లేబుళ్లు

27, ఏప్రిల్ 2022, బుధవారం

స్వోత్కర్ష

                                                               
                                                                       స్వోత్కర్ష 
                                                                 -----------------------
                                        ( published in Sneha, prajashakti, Sunday edition) 

''ఇదిగో డ్రైవర్ ... నీపేరేంటన్నావ్'' అన్నాడు నారదమూర్తి .
''ఉదయ్ కిరణ్'' చెప్పాడతను మర్యాదగా.
"ఓ...ఉదయ్…ఈ ఉదయం లానే నీ పేరు చాలాబావుందయ్యా !
బస్సులో అందరూ ఆడవాళ్లు,పెద్దవాళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు ! అన్నట్లు మరిచాను. బండిలో స్టెఫ్నీఉందా ?  పంక్చర్ గట్రా అవుతే" .....
''ఉంది సార్. నాలుగు కొత్త టైర్లే. ఏమీ ప్రాబ్లెమ్ ఉండదు సార్''
''మీ ట్రాన్స్పోర్ట్ వారంతా ఇలాగే మాట్లాడుతారయ్యా. డబ్బుకు డబ్బు తీసుకుంటారు.
డొక్కు బళ్ళు తెచ్చి ఇబ్బంది పెడుతూవుంటారు. దూరం వెళుతున్నారుకదా ! అందుకే అడిగాను'' అన్నాడు నారదమూర్తి. 
''ఏవండీ…! ట్రిప్ అరేంజ్ చేసిన వాళ్ళు చూసుకుంటారుకదా అవన్నీ!
శుభమా అని బయలుదేరుతుంటే మీ ఆయనకెందుకా నోటి దురద, అనవసర పెత్తనం! 
క్రితం ట్రిప్ లో కమల బస్సెక్కుతుంటే 'జాగ్రత్త' అమ్మా! అన్నారు. మీరామాటంటూనే  కమల బస్సుమెట్టుమీదనుంచి జారిపడి పన్ను విరిగింది. మేము జాగ్రత్తగానే వెళ్ళొస్తాము. తమరు బయలుదేరండిక'' అంది మహతి నారదమూర్తి భార్య పుల్లవిరుపుగా బస్సులోనుంచి.
అయిష్టంగానే బస్సుకు దూరంగా వెళ్లాడు నారదమూర్తి. 
                                                            * * * * *                      
నారదమూర్తి, మహతి గేటెడ్ కమ్యూనిటీలో నాలుగో అంతస్థులో ఉంటారు. ఇద్దరూ సీనియర్ సిటిజన్స్. ఇద్దరూ సంవత్సరానికి రెండు, మూడు ట్రిప్పలు వేసుకుని 'డిస్కవర్ ఇండియా' అంటూ జామ్మున తిరుగుతూ వుంటారు. వాళ్ళిద్దరినీ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని  తెలిసిన వాళ్ళు, వాళ్ళ అపార్టుమెంటులో ఇరుగు పొరుగువారు అంటూవుంటారు. అన్నిటా చురుకుగా ఉంటారు. అందరితో బాగా కలిసి పోతారు. వాళ్లిద్దరు తిరగడమేగాక అపార్టుమెంటులో ఆడవారు, మొగవారు విడివిడిగా మూడు నాలుగు నెల్లకోసారి ఏదోఒక  ట్రిప్ వేసుకుని చూడని ప్రదేశాలు, గుళ్ళు గోపురాలు దర్శించుకుని వస్తుంటారు. పనిలోపని ఆడవారు గట్టిగా షాపింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈసారి కోస్తా ఏరియాలో గుళ్ళు, చీరల షాపింగ్ కని మినీ బస్సులో పదిహేనుమంది బయల్దేరారు. నారదమూర్తి వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి వచ్చి డ్రైవర్ తో మాట్లాడుతుంటే మహతి, నారదమూర్తిని అక్కడనుంచి తరిమేసింది. 
" ఇప్పటికే ఇంట్లో అల్మెరాలన్నీకిక్కిరిసి పోయాయి. ఇంకా చీరలు మాత్రం కొనకు" అని మహతికి చెప్పివెళ్ళాడు నారదమూర్తి అక్కడినుంచి వెళుతూ
                                                                    * * * * *
''అది నోరా లేక ఇంకేమన్నానా ? నువ్వు మాట్లాడకయ్యా మొగుడా అంటే ఊరుకోవు. చిలక జోస్యం చెబుతావు. దరిద్రం. ఆ అపశకునపు మాటలేమో అలానే అయిచస్తాయి ! 
ఇలా బయలుదేరి ఏభై కిలోమీటర్లు వెళ్ళామో లేదో బస్సుముందు టైర్ పంక్చర్. కొద్దిలో ప్రమాదం తప్పింది. బస్సులో మిమ్ముల్నితిట్టని వాళ్ళు లేరు. కొత్త టైర్ పంక్చర్ అయిందని బూతులు తిట్టాడు డ్రైవర్. వినలేక చెవులు మూసుకున్నాను. మీరింక మాఫ్రెండ్స్ దగ్గర ఏమైనా అపశకునపు మాటలు మాట్లాడారో మీకు మర్యాద ఉండదు. జాగ్రత్త"! అంటూ విషయం విశదంచేసి, ఫోనులో హెచ్చరించింది మహతి బస్సు బయలుదేరిన గంటకే ! 
ఆ కబురు విన్ననారదమూర్తికి తనేమైనా అంటే అది జరుగుతుందేమోనన్న ఉత్కంఠ మొదలయింది. కొద్ది అహంభావం మొలకెత్తింది. నాలుక మీద పుట్టుమచ్చవుంది. 
సరస్వతీ దేవి కటాక్షం మొదలయిందేమోనన్న భావన కాంక్రీటులా గట్టిపడడం మొదలయింది నారదమూర్తిలో !    
ఇదివరలో కూడా మహతి, పిల్లలు తరచుగా అనేవారు నారదమూర్తితో  'మీ నోటితో కీడు శంకించకండి అవి నిజమవుతాయని'...వారి మాటల్నిపిచ్చి నమ్మకాలంటూ కొట్టిపారేసేవాడు నారదమూర్తి.
ఇప్పుడు నారదమూర్తి రిటైర్ అయి ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటున్నాడు. వేరే పనీ, పాట లేదు. స్నేహితులతో, చుట్టాలతో ఫోనులో మాట్లాడడం, వార్తాపత్రికలు, వార, పక్ష,మాసపత్రికలు, పుస్తకాలు చదవడం, పాత పాటలు వినడం మినహా వేరే పని లేదు. 
వేరేవ్యాపకం లేదేమో నమ్మకాలని నమ్మడం మొదలెట్టాడు తనునూ !
                                                                 * * * * *
నారదమూర్తి వారుండే అపార్టుమెంటులో దసరా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఉత్తరాదివాళ్ళు దుర్గ అమ్మవారి పెద్ద విగ్రహం తెచ్చి నవరాత్రి పూజలు ఘనంగా చేయాలని, దాండియా, డి.జె పెట్టవలసిందేనని కమిటీ సమావేశంలో తీర్మానించారు. వెంటనే  సాంసృతిక కమిటీ మెంబర్ గా నారదమూర్తి ''పెద్ద విగ్రహమవుతే క్లబ్ హౌస్ లోనికి తీసుకువెళ్లడం కష్టం…గుమ్మానికి తగిలితే విగ్రహం దెబ్బతింటుంది. బయట షామియానా వేసి అమ్మవారిని అక్కడ ప్రతిష్టిద్దాం '' అన్నాడు నారదమూర్తి ముందుచూపుతో. 
దానిమీద చర్చ జరిగి వర్షం వచ్చే సూచనవుంది కాబట్టి లోనే క్లబ్ హౌస్ లోనే పూజలని తేల్చేశారు. నవరాత్రులలో మొదటిరోజు ఉదయాన్నేఅమ్మవారి విగ్రహం వచ్చింది. 
ఆరడుగుల ఎత్తున్న విగ్రహం ట్రాలీ లోనుంచి క్లబ్ హౌస్ లోనికి తరిలిస్తుంటే అమ్మవారి కిరీటం కాస్తా గుమ్మానికి తగిలి విరిగింది. కమ్యూనిటీలో నానా రభసయింది. 
నారదమూర్తి ముందే హెచ్చరించినా జాగ్రత్తలు తీసుకోలేదని కొందరు పనిగట్టుకుని  ప్రచారం చేశారు.అపశకునమన్నారు. విగ్రహం మార్చాల్సి వచ్చింది. ఖర్చు తడిసి మోపెడయింది. 
ఆ సంఘటన జరిగిన నాటినుంచీ నారదమూర్తి అహం మొక్క నుంచి 'చెట్ట'యింది. 
మాట తీరూ మారింది. తనమాటకు తిరిగేలేదన్ననమ్మకం తనలో ఏర్పడింది. 
అతని అహం మూర్తివంతమైంది. 
నారదమూర్తి  ప్రవర్తన ఎదుటివారికి రాను రానూ భరింపరానిదిగానూ, ఎబ్బెట్టుగాసాగింది. 
అతని అహం 'చెట్టు' నుంచి 'మాను' అయింది.  
తనని తానొక 'బాబా'గానో 'స్వామి'లానో భావించడం మొదలెట్టాడు. ఇంటా, బయటా అనవసరపు విషయాల్లో జోక్యం మొదలయింది. అతనిలో 'అహం'మూర్తి పెరుగుతున్నాడు.
'ఇంతింతై వటుడింతై మరియు దానంతై నభోవీథిపై నంతై.....బ్రహ్మాండాంత సంవర్ధియై' అన్నట్లు అతన్నిఅతని 'అహం'మూర్తి పూర్తిగా ఆవరించాడు !అవతరించాడు!
                                                                   * * * * * 

నారదమూర్తి వారుండే అపార్టుమెంటులో నీటి కొరతతో కొత్త బోరు వేయాలన్నప్రతిపాదనపై సొసైటీ సమావేశంలో చర్చ వాడిగా సాగుతోంది. సభ్యులు కొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ 'బోరు' ఎక్కడవేయాలో నారదమూర్తిని అడిగితే బావుంటుందనన్నారు. కొందరు భూగర్భజల నిపుణుణ్ణి సంప్రదించాలన్నారు. నారదమూర్తిక్కూడా 'జియాలజీ'లో ప్రవేశం ఉందని ఎవరో చెప్పగా విన్నానని సెక్రటరీ అనడంతో మీటింగుకి నారదమూర్తిని పిలిచి 
"నారదమూర్తిగారూ ఈ సొసైటీకి  మీ సేవలు అమోఘం. సొసైటీలో ఇంకొక బోర్ వెల్ వేయాలని నిర్ణయించాం. బోర్ ఎక్కడ వేస్తే నీరు బాగా పడుతుందో కనుక్కునే బాధ్యత మీ భుజస్కంధాలమీద పెడుతున్నాం" అన్నాడు సొసైటీ సెక్రటరీ. 
ఆ పొగడ్తకు, సొసైటీలో వచ్చిన గుర్తింపుకు హీలియం గ్యాస్ కొట్టిన బెలూన్లా గాలిలో అలా  తేలుతున్నట్లనిపించింది నారదమూర్తికి. 
అతనిలో 'అహం'మూర్తి పరిధి దాటిపోయాడు.ఇదివరలో ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేవాడు. ఇప్పుడతనికి అనవసరమైన విషయంలేదు. ప్రతి విషయంలోనూ అతని ప్రమేయమే ! 
నిజాం, సర్కార్, కోస్తా హక్కులు ఒక్కరికే అన్నట్లు  నారదమూర్తిపై పూర్తి హక్కులన్నీ అహం మూర్తివశమయ్యాయి !    
'బోరు' వేయడానికి సరైన పాయింట్ కనుక్కునే బాధ్యత తనదని అందరిలో సొసైటీ వారికి మాటిచ్చాడు నారదమూర్తి. మాటైతే ఇచ్చాడు గాని ఏం చేయాలో అర్థంగావడం లేదు.
ఈ విషయమై మూడురోజులుగా రేయింబవళ్లు మదనపడుతున్నాడు. 
అహంమూర్తి అతన్ని రెచ్చగొడుతున్నాడు. 
"ఎవరో భూగర్భజల నిపుణుణ్ణి కనుక్కోవలసిన అగత్యం నీకేమిటి ? నేనునున్నాను కదా! 
ఫలానా స్థలమని ఎంపికచేసి చెప్పు"అన్నాడు అహంమూర్తి ఉరఫ్ నారదమూర్తి ఆత్మ.   
''లేదు. ప్రమాదం కదా ! ఒకవేళ నీరుపడకపోతే"? అనుమానం వ్యక్తం చేసింది నారదమూర్తి. ఆత్మ.  
"అర్ధంలేదు…ఇంతవరకు నేను చెప్పిన భవిష్యవాణి, శకునాలు, ఎన్ని నిజం కాలేదు ! 
ఇది కూడా అంతే ! ప్రయత్నం చెయ్యి" అన్నాడు అహం మూర్తి. 
నారదమూర్తికి అనుమానంగా ఉంది. తర్జనభర్జనపడుతోంది అతని మేధ. 
'అవమానంపాలవవుతావు. ఇదేమీ చిన్న విషయంకాదు. నలుగురితోపని. ఫలితం భౌతికం' అందతని మేధ. మేధని గెలవనివ్వలేదు అహంమూర్తి. 
ఈ సారికూడా అహంమూర్తికి పూర్తిగా వశమైపోయాడు నారదమూర్తి
                                       * * * * *
నిశీధిన, నిశ్శబ్దంగా ఉన్నసమయంలో భూమిమీద చెవ్వు ఆనించి వింటే, ఆప్రదేశంలో భూగర్భజలముంటే, ఆ నీటిప్రవాహ శబ్దం వినబడుతుందని, ఎప్పుడో ఎవరో చెబితే విన్నట్లుగా గుర్తు వచ్చిందతనికి.     
ఆ రోజు రాత్రి నిద్రపోలేదు నారదమూర్తి. అర్దరాత్రి దాటాక దాదాపు రెండుగంటలకు నాలుగో అంతస్తునుంచి కిందకు వచ్చాడు. అపార్టుమెంటులో ఒక మూలగా ఖాళీగా ఉన్నప్రదేశంలో తుప్పలు, ఎండిపోయిన ఆకులూ శుభ్రంచేసి తనతో తెచ్చుకున్నబెడ్ షీట్ కింద పరిచి బోర్లాపడుకుని చెవి భూమికి ఆనించి జాగ్రత్తగా విన్నాడు. నీటి ప్రవాహశబ్దం వినబడలేదు. 
ఇంకొక ప్రదేశానికి మారాడు. అక్కడా పడుకుని చెవి భూమికి ఆనించి విన్నాడు. ఎలాటి ప్రవాహశబ్దం వినబడలేదు. 
'ఓహో…బెడ్ షీట్ అడ్డం ఉంది' అనుకుని దాని పైఅంచు మడిచి పడుకుని కుడిచెవి నేల కానించి కదలక అయిదు నిముషాలబాటు తన ధ్యాసను సూక్ష్మంగా కేంద్రీకరించి భూగర్భనీటి  ప్రవాహశబ్దం వినబడుతుందోమోనని చెవు నిక్కరించి విన్నాడు. ఇంతలో చెంప మీద చురుక్కుమని ఏదో కుట్టినట్లనిపించి, తటాలున లేచి టార్చ్ లైట్ వేశాడక్కడ నారదమూర్తి. ఆవెలుతురులో స్పష్టంగా కనిపించింది చిన్న నల్లటి తేలొకటి కొండి ఎత్తుకుని పాకుతూ! 
కెవ్వున అరిచి చటుక్కున లేచి చెంప రుద్దుకుంటూ అలవికాని మంట, నొప్పితో విలవిల్లాడుతూ, బెడ్ షీట్ మరిచి అక్కడనుంచి పరుగులంకించుకున్నాడు నారదమూర్తి ! 
"ఎవరు ... కోన్ హై వో... చోర్… చోర్ అంటూ విజిల్ వేస్తూ వెంటబడ్డాడు లాఠీతో సెక్యూరిటీ గార్డ్"... 'ఖర్మ సమయానికి వీడొకడు' అనుకుంటూ అడ్డదిడ్డంగా పరుగెత్తి రొప్పుతూ లిఫ్ట్ దగ్గర దొరకనే దొరికాడు తరుముతున్నసెక్యూరిటీ గార్డ్ కి నారదమూర్తి. 
"ఓ ...ఏందీ సార్…గట్ట ఉరుక బడితివి…ఎవడో దొంగనా.... అనుకుని ...లాఠీ నూకెటోన్ని సార్ ! 
ఇంకా నయం...నీ రోజులు, నారోజులు బాగున్నయ్ ! అయినా ఈయాలటప్పుడు కింద ఏం చేస్తుంరు సార్ ?"అనిపైకని, గొణుక్కుంటూ వెళ్లిపోయాడక్కడి నుంచి సెక్యూరిటీ గార్డ్ . 
'బతుకుజీవుడా' అనుకుంటూ ఫ్లాట్ కొచ్చి కారు కీస్ తీసుకుని మరెప్పుడూ భవిష్యవాణి జోలికి వెళ్లరాదనుకుంటూ పొరపాటున గట్టిగా లెంపలేసుకుని నొప్పితో గిలగిల్లాడుతూ ఆసుపత్రికి బయలుదేరాడు నారదమూర్తి ఆ అర్దరాత్రి. 
అహంమూర్తి పూర్తిగా వదిలాడు నారదమూర్తిని ! 
                                                                        * * * * *
రచన :
కేశిరాజు వెంకట వరదయ్య 
మొబైల్ నం. 9849118254                                   
              





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి