఆరోజు స్కూల్లో జరిగిన విషయాలు అందునా మాచిన్నది ఏవో జోకులు, పోచికోలు కబుర్లు మోసుకు వచ్చి పేలుస్తుంది ఆ టైంలో. అందరం కాసేపు నవ్వు కుంటాము. 
ఇదీ సాయంత్రాలు మా పెర్మనెంట్ రొటీన్.
అందుకే నాకు సాయంత్రం ఈ అర్ధగంట 'టైం' అంటే ప్రత్యేకంగా చాలా ఇష్టం. మేం అయిదుగురం కలిసి ఉండే ప్రత్యేక క్షణాలవి. ఏరోజు కదే ప్రత్యేకం. మేము అయిదుగురం. మా చిన్న ప్రపంచం. రేపు పిల్లలు పెద్దయి, పెళ్ళిళ్ళు అయి ఎటు వాళ్ళు అటు వెళ్ళినా ఇలాంటి ప్రత్యేక క్షణాలు మా జీవితాంతం మా అయిదుగురికి ఉండాలని కోరుకోవడం నా స్వార్ధం అని తెలిసినా భగవంతుడు నన్నేమైనా కోరుకోమంటే ఇదే కోరిక కోరుకుంటాను.
తరువాత  జానకమ్మ గారు నెల రోజుల కొకసారి వచ్చి వడియాలు, అప్పడాలు ఇచ్చి వెళ్ళేది. మొదటి రెండు మూడు సార్లలోనే తను చాలా అభిమానం కల మనిషిగా నాకు అర్ధమయింది. ఇంట్లో టీ త్రాగడానికి మొహమాట పడేది. పొరబాటున టీ త్రాగితే ఇవి కొత్తగా చేసుకొచ్చానమ్మా! రుచి చూసి చెప్పు అని ఏవో స్నాక్స్ 'శాంపిల్' గా ఇచ్చి వెళ్ళేది.
నాకు అర్ధమయిదేమంటే తను ఎక్కడా ఋణపడకూడదన్న సిధ్ధాంతం తప్పని మనిషిలా అన్పించింది.
ఒకటి రెండు సార్లు తనతో ఈమాట అన్నాను.
''నాకు తెలుసు. ఆవిడ అంతే" అని ముక్తసరిగా జవాబిచ్చేవారు. దాంతో నాకు ఆవిడ గురించి తనకు తెలుసు కాని ఆయన చెప్పడంలేదు అని మాత్రం అర్ధం అయింది.
'సరేలే ..... ఆయనే ఎప్పుడో ఒకసారి చెప్పక పోతారా'  అని నేను అడగలేదు ఆయన చెప్పలేదు.
                                                               *******
                          'కాలచక్రం' ఎవరో 'ఏక్సిలరేటరు' తోక్కినట్లుగా గిర్రున తిరుగుతోంది. పిల్లల చదువులు హైస్కూల్ దాటి కాలేజిల్లోకి వచ్చారు. 
ఆరోజు ఆదివారం. ఉదయం 11 గంటలవుతోంది. 
గేటు బయట 'ఆటో' ఆగిన శబ్దమయింది. ఎవరో ఆడవాళ్ళు ఆటో దిగుతున్నారని చూసి గుమ్మంలోనే నిలబడి చూస్తున్నాను. ఎవరో ఆవిడ ఆటో దిగి డబ్బులిస్తుంటే వెనకనుంచి చూసి 'ఎవరబ్బా, తెలిసిన వాళ్ళలా వున్నారు' అని బయటకు వచ్చి చూసే సరికి 'జానకమ్మ గారు'.
ఇంత ఉదయాన్నే వచ్చిందేమిటి ? అందునా చేతిలో సంచులేమీ లేవు. కొద్దిగా విచిత్ర మన్పించింది. కొత్త చీరలా వుంది. మనిషి కూడా ఏదోలా కొత్తగా, సంతోషంగా కన్పించింది. 
తల దువ్వుకుంది. గుడికి వెళ్లి వస్తున్నట్లుగా ఉంది. చేతిలో కొబ్బరిచిప్ప, పూలు వాటితో బాటు ఓ పాత బౌండ్ 'నోట్ బుక్' ఉన్నాయి. ఇదివరలో ఎప్పుడు చూసినా నెత్తి మీద కొండంత భారం మోస్తున్న భూదేవిలా ఉండేది. ఇప్పుడు భారం అంతా దింపేసి నింపాదిగా, బాదరా బందీ లేని మనిషిలా కన్పించింది. లోపలికి వస్తూ ''మీ ఇంటి దగ్గర రామాలయానికి వచ్చానమ్మా.ప్రక్కనే కదా అని ఇలా వచ్చాను" అంటూ ప్రసాదం, పూలు నాచేతిలో పెట్టింది. 
నేనడగబోయే ప్రశ్నకు ముందు గానే సమాధానం చెపుతూ ''ప్రసాదరావుగారు ఉన్నారా అమ్మా ?" చాలా నెమ్మదిగా అడిగిందావిడ.
''ఉన్నారండీ.ఈవేళ ఆదివారం కదా.రండి" అంటూ బయట గదిలో సోఫా చూపించాను.
ఇంట్లోకి వెళ్లి బెడ్ రూం టి.వి. ముందు పిల్లలతో కూర్చుని ఏదో ప్రోగ్రాం చూస్తున్న ఆయనకు 'జానకమ్మ' గారు వచ్చారని చెప్పాను.
ఆయన వెంటనే లేచి బయటకు వెళ్ళారు. మళ్ళీ అనిపించింది నాకు. వీళ్ళకి ఏదో పాత పరిచయం ఖచ్చితంగా ఉందని.
రెండు నిముషాల్లో నేను ఆవిడకి మంచి నీళ్లు తీసుకు వెళ్ళాను. ఆయన ఇందాక ఆవిడ చేతిలో ఉన్న పాత 'నోట్ బుక్' పేజీలు తిరగేస్తున్నారు.
'నోట్ బుక్' తిరిగి ఆవిడకిచ్చాక ఆవిడ ''ఇక వస్తాను నాయనా'' అంది.
''అప్పుడే వెళ్తున్నారా.కొద్దిసేపు ఆగండి.కాఫీ తెస్తాను'' అన్నాను నేను.
''లేదమ్మా మా చెల్లెలు ఇంటికి కూడా వెళ్లి ఇంటికి వెళ్ళాలి''.అంటూ వెంటనే బయలు దేరింది ఆవిడ.
ఆవిడ అటు వెళ్ళగానే ''ఏమిటండీ ఆ నోట్ బుక్,.మీకు చూపెడ్తోంది? ఏవిటీ ఆవిడ కధ.ఈరోజు కొద్దిగా విచిత్రంగా వుంది.ఏమైనా నాకు చెప్పకూడని విషయమా? ఇదివరకు అడిగినా ఇన్ని సంవత్సరాలుగా ఏమీ వివరాలు చెప్పలేదు. అంతగా నాతోకూడా చెప్ప కూడని విషయమైతే వదిలేయండి'' నిష్టూరంగా అన్నాను.
''ఇందులో దాపరికమేమీ లేదు. నీకు చెప్పకూడని విషయమూఅంతకంటే కాదు. అది ఆవిడ ఎకౌంటు బుక్.  ఆవిడంటే నాకు మా అమ్మమీద ఉన్నంత గౌరవం. ఆవిడలాంటి గొప్ప వ్యక్తిత్వం, అభిమానం ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు" చాలా కూల్ గా సమాధానం చెప్పి నా చేయి పట్టుకుని సోఫా లో తన పక్కనే కూర్చోపెట్టి చెప్పడం మొదలెట్టారు తను.
''నేను హైదరాబాదులో మొదటిగా 'జాబు'లో చేరినప్పుడు 'శర్మ' గారని నా ఫస్ట్ బాస్. ఈ జానకమ్మ గారు ఆయన భార్య. నాకప్పుడు హైదరాబాదు లో ఎవరితోనూ పరిచయం లేదు, తెలిసిన వాళ్ళు లేరు. ఈ మహానగరంలో అంతా కొత్త.హైదరాబాదులో దిగగానే సరాసరి ఆఫీసుకే వెళ్లాను.
శర్మగారు వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లారు. వారి ఇంటి దగ్గరే ఒక రూం అద్దెకు చూశారు. ఆయన స్కూటరు మీదనే ఆఫీసుకి వెళ్ళేవాడిని. నేను హైదరాబాదు వచ్చే సరికి నాన్నగారు చెల్లెలి పెళ్ళికి చేసిన అప్పులు, నేను చేసిన కొన్ని చిన్న చిన్న అప్పులు. వాటిని తీర్చడానికి విపరీతమైన వత్తిడి ఉండేది. నెలకింతని కొంత అప్పు తీర్చేవాడిని. అప్పులుకూడా శర్మ గారి సాయంతోనే ముందుగానే తీర్చేసి మెల్లగా ఆయనకు తిరిగి ఇచ్చేశాను. ఎన్నిసార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేశానో లెక్కే లేదు.
జానికమ్మ గారిని 'పిన్నిగారూ' అని పిల్చేవాడిని. వాళ్లకి పిల్లలు లేరు. నన్ను పెంచుకుంటానని సరదాగా అనేది ఆవిడ. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేయకుండా వెళ్లనిచ్చేవారు కాదు. 
నిజంగా ఆవిడ అన్నపూర్ణమ్మ తల్లే. 
శర్మగారు ఆఫీసు అయ్యాక విపరీతంగా పేక ఆడే వారు ఆఫీసులో ఉన్న కొంతమంది పేకాటరాయుళ్ళతో. ఆదివారాలు, శలవులు వచ్చాయంటే మనిషి కన్పించేవారు కారు. రాను రాను పేకాట పిచ్చి ఎక్కువయింది. జీతం మొత్తం అక్కడే అయిపోయేది. ఆవిడ ఎంత మొత్తుకున్నా ఆవిడ మాటలు గాలికొదిలేసే వారు. ఎక్కడ బడితే అక్కడ అప్పులు చేయడం మొదలెట్టారు. చివరికి పాలవాడిని కూడా వదలలేదు. ఆయనంటే ఆఫీసులో అందరికీ అమితమైన గౌరవం. పాదరసం లాటి మెదడు. ఎవరికీ ఏ ఆపద వచ్చినా అయన సాయం చేయడంలో ముందు ఉండేవారు. అంచేత ఆయనకు అప్పుఇచ్చేవారు. అప్పులెక్కువయ్యేసరికి తిరిగి ఇవ్వడం తిరిగి ఇవ్వడం తక్కువయిపోయింది. అప్పుల వాళ్ళు ఇళ్ళకి రావడం మొదలెట్టారు.
నాదగ్గర అయితే లెక్కే లేదు.ఎన్నిసార్లు చేబదులు అంటూ డబ్బు తీసుకున్నారో! ఒకసారి నేనిక ఉండబట్టలేక చెప్పేశాను.
''సార్! నేను ఇంటికి డబ్బు పంపించడానికి ఇబ్బందవుతోంది. ఇక నన్ను డబ్బు అడగకండి సర్!" అని చాలా మొహమాట పడుతూ చెప్పాను. నన్ను మరి అడగలేదు. ఆఫీసులో పరిస్థితి దారుణంగా తయారయింది. ఆఫీసులో ఆయన ఎవరినీ వదలలేదు. దాదాపు ఒకరిద్దరు తప్ప అందరు అప్పు ఇచ్చిన వారే.
శర్మ గారు కన్పిస్తే చాలు.మనుషులు తప్పుకు తిరగడం మొదలయింది. 
''అప్పు లక్షకు పైగా అయింది'' అని ఒకసారి జానకమ్మ గారు నాతో చాలా బాధ పడుతూ అన్నారు.
''మీకు ఎలా తెలుసు ?" అని ఆవిడను అడిగాను.
''ఆయనే చెప్పారు.ఎక్కడో లెక్క వ్రాస్తున్నారట'' అని చెప్పింది ఆవిడ. 
ఇంతలో మమ్ముల్ని డిస్టర్బ్ చేస్తూ ''అమ్మా.ఆకలవుతోంది" అంటూ ముగ్గురు పిల్లలు ఒక్కసారి గదిలోంచి బయటకు వచ్చేశారు. అంతటితో అక్కడికి 'సశేషం' అయిందా కధ !
ఆదివారం కావడంతో నేను కూడ పనిలో నిమగ్నమయి మళ్ళీ ఆ టాపిక్ రైజ్ చేయలేదు ఆరోజుకి.
మరుసటి రోజు ఉదయం ఆయన ఆఫీసుకి వెళ్లారు. వెళ్ళిన గంటకే అంటే పదకొండు గంటలకు ఆయనదగ్గరనుంచి ఫోను... ఇంట్లో డబ్బు ఎంత వుందో తీసుకుని రెడిగా ఉండమని బయటకు వెళ్లాలని చెప్పిన పది నిముషాల్లో వచ్చి నన్ను బైక్ మీద ఎక్కించుకుని బయలు దేరారు. తనని చూడగానే అర్ధమయింది...ఏదో కాకూడనిది అయిందని.
తనే కొద్ది బైక్ మీద కొంత దూర మెళ్ళాక అన్నారు. జానికమ్మ గారు పోయారట. అక్కడికే వెళ్తున్నాం.
''డబ్బు ఎంత వుంది?'' అడిగారాయన. జానకమ్మ గారు పోయారట....అన్నమాట వినడం తోనే నేను దిగ్భ్రమ చెందాను. నిన్న ఉదయం చూశానావిడను. ఎప్పుడూ లేనిది ఆవిడ ఎంతో సంతోషంగా 
కనిపించింది. కొత్త చీర కట్టుకుంది. చనిపోతున్నట్లు తనకి ముందే తెలుసా? ఏమైనా ఆత్మహత్యా? మనసు పరి పరి విధాల పోతోంది. 
''ఏయ్....నిన్నే.ఎక్కడవున్నావ్ ?" అని ఆయన బైక్ నడుపుతూనే వెనక్కి తిరిగి బిగ్గరగా అడిగేసరికి ఈ లోకం లోకి  వచ్చాను నేను.
''ఆ...ఆ.....ఏదో పరధ్యానంలోకి వెళ్లాను.పాపం ఆవిడ గురించే ఆలోచిస్తున్నాను''
''సరే, డబ్బు ఎంత తెచ్చావు ?'' మళ్ళీ అడిగారాయన
''ఇంట్లో ఉన్నదంతా తెచ్చాను. షుమారు పదిహేను వేల దాకా ఉంది'' చెప్పాను నేను.
పావుగంటలో చేరాము రాంనగర్ గుండు దగ్గర జానకమ్మ గారి ఇంటికి .
ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు. రెండు గదులు.పెద్ద కాంపౌండ్. మూడు నాలుగు పోర్షన్లు. మామిడి, జామ, కొబ్బరి చెట్లు ఉన్న లోగిలి.
ఆవిడని బయట రూంలో చాప వేసి పడుకోపెట్టారు. మేము వెళ్తూనే అచ్చు జానకమ్మగారిలా ఉన్నావిడ బయటకు వచ్చి బోరున ఏడ్చేసింది.
"మొన్న శుక్రవారంతో అన్ని పూర్తిగా అప్పులన్నీ తీర్చేసి శనివారం నాడు పన్నెండు సంవత్సరాల తరువాత గుడికి వెళ్లి వచ్చింది బాబూ. నిన్న గుడికి వెళ్లి అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి కాసేపు ఉండి నన్నుతనతో రమ్మని బలవంతంగా తీసుకువచ్చింది. బావ పోయాక దాదాపు పన్నెండు సంవత్సరాల తరువాత మాఇంటికి వచ్చింది. చాలా సంవత్సరాల తరువాత అర్ధరాత్రి దాటిం దాకా చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నాము. తెల్లవారే  సరికి ఇలా అవుతుందని కనీసం నాకు ఊహా మాత్రంగానైనా తోచలేదు. రాత్రి కబుర్లలో రెండు మూడు సార్లు ఇక తన ఇక బ్రతికి ఉండవలసిన అవసరం లేదంది. ఇన్నాళ్ళు బ్రతికి ఉండడానికి కారణం బావ చేసిన అప్పులేనంది. నీ సాయం గురించి పదే పదే చెప్పింది. దేవుడేదైనా వారం కోరుకొమ్మంటే నీలాటి వాడిని కొడుకుగా కావాలని కోరుకుంటానంది. చివరిగా నీ గురించి ఒక్కమాట చెప్పింది. తనకు తెలిసి నీ ఒక్కడి ఋణం కావాలని తీర్చకుండా వెళ్లి పోతానంది. 
'ఎందుకే అలాగా?' అంటే దాని సమాధానం. అతనికి ఋణపడి ఉంటె వచ్చే జన్మ అంటూ ఉంటె అతనింత పుట్టి అతని ఋణం తీర్చుకుంటానంది.
ఋణ విముక్తురాలయినందుకు ఏదో తెలీని బాధ, సంతోషం మిళితమైన ఆవేశంలో మాట్లాడుతోంది అనుకున్నా. కానీ తనువు చాలించే శక్తి ఇంతలా తనలో ఉందని ఊహించలేకపోయాను. 
శర్మ బావగారు చనిపోయాక మొదటిసారిగా చాలా సంవత్సరాల తరువాత 'జానకి' సంతోషంగా ఉండడం నిన్నచూశాను. చిన్నవాడి వైనా నీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాబాబూ! 
మే మేవ్వరం దాని కష్ట కాలంలో వెన్నంటి లేము. కన్నతల్లిలా చూశావట. ప్రతి రోజు తిన్నదో లేదో కనుక్కునే వాడివట. నీ ఋణం తీర్చుకోలేనంది. కన్నకొడుకు ఉంటే చూశే వాడో లేదో కాని ప్రసాదరావు నన్ను తల్లిలా ఆదరించాడంది. నాకో కొత్త చీర కొని ఇచ్చింది. జీవితంలో ఏమి అనుభవించిందో లేదో, బావగారు పోయాక మా ఎవరి ఇండ్లకు రాలేదు. ఎవర్నీ సాయం అడగలేదు. తిన్నదో, లేదో తెలీదు. బావగారు పోయిన రోజుల్లో 'నా దగ్గరికి రావే,నా దగ్గరే ఉండు' అని నేనన్న మాటలకు దాని సమాధానం నాకు ఇంకా గుర్తుంది.
''వద్దు లేవే! నేను బాగా ఉన్నప్పుడు రావడం వేరు.ఇప్పుడు రావడం వేరు. నా దురదృష్టం మీకేవరికి అంటకూడదు.పోయినాయనకేం, మహారాజులా వెళ్ళిపోయారు. ఆయన వదిలి వెళ్ళిన పనులు ఉన్నాయి..అవి పూర్తి చేయాలి. ఈ జీవితకాలం దానికే సరిపోతుందేమోనే'' అన్న మాటలు ఇప్పటికీ నా కింకా గుర్తున్నాయి. ఆ మాటల్లో మర్మం నాకప్పుడు అర్ధం కాలేదు. 
తరువాత కొన్ని విషయాలు తెలిశాయి. నేను సాయం చేయడానికి ముందు కొచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరించింది. నన్ను మళ్ళీ తనని కలవడానికి కూడ రావొద్డంది. ఈ పన్నెండు సంవత్సరాలలో నా అంతట నేను తనని కలవడమే గాని తనంతగా తాను మాఇంటికి గాని చుట్టాల ఇండ్లకు గాని రాలేదు. ఎవరి దగ్గరా ఇస్తామన్నా పైసా సాయం తీసుకోలేదు. ఎవరింటా ఏ కార్యానికి రాలేదు. రెక్కలు ముక్కలు చేసుకుంది. ఇదిగో ఇలా అనాధ బ్రతుకయింది దానిది" అంటూ బోరుమందావిడ. కంటికీ , మింటికీ ఏక ధారగా ఏడ్చిందావిడ.
నేను ఆవిడను దగ్గరికి తీసుకున్నాను. ఓదార్చాను. తమాయించుకొమ్మని ముందు జరుగవలసిన పని చూడాలని చెప్పాను. ఆవిడ ఏడుస్తుంటే నాకూ ఏడుపు ఆగలేదు.నేను కూడా కొంగ నోటికి అడ్డు పెట్టుకుని మూగగా రోదించాను. 
ఆవిడ కొంగుతో కళ్ళు తుడుచుకుని, తన భర్త, కొడుకు తన వాళ్ళంతా అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారనీ చెప్పింది. 
ఇంతలో ఆయన కల్పించుకుని "బయటగదిలో మూలన ఒక ట్రంక్ పెట్టె ఉన్నదని దానిలో కొంత డబ్బు, ఓ కొత్త చీర ఉన్నాయని తను పోయాక అవి వాడాలని జానకమ్మగారు తనతో అయిదారు నెలల కింద అన్నారని, జానికమ్మగారి చెల్లెలు తో చెప్పారు. 
"అయితే ఆ పెట్టె చూద్దాం రండి'' అని మమ్ముల్ని కూడా లోనికి రమ్మని పిలిచింది.
అందుకు ఆయన '' మీరు వెళ్లి చూడండి'' అని సున్నితంగా చెప్పారు.
నేను, ఆయనా ఒక ప్రక్కగా నిలబడి చెట్లకింద సెటిల్ అయ్యాము. ఈయన ఆఫీసు వాళ్ళలా వున్నారు. చాలామంది వచ్చారు. అందులో చాలామంది ఆడవాళ్ళు వున్నారు. నాకు చాలా విచిత్రమనిపించింది. ఆవిడను చూడ్డానికి ఆఫీసు నుంచి ఇంతమంది రావడమేమిటి? ఆవిడ కనీసం ఆఫీసులో పనిచేసిన వుద్యోగి  కూడా కాదు. కానీ ఇంతమందిని ఇక్కడ చూశాక నాకు అర్ధమయింది ఏమంటే జానకమ్మ గారు మామూలుగా వడియాలు, అప్పడాలు ఆఫీసులు తిరిగి అమ్ముకునే సాధారణ వ్యక్తి కాదు అని నేను స్వగతంలో అనుకుంటుండగానే
పది నిముషాల్లో మళ్ళీ జానకమ్మ గారి చెల్లెలు వచ్చి చెప్పింది.'వారెవరు పైసా ఖర్చు చేయవలసిన పనిలేదని, పాతిక వేల దాకా కాష్, కొద్ది బంగారం, ముత్యం, పగడం, ఓ కొత్త చీర, దాంట్లో ఒక చిన్న చీటీ. అందులో 'ఇవన్నీనా చరమాంకం లో వినియోగించగలరు.ఇంతకు మించి పైసా కూడ ఎక్కువ ఖర్చు పెట్టవద్దు' అన్నమాట వ్రాసి ఉందని చెప్పిందావిడ.
ఇవన్నీచూసి, వినీ నాకు జానికమ్మగారి మీద విపరీతమైన అభిమాన మేర్పడింది.
మనుషుల్లో నిజంగా ఇలాటి నిష్కళంక, పరిపూర్ణ అభిమానధనులయిన మనుషులు ఉంటారా? అందునా ఒంటరి ఆడమనిషి, జీవితంలో విలువల కోసం ఇంత పోరాటం సాగించి, అనుకున్నది సాధించిన వెంటనే తన మరణాన్ని తనే శాసించుకుని వెళ్ళిపోయింది. మనసులోనే ఆవిడకు జోహార్లు అర్పించాను.
ఈ జీవిత పోరాటంలో ఆవిడకు బాసటగా నిలబడిన ఆయన్ని కూడా మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయాను.  ఆవిడ గురించి, ఆవిడ జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉత్సుకత ఏర్పడింది.
'బ్రహ్మగారు' వచ్చారు. జానకమ్మగారి చెల్లెలి కొడుకుతో కార్యక్రమమంతా చేయిస్తున్నారు.
'మహా ప్రస్థానం' వాన్ వచ్చింది. ఆయన నన్నుఇంటికి వెళ్ళమన్నారు. నేను ఆటోలో ఇంటికి వచ్చేశాను.
అయన ఇంటికి వచ్చేసరికి దాదాపు సాయంత్రం ఏడు గంటలు దాటింది.
రావడంతోనే స్నానం చేసి ''నేను ఏమీ తినను.నన్ను లేపవద్దు'' అనిచెప్పి పడుకున్నారాయన.
నాకూ మనసు బాగోలేక నేను తినలేదు. పిల్లలు భోజనం చేసి వాళ్ళ చదువుల్లో వాళ్ళు బిజీ అయ్యాక నేను వచ్చి పడుకున్నాను. ఈయన పడుకున్నారు కానీ నిద్ర పోయినట్లు లేదు.
నేను రూము లోకి వెళ్లేసరికి ఆయన ప్రక్కకి తిరిగి పడుకున్నారు.
''ఇంకా నిద్ర పోలేదా? చాలా లోగొంతుకతో అడిగాను తనని.
''ఉహూ.నిద్ర రావడంలేదు''.
''తలనొప్పిగా ఉందా...అమృతాంజనం రాసేదా?" అనునయంగా అడిగాను.
"లేదు.తలనొప్పి లేదు.చాలా బాధగా ఉంది. 'ఆవిడ'...అని అయన అంటుండగానే ఆయన గొంతు గాద్గదమైంది.
''దాదాపు పదిహేను సంవత్సరాలనుంచి చూస్తున్నాను. శర్మగారు పోయిన రోజునుంచి రోడ్డు మీద పడిన మనిషి తన కోసంకాక భర్త చేసిన అప్పులు తీర్చడంకోసం బ్రతికింది. అనుకున్న దానికంటే రెట్టింపు అప్పులున్నాయి ఆయన చనిపోయే నాటికి. లోన్ లు అన్ని మినహాయించుకున్నాక ఆఫీసు నుంచి పెద్దగా ఏమీ రాలేదు. ఇల్లు అమ్మినా తీరలేదు అప్పులు. ఆయన చేసిన అప్పులన్నీ క్షుణ్ణంగా ఒక నోటు బుక్ లో విపులంగా వ్రాశారు. 
ఎన్నిసార్లు అన్నదో నాతో ''ఈ వెధవ బ్రతుకు ఎప్పుడో చాలించేదాన్ని ప్రసాదూ!ఆయన చేసిన అప్పులు నన్ను బ్రతికిస్తున్నాయని...జీవితంలో కష్టాలను ఎవరికీ పంచకూడదని, ఎవరైనా తమ కష్టాలను పరవారికి చెప్పకూడదని, అలా చేస్తే మనం పల్చనవుతామని!" అదే నోట్ బుక్ మొన్న నాకు ఆవిడ చూపించింది. 
ఒక్కొక్కటి చొప్పున అప్పులన్నీ తీర్చేసింది ఆవిడ . కొంతమందికి, వాళ్ళు శర్మ గారికి అప్పుఇచ్చిన గుర్తు కూడా లేదు. వారెవరు తనని అప్పు తీర్చమని అడగలేదు కూడా.... అయినా సరే ఒక్కొక్కరిని కలిసి అప్పులు తీర్చేది. కొంతమంది ఈవిడ ఆఫీసుకి వచ్చిన రోజు ఆవిడను తప్పించుకు తిరిగేవారు. ఎందుకంటే ఆవిడ దగ్గరనుంచి శర్మగారికి ఇచ్చిన డబ్బు తీసుకోవడం ఇష్టంలేక. 
అలా ఆవిడ డబ్బు తిరస్కరించిన వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారివి వారి కివ్వవలసిన డబ్బు వారి  టేబుల్ మీద పెట్టి వెళ్ళేదావిడ. కొందరికి ఇళ్ళకు కూడ వెళ్లి అప్పు చెల్లించేది. ఆ నోట్ బుక్ లో వ్రాసిన అప్పులన్నీ తీర్చడానికి ఆవిడకు ఇన్నిసంవత్సరాలు పట్టింది. నోట్ బుక్ లో చివరి అప్పు శుక్రవారం నాడు తీర్చేసింది. నాకు తెలుసు ఆ చివరి అప్పు తీర్చేశాక ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదని! కానీ ఇంత త్వరగా ఆవిడ కనుమరుగై పోతుందనుకోలేదు'' ఆయన గొంతు పూర్తిగా గాద్గద మయింది.

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య.
Mob. No.9849118254                 
                             

21, నవంబర్ 2022, సోమవారం

అనుకున్నదొకటి ...

                                                           అనుకున్నదొకటి ...                                        
                                                    --------------------------------

శనివారం నుంచి పాఠశాలలకు, హాస్టళ్లకూ పదిహేను రోజులపాటు దసరా శలవలు. తలితండ్రులు, సంరక్షకులు వచ్చి పిల్లల్ని తీసుకువెడుతున్నారు. హాస్టల్లోవున్నవిద్యార్థులంతా కేరింతలు గొడుతూ ఇండ్లకు వెళుతున్నారు. సాయంత్రం నాలుగ్గంటలయ్యే సరికి  హాస్టల్లో ఆరవ తరగతి విద్యార్థి 'నందు' ఒక్కడే మిగిలాడు. నందుని తీసుకెళ్లడానికి తాత రాఘవయ్య రావాల్సి ఉంది. ఆయన రాలేదు. హాస్టల్ వార్డెన్ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశారాయనకు.  ఫోను పలకడంలేదు.
నందూని హాస్టల్ దగ్గరలో నివసిస్తున్నవార్డెన్ సదాశివంకి అప్పగించి ముఖ్య వార్డెన్, ఇతర వార్డెన్లు ఇండ్లకు వెళ్లిపోయారు.
"ఏమైంది మీవాళ్ళకి ? ఎవ్వరూ రాలేదు నిన్ను తీసుకెళ్లడానికి"  విసుగ్గా నందుని ప్రశ్నించాడు  ఆరు గంటలదాకా వేచిచూసిన వార్డెన్ సదాశివం.
సమాధానం ఇవ్వలేదు నందు. మౌనంగా శూన్యపు దృక్కులతో చూస్తూ ఉండిపోయాడు.
నందూ కళ్ళలో దైన్యం కన్పించింది. అతని నిస్సహాయతను అర్ధం చేసుకున్నాడు సదాశివం. రాఘవయ్యకి మళ్ళీ ఫోన్ చేశాడు. 'ఫోన్ స్విచ్డ్ ఆఫ్' అని సందేశం వస్తోంది.
తనని కాంటాక్ట్ చేయమని సందేశంపెట్టి, అట్టముక్కమీద ఫోను నంబరు వ్రాసి హాస్టల్ తాళానికి తగిలించి, వాచ్ మెన్ కి చెప్పి, నందూని సైకిల్ వెనకాలెక్కించుకుని ఇంటికి బయలుదేరాడు హాస్టల్ వార్డెన్ సదాశివం.
ఇంటికి చేరుతూనే ముఖ్య వార్డెన్ కి ఫోను చేసి "సార్ ! నందు తాత గారు రాలేదు. నందూ నాదగ్గరే ఉన్నాడు. ఏం చేయమంటారు?" సూచనలడిగాడు సదాశివం. 
"మీ రూముకి తీసుకెళ్ళారా?"
"అవును సార్ ! నందుకీ భోజనం లేదక్కడ. నేనూ వంట చేసుకోవాలి. అందుకే రూముకి తీసుకు వచ్చాను"   
"పెద్దాయనకేదో ఇబ్బంది వచ్చి ఉంటుంది. రేపుదయం వరకూ చూడండి. పిల్లాడు జాగ్రత్త" అని సూచించాడు ముఖ్య వార్డెన్. 
"సరే…సార్! రేపుదయం రాఘవయ్య గారికి మళ్ళీ ఫోనుచేస్తాను" అని చెప్పి ఫోను కట్ చేశాడు సదాశివం. 
                                                                * * * * *
అంతకుముందు  రోజు  గురువారం నాడు 'నందు' తల్లి జాహ్నవి మారుపెళ్లి  శివప్రసాద్ తో ఏ హంగూ, ఆర్భాటమూ లేకుండా తిరుమల కొండపైన సత్రంలో అయింది. పెళ్ళికి వధూవరులు, శివప్రసాద్ తల్లితండ్రులు, జాహ్నవి తండ్రి రాఘవయ్య, తల్లి రత్నమాల మాత్రమే వచ్చారు. 
ఎవరి ముఖాల్లోనూ సాధారణంగా పెళ్లిళ్లలో ఉండే ఉత్సాహంగానీ, సరదాగానీ మచ్చుకైనా కనుపించడంలేదు. ప్రతిఒక్కరూ మోయలేని బరువులు మోస్తున్నట్లు యాంత్రికంగా మసులుతున్నారు. 
శుక్రవారం రోజు  స్వామివారి, అమ్మవారి దర్శనం చేసుకుని జాహ్నవి తలితండ్రులు తప్ప మిగతావారంతా తిరుపతి నుంచి నేరుగా విమానంలో ముంబై వెళ్లిపోయారు.
                                                                * * * * *
రాఘవయ్య, రత్నమాలతో  ఖమ్మం స్టేషనులో రాత్రి రెండుగంటలకు రైలు దిగుతూనే  మొబైల్ ఫోను కోసం జేబులు తడుముకున్నాడు. తిరుమలలో ఫోను స్విచ్ ఆఫ్ చేసి భార్య బ్యాగ్ లో దాచిన సంగతి గుర్తుకొచ్చి, ఫోను తీసుకుని స్విచ్ ఆన్ చేశాడు. ఫోను పలకలేదు. 
రైల్వే స్టేషనులో చార్జి చేసుకుని మిస్డ్ కాల్స్, సందేశాలు చూశాడు.
మనవడు నందు ఉన్న హాస్టల్ ల్యాండ్ లైన్ నుంచేగాక, వార్డెన్ మొబైల్ నుంచి  వచ్చిన  ఫోన్ కాల్స్ ,సందేశాలు చూసి కంగారుపడ్డాడు. 
తెల్లవారుతూనే వార్డెన్ కి ఫోను చేసి "నందు తాతయ్య రాఘవయ్యని మాట్లాడుతున్నాను. క్షమించాలి. నందూని సమయానికి తీసుకెళ్లలేకపోయాను. శలవుల సంగతి మరిచి వూరికెళ్ళాను. అర్ధగంటలో వస్తున్నాను" అని చెప్పి రైల్వే స్టేషన్నుంచి ఆటో చేసుకుని హాస్టల్ కి వచ్చాడు. అప్పటికే నందూతో హాస్టల్ దగ్గర వేచి చూస్తున్న సదాశివంకు కృతజ్ఞతలు చెప్పి, నందూని తీసుకుని వారి గ్రామం చేరారు రాఘవయ్య.  
                                                                  * * * * *                                               
"తాతా ! నిన్న హాస్టల్ కి ఎందుకు రాలేదు?" ఇంటికి వెళుతూనే చనువుగా అడిగాడు నందు. 
"హాస్టల్ కి శలవులని మరిచిపోయి ఊరికెళ్లాం నందూ ! అందునా ఫోను స్విచ్ ఆఫ్ యింది. దాంతో హాస్టల్ వార్డెన్ నిన్ను తీసుకెళ్లమని పెట్టిన సందేశం చూడలేకపోయాను. అందుకే  రాలేకపోయాను"అన్నాడు రాఘవయ్య నొచ్చుకుంటూ.
"తాతా ! నువ్వూరెళ్ళావు కదా! అక్కడ వార్డెన్ సందేశం చూసినా ఏం చేసేవాడివి?" అన్నాడు నందు. చర్నాకోలుతో చెళ్ళున మొహం మీద కొట్టినట్లనిపించి మౌనంగా ఉండిపోయాడు
రాఘవయ్య.
"నువ్వేవూరెళ్ళావు ? ఎందుకెళ్ళావు ?'' రెట్టించి అడిగాడు నందు. 
''వచ్చిన వెంటనే నిన్ను తీసుకొచ్చానుగా…ఇంక ఆ విషయం వదిలేసి ఏదైనా పుస్తకం తీసి
చదువుకో !" కోపంగా అన్నాడు రాఘవయ్య
చిన్నబోయాడు నందు. అయినా కుతూహలం ఆపుకోలేక వంటింట్లోకి వెళ్లి ''ఎక్కడికెళ్లారమ్ముమ్మా మీరు?" అడిగాడు నందు.  
"దేవుణ్ణి చూడడానికి తిరుపతి కొండకి వెళ్ళాం నాన్నా!" శాంతంగా చెప్పింది అమ్ముమ్మ రత్నమాల.
"ఓ అలాగా ! అమ్మ దగ్గరికి వెళ్లారేమోననుకున్నా! ఎప్పుడైనా అమ్మ దగ్గరికెళితే నన్ను కూడా తీసుకెళ్లండి అమ్ముమ్మా !" ఆర్ద్రంగా అడిగాడు నందు.
"నా తండ్రే ! అమ్మదగ్గరికెళ్ళామనుకున్నావా ? అమ్మదగ్గరికి తప్పక తీసుకెళతాను. 
సరేనా!" అంది నందూని దగ్గరికి తీసుకుని ప్రేమగా వీపు రాస్తూ సర్ది చెప్పింది రత్నమాల.
'ఎన్నిసార్లు చెప్పినా ఈ ముసలాయన ఇంతే…పసివాడని కూడా చూడకుండా కసురుకుంటాడు' గొణుక్కుంటూ బాధపడింది రత్నమాల.
"సరే అమ్ముమ్మా !'' అంటూ వంటింటినుంచి బయటకు వెళుతూ ఆగి వెనక్కి వచ్చాడు. 
''ఒక్కసారి అమ్మతో ఫోనులో మాట్లాడవచ్చా అమ్ముమ్మా! చాలా రోజులయింది. అడుగుదామంటే తాత కోపంగా ఉన్నాడు. భయమేస్తుంది" మూగగా రోదిస్తూ జీర గొంతుతో అన్నాడు నందు.
వంటింట్లో చేస్తున్నపని ఆపి "అమ్మతో మాట్లాడాలని వుందా! తాతతో చెబుతాను ఫోను అమ్మకు కలిపివ్వమని" అంది రత్నమాల మళ్ళీ నందూని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని హత్తుకుంటూ !
"వద్దు…అమ్ముమ్మా! వద్దు. తాత తిడతారు. నీ దగ్గర ఫోనుందేమోనని అడిగాను. పోనీలే అమ్ముమ్మా! అమ్మ ఫోను చేసినప్పుడే మాట్లాడుతాను" అంటూ షర్ట్ తో కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళాడు నందు.
'ఏం ఖర్మమో ఏమో! పసివాడి బ్రతుకు దిక్కులేని బ్రతుకయిపోయింది. అటు తల్లినీ ఏమనేట్టు  లేదు. ఇటు పసివాడు తల్లితో మాట్లాడే వీల్లేకపోయే' అనుకుంటూ గుండెల్లో పొంగుకొస్తున్న దుఃఖంతో వెళ్లి మంచంమీద వాలి కొంగుతూ కళ్ళు ఒత్తుకుంటూ పాత జ్ఞాపకాల్లో మునిగిపోయింది రత్నమాల.
                                                               * * * * *
జాహ్నవి మొదటి భర్త రామ్మోహన్  రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తను పనిచేస్తున్న విదేశీ కంపెనీ ముంబై శాఖకి హైద్రాబాదు నుంచి బదిలీ చేయించుకుని కొడుకు నందు  సహా మకాం మార్చింది.  ముంబైలో కొలీగ్  శివప్రసాద్ సహాయంతో ముంబైలో తనుండే ఇంటికి దగ్గరగా ఉన్న మంచి స్కూల్లో చేర్పించింది. 
                                                               * * * * * 
జాహ్నవి ముంబై వచ్చి సంవత్సరం గడిచిపోయింది. శివప్రసాద్ తో చనువు పెరిగింది.  పరిచయం ప్రేమగా మారింది.
ఒక రోజు వారిద్దరూ, నందు ముగ్గురూ కలిసి సినిమా చూసి బీచ్ లో కూర్చుని కబుర్లాడుతున్నారు.
నందూ ఇసుకలో ఆడుతున్నాడు.
"మనం పెళ్లి చేసుకుందాం జాహ్నవీ ! మా పేరెంట్స్ కి చెప్పాను. నిన్ను చూస్తామంటున్నారు. 
కానీ చిన్న ప్రాబ్లెమ్" అన్నాడు శివప్రసాద్ గుంభనగా.    
"నీ గురించి వివరాలన్నీ చెప్పాను కానీ నీకొక బాబు ఉన్నట్లు అమ్మా, నాన్నకు చెప్పలేదు.
నా ఉద్దేశ్యం...పెళ్ళయ్యాక మెల్లగా చెబుదామని !'' నసుగుతూ అన్నాడు శివప్రసాద్.
"అదెలా వీలవుతుంది? నేను మోసం చేసినట్లవుతుంది. తరువాత సమాధానం చెప్పుకోవడం   కష్టమవుతుంది. అలావద్దు" అతన్ని వారిస్తూ ఖచ్చితంగా అంది జాహ్నవి.
"నేననేదీ అదేకదా!"
"అంటే"...
"కష్టమవుతుంది…కానీ అసాధ్యం కాదుకదా !"
"నాకర్ధం కాలేదు, నువ్వేం చెప్పదలుచుకున్నావో... స్పష్టంగా చెప్పు "
"ముందు పెళ్లి కానీ! తరువాత మెల్లగా చెబుదాం!"
"అదెలా ? "
"నా దగ్గర పెర్ఫెక్త్  ప్లాన్ ఉంది" అన్నాడు శివప్రసాద్ ప్లానేమిటో చెప్పకుండా 
"అదేమిటో చెప్పు"
"నీకు బాబు ఉన్నాడన్న సంగతి పెళ్ళికి ముందు మా వాళ్లకి చెప్పడమా లేదా ? అంతవరకే…   ఆవిషయం ఒక్కటే ఆలోచించు. నా ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదానని నువ్వు బుర్ర బద్దలుకొట్టుకొనవసరం లేదు. దాన్ని నాకు వదిలెయ్ ! ప్లాన్ ఫూల్ ప్రూఫ్ " అన్నాడు శివప్రసాద్ నర్మగర్భంగా, మెస్మరైజింగ్ గా మాట్లాడుతూ.
కొలిమిలో ఎర్రగా కాల్చిన ఇనుములా వుందామె మనసు.
"నా మీద నమ్మకం లేదా?" అన్నాడు శివప్రసాద్.
కాల్చిన ఇనుము మీద సుత్తిపోటు పడుతూనే రూపాంతరం చెందినట్లు ఆమె మనసు మారుతోంది .
"నిన్నుపూర్తిగా నమ్మాను. బాబున్నాడని చెబుతే వచ్చే అడ్డంకి అర్ధమయింది" అంది జాహ్నవి.  
నమ్మకం మనుషుల్ని స్వతంత్రంగా ఆలోచించనివ్వదు.
తన ఆలోచనా పరిధిని అతను నిర్ణయిస్తున్నాడన్నవిషయాన్ని గ్రహించలేనంతగా వివేకాన్ని కోల్పోయింది జాహ్నవి. 
ఉచ్చులోపడుతున్నానన్న భావన గానీ, కొడుకు భవిష్యత్తు గురించిగానీ, అస్వతంత్రురాలవుతున్నానన్ననిజాన్నిగాని గమనించలేనంతగా అతన్ని నమ్మింది.
మరుసటి రోజు శివప్రసాద్ ని అడిగింది.
"పెళ్ళైన ఎన్నాళ్ళకి చెబుదామని నీ ఆలోచన?"
"మహా అయితే ఆర్నెల్లు…అప్పటికీ వీలుకాకపోతే సంవత్సరం గరిష్టంగా! అదీ నీకు పూర్తిగా సమ్మత మవుతేనే ! నీనిర్ణయానికే వదిలేస్తున్నా! నీకే మాత్రం ఇష్టం లేకున్నా నిర్మొహమాటంగా చెప్పు! నాకేమీ ఇబ్బంది లేదు.పెళ్లి వాయిదా వేసుకుందాం.అంతే ! 
ఇది చిన్న అవరోధం మాత్రమే. కొన్నాళ్ళు ఓపిక పడదాం!'' అన్నాడు శివప్రసాద్ తాపీగా  జాహ్నవి మీద మానసిక ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.
"నువ్వు చాలా క్లియర్ గా ఉన్నావు ప్రసాద్! నేనే  నిర్ణయానికి రాలేక పోతున్నాను" అంది జాహ్నవి అతని మాటలకి పూర్తిగా వశమై, అతని వంక మెచ్చుకోలుగా చూస్తూ.
"అన్నట్లు నీకో విషయం చెప్పడం మరిచాను. అమ్మా వాళ్ళు ఇంకొక సంబంధం చూశారు.
వద్దని చెప్పాను. నీ నిర్ణయమేమిటో చెప్పాలి త్వరగా" అన్నాడు శివప్రసాద్ జాహ్నవి మీద ఒత్తిడి పెంచుతూ.
నాలుగు రోజుల్లో ఊరికెళ్లొచ్చాక నిర్ణయం చెబుతానంది జాహ్నవి.
                                                                 * * * * *
వేసవి శలవులు కావడంతో వారంరోజులు శలవుపెట్టి  నందుతో స్వంతవూరు వచ్చింది జాహ్నవి.
తండ్రికి, తల్లికీ  వివాహ ప్రతిపాదన, శివప్రసాద్ గురించి అతని కుటుంబం గురించి తల్లితండ్రులకు చెప్పింది జాహ్నవి.
"నువ్వు మారుపెళ్లి చేసుకోవడం మాకు చాలా సంతోషం తల్లీ !
కానీ కొడుకున్నాడన్న విషయం ఆ అబ్బాయి తల్లితండ్రులకు చెప్పక పోవడం, దాచడం తప్పు. రేపతన్నెవరూ తప్పుబట్టరు, నీ నైతికతనే ప్రశ్నిస్తారు. రాజీ పడే చిన్న విషయం కాదు.
నందు తండ్రిని పోగుట్టుకున్న నష్ట జాతకుడు. నువ్వూ దూరమయ్యే పరిస్థితి వస్తే వాడి పరిస్థితేమిటో మనసుపెట్టి ఆలోచించు!" సూటిగా బిడ్డ వంక చూస్తూ అన్నాడు రాఘవయ్య. 
దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది జాహ్నవి.
"ఆ అబ్బాయి ఈ విషయాన్ని తలితండ్రుల వద్ద దాయడం, నిన్ను చెప్పవద్దని వారించడం వెనుకేదో మర్మం దాగుంది. చెప్పక, తప్పటడుగు వేస్తున్నావేమోనమ్మా !" నిర్మొహమాటంగా అన్నాడు రాఘవయ్య
"అవునమ్మా! నువ్వేమైనా మాయలోపడ్డావేమో!? జాగ్రత్త పడకుంటే నువ్వూ, నీ పిల్లాడు ఇద్దరూ ఆగమవుతారు" భర్తకి వత్తాసు పలుకుతూ అంది రత్నమాల.
"అమ్మా! చెబుదామనే   ప్రసాద్ తో  గట్టిగా అన్నాను. పెళ్లికి ముందు తలితండ్రులకీ విషయం చెప్పడం కి ఇష్టంలేదు. 
తీరా చెప్పాక, అతని తలితండ్రులు పెళ్లికి తిరస్కరిస్తే ...అవకాశం కోల్పోతామేమోనని మా  భయం. నేనూ ఆలోచించాను. ఒంటరి బ్రతుకు ఎంత కష్టమో మీకు తెలుసు ! 
అతను నాతోనే పనిచేసే తెలుగుతను. మంచివాడు. భగవంతుడిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే వివాహప్రతిపాదనకు ఒప్పుకుంటున్నాను. మీ ఆశీర్వాదం కావాలి" అన్నది జాహ్నవి తన తలితండ్రులు చెప్పిన హితాన్ని ఉపేక్షిస్తూ.
"మా ఆశీర్వాదం నీ కెప్పుడూ ఉంటుంది తల్లీ" అన్నారు తల్లీ, తండ్రీ ఒకేసారి.
"వాడిని మళ్ళీ ముంబై తీసుకెళ్ళేవరకు మీరే వాడి బాగోగులు చూడాలి. డబ్బుకేమీ బాధలేదు. 
రేపే వెళ్లి  ఖమ్మం రెసిడెన్షియల్ స్కూల్లో మాట్లాడి నందుని చేర్పిద్దాము. నేను వెళ్ళగానే టి.సి పంపిస్తాను" ధృడంగా అంది జాహ్నవి తండ్రితో
                                                               * * * * *
స్వంతవూరికి వెళ్లి తల్లితండ్రులతో మాట్లాడివచ్చిన జాహ్నవి తన అంగీకారం చెప్పింది.
"నువ్వు మనః స్ఫూర్తిగా ఇష్టపడే ఓకే అన్నావుగా !" గంభీరంగా అడిగాడు శివప్రసాద్.
''అవును'' అంగీకారంగా తలఊపింది జాహ్నవి. 
జాహ్నవిని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేశాడు శివప్రసాద్. 
''జాహ్నవి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు'' తలితండ్రులకు చెప్పాడు శివప్రసాద్. కుటుంబసభ్యులెవరూ అభ్యంతర పరచలేదు.
"కొన్నాళ్లు ఒకర్నిఒకరు అర్థచేసుకొండి. తరువాత పెళ్లి " అంది శివప్రసాద్ అమ్మగారు.
తలలూపారు ఇద్దరూ అంగీకారంగా!
రెణ్ణెల్ల తరువాత...పెళ్లి ప్రస్తావన వచ్చింది.
"పెళ్లి తిరుపతి కొండమీద జరగాలి" తన మనసులో మాట చెప్పింది జాహ్నవి
"మీ అమ్మా నాన్నగారిని కలుస్తామని  అడుగుతున్నారు మాపేరెంట్స్ . వాళ్లు ఊరివాళ్ళు అంతగా మాట్లాడలేరని చెప్పాను. నిన్నడిగినా అదే మాట చెప్పు" ఏకపక్షంగా అన్నాడు శివప్రసాద్ 
ఇబ్బందిగా చూసింది జాహ్నవి. అతనదేమీ పట్టించుకోలేదు. 
పెళ్లి తిరుమలలోనని చెప్పడంతో ఇబ్బంది గా ఫీలయ్యారు శివప్రసాద్ తల్లితండ్రులు. 
"పెళ్లి అక్కడ చేయాలని వాళ్ళ మొక్కట. మనం ముంబై లో గ్రాండ్ గా రిసెప్షన్ పెట్టుకుందాం" చర్చకు తావివ్వకుండా తల్లితండ్రులకు చెప్పాడు శివప్రసాద్ ! 
నెల తరువాత ముహుర్తానికి పెళ్లయింది జాహ్నవి, శివప్రసాద్ కి తిరుమలలో. 
                                                              * * * * *
పెళ్లయి ఆరునెల్లయింది. జాహ్నవి, శివప్రసాద్ ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది.
నందు మాటెత్తితే  శివప్రసాద్ టాపిక్ ని మార్చడం గమనిస్తూ వస్తోంది జాహ్నవి. అతన్ని రెట్టించి సమస్యను జటిలం చేసుకోవాలనుకోవడంలేదామె.
అవకాశం కోసం ఎదురు చూస్తూవుంది. ఆరునెల్లలో కొద్ధి సార్లు మాత్రమే తండ్రితో, తల్లితో,  నందుతో మాట్లాడింది. ఒకరోజు శివప్రసాద్ ని గట్టిగా అడిగింది.
"నందూని ఎప్పుడు ముంబై తీసుకువద్దాం ప్రసాద్ ?"
"అమ్మావాళ్ళతో ఇంకా చెప్పలేదు కదా! ఈ వారం ప్రయత్నిస్తాను" భుజాలు ఎగరేస్తూ ఆమె మాటను తేలిగ్గా తీసుకుంటూ అన్నాడు శివప్రసాద్.
మౌనంగా అతని మాటను వినడం వినా మారుమాట్లాడలేకపోయింది జాహ్నవి.
                                                             * * * * *
పెళ్లయి సంవత్సరం దాటిపోయింది. నందూని ముంబై తీసుకువచ్చే విషయంలో భర్త కావాలనే తాత్సర్యం చేస్తున్నాడని అర్ధమయింది జాహ్నవికి. 
ఆ రోజు... ఒక నిర్ణయానికి వచ్చిన జాహ్నవి, ఆఫీస్ నుంచి తిరిగి వస్తూనే నిర్ణయాన్ని అమలులో పెట్టింది. 
"ప్రసాద్ ! రేపుదయం ఫ్లైట్ కి హైదరాబాద్ వెళుతున్నాను. అక్కడి బ్రాంచ్ లో కొద్ధి పని ఉంది. 
అది చూసుకుని మావూరికి వెళ్లి నందూని, అమ్మా వాళ్ళని చూసి నాలుగు రోజుల్లో తిరిగి  వచ్చేస్తాను.పెళ్లయ్యాక వెళ్లనే లేదు" అంది జాహ్నవి. 
"హ్యాపీ గా వెళ్ళిరా" అన్నాడు శివప్రసాద్ సంతోషంగా. 
                                                             * * * * *
జాహ్ణవి ఊరికి వెళ్లిన నాలుగోరోజు సాయంత్రం ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి తిరిగి వచ్చాడు శివప్రసాద్. వస్తూనే ఇంట్లో నందూని చూసి కలత చెందాడు. 
అతని మనసు ఉక్రోషంతో కుతకుతలాడింది. 
తనని సంప్రదించకనే జాహ్నవి నందుని ముంబై తీసుకురావడం అతనికి నచ్చలేదు. భోజనం రుచించలేదు. ముభావకంగా ఉన్నాడు.
నందూని పడుకోబెట్టి జాహ్నవి బెడ్ రూమ్ లోనికి వస్తూనే అప్రమత్తమయ్యాడు.  
అప్పటిదాకా అతని ముఖకవళికలను,ముభావకంగా వున్న భర్తను, గమనిస్తూనే ఉంది జాహ్నవి.
గదిలోనికి రావడంతోనే పలకరించాడు.    
''మీ అమ్మా నాన్నా బావున్నారా ? నందు కేమైనా హాలీడేస్ ఉన్నాయా?" ఏకబిగిన ప్రశ్నలు సంధించాడు శివప్రసాద్.  
"అమ్మా,నాన్నాఇద్దరు బావున్నారు. బట్టలు కొనుక్కొమ్మని  పదివేల రూపాయలిచ్చారు" అంది జాహ్నవి బెడ్ మీద కూర్చుంటూ. 
"నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు" కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు శివప్రసాద్.  
" ఏ ప్రశ్నకు ? " ఎదురుప్రశ్నతో భర్తని రెట్టిస్తూ అంది జాహ్నవి.      
"నందూ విషయం. అతన్నిక్కడికి  తీసుకొచ్చేముందు నన్నడగవలసింది కదా ?" అన్నాడు శివప్రసాద్ ఉక్రోషాన్ని వెళ్ళగ్రక్కుతూ.   
"లేదు ! వాడికిప్పుడు శలవులేమీ లేవు. టి.సి తీసుకుని వచ్చాను. వాడిక ఇక్కడే,  మనతోనే ఉంటాడు. పాత స్కూల్లో చేర్పిస్తున్నాను. వాడిని తీసుకొస్తున్నానని ముందుగా నీకు చెప్పడం, చెప్పకపోవడంలో తేడా ఏముంది ? నీ వెలాగూ  వాడి విషయాన్ని దాటవేస్తున్నావుగా!" అంది జాహ్నవి అతని స్పందనను  బేరీజు వేసి, అతనివంక సూటిగా చూస్తూ.  
"అదేమిటి ? తేడా లేకపోవడమేమిటి ? మనమనుకున్నదేమిటి ? నువ్వు చేసిందేమిటి ?" అన్నాడు శివప్రసాద్ ఉడుక్కుంటూ.  
"తేడా ఏముంది ? మనం అనుకున్నదే చేశాను. పెళ్లయి సంవత్సరం దాటింది. 
నీవిచ్చిన మాట తప్పావు. నందు మాట ఎత్తితే చాలు…కావాలనే తప్పించుకు తిరుగుతున్నావు. అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నాను" నిర్మొహమాటంగా, ఖచ్చితంగా అంది జాహ్నవి.
"జాహ్నవీ ! ప్రతి మనిషికి స్వార్ధం ఉంటుంది. అదే స్వార్ధం నాలోనూ ఒక పాలెక్కువే వుంది.
నిన్ను ప్రేమించాను. నీతో పెళ్ళవుతే భవిష్యత్తు బాగుంటుందనుకున్నాను. కానీ, నీ కొడుకుని మన పిల్లాడిగా చూడగలిగే విశాల మనస్తత్వం కాదు నాది.  అతనెలాగూ  హాస్టల్లో సెటిలయ్యాడు. ఇకముందూ అలాగే కంటిన్యూ అవుతాడు. ఎలాగూ మీ అమ్మా, నాన్న  అతని బాగోగులు చూస్తారు.
ఇక సమస్య  ఏముంది ?
నీ కొడుకును ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్లి చూసిరా! ఇక్కడ స్కూల్లో చేర్చవలసిన అవసరం ఏముంది? " జాహ్నవిని ఒప్పించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తూ  అన్నాడు శివప్రసాద్ తన నైజాన్నిబయటపెడుతూ.
"ఆహా ! నువ్వీ మాట ఏదో ఒక రోజు అంటావేమోనన్న అనుమానం గత కొద్దినెలలుగా నన్ను వేధిస్తూనే ఉంది. అదే నీ 'ప్లాన్'... అని నాకు  ఆలస్యంగా అర్ధమయింది.
అందుకే తప్పుని దిద్దుకుని నా 'ప్లాన్' ప్రకారం నేను నడుచుకున్నాను. 
నా కడుపులో పెరుగుతున్న బిడ్డతో మనం…అంటే మనిద్దరం కలిసి ఉండాలంటే, నందు  ఇక్కడే, మన దగ్గరే, మనింట్లోనే  ఉండాలి... ఉంటాడు ! ఈ విషయంలో నేనింతవరకు బాధ్యతారాహిత్యంగా పడ్డ రాజీ చాలు !" ధృడంగా అంది జాహ్నవి అతనన్నమాటలకు తీవ్రంగా స్పందిస్తూ.
"నాకింకొద్ధి సమయమివ్వు...ఈ విషయమేదో తేలేదాకా అతన్నక్కడే ఉంచు !" చివరి ప్రయత్నం చేస్తూ అన్నాడు శివప్రసాద్.
"ఇంకాపు ప్రసాద్ ! నందూకి నా అవసరం ఎంతవుందో నీ బిడ్డకి …కాదు…మన బిడ్డకీ నీ అవసరమంతే ఉంటుందని నువ్వు గ్రహిస్తే మంచిది. ఆలోచించుకో ! ఇందులో ఏమాత్రం బలవంతం లేదు!'' ప్రతిమాట ఒత్తి పలుకుతూ ఖచ్చితంగా, ఆవేశంగా అంది జాహ్నవి.
శివప్రసాద్ జాహ్నవి మాటలకు మాన్పడి పోయి, తను ఇదివరకన్న మాటలు తిరిగి అప్పజెప్పడం  గమనిస్తూ  మింగలేక, కక్కలేకా మౌనంగా ఉండిపోయాడు. 
''ఇంకొక  ముఖ్య విషయం నీకు చెప్పనే లేదు ! మీ అమ్మగారు, నేను వారం రోజుల  క్రితం గైనకాలజిస్ట్  దగ్గరికి వెళ్ళొచ్చాము. అంతా బాగుంది'' అంది డాక్టరు. 
''ఏం బాగుంది? కనబోయే రెండో బిడ్డకోసం జాగ్రత్తలన్నీ పాటిస్తున్నావు. కన్న కొడుకుపట్ల ఏమయ్యాయీ  జాగ్రత్తలు? పసివాడిని అమానుషంగా దూరంగా హాస్టల్లో ఎందుకు వేయాల్సొచ్చింది?'' అని  మీ అమ్మగారు నన్నుగట్టిగా మందలించారు .
"మీ అమ్మగారికి నేను చెప్పలేదు నాకింతకు మునుపే పదేళ్ల కొడుకున్నాడని ! 
నువ్వేమయినా పెళ్ళికి ముందే చెప్పి నాకు చెప్పడం మరిచిపోయావేమో…గుర్తుకు తెచ్చుకో!" అంది జాహ్నవి ఉద్వేగంగా.  
ఊహించని ఎదురుదాడికి సమాధానంలేక జాహ్నవి ముందు తను కురుచగా అయినట్లు భావిస్తూ, మౌనంగా ఉండిపోయాడు శివప్రసాద్.
మరుసటి రోజు ఉదయాన్నే జాహ్నవి నందూని తీసుకుని స్కూలుకి బయలుదేరింది. 
"జాహ్నవీ ! ఆగు. నందూని స్కూల్లో చేర్చడానికి నేనూ వస్తున్నాను !" అన్నాడు శివప్రసాద్ 
నందు భుజం చుట్టూ చేతులువేసి కారు దగ్గరికి నడుస్తూ. 
                                                          *  *  *  *  *

రచన :
కేశిరాజు వెంకట వరదయ్య
మొబైల్ నం: 9849118254