లేబుళ్లు

30, సెప్టెంబర్ 2010, గురువారం

నిరామయ భారతం .... కవిత

నిరామయ భారతం  

భరతమాతనునేను
భరత ధాత్రిని నేను
తరతరాల దాస్యంతో
ధరిత్రి చరిత్రలో పుటల కెక్కిన నేను
తెల తెల్లని మిన్నాగుల బారినుంచి
బంధనాలుతెంచుకుని
బయల్పడ్డా ననుకొన్నాను
బిడ్డల నీడలో ఒడలంతా
బడలిక తీర్చుకుందా మనుకొన్నాను
దశాబ్దాలు దాటాయి
నాటి మొదలు నేటి వరకు
నా 'శిరోభారం' తీర్చిన వారు లేరు
శిరమే కాదు భారం
ఒడలంతా ఒరుసుకుపోతోంది
తూర్పు, పడమరలు
దక్షిణ, ఉత్తరాలు
ఎటు  చూసినా ఆటుపోట్లు
ఏమిచేస్తే 'మేలో' పాలు పోవడంలేదు లేదు !
అర్దరాత్రి స్వాతంత్ర్యం
అవస్థ పెడుతోందో ?
అవాచ్య విశృంఖలత్వం
విజ్రుంభించిందో ?
'వివక్ష' విభజనగా విస్ఫుటిస్తోందో  ?
మత మహమ్మారి మట్టగిస్తోందో ?
భిన్న సంస్కృతుల నా ప్రజ
'పక్షపాతం' పాలయ్యారో  ?
పాలకుల చేతిలో పగ్గాలు
పక్క దారి పట్టాయో ?
'పబ్బం' గడుపుకునే
'ప్రాపులు'ప్రామాణిక మయ్యారో ?
పొలాల పండుగలు
పట్నవాసం పాలయ్యాయో ?
పౌరసత్వ హక్కులు
పోరుసల్పందే 'పాలు' కావడంలేదో ?
తళుకు,బెళుకులు తలకెక్కాయో ?
తలనెరిసిన వారి తలలు
నీడ కోసం నిట్టూరుస్తున్నాయో  ?
జాతి సంపద 'సంపీడ్య' సాంక్రమిక
హక్కు భుక్త  మవుతోందో ?
ఏమీ తెలియక తెల్లమోహమేసుకుని
అర్ధంకాని, వ్యర్ధమైవుతున్న
స్వాతంత్ర్యంతో
స్వాంతన కరువైన 
స్వజనంతో ఏమని చెప్పను?
ఎవరికి  చెప్పను?
ఉన్నాయి ఊసులు
ఎన్నో, ఇంకెన్నో
ఇంకెవరికి చెప్పను?
నా హిమన్నదాలు ఇంకి పోతున్నాయనా!
నా 'గంగ' ఇంక గట్టుకి చేరదనా !
గమన నియమాలు'నీటికీ' నిబద్ధమనా!
నదీమతల్లుల నాట్యం
నిరంతరం నిరర్గళ మవుతే
నిర్నిబద్ధమేగా పైవారికి
నిరాపేక్షణేయమేగా క్రిందవారికి
అందుకు సన్నద్ధంకండి!
హరితవనాల్ని స'హరితం' చేయండి.
ప్రకృతి ప్రసాదాల్ని
పంచడం మానండి !
అవే ఆదుకునేది నాప్రజని
అప్పుడే 'నిరామయం' నా ప్రజకి .

రచన:
కేశిరాజు వెంకట వరదయ్య.   




   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి