లేబుళ్లు

30, జులై 2025, బుధవారం

                                                                        శిశిరం

                 (ఈ కధ 'మే' నెల, 2013 - ఆంధ్రభూమి మాస పత్రికలో ముద్రితమైనది )   
     
                  అర్ధరాత్రి దాటింది. ఎంతకూ నిద్ర రావడం లేదు. అలసటగావుంది. రెండ్రోజుల్లో హైదరాబాదులో వుంటామనుకుంటేనే గుండెల్లోంచి తన్నుకు వస్తోంది ఒణుకు. బెడ్  మీద నుంచి లేచి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని ఆలోచనలో పడ్డాను. 
'హైదరాబాద్  వెళ్ళాక ఎక్కడో ఒకచోట కలవక పోతామా? ముందుగా నేనే వెళ్తాను!
అమ్మా, నాన్న ఎలా స్పందిస్తారో. అసలు ఇంట్లోకి రానిస్తారా?' అన్న ప్రశ్నలు నామెదడుని  తొలిచేస్తున్నాయి. తిరిగి ఇన్నేళ్ళ తరువాత హైదరాబాదుకి వెళుతున్నామని తెలిసిందగ్గర నుంచి  మనసుతో ఇదే తంతు.
                                                                  * * * * *
తొమ్మిది సంవత్సరాలయింది అమ్మా, నాన్నలని వదిలి అమెరికా వచ్చి. ఎన్నిసార్లు ప్రయత్నం
చేశానో మాట్లాడుదామని. ఫోను నంబరు మార్చుకున్నారు.
నా స్నేహితులన్న వారిని దగ్గరికి రానివ్వలేదు. అమ్మ నా మాట వస్తేనే మాట మార్చేసేదట.
వాళ్ళ సంగతులు  కొద్దో, గొప్పో మొదట రెండు మూడేళ్ళు తెలిశాయి. తరువాత మా స్నేహితురాలు చెప్పింది అమ్మవాళ్ళు ఇంట్లోలేరని!
''ఇంట్లో లేరంటే ఏమిటే? ఎక్కడికైనా వెళ్ళారా... సరిగ్గా కనుక్కోలేకపోయావా? ఎక్కడికి వెళ్తారు?
వెళ్ళినా ఎన్ని రోజులు ఉంటారు? నువ్వు ఎన్నిసార్లు వెళ్లావు'? అని వివరాలడిగితే దాని దగ్గరనుంచి  మారు సమాధానం లేదు.
అమ్మా, నాన్నకి బాగా తెలిసిన నా ఫ్రెండ్స్ ఇద్దరు 'లావణ్య,లత.
''నన్నడకే వాళ్ళ సంగతులు. మీ ఇంటికి వెళ్లాలంటే నాకు చచ్చే  భయం!'' అని ఖరాకండిగా చెప్పింది లావణ్య. ఇక మిగిలింది లత.
అది కూడా నేను అమెరికా వచ్చిన రెండేళ్ళ తరువాత నాతో పూర్తిగా మాటే మానేసింది. అది 
ఇప్పుడు ఎక్కడుందో, ఏంచేస్తుందో తెలీదు. అలా ఫ్రెండ్స్  తో  కూడా టచ్ పోయింది. 
ఈ తొమ్మిదేళ్ళు ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు.
అమ్మా, నాన్న, తమ్ముడు గుర్తు వస్తే చాలు ఆరోజంతా మనశ్శాంతి వుండేది కాదు.
నిద్ర పట్టేది కాదు. ఏ పని మీద దృష్టి ఉండేది కాదు.
ఆఫీసులో చాలాసార్లు మేనేజరు మందలించేవాడు పని మీద దృష్టి ఉంచమని.
నా పరిస్థితి చూసి ''బ్రేక్' తీసుకో శిశిరా!" అని సలహా ఇచ్చాడు శశాంక్
తరువాత వరుసగా బాబు, పాప.  ఆ పై నేను, నా సంసారం, నాపిల్లలు, నా ఇల్లు! 
అయినా ఇన్నేళ్ళలో ఒక్కక్షణం కూడా అమ్మ,నాన్న,తమ్ముడిని తలవని క్షణం లేదు. 
'వాళ్ళకేనా, పట్టింపు, నాకు లేదా' అనిపించేది ఒక్కోసారి!
మన జీవనగమనంలో ఒడిదుడుకు లొచ్చాయని కాలమేమీ ఆగదుగా!
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. వెనక్కి చూసుకుంటే కాలచక్రంలో తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి.
                                                                     * * * * *
ఈ తొమ్మిదేళ్ళలో ఎంత ప్రయత్నం చేసినా అమ్మా,నాన్నా,తమ్ముడు వాళ్ళసంగతులేమీ తెలవలేదు. ఎన్నీ లెటర్లు వ్రాసినా సమాధానం లేదు. అవి అందాయో లేదో కూడా తెలీదు.
ఇక ఇమెయిల్స్ అయితే లెక్కే లేదు!
నాతరువాత పన్నెండేళ్ళ తేడాతో పుట్టాడు తమ్ముడు 'రాజేష్'. ఇప్పుడు ఇరవై రెండేళ్ళువాడికి.  'హైదరాబాదు కు వెళ్తున్నాం' అని శశాంక్ చెప్పిన దగ్గరనుంచి ఆలోచన ఏదీ తెగడం లేదు. వాళ్ళని కలవడం తలుచుకుంటేనే భయం, బాధ. గుండెల్ని పిండుతోంది. నాకు అమ్మకంటె నాన్నతో ఎంతో కలివిడి. నాన్న ఎన్నడూ గట్టిగా కోప్పడినట్లుగా గుర్తు లేదు.
నేను చదువులో ఎప్పుడూముందే. ఇంజినీరింగ్ ఎంట్రెన్సులో ఆరు వేలలో 'రేంకు' వచ్చినప్పుడు ''ఏం సరిగ్గా ప్రిపేరు కాలేదా'? టి.వి చూడ్డం ఎక్కువయిందా?" అని మందలించారు అంతే! 
అప్పుడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడున్నాయి? దాంతో నేను సిటి వదలి ఇంజనీరింగ్ బయట చెయ్యాల్సి వచ్చింది. నాన్ననాకు ఇరవై ఒక్క సంవత్సరాల వరకూ ఒక మంచి స్నేహితుడు లానే వున్నారు.
ఆయన దగ్గర నేను దాచి, ఆయనకు తెలీకుండా చేసిన ఒకే ఒక్క పని ప్రేమ,పెళ్ళీ! 
పెళ్లి చేసుకుని నేను, శశాంక్ తో మా ఇంటికెళ్ళి నప్పుడు నాన్న నోటి మాట రాక, నిశ్చేష్టులై, షాకులో కూడ అన్న ఒక్కటే మాట. 
''గాడ్ బ్లెస్ యు బోత్!"అని లోపలి కెళ్ళివచ్చి ఒక 'కవరు' నా చేతికిచ్చారు. ఆ కవరు నా దగ్గరే వుందింకా! 
"ఏదైనా పెళ్లి కెళితే నేను ఇలాగే బహుమతి ఇస్తానమ్మా! అలాగే నీకు ఇచ్చాను'' అన్నారు కళ్ళజోడు క్రిందగా జారిన  రెండు కన్నీటి ధారలు తుడుచుకుంటూ అన్నారు.
''ఈ అబ్బాయి ఇంట్లోవాళ్లకైనా మీ పెళ్లి విషయం తెలుసా?'' అనడిగారు నాన్నగారు.'
ఆయన ముఖంలోకి చూసే ధైర్యం లేక నేను సమాధానం చెప్పలేదు.
శశాంక్  కల్పించుకుని " తెలుసండీ. వాళ్ళే చేశారు పెళ్లి'' అన్నాడు.
''ఓ అలాగా!" అంటూ నా వంక చాలా బాధగా చూశారు నాన్న.
ఆయన ఆ 'చూపు' నా గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. చేసిన పెద్ద తప్పుకు 
విల విల్లాడుతూ బాధగా తలవంచుకోవడం మినహా నేనేమీ మాట్లాడలేకపోయాను.
నాకిప్పటికీ నాన్నగారి ముఖం నన్ను బాధగా చూసిన 'ఆ చూపు' గుర్తుంది. అది నన్నునీడలా వెంటాడుతూనే ఉంది. 
'ఏం తప్పు చేశామని మాకు ఈ శిక్ష వేశావు' అని  ఆయన నన్ను గుచ్చి, గుచ్చి అడిగినట్లుగానే అనిపించేది నాకు.
''దాని నగలు దానికిచ్చి బొట్టు పెట్టి పంపించు!'' అని అమ్మతో చెప్పి లోని కెళ్ళి మేము   వెళ్ళిన దాకా ఆయన బయటకు రాలేదు.
ఆక్షణంలో, నేను నా అపరిపక్వ నిర్ణయంతో ఆ ఇంటికి పరాయిదాన్నయిపోయాను.  నాన్నగారితో ఎప్పటిలా చనువుగా మాట్లాడలేక పోయాను. అమ్మ అరుస్తూనే వుంది. 
స్వతంత్రించి నేను వారికీ చెప్పకుండా చేసుకున్న కులాంతర వివాహానికి తట్టు కోలేక పోయారు.   నా నగలన్నీ నాకిచ్చేసి లోనికి వెళ్ళింది అమ్మ. తమ్ముడు ఇంట్లో లేడు. 
అలా ఆనాడు ఇంటినుంచి వెనుతిరిగి మళ్ళీ ఇన్నేళ్ల తరువాత హైదరాబాద్ తిరిగి వస్తున్నాను. 
                                                                 * * * * *
అప్పుడు అమెరికా బయలుదేరే ముందు ఫోన్లో నాన్నతో మాట్లాడి నప్పుడు ఒక్కటే అన్నారు.
''నన్ను మోసం చేసిన వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం వుండదమ్మా! ఆ సంగతి నీకు బాగా తెలుసు. ఇదే చివరిసారి, ఇక ఎప్పుడూ నాతో  మాట్లాడాలని ప్రయత్నించకు. నన్నుబాధ పెట్టకు. ఇప్పటికే సగం చచ్చిపోయాను. 'మాఇంటికి' చాలా మంది వచ్చి వెళుతుంటారు. 
నిన్నుఆ అతిధి కోవలో చూడలేను. అలాగని నిన్ను పరాయిదానిలా చూడడం నావల్ల కావడంలేదు . ఇంతటితో మమ్ముల్ని వదిలేయ్. పిల్లా, పాపలతో కల కాలం హాయిగావుండు! ఎన్నడూ నాదగ్గరికి  రావద్దు. ప్రయత్నం  కూడా చేయకు.
"ఒక్క విషయం ఎప్పటికీ గుర్తుంచుకో. నువ్వు కులాంతర వివాహం చేసుకున్నావని కాదు ఈ ఆంక్షలు. నన్ను శత్రువు కన్నాఎక్కువ మోసం చేశావు, అందుకు నిన్ను క్షమించలేను. దిక్కులేనిదానిలా నువ్వు నీ స్వంత  నిర్ణయం తీసుకున్నావు. అలాగే స్వతంత్రం గానే వుండు'' అని కరకుగా మాట్లాడారు నాన్నగారు.
తరువాత  నాన్నగారు నాతో మాట్లాడ లేదు. నా తప్పు నన్ను కసిగా వెంటాడుతూనే వుంది. 
కని పెంచిన వారిని, తోబుట్టువును వదిలేసి మూర్ఖంగా నా స్వార్ధం చూసుకున్నాను. అందుకే జీవితంలో తల్లీ, తండ్రీ లేని దాన్నయ్యాను. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడని క్షణం లేదు.
'ఇప్పడు హైదరాబాద్ వెళ్తున్నాము.స్వామీ కరుణించి నాన్నగారి మనసు మారేలా చూడు.నాకు వాళ్ళు కావాలి'  అని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్ధించాను.  
                                                                 * * * * *
నాన్నగారు వాళ్ళు వుండేది అమీర్ పేటలో. మేముండబోయేది 'గచ్చిబౌలి' లో.
ఇంతలో చిన్నది నిద్ర లో  లేచి మంచం దిగి ''డాడీ...డాడీ'' అంటోంది. ఒక్క అంగలో లేచి  వెళ్లి దాన్ని అందుకుని 'క్రిబ్' లో పడుకో బెట్టాను. వెంటనే నిద్రపోయింది.
పెద్దవాడు బాబు. ఆరు సంవత్సరాలు. చిన్నదానికి మూడు సంవత్సరాలు..టైము చూశాను. రాత్రి  ఒకటయింది. 'శశాంక్' లేచి తనూ  పనిచేసు కుంటున్నాడు.
''పడుకో శశాంక్ ! రేపే ప్రయాణం'' అని చెప్పి వచ్చి పడుకున్నాను.
                                                                 * * * * *
'లుఫ్తాన్సా' ఎయిర్ లైన్స్  విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో  ఆన్ టైం లేండ్ అయింది. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలన్నీ ముగించుకుని  సూట్ కేసులన్నీ తీసుకుని బయటకు వచ్చేసరికి దాదాపు నాలుగయింది.
'శశాంక్' వాళ్ళ తమ్ముడు వచ్చాడు ఎయిర్ పోర్ట్ కి. కంపెనీ కారు వచ్చింది. లగేజి అంతా కారులో డిక్కీలో, వెనక  సదిరి డ్రైవర్ బయలుదేరాడు.
శశాంక్ వాళ్ళతమ్ముడు,' సాయి' మరో కారులో మావెనకే వచ్చాడు. నాలుగు బెడ్ రూముల ఫ్లాటు. చాలా బావుంది. ఏడో అంతస్తు.  ఖరీదైన ఇంటీరియెర్! దగ్గర్లో ఏదో స్టేడియం కనిపిస్తోంది!
ఎటు చూసినా మంచి 'వ్యూ' ఉన్న ఫ్లాటు.
శశాంక్ వాళ్ళ తమ్ముడు, మరదలు ఇద్దరు,  ఉదయానే మళ్ళీ వస్తామని వెళ్ళారు. అలసి పోయామేమో అందరం వెంటనే నిద్ర పోయాము.
                                                                 * * * * *
'కాలింగ్ బెల్' మోతకు దిగ్గున లేచాను. టైం చూశాను. ఉదయం పది గంటలు దాటింది. 
బాబోయ్, ఎంత నిద్ర పోయాము అనుకుంటూ లేచాను. జుట్టు సరిచేసుకుని తలుపు తీశాను.
శశాంక్ వాళ్ళ  తమ్ముడు అతని భార్య అనిత.
''అక్కా 'బెల్', తలుపు, చాల సేపునుంచి కొడుతున్నాం. సారీ అక్కా! నిద్ర పాడు చేసినట్లున్నాం'' అంది లోనికి వస్తూ.
''భలేదానివి' రండి! పిల్లలు, శశాంక్ సరైన తిండి తిని రెండుమూడు రోజులైంది.
ముందు వాళ్లకి టిఫిన్ చేయాలి. శశాంక్ ఆకలికి అసలు ఆగలేడు" అంటూ లోపలి కొచ్చాను.
''అక్కా! మేము వస్తూ, హోటల్ నుంచి టిఫెన్,  ఇంటి నుంచి భోజనం క్యారియర్  తీసుకుని  వచ్చాము''రెండు మూడు రోజులు భోజనం పంపిస్తాను. ఇప్పుడే వంట మొదలెట్టకు.
ముందు సెటిల్ కండి కంగారేమీ లేదు" అంది అనిత.
''లేదు, అనితా! ఇవాళ నుంచి వంట కుర్రాడు వస్తాడు. నేను జాబు మానేసాను. పిల్లలతో కుదరడం లేదు"  . 
''అయ్యో! అంత డబ్బు ఎందుకు వదులుకోవడం.ఇక్కడ ఐదారు వేలు ఇచ్చామంటే మనుషులు  దొరుకుతారు. నువ్వు హాయిగా జాబులో చేరవచ్చు అక్కా!' అంది అనిత.
''లేదు, అనితా! పిల్లలు కొద్దిగా ఎదిగిన దాక నేను జాబు మానేద్దామని ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నాము. శశాంక్ వాళ్ల కంపెనీ  వైస్ ప్రెసిడెంటుగా వచ్చాడు ఇక్కడికి. మంచి జీతం. నేను కూడా జాబు చేయవలసిన అవసరం  లేదు. మీరు  కూర్చోండి'' వాళ్లకి  సోఫా చూపించి నేను బెడ్ రూమ్ లోకి వచ్చిశశాంక్ ని, పిల్లల్నిలేపాను.
లేవడమే ఆలస్యం పిల్లలు  ''మామ్  ఆకలి" అంటూ గొడవ మొదలెట్టారు.
పిల్లలు, శశాంక్  బ్రష్ చేసుకుని  టిఫెన్ తినేశారు. శ
శాంక్ వాళ్ళతో  కాసేపు మాట్లాడి 'లేప్ టాప్'   ముందేసుకుని కూర్చుని, ఫోన్లో మాట్లాడుతున్నాడు. కొద్ది సేపటికి ఇద్దరు మనుషులు వచ్చారు. ఒకరు కుక్, ఇంకొకరు 'బోయ్'. 
కుక్ ఉదయం, సాయంత్రం వస్తాడట . ఇద్దరు  తెలుగు వాళ్ళే. బావుంద నుకున్నాను.
సాయంత్రానికి కూరలు, సామానులు ఏమి కావాలనో లిస్టు రాసిస్తే, కిందనే షాపు ఉందట. తెస్తామన్నారు. .
వెంటనే శశాంక్ కి చెప్పాను. కేష్ కావాలని. పని కుర్రాడు చెప్పాడు కిందనే ఎ టి ఎం  వుందని.  హైదరాబాద్ ఎంత మారిపోయిందనుకున్నాను.
శశాంక్ ' క్రిందకు  వెళ్లి కేష్ తెచ్చాడు. కావలసిన సామాను తెప్పించాను. 
అనితకు చెప్పాను. ఇక భోజనం పంపించవద్దని. వాళ్ళు సాయంత్రం వరకు వుండి వెళ్లారు.
                                                                * * * * *
అప్పుడే వారం రోజులయింది హైదరాబాద్ వచ్చి. పిల్లలు సెటిల్ అయ్యారు.
ఇద్దరు పిల్లలకి అపార్టుమెంటులో స్నేహితులు బాగానే తయారయ్యారు. కిందనే ఉన్న  సమ్మర్ స్కూల్ లో ఇద్దరినీ చేర్పించాను. 'స్విమ్మింగ్ క్లాస్' కి, ఆటలకు వెళుతున్నారు. 
                                                                * * * * *
ఆరోజు ఆదివారం !
శశాంక్ టీవీ చూస్తూ కూర్చున్నాడు. వంటతను టిఫెన్ చేయడంతో అందరి బ్రేక్ ఫాస్ట్ అయింది, వంట మొదలెట్టాడు. కానీ మనసు బాలేదు. వచ్చి  వారం రోజులయినా ఇంతవరకు ఎవరినీ కలవ లేదు.నేను హైదరాబాద్   మేము హైదరాబాద్  షిఫ్ట్  అవుతున్నట్లు ఎవరితోనూ చెప్పలేదు. 
'అమ్మవాళ్లతో  పరిచయమున్నస్నేహితులు ఇంకెవరు హైదరాబాద్ లో ఉన్నారా?' అని అలోచించాను. 
ఎంత అలోచించినా ఉన్నది ఇద్దరు స్నేహితులే. వాళ్ళ 'పేరెంట్స్' కూడ అమ్మా వాళ్లకి బాగా పరిచయమే. వాళ్ళ ఇళ్ళు తనకి తెలుసు. 
ముందు ఇంటికి వెళ్లి చూసి అమ్మ వాళ్ళ  ఆచూకీ తెలియకపోతే  తరువాత వాళ్ళ దగ్గరికి  వెళదామని నిర్ణయించుకున్నాను. ఈ రోజు ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి అని దృడంగా మనస్సులో అనుకున్నాను.
ఇంతలో శశాంక్ "ఇదుగో శశీ! ఇవాళ నేను పిల్లల్ని చూసుకుంటాను. నువ్వు బయటకు వెళ్లదలుచుకుంటే వెళ్ళు. కారు, డ్రైవరు రెడీ'' అన్నాడు శశాంక్.
తను మనస్సులో ఏమి ఉంచుకుని చెప్పాడో అర్ధం అయింది నాకు.
ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చి గదిలోకి వచ్చితలుపు వేసుకున్నాను.
శశాంక్ నా వెంటనే లోనికి వచ్చాడు.
''శశీ! ఇలా చూడు. నాకు తెలీదా, నీ బాధ?'' దగ్గరికి తీసుకుని వీపు రాస్తూ అన్నాడు శశాంక్ .
ఒక్కసారిగా బోరు మన్నాను.కంగారు పడి పోయాడు శశాంక్.
 నాకళ్ళు తుడిచి ''వెళ్లి  అందరినీ కలిసిరా 'అల్ ది బెస్ట్'! నేను  తరువాత వస్తాను'' అన్నాడు శశాంక్. త్వరగా తెమిలి కింద పార్కింగ్ కి వచ్చాను.
                                                                        * * * * *
ముందుగా  శ్రీనగర్ కాలనీలో 'లావణ్య' పేరెంట్స్ ఇంటికి వెళ్లాను. లావణ్య వాళ్ళాయన 
తలుపు తీసి ''ఓ మీరా!'' అని నన్ను అదోలా చూస్తూ లావణ్యని పిలిచాడు.
అది నన్నుచూసి బిత్తరపోయి, ''ఏంటే, ఎప్పుడొచ్చావు ? ఎక్కడ దిగావు? బాగున్నావా?
ఎన్నిసంవత్సరాలయిందే నిన్ను చూసి!" అంది గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది.
''మేము హైదరాబాద్  షిఫ్ట్ అయ్యాము. గచ్చిబౌలిలో ఇల్లు తీసుకున్నాము. నువ్వు, మీఆయన ఇక్కడ ఉన్నారేంటి? 'మీ అమ్మా, నానా వాళ్ళెక్కడ ? నన్ను చూస్తూనే  మీయన అదోలా ముఖం పెట్టాడు? అంతలా మోశావేంటి?" పాత రోజులు గుర్తుకి తెచ్చుకుంటూ అడిగాను దాన్ని. .
''ఛీ! అదేంటే అలా అంటావు. అమ్మావాళ్ళు అమెరికా లో అన్నయ్య దగ్గర సెటిలయ్యారు. వాళ్లకి 'గ్రీన్ కార్డు' వచ్చింది. ఏడేళ్ల క్రితమే వాళ్ళు అమెరికా వెళుతూ మమ్ముల్నిఈ ఇంట్లోకి 'షిఫ్ట్' కమ్మన్నారు" అని విశదంగా చెప్పింది లావణ్య.
" మిగతా సంగతులన్నీ తరువాత మాట్లాడుదాం! ముందు మా అమ్మావాళ్ళ సంగతి చెప్పు! నువ్వువాళ్ళని కలిసి ఎంత కాలమైంది? వాళ్ళెలా వున్నారు? తమ్ముడేం చేస్తున్నాడు? డాడీ, ఎలావున్నారు?" అంటూ నాన్న వాళ్ళ గురించి ఆరా తీస్తూ అడిగాను లావణ్యను
''నేను మీ పెళ్లి అయిన  ఓ సంవత్సరం తరువాత నా పెళ్లికి పిలవడానికి వెళ్లాను. మీ అమ్మ నా ముఖం వాచేలా చివాట్లు పెట్టింది. నేను పారిపోయి వచ్చేశాను. తరువాత వాళ్ళని కలవలేదు" అంది లావణ్య 
"లత పెళ్లి అయిందా ? అదెక్కడ ఉంది? దాని అడ్రెస్ ఉందా?" అడిగాను. 
''అది పెళ్లి చేసుకోలేదు.పెద్ద సోషల్ వర్కర్. ఇంట్లో దొరకడం కష్టమే. టూర్లు వెళుతూ వుంటుంది. ముందు దానికి ఫోను చేద్దాం. అది ఇంట్లో వుంటే ఇద్దరం వెళదాం'' అంది లావణ్య.
''దాని ఫోను నంబరు నాకు ఇవ్వు" అని ఫోను నంబరు తీసుకుని తరువాత కలుస్తానని చెప్పి  లేచాను. 
''అయ్యో! అదేంటే అప్పుడే వెళతావా'? భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పుకుందాం'' అంది లావణ్య.
''లేదే... ఇప్పుడు నాకు వేరే పనుంది. తరువాత తీరిగ్గా కలుద్దాం.ఇక్కడే వుంటాను కదా" అని అక్కడ నుంచి  బయలుదేరాను. 
                                                                    * * * * *
కారు ఎక్కి డ్రైవర్నిపేరడిగాను. 
''అష్రాఫ్''  అన్నాడతను. 
''అమీర్ పేట వెళ్ళాలి'' అన్నాను.
అర్ధగంటలోపే  ''అమీర్ పేట వచ్చామమ్మా'',అన్నాడు అష్రాఫ్. 
మెయిన్ రోడ్డు చాలా మారి పోయింది. "ముందుకు వెళ్లి అక్కడ లెఫ్ట్ కి వెళ్ళు!" అని చెప్పి రోడ్డు వంక చూస్తున్నాను. మా ఇల్లు దగ్గరవుతున్నకొద్దీ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఒళ్ళంతా చెమటతో తడిసి పోయింది.
''అష్రాఫ్! మెల్లగా వెళ్ళు''అన్నాను.
''ఏందమ్మా?".నా మాట గొంతు దాటి రాలేదని అర్ధమైంది. గొంతు పూర్తిగా గీర పోయింది.
కూడ తీసుకుని ''మెల్లగా వెళ్ళు'' అన్నాను.
''సరే అమ్మా!", అని బాగా మెల్లగా వెళ్తున్నాడు.
కుడి పక్కన రోడ్డుకి  తిరుగుతూనే కారు పక్కన పార్క్ చేసుకొమ్మని చెప్పి కారు దిగాను. 
మాఇల్లు అలాగే ఉంది. బాగా పాత బడింది.
పోషణ లేని మనిషిలా, మోడైన చెట్టులా, జరిగిన విషయాలకి సాక్షిలా అలా నిలబడి ఉంది.
'రంగులు వేసి ఎన్ని సంవత్సరాలయిందో' అనుకున్నాను.
గేటు పక్కనే వెలిసిన పాత బోర్డు.
"ప్రభుత్వ  బాలల సంరక్షణాలయం" డిపార్ట్ మెంట్  అఫ్ సోషల్ వెల్ ఫేర్, గవర్నమెంటు అఫ్ తెలంగాణ, బోర్డు చదివి కారు దిగి లోనికి వెళ్లాను.
''ఎవరూ కావాలమ్మా ?" అడిగాడు వాచ్ మెన్ . 
''ఇక్కడ వెంకటరావుగారు వాళ్ళు ఉండాలే ?వాళ్ళ ఇల్లు కదా ఇది?"
''అదేందమ్మా! చానా సంవత్సరాలు అయినాది నేను ఈడ  వాచ్ మెన్ గా చేయబట్టి. ఈడ  దిక్కులేని పిల్లలుంట రమ్మ. మీరు అడిగేటోళ్ళు ఎవరూ ఈడ లేరమ్మా'' అన్నాడు వాచ్ మెన్.
పక్కన వాళ్ళను కనుక్కుందామంటే ఇంటికి రెండువైపులా అపార్ట్ మెంటులు వెలిశాయి.  .
అంతా అయోమయం. ఏమీ తోచడం లేదు. తల తిరిగి పోతోంది. 
''సరేలే బాబూ' అని చెప్పిమళ్ళీ ఇంటి వంక చూసి కారు ఎక్కాను. 
నాకు తెలీకుండానే కళ్ళనుంచి నీరు చిందుతోంది. కళ్ళు తుడుచుకున్నాను.
''కళ్ళలో దుమ్ము పడిందామ్మా ?" అనడిగాడు అష్రాఫ్.
నేనేమీ సమాధానం చెప్పలేదు. మనసు, మనసులో లేదు, భారంగా వుంది .
'ఏమయ్యారు...అమ్మా,నాన్నా?' కీడు శంకిస్తోంది మనసు .
'లేదు, లేదు... '  వేరే ఇంటికి  'షిఫ్ట్' అయి వుంటారు' మనసుకు సర్ది చెప్పాను.
మనసు ఊరుకోవడం లేదు. 'షిఫ్ట్' కావడమేమిటి సొంతిల్లు కదా!' అని ప్రశ్నిస్తోంది. 
'అవునూ, ఇల్లు వదిలి ఎక్కడి కెళ్ళినట్లు? దీనికంతా నేనే కారణమా?' మనసు తొలిచేస్తోంది.
తల పగిలిపోతోంది. పిచ్చిఎక్కేలా వుంది. 
'అమ్మో, పిల్లలు, శశాంక్' మనసు హెచ్చరించింది. ఇంటికి చేరుతూనే స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చి దేవుణ్ణి మనస్పూర్తిగా ప్రార్ధించాను. శశాంక్ పిల్లలిద్దరికి అప్పటికే అన్నం తినిపించాడు. 
ఏమయిందన్నట్లుగా  నావంక ప్రశ్నార్ధకం గా చూసాడు శశాంక్ నావంక. .
మౌనంగానే సమాధానం చెప్పాను 'ఏమీ కాలేదని'!
''ఏమిటి  ఏమయింది, శశీ?" అంటూ దగ్గరి కొచ్చాడు,శశాంక్.
''మా ఇంట్లో ఓ అనాధ శరణాలయం వుంది. అదీ అయిదారు సంవత్సరాల నుంచి ఉందట.  
మా ఇంటికి  రెండువైపులా అపార్ట్ మెంటులు కట్టారు. పాత వారెవరూ కనిపించలేదు.
లావణ్యను కలిశాను. తనకి అమ్మా వాళ్ళు ఎక్కడికెళ్లిందీ తెలియదంది. లతని కలవాలి. 
సరే గాని నువ్వు తిన్నావా?" అని శశాంక్ ని అడిగి నేను కాసేపు పడుకుంటానని చెప్పి వచ్చి బెడ్ మీదకు చేరాను. పడుకోవడానికి మనస్కరించలేదు. లేచి 'లత'  నంబరు డయలు చేశాను.
''హలో, ఎవరూ'? "అవతలి గొంతు గుర్తు పట్టాను. వేరే పరిస్థితి అయితే కాసేపు ఆట పట్టించే దాన్నే.
''ఏయ్, లతా,ఎలా ఉన్నావే?"అడిగాను నేనెవరో చెప్పకుండా.
''ఎవరు, మాట్లాడేది?" లత గొంతులో అసహనం. 
నేను 'శిశిర' ను అన్నాను. 
''ఎవరూ?"
''నేనే, లతా! 'శిశిర' ను''.
''గాడ్! నువ్వా...ఎక్కడనుంచి  ఇండియాకి  ఎప్పుడొచ్చావు?" అంది ఉద్వేగంగా లత.
"హైదరాబాదులోనే వున్నాను. లావణ్య దగ్గర నుంచి నీ నంబరు తీసుకున్నాను"
''నువ్వెక్కడ?" అడిగాను నేను.
"ఇప్పుడే ఇంటికి చేరాను. జుబిలీ హిల్స్ లో ఇల్లు అడ్రస్ చెప్పింది.
''ఓ...పాతిల్లే కదా! నేను గంటలో వస్తానే, ఫరవాలేదా ? రావచ్చా'?"అడిగాను .
''రా! త్వరగా వచ్చేయ్ ! వెయిట్  చేస్తుంటాను'' హుషారుగా అంది లత.
ఒక గంటలో వస్తానని శశాంక్ తో  చెప్పి వెంటనే బయలు దేరాను.
క్రిందకు వచ్చేసరికి డ్రైవర్ లేడు. లంచ్ కి వెళ్లాడేమోనని అక్కడున్నసెక్యూరిటీ వాళ్ళని అడిగాను.
''బయట బడ్డీ కొట్టుకి  చాయ్ తాగనీకి పొయిండేమో... ఇప్పుడే పిలుస్తనమ్మా'' అంటూ సెక్యూరిటీ గార్డ్  పరుగెత్తి వెళ్లి అతన్ని పిలుచుకొచ్చాడు.
''చాయి తాగుదామని ఇప్పుడే ఎల్లినానమ్మా'' అన్నాడు డ్రైవర్.
''ఫరవాలేదు. జూబిలీ హిల్స్ వెళ్ళాలి'' అని చెప్పి  కారెక్కి డోర్ వేశాను.
అడ్రస్ చెప్పాను డ్రైవర్ కి. పదిహేను నిముషాల్లోనే ''వచ్చిన మమ్మా! ఇదే ఇల్లు" అన్నాడు డ్రైవర్.
ఇల్లు గుర్తు పట్టాను. చదువుకునే రోజుల్లో చాలా సార్లు వచ్చాను.
ఇంటికి పెద్ద గేటు. సెక్యూరిటీ గార్డ్ ఎవరని అడిగాడు 
పేరు చెప్పాను. సెల్యూట్ చేసి గేటు తెరిచాడు, కారు లోన పార్క్ చేసుకోమన్నాను. .
ఇంటి ముందు పెద్ద గార్డెన్. అందంగా వుంది. అంతా  తిరిగి  చూడాలనిపించినా సమయంలేక చూడలేదు. కారు దిగి ఇంటి వైపు చక చకా నడిచాను.
లత బయటే వుంది. ''ఏయ్,శశీ...ఎలావున్నావే'?" ఆత్రంగా పరుగెత్తి వచ్చి కౌగలించుకుంది. ఇద్దరమూ కాసేపు అల్లాగే ఉండి పోయాము.
''ఇంట్లోకి వెళ్లి మాట్లాడు కుందాం" అంది లత నా చేయి పట్టుకుని లోనికి నడుస్తూ.
''అమ్మా, నాన్నా,అన్న వాళ్ళు ఎలాఉన్నారు? ఇక్కడే వున్నారా?" లోనికి నడుస్తూ అడిగాను. .
''అందరం ఇక్కడే ఉన్నాము"
"నువ్వేంటి పెళ్లి.. '' నేనింకా అడగదలిచింది పూర్తిగాకుండానే ''నేనింకా పెళ్లి చేసుకోలేదు. చేసుకోను'' అంది ఖచ్చితంగా.
''అమ్మా, నాన్నా,అన్నయ్య, వదినా, పిల్లలు అందరు ఇక్కడే వున్నారు. చాలా? ఇవన్ని ఎలాగు అడుగుతావని ముందే చెప్పేశాను! 'కాఫీ, టీ, కూల్ డ్రింకా...  ఏం తాగుతావు ?" నర్మగర్బంగా అంది తన గదిలోకి నడుస్తూ. అదే గది! 
"కాఫీ తాగుదామే" అన్నాను నేను.
పై నుంచి రెండు కాఫీ తెమ్మని పురమాయించింది ''ఊ' ఇక చెప్పు!" అంది నా వంక సాలోచనగాచూస్తూ.
నేనే మొదలెట్టాను. వచ్చివారమయిందని, ఫ్యామిలీ విషయాలు, లావణ్యను కలిసింది అన్నీ క్లుప్తంగా చెప్పాను.
లత కూర్చున్నదల్లా లేచి కిటికీ దగ్గరికి వెళ్లి 'లాన్' లోకి చూస్తూ అంది.
"అమ్మను కలిసావా?" అడిగింది లత.
నా మనసు కీడు శంకించింది. నన్ను నేను తమాయించుకున్నాను. 
''లేదు.కలవలేదు! కలుద్దామని ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు లేరు. సరికదా ఆఇంట్లో
శరణాలయం ఉంది. అక్కడ ఎవరూ అమ్మా వాళ్ళ సంగతి ఎవరికీ తెలీదన్నారు'' నాకు తెలీకుండానే నాగొంతు గద్గద మయింది.
''వాళ్ళ సంగతి కనుక్కుందామనే నీ దగ్గరికొచ్చాను. నాకసలు దిక్కు తోచడం లేదు.
తొమ్మిది సంవత్సరాలయింది వాళ్ళని కలిసి. నా అంత దురదృష్టవంతులెవరైనా ఉంటారా?
ఎంత మంది ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు... కలిసి పోలేదు ? అంతా నా దురదృష్టం. 
నా గొంతు పూర్తిగా బొంగురు పోయింది. కళ్ళవెంట నీళ్లు ధారలుకట్టాయి. 
"అవును శిశిరా! దేవుడు అందరి నుదుటా ఒకేలా వ్రాయడు కదా!" అంది లత నిర్వికారంగా. .
కాఫీ వచ్చింది ఇద్దరం తాగాము.
''అమ్మ, వృద్ధాశ్రమంలోఉంది. కేశవగిరి దగ్గర !" అంది లత చాలా నార్మల్ గా. లత మాట  
వింటూనే  కాళ్ళ క్రింద  భూమి జారి పోతున్నట్లు అనిపించింది.
'లత' కిటికి లో నుంచి బయటకు చూస్తూ  మాట్లాడుతోంది ఇంకా.
''మొన్నీమధ్యనే వెళ్ళింది తను అక్కడికి. చాల కాలంనుంచి ఆ ఆశ్రమం లో వృద్ధుల సేవలో మమేకమైంది. రాజేష్  రెండు నెలల క్రిందనే ఎం ఎస్  చేయడానికి.అమెరికా వెళ్ళాడు  తమ్ముడటు వెళుతూనే అమ్మ  అపార్టుమెంటు నుంచి ఆశ్రమానికి షిఫ్ట్ అయింది. ఆశ్రమం నడపడంలో తనది చాల చురుకైన పాత్ర. అమ్మ అక్కడ ఒక్క రోజు లేకున్నాఆ వెలితి పూడ్చలేనిది అంటారు ఆశ్రమ నిర్వాహకులు'' అని ముగించింది లత.
నాకళ్ళ వెంట ధారలు కారుతున్నాయి కన్నీరు. తుడుచుకునేందుకు కూడ ప్రయత్నం చేయలేదు. 
''నాన్నగారు ఎక్కడున్నారు? అమ్మ ఆశ్రమంలో చేరడమేమిటి?" భయపడుతూ అడిగాను. 
''శశీ! నాకు నువ్వు చాలా సార్లు ఫోను చేశావు. ఇక్కడ జరిగిన సంగతులన్నీ నీకు చెప్పినా, నువ్వు బాధ పడడం మినహా చేయ గలిగిందేమీ లేదు. అందుకే విషయాలు నీ నుంచి దాచాను" అంది లత  తలవంచుకుని 'శిశిర' ముఖం వంక చూడకుండా.
''మీ అమ్మా, నాన్నా, నిన్ను పూర్తిగా విస్మరించారు. శిశిర అని ఒక కూతురు ఉందని ఉచ్చరించడం మానేశారు. నువ్వు వెళ్ళిన తరువాత మీ అమ్మానాన్న పరిస్థితి బాలేదని తెలిసి మీ ఇంటికి  చాలా సార్లు కలిశాను. నీ పెళ్లయిన కొన్ని నెలలకే మీ నాన్నగారు వ్యాపారం మానేశారు. ఇల్లు ప్రత్యేకంగా అనాధ పిల్లల సంరక్షణాలయం పెట్టాలని షరతుపెట్టి 'డొనేట్' చేశారు.
ఉన్న డబ్బంతా తమ్ముడి పేరున, తన చదువుకి కావలసినదంతా బ్యాంకులో వేశారు.
ఇప్పుడు అమ్మ ఉన్న ఆశ్రమం స్థాపించి భారీగా ధన సహాయం చేశారు. అక్కడ వంద మందికి పైగా వృద్ధులు, దిక్కులేని వయసు మళ్ళిన అనాధలుంటారు. అమ్మ  నాతో స్వయంగా చెప్పింది.  నువ్వు వెళ్ళినతరువాత కొన్నినెలలు పాటు మీనాన్నగారు నిద్ర పోలేదు.  నేను ఆయన్ని చివర రోజులు దగ్గర్నుంచి చూశాను. ఎప్పుడూ నిన్ను గురించే పలవరించేవారు. .
ఒక రోజు నన్ను అడిగారు ''నేను దానికి ఏం తక్కువ చేశాను? ఏనాడు అది అడిగింది కాదనలేదే? ఇలా ఎందుకు చేసింది? నా పెంపకం లోనే ఏదో పెద్ద తప్పు వుంది. నేనే ఏదో తప్పు చేశాను. లేకుంటే నాకూతురు అలా చేసి వుండేది కాదు'' అని కుమిలి, కుమిలి ఏడ్చారు. 
ఆయన్ని అలా చూడలేకపోయాను. అప్పట్లో నిజంగా నీ మీద చాలా కోపం వచ్చింది.  తినేవారు కాదు. చిక్కి శల్యమయ్యారు. అయన ఆరోగ్యం చెడింది. నీకు ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడి విషయాలు  చెప్ప వద్దని తన మీదనే  ప్రమాణం చేయించుకున్నారు. అలాగయితేనే నన్ను ఇంటికి రమ్మన్నారు.  
తరువాత నీ వెళ్ళిన  మరుసటి సంవత్సరంలో ఆయన పోయారు. 
'అప్పుడు నాకనిపించింది ఇక్కడి సంగతులు నీకు చెప్పేకన్నా బాధలో ఉన్న వారికి చేతనైన సేవ చేస్తూ వారికి దగ్గరగా ఉండడమే మేలనిపించింది.
"మా నాన్నగారు కూడా చెప్పారు.వెంకటరావు కూతురుకి చాలా 'అట్టాచ్డ్' కదా లతా! అతను ఈ 'షాక్' నుంచి కోలుకున్న దాకా వాళ్ళింటికి వెళ్తూఉండమని ! నువ్వేమీ ఏమనుకోవద్దు. నేను జరిగింది జరిగినట్లుగా చెబుతున్నాను. నీ పెళ్లి మీ కుటుంబంలో సమ్మూల మార్పులు తెచ్చింది. నా ఈ ప్రస్తుత జీవితానికి కూడా నాంది పలికాయి. అంటే నేనేదో నీ వల్ల సన్యాసిని నయ్యాను అనడం లేదు. నాకిష్టమైన జీవితం గడుపుతున్నాను. నేను నాపట్ల, నాజీవితం పట్ల పూర్తి అవగాహనతో, సంతోషంగా ఉన్నాను. ఒక విధంగా నీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఈ ప్రస్తుత జీవితంతో నిస్సహాయులకు సాయ పడుతున్నాను. కొన్ని దారి తప్పిన జీవితాలకు మార్గదర్శకం చేస్తున్నాను. నా జీవితంలో ఒక స్థిర నిర్ణయం తీసుకోవడానికి నీ జీవితం నాకు మార్గదర్శక మైంది. నిన్నుతప్పుపడుతున్నానుకోవద్దు. 
నిన్ను అంతగా  ప్రేమించిన తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు. 
నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళినంత మాత్రంతో 'మాజీవితం ఇక వ్యర్ధం' అనుకుని చేజేతులా  పచ్చని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకోవడం పెద్దవాళ్ళ తప్పు. అన్నట్లు మరిచి పోయాను.
ఇంకొక ముఖ్యమైన విషయం. 
నువ్వెప్పుడైనా తారసపడితే  నీకివ్వమని రాజేష్  ఒక లెటరు ఇచ్చాడు. వాడు ఎం.ఎస్  చేయడానికి అమెరికా వెళ్ళేటప్పుడు ఇచ్చివెళ్ళాడు. వాడు నన్ను'అక్కా'అని పిలుస్తాడు.
నీ పిల్లల్నినిన్ను,శశాంక్ ని, నాదగ్గర ఫోటోలలో చూస్తూనే వున్నాడు. వాడు నాకూ సొంత తమ్ముడే. వాడి విషయాలు కూడ కొన్నినీకు చెప్పాలి. కానీ ముందు వాడు నీకు ఇమ్మని ఇచ్చిన  లెటరు ఇస్తాను. అది చదువు. తరువాత మిగతా విషయాలు మాట్లాడుదాం" అని వెనక్కి తిరిగి 'శిశిర' వంక చూసింది లత.
రెండు చేతులతో ముఖం కప్పుకుని కంటికి,మింటికీ ఏక ధారగా ఏడుస్తోంది శిశిర. ఆక్షణంలో తనో దుఃఖ దేవత లా కనిపించింది. 
''ఏయ్ శశీ! ఏమిటది? తమాయించుకో. అయిందేదో అయింది. అంతా విధి వ్రాత!
''లత ఏమిటి, వేదాంతం ఏమిటి' ? అనుకుంటున్నావా? నేను నీకు తెలిసిన పాత లతను కాను. ముందు ఈ నీళ్లు తాగు" అని గ్లాస్ నీళ్లు అందించింది. 
పక్కనే కూర్చుని 'శిశిర' భుజాల చుట్టూ చేతులు వేసి వీపు రాస్తూ వుంది. చిన్న పిల్లలా  దాని ఒదిగి పోయాను. పెద్దగా ఏడ్చేశాను. బాధలో వున్నప్పుడు ఎవరైనా కొద్ది సానుభూతి చూపిస్తే, కన్నీళ్లు ఇదిగో మేము వున్నాం, అని వర్షిస్తాయి.
"శశీ! ఇదే జీవితం"అంటూ లేచి బీరువా నుంచి అంటించి ఉన్న ఎన్వలప్ ఇచ్చింది.
కవరు మీద  ఎర్ర అక్షరాలతో రాసి వుంది.
"అక్క కాని అక్కకు"  అని వ్రాసి వుంది.
 నా మనసే కాదు. ఒళ్ళంతా చాలా భారమైంది. ఆ కవరు అటు, ఇటు  తిప్పి చూశాను. అప్పటికప్పుడే కవరు  తెరిచి చదివే ధైర్యం చాలలేదు.
''శశీ, లెటరు ఇప్పుడు చదవకు. ఇంటికి వెళ్లి మెల్లగా చదువు. ఒక్కటి గుర్తుంచుకో ... స్నేహితురాలిగా ఒక సలహా ! ఈ పరిణామాల ప్రభావం నీ కుటుంబం మీద పడకుండా చూసుకో. 
తప్పులు చేస్తాం. మనం చేసిన  తప్పుఇంత పెద్దదా? ఇన్ని జీవితాలమీద  దాని ప్రభావం ఉంటుందా? ఇన్ని జీవితాల గమనం మారుస్తుందా? అన్న ఆలోచనముందే వస్తే మనం తప్పు చెయ్యం కదా! అందుకే మళ్ళీ మళ్ళీ గట్టిగా చెబుతున్నా! నేను చెప్పడమే కాదు. 
నిన్ను హెచ్చరిస్తున్నాను కూడా! 
అమ్మ దగ్గరికి రేపు వెళదాం. ఉదయం ఎనిమిది గంటలకల్లా నేను మీయింటికి వస్తాను. తయారై వుండు'' అంది లత  నా భుజం తడుతూ. .
మంత్రముగ్ధలా తలఊపాను నేను.   
''బయలుదేరు. రేపు కలుద్దాం!'' నా ముఖం లోకి  సూటిగా చూస్తూ అంది లత.
వెళ్లి కారెక్కి  ''ఇంటికి వెళదాం'' అన్నాను డ్రైవర్ తో..
అర్ధగంటలో ఇంటికి వచ్చాను. లత చెప్పిన మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
లేని హుషారు తెచ్చు కున్నాను. ముఖం మీద ఖేదం కన్పించకుండా జాగ్రత్త పడ్డాను.
బయటి  తలుపులు దగ్గరికి వేసి వున్నాయి. లోపలకి వెళ్ళానో లేదో, పిల్లలు చుట్టేసుకున్నారు.
'ఎక్కడికి వెళ్ళావమ్మా, ఇంత సేపు' మేము నీ కోసం ఎంత వెతికామో తెలుసా'? అన్నాడు బాబు.
శశాంక్  'లేప్ టాప్ ' తో  సహా బయటకు  వచ్చాడు.
''అదేంటి శశాంక్ పిల్లల్ని చూసుకుంటానన్నావు" ఏమిటి వీళ్ళ గోల అన్నాను మామూలుగా
ఏమీ లేదు. ఇప్పడి దాకా నాతోనే ఆడుతునే ఉన్నారు.
ఈ వెధవ అమ్మ కూచి. వందసార్లడిగాడు నువ్వెక్కడికి వెళ్ళావని. 'వీ' గేము ఆడాము.అది నిద్ర పోయి ఇప్పుడే లేచింది. 
''వెళ్ళిన పని ఏమయింది? కలిశావా అందరిని ? అమ్మా, నాన్నా, తమ్ముడు ఎలావున్నారు?"అని  అడిగాడు శశాంక్ .
నేను మౌనంగానే ఉండడంతో ''సరే, మేడం, మీ ఇష్టం వచ్చి నప్పుడు చెప్పండి'' అన్నాడు శశాంక్. నా మౌనానికి అర్ధాన్ని వెతుక్కుంటూ.
''ఒక్కటి చెప్పు' అంతా బావున్నారా?"
''లేదు. తరువాత చెపుతానన్నాను కదా!''.
వెళ్లి తల స్నానం చేసి, వేడిగా కాఫీ తాగి పిల్లలకి డిన్నర్ పెట్టేసి వచ్చి హాలులో శశాంక్ దగ్గర కూర్చున్నాను.
''భోజనం చేయలేదు, ఆకలిగా లేదా?" అన్నాడు శశాంక్.
''ప్చ్....లేదు శశాంక్! ఆకలి లేదు.మనశ్శాంతి లేదు. అంతా నావల్లే ...!" అన్నాను ఏడుస్తూ.
ఊహించని పరిణామంతో కంగారు పడ్డాడు శశాంక్. .
''నాన్నగారు పోయారు''
"వ్హాట్?" తను దిగ్గున లేచాడు. ఒళ్లోని 'లేప్ టాప్'  క్రిందకు జారింది. 
దాన్నిక్రింద పడకుండా ఒడిసి పట్టుకుని సోఫాలో పెట్టి ''ఏమైంది...ఎప్పుడు? ఎలా?" అని ఆరాతీశాడు చాల బాధతో ఆత్రుతగా.
''అమ్మ వృద్ధాశ్రమంలో చేరింది.తమ్ముడు అమెరికా వెళ్ళాడు" అంది శిశిర. 
శశాంక్ అడిగిన ప్రశ్నకు సమాధాన మివ్వ కుండానే!
''సారీ, శశీ! ఐ యాం  ఎక్సట్రీమ్లీ సారీ!ఓహ్ 'గాడ్!" అని అంటూనే  రెండు చేతులతో
తలపట్టుకుని ఒక్కసారిగా సోఫాలో కూలబడ్డాడు.
శిశిర' వంక సూటిగా చూడలేక పోతున్నాడు. శిశిర కళ్ళలో నీరు ప్రవాహంగా ధారలుగా స్రవిస్తూనే వుంది. తను వంచిన తల ఎత్తలేదు.
"నా వల్ల నా వాళ్ళు చెట్టు కొకరు, పుట్టకొకరు అయ్యారు. పచ్చని కుటుంబం నిలువునా కూలిపోయింది. నాన్న.. నా ప్రియమైన నాన్న...బోరు మంది శిశిర. 
ఇప్పుడు చేయడానికి ఇంక మిగిలిందేమీ లేదు. శశాంక్ ! అమ్మని కలిసి  తను ఒప్పుకుంటే మనింటికి తీసుకువస్తాను.ఏమంటావు?" అంది శిశిర' అభ్యర్ధనగా.
శశాంక్  తల ఎత్తి ''సారీ శశీ! మన పెళ్లి వల్ల  ఇన్ని దుష్పరిణామాలుంటాయని కలలోకూడా ఊహించలేదు. ఎప్పటికయినా కలుస్తారులే అనుకున్నా గాని, మీ కుటుంబం ఇంతగా విడిపోతుందని ఊహ కూడా రాలేదు. అలాకాదు శశీ ! తను ఒప్పు కుంటే తీసుకురావడం కాదు. అమ్మని  తప్పక తీసుకు రావాలి. మనవల్ల  ఆవిడ ఆశ్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా ఎవరికీ జరగ కూడదు. నేనూ వస్తాను మీ అమ్మగారి దగ్గరికి. ఆవిడను ఒప్పించే  ప్రయత్నం చేస్తాను. అది కూడ చేయకపోతే మనం మనుషుల కింద లెక్కరాము. ఈ బాధ మన జీవితాంతం నీడలా వెన్నంటే వుంటుంది. ఆ బాధ భరించడం నావల్ల కాదు. నీ వల్ల అసలే కాదు. మనం ఆవిడను ఒప్పించి తీసుకు రావాల్సిందే" ధృడంగా  అన్నాడు శశాంక్.
''లేదు, శశాంక్, అమ్మరాదు. మన దగ్గర వుండదు. తన మనసు విరిగి పోయింది నాకు తెలుసు.
ఈ జన్మకు ఈ బాధనుంచి విముక్తి లేదు' అంది శిశిర నిర్వేదంగా. 
''తప్పు చేశాం. దిద్దుకోవడానికి  మనస్ఫూర్తిగా ప్రయత్నం చేద్దాం. అధైర్య పడకు, అమ్మని తప్పక తీసుకు వద్దాం'' అన్నాడు శశాంక్. శశాంక్ మాటలు టానిక్ లా పనిచేశాయి.
శిశిర కు కొద్దిగా ధైర్యం వచ్చింది.
తమ్ముడి లేఖ శాంశాంక్ కి  చూపించడమా, లేదా? మనస్సులోనే తర్జన, భర్జన పడుతోంది శిశిర.
''ఇదిగో! ఇప్పుడేగా చెప్పాను, మళ్ళీ ఏమిటా ఆలోచన?" అన్నాడు శశాంక్.
''రేపు నీకు కుదురుతుందా శశాంక్  అమ్మ దగ్గరికి  రావడానికి ?  లత ఉదయాన్నే వస్తానంది. 
తనే అమ్మదగ్గరికి తీసుకెళ్తానంది. రేపు ఎనిమిది గంటలకల్లా తయారుగా ఉండమంది. 
ఆశ్రమం చాలా దూరమట. ఎక్కడో కేశవగిరి దగ్గరట!" అంది శిశిర
''కేశవగిరి దగ్గరా... ఆశ్రమం ?  చాలా దూరం. నేను వస్తాను.
''సరే, పిల్లల సంగతి ? ఓ పని చేద్దాం. అందరం కలిసే వెళదాం.  పిల్లల్ని అమ్మగారికి చూపించవచ్చు'' తనే అన్నాడు శశాంక్.
''మరి నీ ఆఫీసు? నా ఆఫీసు నాకు వదిలేయ్, నీకెందుకు చింత? సరేనా!"' అని లేప్ టాప్  ముందేసుకుని పనిలో పడ్డాడు శశాంక్.
తను చెప్పింది బాగానే వుందనిపించింది. అయినా మనసులో ఏదో శంక. ఎందుకయినా మంచిది.
లతతో చెపుతే మంచిది కదా, అని ఫోను చేసింది. ఎంతకూ తను ఫోను ఎత్త లేదు.
''భోజనం చేద్దాం శశాంక్!" ఆకలవుతోంది అంది శిశిర.
''నువ్వు తినేయ్ శశీ ! ప్లీజ్, నాకు పని వుంది నేను కాసేపాగి తింటాను' అన్నాడు శశాంక్.
శిశిర భోజనం త్వరగా ముగించేసి, చేసి పిల్లల గది లోకి వెళ్లి, దుప్పట్లు సరిచేసి,
గదిలోకి వచ్చి తమ్ముడి లేఖ తీసి కవరు తెరిచి బెడ్  మీద పడుకొని చదవడం ప్రారంభించింది.
                                                                     * * * * *
                                  ''అక్కా! నిన్నుఇలా సంభోదించడం కూడా నాకు ఇష్టం లేదు. 
ఎంత కాదనుకున్న నువ్వు తోబుట్టువ్వే కదా.  లతక్కే నాకు నిజ మైన అక్క అయితే బాగుండేదని  చాలాసార్లు అనిపించింది. కానీ దేవుడు మనం అనుకున్నవన్నీఇవ్వడుగా. నీ లాంటి వాళ్ళు దేవుడితో పోట్లాడి అయినా కావలసింది సాధించుకోగలరు. నాకంత శక్తి లేదు.
నేను లతక్కకి చాలా ఋణపడి వుంటాను. జీవితంలో నేను మనిషిగానిలబడి ఈ రోజు  ఎం ఎస్   చేయడానికి  అమెరికా వెళుతున్నానంటే ఇదంతా తన చలవే! 
నిజంగా నువ్వంటే నాకు కోపమేమీ లేదు. నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికొచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఆరోజున మొదలయింది నా పతనం. నాన్నగారు ఆరోజు తరువాత తిరిగి మళ్ళీ మామూలు మనిషి కాలేక పోయారు. ఇల్లు నరకం గా ఉండేది. ఒకళ్ళతో ఇంకొకరు మాట్లాడే వాళ్ళం కాదు. ఉన్నది ముగ్గురం. ఇంట్లో ఎప్పుడూ  భయంకర నిశ్శబ్దం.
ఓ పండుగా లేదు. ఓ సెలేబ్రేషను లేదు. నేను మాట్లాడినా ఏదో ముక్తసరిగా మాట్లాడే వాళ్ళు.
డబ్బుకు తక్కువ లేదు. నాన్నగారు అడగ్గానే ఇచ్చేవారు. జాగ్రత్తగా చదువుకో, అనేవారు. 
ఆమాటొక్కటే అయన నాతో చనిపోయే వరకు మళ్ళీ,మళ్ళీ మాట్లాడిన మాట. 
అమ్మకు పూజలు,ఆశ్రమాలు ఎక్కువయ్యాయి. ఇంటిపట్ల ఉండేదికాదు. 
నాన్నగారు ఇల్లు దానం ఇచ్చేశారు. వేరే ఇంటికి మారేము. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే వాడిని. నాకు కాకూడని అలవాట్లు అయ్యాయి. ఒక సారి మోటర్ సైకిల్ ఆక్సిడెంట్ అయింది. నాకు ఒళ్ళంతా గాయాలు నాలుగు ఫ్రాక్చర్లు అయ్యాయి. లతక్క వాళ్ళ అన్న నన్నుహాస్పిటల్ లో చేర్పించారు. అక్క నన్ను చూడ్డానికి తరచూ హాస్పిటల్  కి వచ్చేది.  నాకు  గాయాలు మానిన   తరువాత మూడు నెలలు పాటు  'రిహేబిలిటేషన్'  ట్రీట్ మెంటు ఇప్పించింది.
నీ పెళ్ళయిన  దగ్గరనుంచి నీవు 'లతక్క'తో కాంటాక్ట్ లో వున్నట్లు, తనతో తరచూ  మాట్లాడుతున్నట్లుగా కూడా అక్క చెప్పింది. తాను నీతో మాట్లాడమంది. నేనే నీతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఈ లెటరు నీకు ఇమ్మని చెప్పాను. 
ఈపాటికి నీకు సంగతులన్నీ తెలిసి వుంటాయి. జరిగిన ఈ పరిణామాలన్నిటికీ నువ్వే బాధ్యురాలివని నేను అనడం లేదు. 
ఈ విషయమై  నేను, లతక్కా చాలా సార్లు వాదించుకున్నాము. లతక్క ఎప్పుడు నీ పక్షాన వాదించేది . ఈ విషయం ఎప్పుడూ నాకూ అర్ధం అయి కానట్లుగానే వుండేది. దాన్ని అలాగే వదిలేశాను. మనం ఎప్పుడయినా కలుస్తామా లేదా అన్నది కూడ నాకు ఊహకు అందని విషయం.
అందుకే అన్నీ కాలానికి వదిలేయడమే మంచిది! పిల్లలకి నేను తెలుసా ? 
శశాంక్ గారిని అడిగినట్లు చెప్పగలవు. ఇక వుంటాను.
తమ్ముడు.
                                                                       * * * * *
లత ఉదయం  సరిగ్గా ఎనిమిదిగంటలా కల్లా వచ్చింది. 
తను వస్తూనే ''హాయ్, లతా! ఎలా వున్నారు? " కుశల ప్రశ్నలు వేశాడు శశాంక్.
''ఐ  యాం  ఫైన్'' అంటూ ఇన్ని సంవత్సరాల తరువాతనా ఇండియా కి వచ్చేది?" అంది లత సరదాగా.
"అవును. రాలేక పోయాము'' అన్నాడు శశాంక్ నొచ్చుకుంటూ.
''కాని లతా! మీరు చాలా అన్యాయం చేశారు మాకు.శిశిరతో కాంటాక్ట్ లో ఉండి కూడా ఇక్కడ విషయాలు ఏమీ తనతో చెప్పలేదు. కనీసం వాళ్ళ నాన్నగారు.... '' అన్నాడు  శశాంక్  సీరియెస్ గా.  .
నేను కల్పించుకుని ''లేదు శశాంక్! తన తప్పు లేదు. అమ్మా వాళ్ళు ఇక్కడి విషయాలు నాతో ఏమీ చెప్పవద్దని తన దగ్గర మాట తీసుకున్నారు '' అంది శిశిర.
''అయితే మాత్రం.తను నీ క్లోజ్  ఫ్రెండ్  కదాతాను ! నాన్నగారు చనిపోయిన విషయం కూడా చెప్పలేనంత దాపరికమా ? లతా! మీరు ఆ ఒక్క కబురయినా తనకు చెప్పాల్సింది. 
తను జీవితాంతం బాధపడే విషయమది'' నిక్కచ్చిగా అన్నాడు శశాంక్.
శశి వారించ బోయి ఏమనుకుందో ఊరుకుండి పోయింది.
''నిజమే... అది నాతప్పే! వాళ్ళ కిచ్చిన మాట ఈ ఒక్కవిషయం లోనైనా నేను ఖాతరు చేసి వుండాల్సింది కాదు. నువ్వన్నది కరెక్టే... శశాంక్! నాది .ముమ్మాటికి పెద్ద తప్పే'' నొచ్చుకుంటూ అంది లత. .
''సారీ లతా! మిమ్ముల్నినొప్పించాలని కాదు. నాకే ఆవార్త పెద్ద షాకు. ఇక శిశిర విషయం వేరే చెప్పాల'?... " అన్నాడు శశాంక్.
''టైం అవుతోంది. ఇక బయలుదేరుదామా'?" అంది లత టాపిక్ మారుస్తూ.
''లతా! పిల్లలూ, శశాంక్ కూడా వస్తారు అమ్మదగ్గరకు'' అంది శిశిర.
''నేనూ అదే చెబుదామనుకున్నా'' అంది లత.
''అందరం మా కారులో వెళ్దాం''! అన్నాడు'' శశాంక్.
దాదాపు గంట పైన పట్టిందిఆశ్రమం చేరే సరికి. కారు పార్క్ చేసి అందరం దిగాము.
యధాప్రకారం నాకు గుండె దడ మొదలయింది. నేను బాబు చేయి పట్టు కుని నడుస్తున్నాను. శశాంక్ పాపని నడిపిస్తున్నాడు. 
ఆశ్రమం ప్రశాంతంగా వుంది. త్రోవ రెండు వేపులా పెద్ద చెట్లు. వాటి మొదళ్ళ చుట్టూ అరుగులు,
ఆ అరుగుల మీద కొందరు కూర్చుని, ముడుచుకుని పడుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు.
కొందరు న్యూస్ పేపర్లు చదువుతున్నారు. కొందరు 'కేరమ్స్' ఆడుతున్నారు. చిన్నచిన్న కుటీరాల్లా కట్టారు. ఆశ్రమం చాల పెద్దది. మూడు పెద్ద బిల్దింగులు, చిన్న చిన్న కుటీరాలు చాలానే  వున్నాయి. లత ఆఫీసు వైపు నడుస్తోంది. లోపల దాదాపు వంద గజాలు నడిచి ఉంటాము.
పాపని ఎత్తుకుని నడుస్తూ నన్నేగమనిస్తున్నాడు శశాంక్.
'లత' ఆఫీసు లోనికి వెళ్లి రెండు మూడు నిముషాలయింది. తను ఒక్కతే తిరిగి వచ్చి మమ్ముల్నిఒక  రూముకి  తీసుకు వచ్చింది.లోపల చల్లగా వుంది చుట్టూ చెట్లు వుండడం వల్ల అనుకుంటాను. లోపల రెండు బెడ్స్, ఒక టేబులు,రెండు కుర్చీలు వున్నాయి. .
బాత్ రూం వుంది. రూము చాలా శుభ్రంగా వుంది. 
నా మనసంతా ఉద్విగ్నంగావుంది. అమ్మ ఎలా రియాక్ట్  అవుతుందో, నేను ఎలా రియాక్ట్ అవాలో అర్ధం కావడం లేదు. దానికి తోడు కడుపులోనుంచి తన్నుకొస్తున్న బాధ. ఏడుపు!
పావుగంట పైన అయింది. ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. ఎవరో కుర్రాడు వచ్చిమంచినీళ్లు,టీ,బిస్కట్స్ఇచ్చివెళ్ళాడు.బయటనుంచి మాటలు వినబడుతున్నాయి. ఒకరి మాట అమ్మదే. గుర్తించాను. మాటలు ఆగిపోయాయి. 
అమ్మలోనికి వచ్చింది. ఆమె ముఖం ప్రశాంతంగా వుంది. 
ఎటువంటీ భావనా అమ్మ ముఖంలో నాకు కనుపించలేదు. 
నాకు ఏడుపు ఆగడం లేదు. కళ్ళ వెంట నీరు కారుతూనే వుంది.
''శిశిరా బావున్నావా అమ్మా! ఇద్దరు పిల్లలు కదా!" లత చెప్పింది.
''బావున్నావా బాబూ? ఎప్పుడు వచ్చారు హైదరాబాదు?" శశాంక్ ని పలకరించింది అమ్మ.
శశాంక్ వంగి అమ్మ కాళ్ళకు నమస్కరించి పిల్లలిద్దరితోను నమస్కారం చేయించి ''అమ్ముమ్మ'' అని చెప్పాడు. అమ్మ పాపని దగ్గరకు తీసుకుని ''నీ పేరేంటి ?" అని అడిగింది.
అది వాళ్ళ నాన్న కాళ్ళని చుట్టేసుకుంది.
''నీ పేరేంటి బాబూ?"బాబుని అడిగింది అమ్మ. 
''వెంకట్'' వెంటనే సమాధాన మిచ్చాడు వాడు స్పష్టంగా.
''అమ్మా!'' అన్నాను నేను. నా వైపు చూసింది అమ్మ.
అమ్మ కలివిడి చూసి నాకు దుఃఖం పొంగుకు వచ్చింది.
నేను నాకు తెలీకుండానే లేచి అమ్మా కాళ్ళు  చుట్టేసుకుని ''నన్ను క్షమించమ్మా!"అని బోరుమన్నాను.
అమ్మ చాలా సున్నితంగా మందలిస్తూ ''లే శిశిరా...ఏమిటిది?  పిల్లలు భయ పడతారు".అంటూ భుజాలు పట్టుకుని లేపింది నా వీపు నిమురుతూ. ఆ క్షణం నేను పొందిన ఆనందం, అమ్మ స్పర్శ  అనిర్వచనీయం. ఈ 'ఆనందం' కోసం ఈ తొమ్మిదేళ్లు ఎదురు చూశాను.
నేను కళ్ళు  తుడుచుకుని ''అమ్మా! క్షమించమని అడిగే హక్కు లేదు నాకు. నా మూలంగానే ఇన్ని అనర్ధాలు జరిగాయి. కుటుంబం ఇలా చెట్టు కొకరమయ్యాము'' అన్నాను నేను బాధగా తలవంచుకుని.
''ఎందుకు అలా అనుకుంటున్నావు?"
''ఇలా జరిగేవన్నీమనవల్ల వల్ల జరిగాయనుకుంటే ఇక దేవుడు... సృష్టి అంతా మనచేతుల్లో ఉన్నట్లే గదమ్మా! మీ లాగా ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు? అందరికీ ఇలాగే అయిందా.... కాదు కదా! ప్రతిమనిషికి  నొసటన  ఏమి వ్రాసివుందో అదే జరుగుతుంది. తెలీసీ, తెలియక ఎన్నో అనుకుంటువుంటాం. అల్పులం కద !" అంది  అమ్మ చాలా మామూలుగా.
అమ్మ మాట్లాతున్నంతసేపు అమ్మనే చూస్తూ వున్నా. ప్రశాంతంగా ఉందామె. 
''నేనిప్పుడే .పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకు వస్తాను" అంటూనే  బయటకు వెళ్ళింది అమ్మ.
నాకు నెత్తి మీదనుంచి వేయి ఏనుగుల బరువు దించి నట్లయింది. మనసు కొద్దిగా కుదుట పడ్డది.
ఒ పావు గంట తరువాత అమ్మ వచ్చింది. అందరికి టిఫెన్లు వచ్చాయి.
''అమ్మా! నీతో కొద్దిగా మాట్లాడాలి. చేసిన తప్పుకు ఫలితంగా నాన్నను పోగుట్టుకున్నాను. తమ్ముడు, నువ్వు, మన కుటుంబం కోల్పోయిన దానికంతా నేనే బాధ్యు రాలిని. ఆ తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయను. ఎవరు కాదన్నా నాకు నేను దోషినే''.దానికి ఫలితం నేను  అనుభవించాల్సిందే!
లత, శశాంక్ ఇద్దరు లేచి బయటకు వెళ్ళడానికి  ఉద్యుక్తులయ్యారు.
"ఎవరు బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. అమ్మా! నీతో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు"
'నేను,శశాంక్, నిన్ను  ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాం.   నీతోనే మేముండాలని మాకోరిక!
"అవును ఆంటీ! మా తెలిసీ తెలియని నిర్ణయంతో ఏమి కోల్పోయామో, కోల్పోయిన దాకా తెలవ లేదు.మమ్ముల్ని మేము క్షమించుకోలేని ఈ క్షణం వస్తుందని ఎప్పుడూ వూహించలేదు.
మమ్ముల్ని క్షమించమని అడిగే అర్హత మాకు లేదు. దానికి పరిహారంగా మిమ్ముల్ని మాదగ్గరికి రమ్మని అంటున్నామని మీరు అనుకోవద్దు.మిమ్ముల్ని కాపాడు కోవడమే మా బాధ్యత. .
ఇప్పటికే మామయ్యగారిని, కుటుంబాన్ని కోల్పోయారు మీరందరు. ఇక నైనా సంతోషంగా వుండాలని మాకోరిక. అందుకే మీరు ఇక్కడ అంతా సెటిల్ చేశాక అందరం కలిసి ఉండాలని మా కోరిక. మీరు దయచేసి  రాను అనవద్దు" వేడికోలుగా అన్నాడు శశాంక్.
శిశిర కృతజ్ఞతాపూర్వకంగా చూసింది శశాంక్ వంక.
''పిల్లలూ! వినండి. నేను ఇందాక చెప్పాను, ఇదివరకు లతతో చెప్పాను.
శిశిర మీద నిజంగా నాకు కోపం ఏమీ లేదు. అప్పుడేమైనా అని ఉంటే అది ఆక్షణం వరకే.
జరగవలసినది జరిగింది. అందులో మీ తప్పు, నాతప్పు అని ఏమీ లేదు.
ఎవరి కర్మ ఎలావ్రాసివుందో అలా జరిగింది. జరుగుతుంది. ఇది వేదాంతం కాదు.
ఇంత కంటే ఏమీ చెప్పదలుచుకో లేదు. ఇక నేను ఇక్కడనుంచి షిఫ్ట్ కావడమంటూ జరిగేపనికాదు. అది సాధ్యం కాదు.  ఇక్కడ నాకు చాలా బాధ్యతలు వున్నాయి. దిక్కులేని వాళ్ళు ఈ ఆశ్రమంలో చాలామంది ఉన్నారు. ఇక్కడి విషయాలన్నీ లతకు విపులంగా తెలుసు. 
పిల్లలు పట్టించు కోని తల్లులు, తండ్రులు, అనాధలూ, అన్నీవుండి ఆదరణ కరువైన వాళ్ళు ఇలా చెబుతూపోతే  వినడానికే బాధగా వుంటుంది. ఇంకొక విషయం నిర్మొహమాటంగా చెపుతాను.
ఇక్కడ వీళ్ళందరికీ నా అవసరం వుంది.
నా కోసం, నేను సుఖంగా వుండడం కోసం, నేను ఇప్పుడు ఎక్కడికీ రాలేను. నా కేమి బాధల్లేవు. నాకు ఇక్కడ మనశ్శాంతి వుంది. ఇంకొంతమందికి మనశ్శాంతి కల్పిస్తున్నామని నా విశ్వాసం.
మీ ఈరాక తో, మీ పిలుపుతో నన్ను, నావిశ్వాశాన్ని సడలించే ప్రయత్నం చేయకండి.
వీలున్నప్పుడు తప్పక మీ ఇంటికి వస్తాను. పిల్లలతో గడుపుతాను. మీకు వీలున్నప్పుడు ఇక్కడికి  ఎప్పుడయినా రావచ్చు. నా ఈ శేష జీవితం ఈ ఆశ్రమానికే అంకితం! 
మళ్లీ, మళ్ళీ చెబుతున్నాను శిశిరా! నీ మీద నాకు కోపం లేదు. నువ్వుకూడా జరిగిన దానికి 'నేనే'  బాధ్యురాలినని నిందించుకోవద్దు. ఆత్మనింద మంచిది కాదు. నేను ఇప్పుడు చెపుతున్న ప్రతి మాట నిష్కల్మషంగా చెపుతున్నవే.
ఇంకొక విషయం శిశిరా!. తమ్ముడు యు.ఎస్. వెళ్ళాడు తెలుసుకదా!
వాడి భవిష్యత్తు ఇక మీ బాధ్యత. వాడితో మాట్లాడుతాను.నీతోమాట్లాడమని, నీతో కాంటేక్టులో ఉండమని చెబుతాను.
''శిశిరా! ఇది పిల్లలకి'' అంటూ ఒక కవరు ఇచ్చింది అమ్మ, నా చేతికి. ఇక వెళ్తాను. నాకు పనులున్నాయి" అని తను వెళ్లి పోయింది.
అమ్మలో ఎంత మార్పు. ఎంత ప్రశాంతత! 
"థాంక్ యు లతా! నీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడం లేదు" అని లతని కౌగలించుకుంది శిశిర. 
"ఇక బయలుదేరుదామా?" అంది బయటకు నడుస్తూ లత 
"గాడ్! అ యామ్ సో గ్రేట్ఫుల్ టు యు" అనుకుంటూ అమ్మ వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉండి పోయాను. శశాంక్ నన్ను భుజం తట్టాడు బయటకు నడుస్తూ. 
                                                 
                                                         --------సమాప్తం--------

రచన:-  
కేశిరాజు వెంకట వరదయ్య.
mob.no..9849118254

27, జులై 2025, ఆదివారం

                                                       చిలకలగూడ రైల్వే బ్రిడ్జ్  

                                                    -------------------------------------  
                     ( ఈ క్రైమ్ కథ  'మార్చి, ఏప్రిల్' 2013  రెండు  నెలలు  'ఆంధ్రభూమి'    
మాసపత్రిక లో ముద్రితమైనది) 
                                              

ఉదయం అయిదు గంటలయింది. 
అలారం నాలుగున్నర గంటలకి పెట్టుకుని పడుకున్నాను. మెలుకువ రాలేదు. గోదావరి ట్రెయిన్ కి మా ఫ్రెండ్ 'శ్రీహర్ష' వైజాగ్ నుంచి వస్తున్నానని ఫోను చేశాడు. 
'గోదావరి ట్రెయిన్ సాధారణంగా అయిదున్నర, ఆరుగంటలలోపే సికిందరాబాద్ వచ్చేస్తుంది' అనుకుంటూ త్వర త్వరగా బ్రష్ చేసుకుని బైక్ స్టార్ట్ చేసి బయలు దేరాను. బయటకు వచ్చిన తరువాత గాని తెలవలేదు. బయట మసక మసకగా వచ్చీ రాని వెలుతురుతో బాగా చల్లగా వుంది. 'స్వెట్టర్ వేసుకుని రావాల్సింది. పదిహేను నిముషాల్లోపే స్టేషను చేరుకుంటాలే పర్లేదు' అనుకుంటూ బైక్ అక్సిలరేట్ చేశాను. 
మెట్టుగూడ చౌరాస్త, రైల్ బ్రిడ్జిదాటి చిలకలగూడ వైపు తిరిగాను. అక్కడే ఇంకొక రైల్ బ్రిడ్జి వుంది. అది సింగిల్ లేన్. అకస్మాత్తుగా బైక్ స్కిడ్ అవుతూ సర్రున జారి పడింది. బాలన్సు చేసుకుంటూ ఎడమ కాలు రోడ్డు మీద బలంగా మోపి 'రైల్ బ్రిడ్జి రాంప్' మీదకు గెంతాను. రాంప్ మీద గడ్డి ఏపుగా పెరిగి గుబురుగా వుంది. గెంతుతూనే వీధి వేపర్ లాంప్ వెలుగులో గడ్డిలో పడి ఉన్న చిన్న లెదర్    హాండ్  బ్యాగ్  గమనించాను. 
'దుమ్ముపట్టిన గడ్డి గుబురుగా ఉండడంతో బ్యాగును  ఎవరు చూసినట్లు లేదు. అందుకే అలా పడివుంది' అనుకుంటూ దాన్ని అందుకోవడానికి ఒంగుతునే బాంబేమైనా వుందేమోనాని అనుమానం వచ్చింది. బ్యాగు గడ్డిలోనుంచి తీస్తూ అటుఇటు గమనించాను. రోడ్డు నిర్మానుష్యంగా వుంది. బ్యాగు జిప్  సున్నితంగా తీసి చూశాను. కేష్ చాలావుంది. నోట్లకట్టలు తడిమి చూశాను. దాదాపు అన్నీ వేయి రూపాయల కట్టలు. డబ్బు లక్షలలో ఉన్నట్లుంది. ఒక   బ్రాండ్ న్యూమొబైల్ ఫోను కూడా ఉంది.  భయం అనిపించింది. టైం చూసుకున్నాను.
'ట్రైన్  వచ్చేసుంటుంది. బయటకు రాగానే కనిపించకపోతే హర్ష గాడు చంపేస్తాడు' అనుకుంటూ బ్రిడ్జి రాంప్ మీద నుంచి కిందకు దిగాను. కాలు సర్రున జారింది. రాంప్ గట్టు పట్టుకుని మళ్ళీ బేలన్సు చేసుకున్నాను. నా పాదం పూర్తిగా నేల మీద  గడ్డ కట్టిన రక్తం మడుగులో పడింది. 
నీచు వాసన. జీవితంలో ఇదే మొదటిసారి అంత రక్తం చూడడం. మనసులో తీవ్ర ఆందోళన మొదలయింది. ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు.  
కింద పడ్డ బైక్  ని పైకె త్తి,  దొరికిన జిప్ బ్యాగుని సైడ్ ' బాక్సు లో పెట్టి మళ్ళీ  రోడ్డు మీద రక్తం వంక నిశితంగా చూశాను. రక్తం పల్లానికి ధార కట్టింది.    ఒళ్ళు గగుర్పొడిచింది. 
బయలుదేరి  నిముషంలో 'బోయిగుడ' వైపునున్న సికింద్రాబాద్ స్టేషనుకి చేరి మేము కలుద్దామనుకున్నచోట  బైక్ పార్క్ చేసి నిలబడ్డాను. మనసింకా కుదుట పడలేదు. 
ఇంకా ట్రైన్ వచ్చినట్లు లేదు. ముందు ఓ కప్పు  'టీ' పడితే గాని బుర్ర పనిచేయదు' అనుకుంటూ రెండడుగులు వేశాను. బ్యాగ్ గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగానో  లేదో దూరం నుంచి పోలీసు కానిస్టేబుల్ ''వో భాయి సాబ్ వాహా సే గాడి నికాల్డో'"' అంటూ చేతిలో లాఠి ఊపుకుంటూ బిగ్గరగా పిలుస్తున్నాడు.. 
'' గాడీ అభీ నికాల్ రుం'' అని అక్కడ్నుంచి   బైక్  తీసి ముందుకు వచ్చి ఒక పక్కగా బైక్ స్టాండ్ వేసి ఆనుకుని నిలబడ్డాను. 
ఇంతలో ఏదో ట్రైన్ వచ్చినట్లుంది. మెల్లగా జనం బయటకు వస్తున్నారు. ఆటోలు, కార్ల హడావుడి కనబడుతోంది. 
ఇంతలో "గోదావరి కొద్దీ నిముషాలలో ప్లాట్  ఫామ్  నంబరు రెండు కు వచ్చును" అని మూడు భాషల్లో  అనౌన్సుమెంట్ వినిపించింది. కొద్దిగా టెన్షన్ తగ్గింది. టీ కొట్టు దూరంగా కన్పించింది. బైక్ తీసుకుని  బడ్డి కొట్టు దగ్గరికి వచ్చి'టీ' తీసుకుని  ఆస్వాదించడం మొదలెట్టాను. 
టీ  కొట్టు దగ్గర జనాల్ని చూస్తూ  అనాలోచితంగానే నా మనస్సు గతంలోకి వెళ్ళింది.
                                                                * * * * *. 
నేను, శ్రీహర్ష క్రితం ఏడు సంవత్సరాలుగా మంచి స్నేహితులం. ఇద్దరం చెన్నై దగ్గర 'గుమ్మడిపూండి' లో ఇంజనీరింగ్ ,బి.ఇ  చేశాము. ఇద్దరం ఒకె కంపనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ గా చేరాము. వాడేమో వైజాగ్ బ్రాంచిలో, నేను హైదరాబాద్ లో పని చేస్తున్నాము. వాడికి  మొదట్నుంచి హైదరాబాద్ అంటేనే భయం. చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడ కర్ఫ్యూలో ఇరుక్కున్నాడట. అదీ సంగతి!
'ఇప్పుడు వాడికి ఈ డబ్బు దొరికిన విషయం చెప్పాలా లేదా? అసలే చాదస్తుడు.భయస్తుడు. 
చెపుతే ఎలా రియాక్ట్ అవుతాడో.నాకే అయోమయంగా వుంది. వాడిక్కడ నా రూంలోనే పదిహేను రోజులు ఉంటాడు. ట్రైనింగ్ కి వచ్చాడు. ఏం చేయాలి?' అని ఆలోచిస్తూ టీ గ్లాస్ అక్కడవుంచి బైక్ వెనక్కితిప్పుతూ వెనక్కు చూశాను. 
శ్రీహర్ష దూరంగా ఇటు వస్తూచేయి ఊపుతూ కన్పించాడు. సూట్ కేసు లాక్కుని వస్తున్నాడు. నేను చేయి ఊపాను.
'అమ్మయ్య!.ముందిక్కడనుంచి బయటకు వెళ్ళాక ఇద్దరం కలిసి ఆలోచిస్తే ఏదైనా మార్గం తోచక పోదు' అని వాడికి విషయం చెప్పాలనే నిర్ణయించుకున్నాను. 
మరునిముషంలోనే నెత్తిమీద నుంచి టన్నుబరువు తీసేసి నట్లయింది.
ఇంతలో ''ఏరా చాలా సేపయిందా వెయిట్ చేయబట్టి' ట్రైన్ పావుగంట లేటు.
''పద వెళదాం'అన్నాడు శ్రీహర్ష నా సమాధానం కోసం వెయిట్ చేయకుండానే.. బండి వెనకాల ఎక్కుతూ "అదేంటిరాపేంటు కింద అంత  ఎరుపుగా బ్లడ్ లాగా వుంది.  లెఫ్ట్ చెప్పు నిండా బ్లడ్. ఏమయిందేమిటి ? బైక్ మీద నుంచి  పడ్డావా ? దెబ్బలు  లేమైనా తగిలాయా ?" అన్నాడు నన్ను నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూస్తూ. 
'గాడ్! ఇప్పటి వరకు ఈ మరకలు నేను చూడలేదు.రక్తపు మరకలు పేంటు మీద చెప్పులనిండా వున్నా నేను ఇప్పటిదాకా చూసుకోలేదు. నీచు వాసన వస్తోంది.ఇదన్నమాట.టెన్షన్  లో 
గమనించలేదు' అనుకున్నాను. .
''అవునురా!స్టేషను కి వస్తూంటే బండి స్కిడ్ అయి పడ్డాను. దెబ్బలేమీ తగల్లేదు.  కానీ నేను పడ్డ చోట ఏదో ఆక్సిడెంట్ అయినట్లుంది. రోడ్డుమీద చాలా రక్తం గడ్డకట్టి వుంది. ఆ రక్తం మీదనే బండి స్కిడ్ అయింది. ఇంటికివెళ్లి మాట్లాడ దాం. ముందు బైక్ ఎక్కి .సూట్ కేసు మధ్యలో పెట్టు.కొద్దిగా వెనక్కి జరిగి కూర్చో.జాగ్రత్త!" అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి పావుగంటలో ఇంటికి చేరాం. 
బైక్ పార్క్ చేసి  జిప్ బ్యాగు తీసుకుని లోపలకి తెచ్చి సూట్ కేసులో పెట్టి, బట్టలు మార్చుకుని చెప్పులు శుభ్రంగా కడిగేశాను. పేంటు, షర్టు రెండు తడిపి డిటర్జెంట్ లో వేసి నాన బెట్టాను. ఇంతలో హర్ష మంచి కాఫీ రెడీ చేశాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాఫీ త్రాగాం. 
"ఏమిటిరా! అంత పరధ్యాన్నంగావున్నావు. ఒంట్లో బాలేదా?" ఆదుర్దాగా అడిగాడు.
''అబ్బే..అదేం లేదు.  బానే వున్నాను'' అని సర్ది చెప్పాను.
ఇద్దరం స్నానం చేసి టిఫెన్ చేశాము.
నేనింకా  అయోమయంలోనే వున్నాను. ఏంచెయ్యాలో అర్ధం కాని పరిస్థితి.
'ఏమైనా సరే...వీడికి జరిగినదంతా చెప్పి, బ్యాగు తీసిఅంతా క్షుణ్ణంగా చూశాకనే ఈ విషయంలో ముందుకు ఎలా పోవాలన్నది నిర్ణయం తీసుకోవాలి. విషయం దాచకూడదు. ఇంక  టైం వేస్టు చెయ్యడం మంచిది కాదు. బ్యాగులో ఉన్న కేష్ తో ఎవరి జీవితాలు ముడివడి వున్నాయో,
ఏ క్రైం కేసు ముడిపడి ఉందో ? పోలీసు రిపోర్ట్ ఇవ్వదామా లేదా ఇద్దరం చర్చించి  నిర్ణయించు కున్నాక  కేష్  ఎవరిదో  వారికి  అందచేస్తే అంతమంచిది" అని నిర్ణయించుకోవడమే తరువాయి ''రేయ్ నీతో ఒక విషయం మాట్లాడాలిరా'' అన్నాను శ్రీహర్షతో.
''నాకు తెలుసు. ఏదో విషయం నీ మెదడు తొలిచేస్తోందని ! ఏమైనా ప్రేమ వ్యవహారమా ఏమిటి ?" కన్నుగీటి, నవ్వుతూ అడిగాడు శ్రీ హర్ష.
''లేదురా! జాగ్రత్తగా విను!" అని జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పి "ఇప్పుడు ఏం చేద్దాం ?" అని సీరియస్ గా సలహా అడిగాను.
శ్రీహర్ష మౌనంగా చెప్పిందంతా విని నోట మాటరాక చిత్తరువులా అయిపోయాడు. 
నాకు మాత్రం చాలా రిలీఫ్ వచ్చింది. గాలి తీసిన బెలూన్లా అయింది నా పొట్ట.
"అరేయ్..హర్షా!" వాడిని తడుతూ గట్టిగా అరిచాను.
శ్రీహర్ష ఉలిక్కిపడి '' నీ ఎంకమ్మ ! ఇదే కారణం. మీ హైదరాబాద్ రావాలంటేనే నాకు భయం  ఇక్కడికి వచ్చిన  ప్రతిసారి  ఏదో ఒకటి జరగాల్సిందే! ఇంతకీ ఆ బ్యాగు ఇలా తీసుకురా! అసలు బ్యాగులో ఏమున్నాయో నువ్వే పూర్తిగా చూడలేదు కదా! చూద్దాం...బ్యాగు ఎవరిదో ? ఏమైనా క్లూ' దొరుకుతుందేమో!" అంటూ లేచి తలుపు మూసి, కిటికీకున్న కర్టెన్ సర్ది వచ్చాడు. అంత టెన్షన్ లో కూడా వాడి జాగ్రత్తకు నవ్వు వచ్చింది. బెడ్ మీద ఇద్దరం కూర్చుని, బ్యాగ్ తెరిచి బోర్లించాను. సైడ్ పాకెట్స్ జాగ్రత్తగా చూశాను.
శ్రీహర్ష బ్యాగ్ లో నుంచి ముందుగా ఫోను తీసి చూస్తూ "రేయ్ రంగా! ఇది బ్రాండ్ న్యూ ఆపిల్ 'ఐ' ఫోనురా బాబూ. చాలా ఖరీదైంది"దాదాపు ఏభై వేల పైమాటే. ఇద్దరం కలిసి  కేష్ మొత్తం  లేక్కేశాం. తొమ్మిది లక్షల అరవై వేలు వుంది. వెయ్యిరూపాయల, అయిదువందలరూపాయల కట్టలు. వున్నాయి. బ్యాగులో ఇంకేమీ లేదు. 
''ఏమిట్రా బాబూ! ఈ మిస్టరీ చాలా సస్పెన్స్ గా వుంది.ఎలా ఛేదించడం ? పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేద్దామా అంటే నువ్వనేది కొంతవరకు కరెక్టే!  అలాగని ఊరుకోవడానికి వీల్లేదు. ఇప్పటికే బ్యాగు దొరికి రెండు, మూడు గంటలవుతోంది. ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచిద్దాం.పేపర్, పెన్ తీసుకో'!' అన్నాడు శ్రీహర్ష అపరాధ పరిశోధకుడిలా!
''మొదటిది! కరెన్సీ కట్టల మీద ఉన్నబ్యాండ్ మీద బ్యాంకు 'స్టాంప్'చూసి ఈ డబ్బు ఎవరు డ్రా చేశారో కనుక్కోవడం" అని కరెన్సీ కట్టలుమొత్తం మళ్ళీ వివరంగా చూశాం.  మొత్తం కరెన్సీలో నాలుగు  కట్టల బాండ్  'తార్నాక' బ్రాంచి స్టేటు బ్యాంకు. ఈ ఆప్షను అంతగా పనిచేస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే ఈ మనీ బ్యాంకు నుంచి డ్రా అయ్యాక ఎన్ని చేతులు మారిందో తెలియదు. దీన్ని లాస్ట్ ఆప్షన్ గా రిజర్వ్ చేద్దాం. 
రెండోది! ప్రమాదం జరిగిన స్థలం ఏ  పోలీసు స్టేషను  పరిధిలో ఉందో ఎంక్వయిరీ చేసి, వివరాలు తెలుసుకుని  ప్రొసీడ్ కావడం!
మూడవది! ఆ స్థలంలో జరిగిన ఆక్సిడెంట్ గురించి  న్యూస్ పేపర్లలో, లోకల్ టి. వి న్యూస్ ఛానల్స్ లో చూడడం, క్లూస్ ఫాలో కావడం!
ఈరోజే 'క్లూ' దొరికితే ఓకే.  లేకుంటే రేపు అన్నీ న్యూస్ పేపర్లు వెదకడం.ఇదీ  కార్యక్రమం. ఒకవేళ మనకు ఇవేవీ వర్క్ అవుట్ కాకపోయినా ఈ బ్యాగు ఎవరిదో కనుక్కోవడానికి ఇంకొక మార్గం వుంది. చూద్దాం...ప్రస్తుతానికి ఈ మూడు ఆప్షన్స్ ఫాలో అవుదాం. ముందు ఇవన్నీలోపల పెట్టి లోకల్ న్యూస్ టీవీ ఛానల్ పెట్టు'' అని చెప్పి బెడ్ మీద నుంచి లేచి సోఫాలో సెటిల్ అయ్యి టి.వి.న్యూస్ చూడ్డం మొదలెట్టాడు శ్రీహర్ష. 
అన్ని తెలుగు న్యూస్ చానల్స్ లో లోకల్ న్యూస్ ఆగకుండా రెండుగంటలపాటు చూసినా 'బ్యాగు' దొరికిన స్థలంలో ఏమీ ఆక్సిడెంట్ కాని 'క్రైం' రిపోర్ట్ అయినట్లుగాని 'న్యూస్' లేదు.
''రంగా! టివి న్యూస్ లో ఏమీ రిపోర్ట్ కాలేదు. నీ లెక్క ప్రకారం రాత్రి 12 గంటలు, ఉదయం అయిదు గంటల మధ్య ఆక్సిడెంటో, హత్యనో జరిగిందనుకుంటే ఈ పాటికి  టి వి న్యూస్ చానల్స్, ఫ్లాష్ న్యూస్" అంటూ మొత్తుకుంటూ ఉండేవి. అలాంటి న్యూస్ లేదు. అంటే హత్య కాని ఆక్సిడెంట్ కాని కాలేదన్నమాట. పైగా నువ్వు కింద పడ్డ టైం కి రక్తం గడ్డ కట్టింది. అంటే అక్కడ ఆక్సిడెంతో  హత్య నో జరిగి కనీసం మూడు, నాలుగు గంటల పైగా అయిఉండాలి. అయితే ఆ  రక్తం అసలు మనుషులదేనా లేక ఏదైనా జంతువుదా అన్నడౌట్ వస్తోంది'' అన్నాడు శ్రీహర్ష తను చదివిన డిటెక్టివ్ బుక్స్ లో సంఘటనలు, మిస్టరీ కేసులలో తను సముపార్జించిన విజ్ఞాన సర్వస్వం గుర్తుకు తెచ్చుకుంటూ. 
"ఇంతకీ నువ్వేమంటావు! మాట్లాడకుండా సైలెంట్ అయిపోయావేంటిరా!" రంగ ముఖంలోకి నిశితంగా చూస్తూ అన్నాడు శ్రీహర్ష.
''అవును. అక్కడ ఏమైనా ఆక్సిడెంట్ జరిగుంటే ఈ పాటికి టి.వి న్యూస్ లో వచ్చివుండేదే. రాలేదు. కాబట్టి నీ అస్సెస్మెంట్  కరెక్ట్  కావచ్చు!
కాని ఏ అర్ధరాత్రో హత్యజరిగి శవాన్ని ఎక్కడైనా పడేసి ఉంటే లేక ఆక్సిడెంట్ చేసి ఏదైనా హాస్పిటల్  పడేసి వుండ వచ్చుకదా! ఆ టైంలో బ్యాగు అక్కడ పడి ఉండవచ్చుకదా!" అన్నాడు రంగా సందర్భోచితంగా ఆలోచిస్తూ. 
''అవును.ఆలా కూడా అనుకోవచ్చు. కానీ  ఈబ్యాగు ఎవరిది ?" అన్నది ప్రశ్న గానే మిగిలి పోతోంది'' అన్నాడు రంగా లేచి చేతులు వెనక్కు కట్టుకుని రూములో టెన్షనుగా అటూఇటూ తిరుగుతూ.
''సరేరా! ఇప్పుడేం చేద్దాం?" ఆదుర్దాగా అడిగాడు శ్రీహర్ష.
"పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా మన వల్ల ఈ పని అవుతుందా? మనం బ్యాగు ఓనరుకి అందచేయగలమా? అన్నది అలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేటు అయినకొద్దీ అనవసరంగా కేసులో ఇరుక్కున్న వాళ్ళమవుతామేమో" నని భయంగా వుంది అన్నాడు రంగా దీర్ఘంగా ఆలోచిస్తూ.
''అంతే కాదు!ఈ 'కేష్' ఏదైనా క్రైం కేసుకి సంబంధించిన 'ఎవి డెన్స్' అవుతే కేసుకి, మనకీ, డబ్బు స్వంతదారుకు, పోలీసు ఇన్వెస్టిగేషను కి తీవ్ర విఘాతం కల్గించిన వాళ్ళమవుతాము. మన మీద క్రిమినల్ చార్జెస్ కూడా ఫ్రేం చెయ్య వచ్చు'' అన్నాడు శ్రీహర్ష తన డిటెక్టివ్ బుర్ర అంతా ప్రదర్సిస్తూ .
''పైగా 'మనం' అని నన్ను కలుపుతావేరా ఈగొడవలో. నాకేం తెలుసు నేను ఇప్పుడేకదా వచ్చింది" అన్నాడు శ్రీహర్ష తలవంచుకుని.
''అదేం లేదు బాబూ! నీకోసం నేను స్టేషన్ కి వస్తుంటేనే కదా ఇది జరిగింది. తమరూ ఈ విషయంలో సమాన భాగస్వాములే.మంచైయినా, చెడైనా,ఇద్దరం అనుభవించాల్సిందే'' అన్నాడు రంగా నిర్మొహమాటంగా శ్రీహర్ష కళ్ళలోకి చూస్తూ, అదేదో సినిమాలో సుబ్రమణ్యాన్ని అనుకరిస్తూ .
''అన్యాయం.అక్రమం.దగా..మోసం" అమాయకుణ్ణి చేసి నన్ను కేసులో ఇరికిస్తున్నావు'' అన్నాడు లేచి నవ్వుతూ హర్ష.
''ఆ...అన్యాయం...అక్రమం...వెధవ! నీ మూలంగా కాదు ఈ న్యూసెన్స్' అంతా. నన్నుస్టేషనుకి రమ్మనకుండా నువ్వే ఏ ఆటోలోనో తగలడితే సరిపోయేదిగా. షనుకి అనవసరంగా నన్ను రమ్మన్నావు. చూడు... ఇప్పుడేమైందో !'' ఉడుక్కుంటూ అన్నాడు రంగా.
''సరే లేరా!సరదాగా అన్నాను.ఇప్పుడే ఏంచేద్దాం చెప్పు!'' సీరియెస్ గా అడిగాడు శ్రీహర్ష.
''ఇంకాసేపు టి.వి లో లోకల్ న్యూస్ చూద్దాం!'' అంటూ టి.వి.న్యూస్ పెట్టాడు రంగా.
'ఫ్లాష్...ఫ్లాష్' అంటూ స్క్రోల్ అవుతూ తెలుగు న్యూస్ వస్తోంది.
చిలకలగూడ పోలీసుస్టేషను పరిధిలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర పాడుబడ్డ భావిలో 'శవం'.
శవాన్ని బయటకు తీయడానికి పోలిసుల ఏర్పాట్లు.ఇంకొద్దిసేపట్లో శవం వెలికి తీత.  
''మనమూ అక్కడికెళ్దాం. ఎవరైనా శవాన్ని గుర్తుపడతారేమో. చూద్దాం!"అన్నాడు రంగ హుషారుగా లేచి డ్రెస్ అవుతూ. 
పదినిముషాలలో చిలకలగూడ రైల్వే బ్రిడ్జి దగ్గర పాడుబడ్డ భావి దగ్గరకి వచ్చారిద్దరు. అక్కడేమీ హడావుడి లేదు. ఆ భావి రైల్వేబ్రిడ్జి దగ్గరనుంచి మహా అయితే వందగజాల దూరం ఉందేమో.
రోడ్డు పక్కనే మోటర్ సైకిల్ మెకానిక్, చెప్పులు కుట్టే అతను ఇద్దరు వున్నారు. 
"ఏమిటి అక్కడ జనం మూగివున్నారు..ఏమైంది?" చెప్పులు కుట్టే అతనికి బూట్లు  పోలిష్ కి  ఇచ్చి  అతన్ని అడిగాడు రంగ.
''మామూలేనయ్యా! ఎవర్నో చంపి భావిలో పడేశారు. పోలీసులు ఇంతకు ముందే శవాన్నితీసి   పంపించారు బాబూ! ఈడ రాత్రి తొమ్మిది దాటితే లోకల్ రైళ్ళు జనం కొందరు పట్టాల మీదుగా ఇటు అడ్డంగా వస్తారు. పోకిరోళ్ళు, రౌడీలు వాళ్ళ దగ్గర డబ్బులు, ఉంగరాలు, ఫోన్లు లాక్కుంటారు. ఎవరైనా అడ్డం తిరిగితే చంపి ఈ భావిలో పడేస్తారు. పదేళ్ళ పైన చూస్తానే వుండ'' అన్నాడు చెప్పులు కుట్టే అతను తల ఎత్తకుండా తన పని చేసుకుంటూ.
''అలాగా! దోచుకోవడమే కాక మనుషుల్నిచంపేస్తారా?" పనికొచ్చే ఇన్ఫర్మేషన్  కోసం సంభాషణ పొడిగిస్తూ అన్నాడు రంగా.
''చెబుతున్నగదా బాబూ! ఎవరైనా ఎదురు తిరిగితే అంతే. చూడరాదు. రాత్తిరి చంపేసి పడేసిన బాబుకి పట్టుమని పాతికేళ్ళు లేవు. బాగా కొట్లాడినట్లుంది. ఎక్కడో తగలరాని చోట తగిలినట్లుంది.
దొంగముండా కొడుకులు బాబూ! పానం ఉండగానే భావిలో  పడేసింరో... ఏం పాడో. పాడులోకం అయిపోనాది బాబూ!" బాధ పడుతూఅన్నాడు చెప్పులు కుట్టే అతను.
"గవర్నమెంట్  హాస్పిటల్ కి వెళ్ళి అక్కడే మైనా 'క్లూ'దొరుకుతుందేమో చూద్దాం" అన్నాడు  రంగ. 
                                                                       * * * * *
ఇద్దరు హాస్పిటల్ కి చేరేసరికి టైం దాదాపు మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. హాస్పిటల్ లో మనుషులు అక్కడక్కడ సెటిల్ అయ్యారు. హాస్పిటల్  కాంపాండ్  లో ఓల్డ్ బోయిగుడ వైపు దూరంగా ఉంది పోస్ట్ మార్టం సెక్షన్. దాని పక్కనే మార్చ్యురి. అటువంక  పరికించి చూసాను. పనికిరాని ఫర్నిచరు, రక్తం మరకలతో ఎండిపోయిన రెండు పాత స్ట్రెచర్లు, పొడుగాటి సిమెంట్ రేకుల షెడ్. చూరు కింద రెండు పాత బెంచీలు, అటు ఇటు తిరుగుతూ చాయ్ వాలా. ఏడుస్తూ కొందరు. ఎటు చూసినా ఆ కంపౌండ్ పరిస్థితంతా దయనీయంగా ఉంది.
బైక్ పార్క్ చేసి రెండడుగులు వేశాము. 
''క్యా సాబ్ ఆక్సిడెంట్ బాడీ హైక్యా? తెలుగునా సార్? ఏందీ ఆక్సిడెంట్ కేసా? పోస్ట్ మార్టం తొందరగా చేయిస్తా సార్! బాడీ వచ్చిందా ? కబాయా... కహా సే ? నాం క్యా హాయ్ షబ్? 
పేరేంది సార్? బోలో సాబ్!" అంటూ ఆగకుండా ప్రశ్నమీద ప్రశ్న వేస్తూ మాదగ్గరికి వచ్చాడు. 
మాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలా. ఇక్కడ బ్రోకర్ అని మాత్రం అర్ధం అయింది. వాణ్ని వదిలించుకోవడమే మంచిదనుకుని "ఐసా కుచ్ భీ నహీ హై భాయి. కిసీ సే మిల్నే ఆయే.బస్!" అని వాడిని ఇగ్నోర్ చేస్తూ బయటకు నడిచాం. 
కొద్ది దూరం వచ్చి ముందుకి నడుస్తూ ''ఇదెక్కడి న్యూసెన్స్  రా బాబూ! వీడెవడో జిడ్డులా పట్టుకున్నాడు" అన్నాడు రంగా వెనక్కు తిరిగి చూస్తూ.  
వాడు ఫాలో కావడంలేదని నిర్దారించుకున్నాక ఒక పక్కన ఆగి ''హాస్పిటల్  బాయ్ ని, మార్చురీ  బాయ్ నీ  కలుద్దామా?" అని అడిగాడు రంగ.
''కలుద్దాం'' అన్నాడు శ్రీహర్ష.
వెంటనే హాస్పిటల్ లోకి నడిచాం. గేటు దగ్గర సెక్యూరిటీ చెయ్యి అడ్డంగా పెట్టాడు.
రంగా వెంటనే పది రూపాయలు చేతిలో పెట్టాడు.  మార్చురీ గది వైపు వెళ్ళాము. 
డోర్ క్లోజ్ చేసి ఉంది. సెక్యూరిటీ గార్డ్, హాస్పిటల్  బాయ్ కూర్చుని  తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు.
 ''ఏం కావాలి సార్ ?" అడిగాడు గార్డు లేచి నిలబడి. 
''డైలీ న్యూస్ నుంచి వచ్చాం. క్రైం రిపోర్ట్ కోసం. కేసులేమీ లేనట్టుంది" అంటూ వెనక్కి తిరిగాడు శ్రీహర్ష. కన్ను గీటుతూ.
''అదేంది సార్! ఆగండి. ఇయ్యాల రెండు 'బాడీ'లు వచ్చినయ్యి ! ఒకటి బోయినపల్ల' చౌరస్తా ఆక్సిడెంట్, రెండోది చిలకలగూడా మర్డర్ కేసు. 'పోస్ట్ మార్టం' రెండు గంటలలో అవుద్ధి!.
డాక్టర్  సాబ్  వస్తున్నానని కబురు చేసిండు" అన్నాడు గార్డు.  
వాడి చేతిలో ఏభై  రూపాయల నోటు పెట్టే సరికి "ఇంకేమైనా కావాలంటే చెప్పు సార్!" అన్నాడు టక్కున సెల్యూట్ కొట్టి.
''చిలకలగూడ మర్డరు కేసు.గురించి  చెప్పు. ఎవరైనా వచ్చారా ?" న్యూస్  రిపోర్టరులా పాకెట్ నోట్ బుక్, పెన్సిల్ పాకెట్ లో నుంచి తీసి వ్రాయడానికి సిద్ధమవుతు. 
''ఇంకేమీ తెల్వదు సార్! ఇచిత్రంగా ఉంది. ఇంతవరకు ఎవరూ రాలే'' అన్నాడు సెక్యురిటి గార్డ్.
''సరే! మేము  మళ్ళీ వస్తాము. ఆ కేసు గురించి ఎవరైనా వస్తే పేరు, ఫోన్ నంబరు.అన్నీ నోట్ చేసుకో! డ్యూటీ ఎన్ని గంటలదాకా ఉంది?"
"అరె...ఫికరు చెయ్యకు సార్! నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కిన. రేపు మజ్జాన్నం దాకా  ఉంటా సార్!  
నా పేరు మల్లేష్" ఉత్సాహంగా అన్నాడు.
''నీదగ్గర ఫోను ఉందా?"
''ఉంది సార్! ఏమైనా కాల్ చేసుకోవాలా ఇదిగో సార్!" జేబులోంచి మొబైల్ ఫోను తీసి ఇవ్వజూపాడు  సెక్యురిటి గార్డ్.
'' నంబరు చెప్పు.నీకు ఫోను చేస్తా ఇంకో గంట తరువాత''
''రాసుకో సార్! " అని నంబరు చెప్పాడు సెక్యూరిటీ గార్డ్.
ఫోను నంబరు నోట్ చేసుకుని బయటకు రాగానే మళ్ళీ తగిలాడు ఇందాకటి బ్రోకర్ గాడు.
''క్యా హువా సాబ్! పోస్ట్ మార్టం తొందరగా చేయించాలా...మర్డరు కేసు కదా సాబ్ ? తెలిసిన వాళ్ళు ఉన్నారు సాబ్" మావెంట నడుస్తూ అన్నాడు బ్రోకరు.
''అరె భాయి!మేము న్యూస్ పేపర్ వాళ్ళం.క్రైం న్యూస్ కోసం వచ్చాం. చెప్పు.నీ పేరేంటి ?' నీ పనేమిటి?"  జేబులో నుంచి పేపర్, పెన్నుతీసే సరికి అక్కడనుంచి ఒక్క ఉదుటున పరుగు లంకించుకున్నాడు బ్రోకరు.
''బతుకు జీవుడా! వీడు వదిలాడు. వాట్  నెక్స్ట్ ??" అన్నాడు రంగ అసహనంగా.
'ఏం ...ద....న్నా! అప్పుడే విసుగు వచ్చేస్తోంది.ఇంకా మొదల్లోనే ఉన్నాం'' అన్నాడురంగా  శ్రీహర్షని ఆట పట్టి స్తూ.
''సరే తమ్మీ! వాట్ నెక్స్ట్ ? ఏంచేద్దాం?" అన్నాడు శ్రీహర్ష. .
''వెయిట్ చేద్దాం ! ఎవరైనా బాడీ తీసుకెళ్లడానికి వస్తారేమో చూద్దాం'' అన్నాడు రంగ.
''సరే నేను పోస్ట్ మార్టం రూం వైపు వుంటాను. పోలీసు కానిస్టేబుల్ ఇక్కడే  
ఉన్నాడు.ఎవరొచ్చినా  అతన్ని కలుస్తారు. నేను అతన్ని కనిపెట్టి  వుంటాను" అన్నాడు శ్రీహర్ష.
''ఒకే '' అన్నాడు రంగ.
                                                                  * * * * *
అది చిలకలగూడ పోలీసు స్టేషను. టైం దాదాపు మధ్యాహ్నం రెండు గంటలవుతోంది. 
ఎస్.ఐ రంగనాథ్ ఉదయం చిలకలగూడ రైల్వే బ్రిడ్జి దగ్గర భావిలో దొరికిన శవం కేసులో కానిస్టేబుళ్లు కానిస్టేబుల్ పరశురాం, మొయిన్ ఖాన్  పట్టుకొచ్చిన అనుమానితులను ఇంటరాగేట్ చేస్తున్నాడు. వారయిదుగురు రౌడీషీట్ ఉన్నవాళ్లే. కానిస్టేబుళ్లు కొంత ఇన్ఫర్మేషన్ సేకరించారు. 
ఆ ఇన్ఫర్మేషన్  ఆధారంగా కేసులో ప్రొసీడ్ అవుతున్నాడు రంగనాథ్. 
ఇంకా పోస్టుమార్టం రిపోర్ట్ రాలేదు. ముందుగా అయిదుగురు అనుమానితులను వారి పద్దతిలో ఇంటరాగేట్ చేశారు. 
ముందు రోజు రాత్రి చిలకలగూడ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర గ్యాంగ్ వార్ అయింది. లోకల్గ్ గ్యాంగ్ , ఆటోవాళ్ళ మధ్య గ్రూప్ 'క్లేషేస్' అయ్యాయని, కొట్లాట జరిగిందని, లోకల్ గ్యాంగ్  గ్రూపుకు చెందిన 'శ్రీను' ఆటో గ్యాంగ్  వారు ఎవరి దగ్గరో కొట్టేసిన డబ్బు సంచిని, కొట్టేసి పారిపోతుండగా ఆటోగ్రూపు వారు శ్రీనును వెంబడించారని, అక్కడే గ్రూపుల మధ్య కొట్లాట అయిందని, సరిగా అదేసమయానికి  మొబైల్ పోలీసు పెట్రోల్ పార్టీ రావడంతో, అందరం పారిపోయామని చెప్పారు. 
చీకట్లో డబ్బు బ్యాగు  శ్రీను దగ్గరనుంచి ఎవరి దగ్గరకి చేరిందో తమకు తెలవదని, క్యాష్ బ్యాగ్  లో  చాలా డబ్బుందని, అనుమానితులంతా ఒకేరకమైన స్టేట్ మెంటు ఇచ్చారు.  
'ఆ డబ్బు బ్యాగు, మొబైల్ ఫోను ఏమయ్యాయి?' పెన్సిల్ నుదురు మీద కొట్టుకుంటూ ఆలోచిస్తున్నాడు ఎస్ ఐ రంగనాథ్.  
సి.ఐ తో కేసు ప్రోగ్రెస్  డిస్కస్ చేసి సూచనలు, ఆదేశాలు తీసుకుని వెంటనే  కానిస్టేబుళ్లు పరశురాంని, మొయిన్ ఖాన్ ని పిలిచి ఆక్సిడెంట్ స్పాట్ కి వెళ్లి ఎవిడెన్స్  ఏమైనా దొరుకుతాయేమో వెతకమన్నాడు ఎస్ ఐ రంగనాథ్. 
నిందితులలో ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి సీన్  'రీ కన్ ష్ట్ర క్ట్' చేయమన్నాడు. 
రెండు గ్రూపుల మధ్య కొట్లాట జరిగిన  ప్రదేశం, శవం దొరికిన భావి దగ్గర ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతకమన్నాడు. ఏ చిన్న'క్లూ' కూడా వదలవద్దని గట్టిగా చెప్పి పంపాడు. వేరే స్టేషన్లలో మనీ 'తెఫ్ట్' కేసులేమైనా రిపోర్ట్ అయ్యా ఏమోనని 'చెక్' చేసుకున్నాడు. కేసులేమీ రిపోర్ట్ కాకపోవడంతో  ఆక్సిడెంట్  సైట్  కి  వెళ్ళిన 'సెర్చ్ పార్టీ' రిపోర్ట్ కోసం ఎదురు చూడసాగాడు.
గంటతరువాత పరశురాం కానిస్టేబుల్  ఫోను చేశాడు.
"'సార్! మొబైల్ ఫోను ఒకటి దొరికింది. 'ఓల్డ్ బ్రిడ్జి' దగ్గరే తుప్పల్లో ఉంది. దానిమీద రక్తపు మరకలున్నాయి" అన్నాడు పరశురాం.
"సరే! మీరు వెంటనే వచ్చేయండి'' అని పరశురాంకి  చెప్పి, 'పోస్ట్ మార్టం' రిపోర్ట్  కోసం  'ఎంక్వైర్' చేసి 'సెర్చ్' పార్టీ కోసం వెయిట్  చేస్తూ కూర్చున్నాడు.
వాళ్ళు తిరిగిరావడం తోనే తను గ్లోవ్స్ వేసుకుని దొరికిన మొబైల్ ఫోనులో  'రీసెంట్ కాల్స్' చూసి
ఒకటే నంబరు నుంచి పందొమ్మిది  కాల్స్ గమనించి, వెంటనే అదే మొబైల్ నుంచి ఆనంబరుకి కాల్ చేశాడు. 
''హలో! ఏమైపోయావురా ? నిన్ననగా వెళ్లావు. పని అయిందా ? రాత్రంతా ఎక్కడున్నావు? ఫోను ఎందుకు ఎత్తడంలేదు? ఇక నేనే బయలుదేరుదామనుకుంటున్నాను'' ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అవతలి నుంచి మాట్లాడుతున్న వారి గొంతులో తీవ్ర ఆందోళన గమనించాడు రంగనాథ్.  .
మాట్లాడుతోంది పెద్దాయనలా ఉందని ''నా పేరు రంగనాథ్ అండీ! నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.ఈ ఫోను ఎవరిదండీ?" అని అడిగాడు  రంగనాథ్.
''మీరెవరండీ ? ఈఫోను మీదగ్గరికెలా వచ్చింది. మావాడెక్కడ?" తీవ్ర ఆందోళనతో బొంగురుపోయిన గొంతుకతో మాట్లాడాడు అవతలనుంచి. 
''మీరేమీ కంగారు పడకండి. ఈ ఫోను నాకు దొరికింది. అడ్రస్ చెపుతే వచ్చి మీకు ఫోను ఇద్దామని ఫోను చేశాను" కావాలని అబద్ధం చెప్పాడు రంగనాథ్
''అయ్యో ! అయితే మా అబ్బాయి ఎక్కడ?" అడిగాడు ఆయన భయాందోళనతో.
''చూడండి! మీ పేరేంటో...  మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు. మీ అడ్రస్ చెబుతే ఇప్పుడే వచ్చి మీ ఫోను ఇవ్వగలను" అన్నాడు రంగనాథ్.
''బాబూ!నేను జనగాం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కేశవరావు. మా అబ్బాయి పేరు చంద్రకుమార్" సమాధానం చెప్పాడు కేశవరావు గారు.
''అలాగా అండీ! అయితే ఇక్కడ మీవారెవరైనా వుంటే చెప్పండి. వాళ్లకి ఫోను అందచేస్తాను'' అన్నాడు రంగనాథ్  పెద్దాయనను కంగారు పెట్టకూడదన్న భావనతో.
''అలాగే బాబూ! నా తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటిలో ప్రొఫెసర్ ఏకాంబరేశ్వర రావు, 
ఫోను నంబరు  నోట్  చేసుకోగలవా? నేనూ తనతో చెబుతాను" అంటూ తమ్ముడి మొబైల్ నంబరు చెప్పాడు కేశవరావు గారు. 
'అమ్మయ్య! తీగ దొరికింది' అని మనసులో అనుకుంటూ  ''ఇంకో గంటలో మీ అబ్బాయి ఎక్కడవున్నాడో  ఇన్ఫర్మేషన్ తెలయక  పోతే మీ తమ్ముడి గారితో మాట్లాడి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. ఇంకా లేటు చెయ్యకండి" అని చెప్పి ఫోను కట్ చేసి వెంటనే తన మొబైల్ నుంచి ప్రొఫెసర్ ఏకాంబరేశ్వరరావుకి కాల్ చేశాడు.
''థిస్ ఈజ్ ప్రొఫెసర్ ఏకాంబరేశ్వర రావు .హు ఈజ్ కాలింగ్?"
''సర్! నా పేరు రంగనాథ్. చిలకలగూడ పోలీసు  'ఎస్.ఐ ని'. మీతో అర్జెంట్ గా రెండు నిముషాలు మాట్లాడాలి"
''ఒకే ఇన్స్పెక్టర్ !  హౌ కె న్ ఐ హెల్ప్ యు?"  కూల్ గా అడిగారు ప్రొఫెసర్.
''సర్!  మీ బ్రదర్ సన్  'చంద్రకుమార్'  గారి మొబైల్ ఫోను చిలకలగూడ దగ్గర రైల్వేట్రాక్ పక్కన తుప్పల్లో దొరికింది. మీ బ్రదర్ కేశవరావు గారితో మాట్లాడాను. చంద్రకుమార్ నిన్న సిటి కి వచ్చారట.ఇంకా ఇల్లు చేరలేదట. నేను వారికి పోలీసునని చెప్పలేదు.పెద్దాయనలా అనిపించారు. కంగారు పడతారేమోనని ఫోను దొరికిన సంగతి ఆయనకు చెప్పలేదు''
''యు డిడ్  ఎ వండర్ఫుల్ జాబ్  ఇన్స్పెక్టర్! ఐ రియల్లీ అప్రిసిఎట్ యువర్ కన్సర్న్! మిస్టర్...?'
''ఐ యాం  రంగనాథ్ సర్! మిమ్ముల్ని అర్జెంట్ గాఇప్పుడే కలవాలి.అర్జెంట్ గా డిస్కస్ చేసే  విషయం.మీకు చూపించవలసినవి ఉన్నాయి"'అర్జెన్సి  అర్ధమయ్యేలా మాట్లాడాడు రంగనాథ్.
''ఎస్ ఇన్స్పెక్టర్! నేను 'యునివర్సిటి' నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎక్కడికి రావాలో చెప్పండి? వెంటనే వచ్చేస్తాను'' అన్నారు ప్రొఫెసర్ .
''సర్! మీరు వెంటనే బోయిగూడ గవర్నమెంట్ హాస్పిటల్ వెనక గేటు దగ్గరికి రండి.  మీకోసం వెయిట్ చేస్తూ వుంటాను'' అని వెంటనే ఫోను 'కట్' చేశాడు రంగనాథ్. 
వెంటనే ఆ మొబైల్ ఫోనుని ఓ జిప్ లాక్  కవర్ లో వేసి దాన్ని తీసుకుని ఒక అర్ధగంటలో వస్తానని ఈ లోపులో ఫోరెన్సిక్ వారిని పిలవమని చెప్పి పరశురాంని, మొయిన్ ఖాన్ ని పోలీసు స్టేషనులోనే ఉండమని చెప్పి ప్రొఫెసర్ ని కలవడానికి  బోయిగూడ ప్రభుత్వ హాస్పిటల్ కి బయలు దేరాడు రంగనాథ్.
'రంగనాథ్ హాస్పిటల్ వెనుక గేటు దగ్గర పోస్టుమార్టం రూం దగ్గర  తన బుల్లెట్ బైక్ పార్క్ చేసి టైం చూశాడు. మూడు ముప్ఫై అయిదు నిముషాలవుతోంది. అక్కడి డ్యూటీ కానిస్టేబుల్ కోసం చుట్టూ కలియ చూశాడు. ఎక్కడా కన్పించలేదు.
'వీడు ఎక్కడున్నాడో' అనుకుంటూ రూం వైపు నడిచాడు ఎస్. ఐ. రంగనాథ్.
'పోస్ట్ మార్టం' రూం ముందు బెంచి మీద కూర్చుని బీడీ కాలుస్తున్నాడు కానిస్టేబుల్ ఇంతియాజ్. 
రంగనాథ్ ని చూస్తూనే బీడీ విసిరేసి సెల్యూట్' కొట్టి ''డాక్టరు సాబు ఇప్పుడే వచ్చిండు. ఇంకా మన బాడీ  'పోస్ట్ మార్టం' కాలేదు సాబ్! ముందు బోయిన పల్లి ఆక్సిడెంట్ డెత్ కేసుది అవుతోంది సాబ్ !" అక్కడి స్టేటస్  అప్ టు డేట్  చేశాడు ఇంతియాజ్. .
'వీడి బొంద తెలుగు. మన బాడీ అట' నవ్వుకుంటూ అనుకున్నాడు రంగనాథ్.
రెండు నిముషాల్లో వెనక గేటు దగ్గరకు వెళుతూనే గమనించాడు.తెల్ల మారుతి కారు ఆగడం.
కార్ లాక్ చేసి వస్తున్నమనిషికి ఎదురుగా వెళ్లి ''ప్రొఫెసర్ ... !?"
క్ హ్యాండ్ ఇచ్చి "రండి సర్! రాత్రి చిలకలగూడా ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర భావిలోనుంచి ఒక డెడ్ బాడీని  రికవర్ చేశాము. మీ అన్నగారి కొడుకు ఫోను కూడా ఆ ప్రదేశం దగ్గరలోనే దొరికింది. 
ఈ ఫోనుకు...బావిలో దొరికిన బాడీ కి ఏమైనా సంబంధం ఉందా అన్నది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఈ మొబైల్ ఫోను  మీ అన్నగారి అబ్బాయి 'చంద్రకుమార్' దేనా ? ఫోనును గుర్తించగలరా?" 
ఫోనును జిప్ లాక్ కవరుతోనే ప్రొఫెసర్ కి అందిస్తూ కూల్ గా మాట్లాడాడు రంగనాథ్.
''ఎస్! ఈ మొబైల్ 'చందుదే' నిన్నసాయంత్రం ఆరు,ఆరున్నర మధ్య మాఇంటి నుంచే బయటకు  వెళ్ళాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి పోతానన్నాడు. ఓకే ఇన్స్పెక్టర్!....లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ . లెట్స్ సి ది బాడీ...' చాలా నిబ్బరంగా నడిచారు ప్రొఫెసర్. 
"మీరు డెడ్ బాడీని చూసి  చందూది అవునా, కాదా  చెప్పండి ?" 
ఇద్దరు 'పోస్ట్ మార్టం' రూం వైపు నడిచారు. గది తలుపు తెరిచాడు ఇంతియాజ్. 
అక్కడే ఉన్న బాయ్ వచ్చి బాడీ మీద  బెడ్  షీట్ తీసి పక్కకు జరిగాడు.
బాడీ ముఖం చూస్తూనే ''నో...నో...చందు కాదు. నో!..'థేంక్ గాడ్' ఇట్ ఇజ్ నాట్ చందు!"అని భారంగా నిట్టూర్చి, ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ బయటకు నడిచాడు ప్రొఫెసర్.
''హా సాబ్!ఈ పోరడు  రైల్వే స్టేషన్చి తాన చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రైల్వే స్టేషను కాడనే వుంటడు..రైల్వే పోలీస్  వీడిని చాలా సార్లు పట్టుకున్నారు సాబ్!" అన్నాడు ఇంతియాజ్  కాన్ఫిడెంట్ గా.
''ముందే ఈ సంగతి ఎందుకు చెప్పలేదు నాకు" కోపంగా అతన్ని మందలిస్తూ  బయటకు  నడిచాడు రంగనాథ్  అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా. .
పోస్టుమార్టం గది గుమ్మం దగ్గ్గర్నుంచి లోపలి తొంగి చూస్తున్న శ్రీహర్షను ''మీరెవరు...ఏంకావాలి?" అడిగాడు రంగనాథ్. 
''మా వాళ్ళది పోస్ట్ మార్టం ఉందండీ" అని పక్కకు నడిచాడు శ్రీహర్ష.
''ఒక్కనిముషం సర్!" ప్రొఫెసరుతో చెప్పి  లోనికి వెళ్లి ''ఇంతియాజ్!పోస్ట్ మార్టం కంప్లీట్ కాగానే స్టేషనుకి వచ్చెయ్యి లేటు చేయవద్దు.అర్జెంట్ పని ఉంది"' అని చెప్పి వచ్చాడు.
బయటకు వస్తూనె ''సర్! బాడీ చంద్రకుమార్ ది కాదు. కాని భావి  పరిసరాల్లో దొరికిన ఫోను మాత్రం అతనిది. అంటే ఆ ఏరియాకి నిన్న చంద్ర కుమార్ వచ్చాడా? వస్తే ఎక్కడికి వెళ్ళాడు? ఈ ఫోను ఇక్కడ దొరకడ మేమిటి ? అతనికేమైనా అపాయం జరిగిందా ?" అన్న ప్రశ్నలు రంగనాథ్  బుర్రను  తొలుస్తున్నయి. 
''సర్! మీ అబ్బాయి దగ్గర కేష్ గానీ వేరే విలువైన వస్తువులు గానీ ఉన్నాయా? అతను నిన్న బయటకు వెళ్ళాక కుటుంబ సభ్యులతో మాట్లాడాడా? మాట్లాడి ఉంటె  ఏమి మాట్లాడాడు?" అన్న ప్రశ్నలకు సమాధానం  కావలి. మీకు ఇబ్బంది కాకుంటే నాతో స్టేషను కి వస్తే పది నిముషాలు కేసు డిస్కస్ చేసి వెళ్ళవచ్చు" అన్నాడు రంగనాథ్
''బయ్ అల్ మీన్స్. ఐ విల్ ఫాలో యు టు స్టేషన్'' అన్నాడు ప్రొఫెసర్ కారు దగ్గరకు నడుస్తు.
ఫోను మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ వారిద్దరిని ఫాలో అవుతూ వచ్చి ప్రొఫెసర్ కార్ నంబరు నోట్ చేసుకున్నాడు శ్రీహర్ష.
వారిద్దరు పది నిముషాల్లో చిలకలగూడ పోలీసు స్టేషను కి వచ్ఛారు.
ప్రొఫెసర్  కారు పార్క్ చేసి బయటనిలబడి. "నేను మాఅన్నగారితోమాట్లాడి వస్తాను'' అన్నాడు. . 
రంగనాథ్  స్టేషనుకి రావడమే ఆలస్యం...పరశురాం కానిస్టేబుల్ రంగనాథ్ కి సెల్యూట్  కొట్టి 
"సార్!  రైల్వే పోలీసు ఎస్.ఐ గారు  ఎవరో 'ఒకతన్ని' ఇక్కడకు పంపారు. వాళ్ళ కానిస్టేబుల్ కూడా వచ్చాడు. అర్జెంటు గా మిమ్మల్ని కలవాలంట. కంప్లైంట్ ఇవ్వాలంట. అతన్ని మీ రూంలో ఉన్నాడు" అని చెప్పాడు.
తన గదిలోకి వెళ్లి కుర్చీలో కూర్చున్నతన్ని వివరంగా చూశాడు రంగనాథ్. 
నలిగి, మాసిన షర్టు. దాని మీద అక్కడక్కడ రక్తం మరకలు. నిద్ర లేక మొహం అంతా పీక్కు పోయి, కళ్ళు ఎర్రగా, దిగులుగా ఉన్న అతన్నిచూస్తూ ''చెప్పండి! వాట్ కెన్ ఐ డు ఫర్ యు ?"అడిగాడు. 
ఇంతలో రైల్వే కానిస్టేబుల్  లోనికి వచ్చి సెల్యూట్ కొట్టి " సార్! ఈవేళ పగలు ఒంటి గంటకు భోయిగూడ  రైల్వే పార్కింగ్ లాట్ లో ఓ మూల ఉన్న పాత 'అన్ క్లైమ్డ్ కార్' లోపల నోరుకు టేప్ వేసి, కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉన్న ఇతని గురించి మాకో అనానిమస్   ఫోను కాల్ వచ్చింది.  మేము  ఇతన్ని రెస్క్యు చేసి  డాక్టరు కి చూపించి అతను తేరుకున్నాక "తనవి కేష్ పదిలక్షల దాకా పోయాయని కంప్లైంట్ చేయాలన్నాడు" క్రైమ్  మీ జ్యూరిస్ డిక్షన్  లో అయిందని  మా ఎస్.ఐ గారు మీ పోలీసు స్టేషన్ లో ఇతన్ని హ్యాండ్  ఓవర్  రమ్మని  నన్ను పంపారు సార్! రిపోర్ట్ పరుశురాం గారికి ఇచ్చాను. ఇక నేను వెళతాను సార్'' అని చెప్పి రైల్వే కానిస్టేబుల్  వెళ్ళాడు. 
                                                                * * * * *
రైల్వే కానిస్టేబుల్ అటు వెళ్ళగానే  "చెప్పండి! కంప్లైంట్  వివరాలు చెప్పండి !" అడిగాడు రంగనాథ్ . 
''సర్! నాపేరు  చంద్ర కుమార్.  మాది జనగాం.  నిన్న సాయంత్రం 'తార్నాక' స్టేటు బ్యాంకులో పది లక్షల రూపాయలు డ్రా చేశాను. అక్కడే మొబైల్ షో రూం లో ఒక 'ఆపిల్ ఐ ఫోను' కొన్నాను. అక్కడే  రెండు, మూడు గంటలు జనగాం బస్సు కోసం వెయిట్ చేశాను. బస్సు దొరకలేదు.    అప్పటికే రాత్రి ఎనిమిది కావడంతో అంత కేష్ తో అప్పుడు జనగాం పోవడం 'రిస్క్' అని  అక్కడ్నుంచి ఆటోలో మారేడుపల్లిలో మా బాబాయి గారింటికి బయలుదేరాను. 
ఆటో మెట్టుగుడ రైల్వే బ్రిడ్జ్ దాటగానే రైల్ నిలయం వైపు తిరగకుండా చిలకలగూడ ఓల్డ్ బ్రిడ్జ్ వైపు తిరిగింది. వెంటనే  ఆటో స్లో అయింది. నేను రియాక్ట్ అయ్యే లోపునే ఇద్దరు వ్యక్తులు  ఆటోలో ఎక్కారు. నాకు చెరొకవైపు కూర్చుని ఒకడు నన్ను గట్టిగ నొక్కి పట్టుకున్నాడు. నా ఫోను లాక్కున్నారు. రెండోవాడు నా మొహాన్ని ఏదో గుడ్డతో నొక్కి పెట్టాడు. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. రైల్వే పోలీసు వాళ్ళు నన్ను రెస్క్యూ చేసి కాపాడిందాకా నేను స్పృహలో లేను. నా దగ్గరున్న  తొమ్మిదిలక్షల అరవై వేల డబ్బు కొట్టేశారు. 
తరువాత ఏo జరిగిందో మీకు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ చెప్పాడు.
''సర్! నిన్న సాయంత్రం నుంచి ఇంటికి ఫోను చేయలేదు. నేను ఇంటికి ఒక ఫోను చేసుకోవచ్చా? ఇంటి దగ్గర మావాళ్ళు కంగారు పడుతూ వుంటారు" అన్నాడతను 
'"పరశురాం! బయట ప్రొఫెసర్ 'సర్' ఉంటారు. లోపలకి రమ్మని చెప్పు" అని .
''ఈ ఫోను చూడండి.గుర్తు పట్టా గలరేమో" టేబుల్ సొరుగు నుంచి ఫోనుఉన్న జిప్ లాక్ కవరు
చూపిస్తూ అన్నాడు రంగనాథ్.
''సార్! ఆ మొబైల్ నాదే! ఇక్కడికి ఎలా వచ్చింది?" ఆశ్చర్యంగా అన్నాడు చంద్రకుమార్.
''వివరాలన్నీ తరువాత. ముందు మీ ఇంటికి ఫోను చేసి మాట్లాడిన  తరువాత కంప్లైంట్ వ్రాసివ్వండి" అంటూ తన మొబైల్ ఫోను చంద్రకుమార్ కి ఇచ్చాడు రంగనాథ్. 
ఇంతలో ప్రొఫెసర్ లోపలకి వస్తూనే చంద్రకుమార్ ని చూసి ''చందూ! నువ్వా? ఏమయిపోయావు ? ఎక్కడికి వెళ్లావు? ఏమైంది నీకు ? ఈజ్ ఎవ్విరి థింగ్ ఆల్ రైట్ ?" ఆశ్చర్యంగా అంటు చంద్రకుమార్ దగ్గరికి వచ్చి భుజం మీద చేయివేసి ''ముందు ఇంటికి ఫోను చేసి క్షేమంగా ఉన్నట్లు చెప్పు'' అని చెప్పిఆప్యాయంగా భుజం తట్టి తను రంగనాథ్ వైపు తిరిగి
''ఎస్.ఐ' గారూ! నేను మా అన్నయ్య గారితో మాట్లాడాను. 
ఇప్పుడు 'చందు' కన్పించాడు కాబట్టి థింగ్స్ ఆర్ డిఫరెంట్ నౌ. బట్ ఐ థింక్ సంతింగ్ ఈజ్ వెరీ సీరియస్ !" అంటూ ఎడం చేత్తో నుదురు పట్టుకుని కళ్ళు మూసుకుని చందు పక్కన  కుర్చీలో కూర్చున్నారు. 
                                                               * * * * *
టైం సాయంత్రం నాలుగు గంటలవుతోంది. మర్డరు కేసు 'బాడీ' కోసం ఎవరు రాలేదు. ఎవరు క్లెయిమ్శ్రీ చేయలేదు. హర్ష, రంగా అప్పటిదాకా వెయిట్ చేసి  ఇద్దరు హాస్పిటల్ 'పోస్ట్ మార్టం' రూం దగ్గరనుంచి బయలుదేరారు. 
అక్కడ్నుంచి 'చిలకలగూడ' పోలీసు స్టేషను దగ్గరికి వచ్చారు. స్టేషన్  ఎదురుగా ఉన్న పాన్ షాప్ 
దగ్గర్నుంచి  స్టేషనులోనికి  చూశారు శ్రీహర్ష.  యెస్.ఐ , బుల్లెట్ బైక్,  హాస్పిటల్ దగ్గర చూసిన  
తెల్ల మారుతి కార్ పార్క్ చేసి ఉండడం గమనించాడు.
''రంగా! నా 'సిక్త్ సెన్స్' చెబుతోంది. మనకు కావలసిన 'లీడ్' కచ్చితంగా ఈ  మారుతి కారులో వచ్చిన  వ్యక్తి అని నా నమ్మకం" అని ధృడంగా అన్నాడు శ్రీహర్ష.
''అలాగవుతే  కాసేపు వెయిట్ చేద్దాం. ఆ కారుని ఫాలో అవుదాం'' అన్నాడు రంగ. .
''అరే మీరా అన్నా! స్టేషనులో పనేమయినా ఉందా ? అంతా మనోల్లే. చెప్పండన్నా!" పాను నోట్లో కుక్కుకుంటు అడిగాడు 'పోస్ట్ మార్టం' రూం దగ్గర తారసపడ్డ బ్రోకరు.
''రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు, ఇక్కడకి తగలడ్డాడు వీడు. ఇక బయలుదేరు మనం ఇక్కడ ఉండడం ప్రమాదం'' అన్నాడు శ్రీహర్ష బైక్ దగ్గరకు నడుస్తూ.
''పోరా! నీకు ప్రతీది అనుమానమే. ఉండు! పది నిముషాలు చూద్దాం"' అన్నాడు రంగా ఆశావహంగా. 
రెండు, మూడు నిముషాలయిందో కాలేదో ప్రొఫెసర్ తో మాట్లాడుతు  ఎస్. ఐ బయటకు వచ్చాడు.  వారి వెంట మూడో వ్యక్తి  స్టేషను బయటకు వచ్చారు. వెంటనే  ప్రొఫెసర్,  అతను కలిసి కారు ఎక్కి బయలుదేరారు. రంగ వెంటనే బైక్ స్టార్ట్ చేసి రెడి గా ఉన్నాడు. శ్రీహర్ష వారిద్దరిని పోలీసు స్టేషను గేటు నుంచి దగ్గరగా నడుస్తూ ఫాలో కావడం గమనించాడు రంగ. 
తెల్ల కారు  సికిందరాబాదు వైపు వెళ్తోంది. 
శ్రీహర్ష  బైక్ ఎక్కుతూనే  తెల్ల మారుతి కారుని ఫాలో అయ్యాడు రంగ.
కారు 'సంగీత్' సినిమా కూడలి మీదుగా ఈస్ట్ మారేడుపల్లి శ్రీనర్సింగ్ హోం పక్కన సందులోకి తిరిగి లెఫ్ట్ సైడ్ 'అశోక' చెట్లు ఉన్న ఇంటి లోనికి వెళ్ళింది. కొద్దిగా ముందుకి వెళ్లి  కూరగాయల దుకాణం దగ్గర ఆపాడు బైక్ రంగ. .
బైక్ ఆగుతూనే దిగి "ఇక్కడ దగ్గరలో తెల్ల మారుతి కారు ఉన్న సార్ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా బాబూ?" దుకాణం అతన్ని అడిగాడు శ్రీహర్ష.
''తెల్ల కార్లు చాలా మందికి ఉన్నాయ్... చిన్న తెల్ల కారవుతే ఇక్కడ నుంచి మూడో ఇంటిలో ప్రొఫెసర్ సారు వాళ్ళు ఉంటరు. ఆయనది పాత తెల్ల మారుతి కారు'' అన్నాడు చిరాకుగా .
''ఆ...అదే పాత తెల్ల  మారుతీ కారు. ప్రొఫెసర్ సారే!" అతనికి అనుమానం రాకుండా జేబులోంచి పేపరు తీసి చదువుతున్నట్లుగా నటిస్తూ అన్నాడు శ్రీహర్ష. 
''ఏకాంబసవ రావు  సారేనా?" ఆయన పేరుని ఖూనీ చేస్తూ,
"అవును. ఏకాంబరేశ్వరరావుగారే" శ్రీహర్ష ఇంకా ఏమి మాట్లాడాలో పాలుపోక.
ఇంతలో జీన్స్ పేంటు వేసుకుని, బాగా జుట్టు పెంచినకుర్రాడు ఒకతను ఆగేటు తెరుస్తున్నాడు. 
ఆ కుర్రాడు ఎవరు?" అన్నాడు శ్రీహర్ష.
''ప్రొఫెసరు సారి కొడుకు.ఉత్త 'బేకారు' పోరడు. సారు ఎప్పుడు పరేశానే కొడుకు గురించి. ఆయన కడుపునా చెడబుట్టిండు. చదువు లేదు. తింటడు. పోకిరోల్లను వెంటేసుకుని తిరుగుడు,  ఆడపిల్లలను అల్లరి చేసుడు. మీతో ముచ్చట పెట్టుకుని నాపని పాడు" అని తన పనిలో మునిగి పోయాడు దుకాణం అతను.
''వెళదాం" అని రమ్మని సైగ చేస్తూ సర్రున బైక్ స్టార్ట్ చేసాడు రంగ. ఇంకా అక్కడ వుంటే దుకాణం అతనికి అనుమానం వస్తుందని 
"ఓకే" అంటూ బైక్ ఎక్కాడు శ్రీహర్ష. వారు ఇంటికి చేరేసరికి సాయంత్రం ఆరు గంటలు దాటింది.
                                                                * * * * *
'టైం' రాత్రి తొమ్మిది గంటలవుతోంది.
రంగా, శ్రీహర్ష ఇద్దరు 'మెస్'లో భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి నడుస్తున్నారు.
''రంగా! నువ్వు  గమనించావో, లేదో ప్రొఫెసర్ గారితో పోలీసు స్టేషను నుంచి వచ్చిన కుర్రాడు ఆయన తమ్ముడో లేక దగ్గర చుట్టమో, బాగా పోలికలున్నాయి. అతని షర్టు మీద రక్తం మరకలున్నాయి. ఖచ్చితంగా అతనికి ఈ కేసుకీ సంబంధం ఉందనే చెబుతోంది నా 'సిక్త్ సెన్స్!" అన్నాడు శ్రీహర్ష ఇంకేదో ఆలోచిస్తూ. 
తనే మళ్ళీ మాట్లాడుతూ "రేయ్..రంగా! ఇంకొక 'క్లూ' వుందిరా. ఉదయం  దొరికిన డబ్బు చూసినప్పుడు ఒక ఐదు వందల రూపాయల కట్ట బ్యాండ్ స్లిప్  మీద స్క్రోల్ నంబరు చూసినట్లు గుర్తుందిరా. ఇంకో కట్టమీద బ్యాంకు బ్రాంచ్ పేరు వుంది. మనం ఆ బ్యాంకు బ్రాంచికి వెళ్లి ఆ స్క్రోల్ నంబరుతో ఎవరు డబ్బు డ్రా  చేశారో కనుక్కుంటే సంగతి తేలిపోతుందిరా!'' అన్నాడు శ్రీహర్ష నడుస్తూనే రంగా వంక 
సాలోచనగా చూస్తూ!
''నీ పరిశోధన పరిశీలనాశక్తి  అమోఘంరా! కాని మనకు ఆ బ్యాంకులో  డబ్బు'డ్రా' చేసిన మనిషి వివరాలు ఎవరు చెపుతారు ? మనం స్వయంగా వెళ్ళడానికి లేదు. ఆ బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఎవరైనా  తెలిసిన వారుంటే వివరాలు కనుక్కోవచ్చు  మాయింటి ఓనరు ఏదో బ్యాంకు లోనే వర్క్ చేస్తాడు. అయినా  కేసు వివరాలు  ఇంకేమైనా తెలుస్తాయేమో చూద్దాం'' అన్నాడు రంగా ఇంటి తాళం తీస్తూ.
ఇంట్లోకి వెళుతూనే టి.వి. ఆన్ చేసి లోకల్ న్యూస్ పెట్టాను. రెండు మూడు చానల్స్ మార్చాను. 
ఒక లోకల్ న్యూస్  ఛానెల్లో 'ఉదయం చిలకలగూడ లో పాడుబడ్డ భావినుంచి నుంచి వెలికి తీసిన శవం తాలూకు పరిశోధనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషను వెనుకాల కొంతమంది జులాయిలను కస్టడిలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించినట్లు, ఒక ఆటో ప్రయాణికుడి దగ్గర దోచుకున్న భారీ మొత్తం డబ్బు కోసం రెండు, మూడు గ్యాంగ్ లు రాత్రి చిలకలగూడ పాత రైల్వే బ్రిడ్జ్ దగ్గర బాగా గొడవ పడ్డట్లు, వారి లోనే ఒకడు శవమై భావిలో తేలినట్లు, డబ్బు ఏమయిందో ఇంకా  పోలీసులకు తెలియరాలేదని....ఇప్పుడే అందిన వార్త' అని, చెప్పిన వార్తనే మళ్ళీ మళ్ళీ చదివుతోంది రంగమాంబ. 
వార్తలు విన్న వెంటనే  "నువ్వు చెప్పు నీకు కేష్  బ్యాగ్  దొరికిన సమయంలో నిన్ను ఎవరైనా చూడడం గాని, నిన్ను అనుసరించడం గాని ఏమైనా జరిగుంటే పోలీసులు మన దాకా రావడం పెద్ద కష్టమైనపనేమీ కాదు" అన్నాడు శ్రీహర్ష వెంటనే స్పందిస్తూ.
'నిన్ను అడిగాను చూడు.నన్ను నేను చెప్పుచ్చుకుని కొట్టుకోవాలి' అనుకుంటూ జరిగిందంతా  పునః శ్చరణ చేసుకుని తననెవరు చూడలేదని నిర్ధారణ కొచ్చి "లేదురా. ఖచ్చితంగా నన్నెవరు చూడలేదు.ఫాలో కాలేదు" అన్నాడు రంగ. .
గంట తరువాత శ్రీహర్ష మళ్ళీ టి.వి. ఆన్ చేసి లోకల్ న్యూస్ పెట్టాడు. మరుసటి రోజు హైదరాబాదు బంద్. ఏదో రాజకీయపార్టి డిక్లేర్ చేసింది. కొత్త న్యూస్  లేవు. రంగమాంబ ఇందాక చదివిన న్యూస్ నే మళ్ళీ చదువుతోంది.
''సరేరా ఇక పడుకుందాం. రేపు న్యూస్ చూసి ఆలోచిద్దాం.పడుకో" అని ముసుగు కప్పేశాడు రంగ.
శ్రీహర్ష కూడ వెంటనే పడకేశాడు.
                                                                      * * * * *
తెల్లవారింది. సోమవారం. 
లేస్తూనే 'హిందూ' ఇంగ్లీష్ పేపరు పేజీలు తిప్పుతూ ఏమైనా డబ్బు పోగుట్టుకున్న లేక తెఫ్ట్ కేసులేమైనా రిపోర్ట్ అయ్యయాయని వెతికాదు శ్రీహర్ష .
టి.వి. న్యూస్ అంతా ఈ రోజు హైదరాబాద్ బంద్ గురించే దంచేస్తున్నాయి. సిటిబస్సు లేవీ తిరగవని 'ఆర్.టి.సి'. ఎం.డి. డిక్లేర్ చేశారు.
''రంగా! ఏవిటి ప్రోగ్రాం ? ఎలా ప్రొసీడ్ అవుదాం?" అడిగాడు శ్రీహర్ష. 
ఇవాళ హైదరాబాద్  బంద్. చూద్దాం! సిటీలో ఏమీ గొడవలు కాకుండా బస్సులు మామూలుగా తిరుగుతూ వుంటే ఆఫీసుకి వెళ్దాం!" అన్నాడు రంగ  
శ్రీహర్ష కాఫీ కలపడం పూర్తి అవుతుండగానే రంగా బ్రష్ చేసుకుని వచ్చాడు.
ఇద్దరు 'కాఫీ' సిప్ చేస్తూ ఈరోజు ఎలా ప్రొసీడ్ కావాలి అని నిర్ణయించుకున్నారు.
రంగా ముందుగా హౌస్ ఓనర్ ని కలిసి బ్యాంకు స్క్రోల్ నంబర్లు ఇచ్చి డబ్బు ఎవరు డ్రా చేశారో కనుక్కోవడం,  ప్రొఫెసరు గారింటి దగ్గర కాసేపు సర్వైలెన్స్ చేయడం, డబ్బు పోయిందని ఎవరైనా  ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేశారామో పోలీస్ స్టేషన్ లో ఆరా  తీయడం, ఆపైన దొరికిన డబ్బు ఎవరిదీ 'కన్ఫర్మ్ డ్' గా తెలుస్తే ఇద్దరు వెళ్లి డబ్బు హ్యాండ్ ఓవర్ చేయడం! ప.
'రంగా' క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా హౌసు ఓనర్ ని కలిశాడు.
అయన వివరాలు కనుక్కుని చెపుతానని, బ్యాంకుస్క్రోల్ నంబరు, తీసుకున్నాడు. వెంటనే  ఆయన ''ఏ రోజు' స్క్రోల్ నంబరు ఇది?" అనడిగారు. 
"మొన్నది కావచ్చు సార్! నాకు ఇది చాలా అవసరమయిన ఇన్ఫర్మేషను. మీరు సాయం చేయాలి  సర్'' అన్నాడు రంగా  చనువునంతా ప్రదర్శించి  వివరాలు తెప్పిస్తానని  ఏస్యురెన్స్' తీసుకు వచ్చాడు రంగ.
ఇద్దరు తొమ్మిది గంటలకల్లా తెమిలి బయటపడి వీదిచివర బండి దగ్గర టిఫిన్ చేశాక 
''చెప్పు మొదలు ఎక్కడికి వెళదాం?"అన్నాడు రంగ బైక్ స్టార్ట్ చేసి.
''ఫెసరు సర్ ఇంటి వైపు'' అన్నాడు శ్రీహర్ష వచ్చీ రాని ఈలవేసే ప్రయత్నం చేస్తూ.
పావు గంటలో ప్రొఫెసరు గారిల్లు దాటి నిన్న వారు వెళ్ళిన కూరగాయల దుకాణం దగ్గర ఆగారు.
దుకాణం దారు లేడు..అతని భార్యలా ఉంది. ఏదో కూని రాగం తీస్తూ దుకాణంలో కూర్చుని ఉంది. "శకునం బావుందిరా" అని షాపు లోనికి వెళ్లి సంభాషణ మెదలెట్టాడు శ్రీహర్ష.
''ప్రొఫెసరు సారు ఇల్లు ఎక్కడమ్మా?" ఆమె ముఖ కవళికలను గమనిస్తూ మొదలెట్టాడు శ్రీహర్ష.
''మూడిళ్ళ పక్కన '' అంది ఆమె.
''మీరెవరు? కాలేజీ పిల్లలా? చదువు చెప్పించుకోనికి వచ్చింరా'?" అమాయకంగా అడిగింది ఆమె.
''అవును సారుని కలవాలి"అన్నాడు హర్ష 
"ఇప్పుడు ఎల్లకండి బాబూ...సారింట్లో పెద్ద కష్టం వచ్చింది. సారు అన్న కొడుకువి పది లచ్చల రూపాయలు  పొయినయంట. అమెరికా నుంచి వాళ్ళ అన్న పంపింనాడంట.ఎవరో దొంగ ముండాకొడుకులు ఆ బాబు ఆటోలో వస్తుంటే  ఆ బాబుకి మత్తుమందిచ్చి, కట్టేసి డబ్బు అంతా కొట్టేసినారంట. పోలీసు కేసయిందంట. ఆబాబు, వాళ్ళ నాయన  అందరు ఇక్కడే ఉన్నారు.
మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళకండయ్య. బాగుండదు'' అని బాధపడుతూ చెప్పింది.
''అయ్యో పాపం అంత డబ్బు పోయిందా? ...ఇంకా దొరకలేదా?" ఆమె బాధను పంచుకుంటున్నట్లుగా అన్నాడు శ్రీహర్ష.
''లేదు బాబూ ! పోలీసు వాళ్ళ చేతులో పనిగంద. ఎప్పటికైనా  దొరుకుద్దో. దొరకదో...పాపం మంచి మనుసులు ఆల్లంతా. ఆల్లకి రావలసిన కష్టం కాదు" అంది దుకాణం ఆవిడ.
ఇంతలో దూరంగా నిలబడి ఉన్న 'రంగ' ప్రొఫెసరు గారి ఇంటి వంక చూస్తూ బైక్ స్టార్ట్ చేసి త్వరగా రమ్మన్నట్లుగా సైగ చేయడంతో నేను సంభాషణ ఆపి వెంటనే వెళ్లి బైక్ ఎక్కాను.
రంగా బైక్ ప్రొఫెసరు గారి ఇంట్లో నుంచి బయలుదేరిన బైక్ ఫాలో అవుతున్నాడు. 
నేను వెనకాల కూర్చుని గమనించాను. ఆ బైక్ మీద వెళ్తోంది ప్రొఫెసరు గారి అబ్బాయి. 
అయిదు  నిముషాల్లో సిఖ్ విలేజి 'లాంబ' సినిమా హాలు దగ్గర ఇరాని హోటల్ దగ్గర ఆగి బైక్ పార్క్ చేసి అటు ఇటు చూశాడు. పాను దుకాణం దగ్గర ఉన్నఇద్దరు మనుషులు...పాను నముల్తూ, సిగరెట్ కాలుస్తూ వచ్చి ప్రొఫెసరు గారబ్బాయిదగ్గరకి వచ్చారు. 
''ఏం  బె! నకరాలు పోతున్నవ్ .. పైసల్ ఏమనయి?" కోపంగా ఇద్దరిలో ఒకడు అతని మీదకు వస్తూ ..
''అన్నానిజం అన్నా!పైసల్ సంగతి నాకు తెలియదు.పైసలున్న బ్యాగుని ఆకొట్లాటలో,
ఎవడో లాక్కున్నడు. బ్యాగు చీకట్లో రైల్ 'బ్రిడ్జి' కింద పడి పోయింది. అప్పుడే పోలీసు వాన్ ఆగింది..
కరెంట్ లేదు. పోలీసు వాళ్ళుచాల మంది వచ్చారు. అందుకే అక్కడ నుంచి పారి పోయి,.
తరువాత వచ్చి  బ్యాగు కోసం అంతా  వెతికినా దొరకలేదు.ఏమి చెయ్యాలో తెలీక పరేషాన్ లో వున్నా. మా అన్న పైసలవి. వాడికి దక్కలే. నాకు దక్కలే..మొత్తం పది లక్షలన్నా.
మా అన్న 'చిలకలగూడ పి.ఎస్.లో కంప్లైంట్  చేశాడు. మా ఫ్యామిలీ అంతా పరేషాన్ లో ఉన్నాం. పోలీసు ఎస్.ఐ కూడా నన్ను. డౌట్ చేస్తున్నట్లు మాట్లాడిండు. నన్నుపరేషాన్ చెయ్యకండి.
నన్ను వదిలేయండి.  మీకు ముందే చెప్పిన అన్నకు ఏమీ కాగూడదని. ఆయన్ని కొట్టి, కారులో కట్టి పడేసినారంట'' అన్నాడు బతిమిలాడుతూ వాడి చేతులు పట్టుకుని.
''మేమేమన్నా పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నామా? రేపు ఉదయం కల్లా సగం పైసల్ తెచ్చి ఇవ్వక పోయినవా కొడకా! మీనాయనకు పోలీసులకు ఈ దొంగతనమంతా నీ ప్లాన్ అని తెలిసి పోతది. 
జైలు కి పోతావు  బిడ్డా!"' అని అతన్ని వెనక్కు నెట్టేసి క్షణంలో బైక్ మీద వెళ్ళిపోయారు ఆ ఇద్దరూ. 
పక్కనే వున్నా ఫ్లైఓవర్  పిల్లర్ వెనక నిలబడి వారి సంభాషణ  వింటున్న 'శ్రీహర్ష' వారి  బైక్ నంబరు నోట్ చేసుకోవడం ఎవరు గమనించలేదు.
వారంటూ వెళుతూనే ప్రొఫెసరు గారి అబ్బాయి 'పాన్ ' షాప్ దగ్గరికి వెళ్లి సిగరెట్ తీసుకుని స్మోక్ చేస్తూ ఎవరికో ఫోను చేసి  రెస్పాన్స్ కోసం ఎదురు చూడ సాగాడు.
రంగా ఎక్కడున్నాడా అని అటు ఇటు చూశాడు శ్రీహర్ష. పాన్ షాప్ వెనక నుంచి వస్తూ మొబైల్ లోకి తదేకంగా చూస్తూ శ్రీహర్షని రమ్మని చేత్తో సైగ చేస్తూ పిలిచాడు రంగ.
''అంతా రికార్డ్ చేశా. మాటలు వినబడడం లేదు కాని పిక్చర్ బాగా వచ్చింది చూడు''
అని తన మొబైల్ 'శ్రీహర్ష' చేతికిచ్చాడు.'
''ష్..ష్  మెల్లగా మాట్లాడు" అంటూ మొబైల్ లో వీడియో క్లిప్ చూస్తూ ''ఎక్సలెంట్' వీడియో అండ్ ఎవిడేన్స్'' అన్నాడు శ్రీహర్ష.
"నువ్వు ఇక్క్దడే వుండు" అంటూ ప్రొఫెసర్ గారి అబ్బాయి దగ్గరగా వెళ్ళాడు శ్రీహర్ష.
'శ్రీహర్ష' ని గమనించి అతను ఇంకా కొద్దిగా దూరంగా వెళ్లాడతను.
అతన్ని ఫాలో అవుదామని నిర్ణయించుకుని దూరంగా బైక్ మీద వెయిట్ చేశారు. .
పది నిముషాలాగాక ప్రొఫె సర్  గారబ్బాయి  బయలుదేరడం గమనించి, అతనికి అనుమానం రాకుండా అతన్ని ఫాలో అయ్యారు.  అతను ఇంటివైపే వెళ్ళడం గమనించి వీళ్ళు సికింద్రాబాదు వైపు కదిలారు.
                                                                * * * * *
మధ్యాహ్నం రెండు గంటలు అవుతోంది. చిలకలగూడ పోలీసు స్టేషను.
ఇన్స్పెక్టర్ రంగనాథ్ ఏవో రిపోర్ట్స్ చూస్తున్నాడు. ఇంతలో టేబుల్ మీద ఫోను మ్రోగింది.
''హలో సబ్  ఇన్స్పెక్టర్ రంగనాథ్..చిలకలగూడ...స్పీకింగ్ !'' అన్నాడు రంగనాథ్.
''సర్! మీకు ఒక ఇన్ఫర్మేషను. నిన్న మీదగ్గర రిజిస్టరు అయిన పది లక్షల రూపాయల
దొంగతనం కేసుకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను ఉన్న ఒక కవరు మీ మోటర్ బైక్ పక్కనే వుంది. చూడండి" 
"హలో మీరెవరు...మీ...." మాట పూర్తి చేయకముందే ఫోను డిస్కనెక్ట్ అయింది.
రంగనాథ్ వెంటనే స్టేషను బయటకు వచ్చి  తన బుల్లెట్  బైక్  పక్కనే పడి ఉన్న ఒక పొడుగాటి ఎన్వలప్  తీసుకుని లోనికి వెళ్లి తన సీట్లో సెటిల్ అయ్యాడు. కవరుని టేబుల్ లైట్ వెలుతురులో 
జాగ్రత్తగా చూసి కవరులో ఏదో పేపరు, ఫోటోలు ఉన్నట్లుగా గుర్తించాడు. వెంటనే కవరు తెరిచి చూశాడు. కవరులో  ఇన్ స్పెకరుని వుద్దేసించి వ్రాసిన లెటరు ఒకటి, రెండు ఫోటోలుఉన్నాయి. ఫొటోలో ఉన్నవ్యక్తులు, ఎక్కడో చూసిన ముఖాల్లా ఉండడంతో పరుశురాంని పిలిచి ఫోటోలు    చూడమని తను కవరులో ఉన్న లెటరు చదవడం మొదలెట్టాడు రంగనాథ్.
ఫోటోలు చూస్తూనే "సార్!'.... అని ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడైన పరుశురాం, ఇన్స్పెక్టర్ లెటర్ చదవడం గమనించి ఫోటోలు చేతిలో పట్టుకుని ఆయన లెటర్ చదవడం పూర్తి అయ్యేవరకు చూసి "సార్! ఈ ఫోటోలో ఉన్నది  ప్రొఫెసరు గారి కొడుకు. రెండో ఫోటోలో ఉన్న ఇద్దరు  మన స్టేషన్  రికార్డులో ఉన్న రౌడి షీటర్ లు'' అని పరశురాం చెప్పాడు. 
వెంటనే ఒక  'టీం' ని ఆ ఇద్దరు రౌడి షీటర్ లను తీసుకురమ్మని పంపి, తను పరశురాంతో ప్రొఫెసరు ఇంటికి చేరారు.
ఇన్ స్పెక్టర్ రంగనాథ్ కి తెలీదు వారి జీప్ వెనుక మోటర్ బైక్ ఫాలో అవుతోందని.
పరశురాంని జీప్ లోనే ఉండమని 'రంగనాథ్'  ప్రొఫెసర్  ఇంటి లోనికి వెళ్ళాడు. 
బయట తలుపు తీసే ఉంది. రంగనాథ్ బయట గుమ్మం దగ్గరున్న కాలింగ్ బెల్  కొట్టిన పది సెకండ్ల లోనే ప్రొఫెసరుగారి అబ్బాయి బయటకు వచ్చి ఇన్ స్పెక్టర్ ని చూసి కంగారు పడడం అతని ముఖకవళికలలో స్పష్టంగా గమనించాడు రంగనాథ్. 
''సార్! డబ్బు దొరికిందా ?" చాలా ఆత్రంగా అడిగాడతను కంగారుని కప్పి పుచ్చుకుంటు.
''దొరుకుతుంది.ఎక్కడికి పోతుంది? డబ్బు కొట్టేయాలని ఎవరు ప్లాన్ చేశారో మాకు తెలిసింది  ఆవిషయం మాట్లాడడానికే వచ్చాను.
''నాన్నగారు, మీ అన్న చంద్రకుమార్, ఇంట్లో ఉన్నారా?" అనడిగాడు రంగనాథ్  అతని కళ్ళలోనికి సూటిగా చూస్తూ.
''ఉన్నారు సార్! రండి " అంటూ "డాడీ! ఇన్ స్పెక్టర్ గారు వచ్చారు"అని సోఫా చూపిస్తూ "కూర్చోండి" అని చెప్పి లోనికి వెళ్లి మంచినీళ్ళు ఇచ్చి పక్కగా నిలబడ్డాడు.
ఇంతలో ప్రొఫెసరు గారు, చంద్రకుమార్ చేతికి చిన్నబేండేజితో బయటకు వచ్చారు.
హాల్లోకి వస్తూనే ''గుడ్ మార్నింగ్' ఇన్ స్పెక్టర్" ఇంత త్వరగా మళ్ళీ వచ్చారు. ఏమిటి విశేషం"  సాలోచనగా ఇన్ స్పెక్టర్ మొహంలోకి చూస్తూ అన్నారు ప్రొఫెసర్ .
''ఈ కేసులో ఊహించని పరిణామం ఒకటి మా దృష్టికి వచ్చింది సర్!..కొన్ని సాక్ష్యాధారాలు కూడా  దొరికాయి. అనుమానితుల ఫోటోలు కూడా దొరికాయి..." 
"చంద్రకుమార్ గారు! ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులని గుర్తించగలరేమో నని అనుమానితుల ఫోటోలు తీసుకుని వచ్చాను.చూడండి"అంటూ చంద్రకుమార్ చేతికి ఫోటో ఒక్కటి ఇచ్చాడు రంగనాథ్.
ఫోటో చూసిన మరుక్షణం ఎస్...వీళ్ళిద్దరూ ఆ దొంగలే. రన్నింగ్ ఆటోలో ఎక్కి నాముఖాన్ని గుడ్డతో నొక్కి మత్తు మందు ఇచ్చింది వీళ్ళిద్దరే" అన్నాడు ఆవేశంగా చంద్ర కుమార్.
వెంటనే రెండో ఫోటో అతని చేతికి ఇచ్చాడు రంగనాథ్. 
తమ్ముడి వాళ్ళతో కలిసి ఫొటోలో వుండడం చూసి సంగతి అర్ధం అయి పోలీసు ఇన్ స్పెక్టర్ ఎందుకు వచ్చాడో అర్ధమయి, మాట్లాడడం ఆపు చేసి, ఫోటో తిరిగి ఇన్ స్పెక్టర్ కి తిరిగి ఇస్తుండగా "ఆ ఫోటో మీ బాబాయి గారికివ్వండి!'' అన్నాడు రంగనాథ్.
చంద్రకుమార్ ఆ ఫోటో పట్టుకుని బాబాయికి ఇవ్వకుండా అలానే నిశ్చేష్టుడై రాయిలా ఉలుకు పలుకు లేక ఆలోచిస్తూ, పరధ్యాన్నంగా నిలబడిపోయాడు.
అమెరికానుంచి అన్నడబ్బు పంపిన సంగతి చెప్పి ఆరోజు డబ్బు తీసుకువద్దామని, ఐ ఫోను కొందామని తమ్ముడు 'చరణ్' ని తనతో రమ్మని అడగడం, 'అర్జెంట్ పనిఉంది' రాలేనని చరణ్  చెప్పిన సంగతి గుర్తుకి వచ్చి, సినిమా దృశ్యంలా తన కళ్ళ ముందు కదలాడింది. 
తమ్ముడు కూడా ఆ దొంగల గ్యాంగ్ లో ఉన్నాడన్న సంగతి అర్ధమైంది. ఆస్థితిలో బాబాయి తో ఎలా స్పందించాలో తెలీక చిత్తరువులా అయిపోయాడు.
వెంటనే "ఇన్స్పెక్టర్  గారూ! నేను కంప్లైంట్  వెనక్కి తీసుకుంటున్నాను" అన్నాడు చంద్రకాంత్. 
''ఏమిట్రా! ఏమయింది?  కంప్లైంట్  విత్డ్రా చేసుకోవడమేమిటి ? ఎందుకలా మాట్లాడుతున్నావు. 
ఆ ఫోటో ఇలా ఇవ్వు'' అని ప్రొఫెసరుగారు చేయిజాపారు.
''లేదు బాబాయ్! కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాను. ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారికి లెటర్ వ్రాసి ఇస్తాను" అంటూ ఆందోళనగా "ఇన్ స్పెక్టర్ గారూ ఇందులో ఏదో పొరపాటు అయినట్టుగా ఉంది.ఈ ఫోటో బాబాయి గారు చూసి ఏంచేస్తారు? అనవసరమైన ఆందోళన తప్ప" అంటూ ఫోటోని తిరిగి ఇన్ స్పెక్టర్ కి ఇచ్చాడు చంద్రకుమార్.
''సర్! మీరు చూడండి వీటిని..." అంటూ రెండు ఫోటోలని, ఆ లెటరుని ప్రొఫెసరు గారికి ఇచ్చాడు ఇన్స్పెక్టర్. 
ప్రొఫెసర్  కళ్ళజోడు సవరించుకుని రెండు ఫోటోలని చూసి, లెటర్ చదివి
సైలెంట్ గా తిరిగి వాటిని  ఇన్ స్పెక్టర్ చేతికి ఇచ్చి "చంద్రా! కంప్లైంట్  విత్డ్రా చేసుకోవద్దు. 
నీ డబ్బు తిరిగి నీ చేతికి రావాలి" అంటూ ఇన్స్పెక్టర్ ని ఉద్దేశించి  "ఇన్స్పెక్టర్! యు ప్లీజ్ ప్రొసీడ్ అహెడ్ ..." అంటూ లోనికి వెళ్లారు. 
ఇన్ స్పెక్టర్ లేచి చరణ్  భుజం మీద చేయివేసి "మీతో కొద్దిగా మాట్లాడాలి" అంటూ తనని తీసుకుని బయటకు వెళ్తూ ''చంద్ర కుమార్  గారూ! మీరు ఒకసారి స్టేషనుకి రావాలి. ఫోటోలో ఉన్న ఇద్దరిని గుర్తించాలి" అంటూ 'చరణ్' ని స్టేషనుకి తీసుకుని వెళ్ళారు.

                                                                      * * * * *
పోలీసు ఇన్ స్పెక్టర్ 'చరణ్' ని తీసుకుని వెళ్ళిన వెంటనే  శ్రీహర్ష, రంగ  ఇద్దరు  ప్రొఫెసరు గారింటికి వచ్చారు. 
రంగ బయట కాలింగ్ బెల్ కొట్టాడు. చంద్రకుమార్  వచ్చి తలుపు తీసి ''ఎవరు కావాలండీ?" అని అడిగాడు.
''మీతోనే పని ఉండి వచ్చామండీ'' అన్నాడు శ్రీహర్ష.
''నాతోనా ? మీరెవరో నాకు తెలీదే  నాతో మీకు పనేమిటి?" కంగారుగా అడిగాడు చంద్రకుమార్.
''కంగారు పడకండి. మేము మీకు అపరిచితులమైనా స్నేహితులం. మీతోనే కాదు.
ప్రొఫెసరు గారితో కూడా పనిఉందండీ. మేం మాట్లాడే విషయం వారి ముందే మాట్లాడాలి. 
చాలా ముఖ్యమైన విషయమండీ" అన్నాడు వినయంగా రంగ. .
''ఒక్క నిముషం. బాబాయి గారితో మాట్లాడి వస్తాను'' అని లోనికి వెళ్ళాడు చంద్రకుమార్. .
"బాబాయ్! మిమ్ముల్ని, నన్ను కలవాలని ఎవరో  తెలియని వ్యక్తులిద్దరు వచ్చారు" అని తలుపు తట్టాడు చంద్రకుమార్.  
"ఇప్పుడెవ్వరి ని కలవను. రెండురోజులు తరువాత రమ్మని చెప్పు" అని చెప్పి తలుపు తీయలేదు.
చంద్రకుమార్  బయటకు వచ్చి "బాబాయి గారి ఒంట్లో బాలేదు. రెండు రోజుల తరువాత రమ్మన్నారు. నాతో పని ఏమిటి?"  చెప్పండి అన్నాడు చంద్రకుమార్. 
''మీరు పోగుట్టుకున్న డబ్బు గురించి మాట్లాడాలి. లోనికి రావచ్చా?" అన్నాడు శ్రీహర్ష.
వారిని లోపలకి రమ్మని డ్రాయింగ్ రూం లో సోఫాలో కూర్చోమని లోపలకి వెళ్లి ''బాబాయ్!  మీరు త్వరగా రావాలి. ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు,  పోయిన డబ్బు గురించి మాట్లాడడానికి వచ్చారు. 
మీరు త్వరగా బయటకు రావాలి" అంటూ తలుపు గట్టిగా కొట్టాడు చంద్రకుమార్.. 
ప్రొఫెసరు గారు  బయటకు వచ్చి "ఎవర్రా వాళ్ళు? ఎక్కడ?" అంటూ  చంద్రకుమార్ వెంట ఆయన కూడా కంగారుగా డ్రాయింగ్ రూం లోకి వచ్చి "మీరెవరు, మీకు పోయిన డబ్బుతో సంబంధం ఏమిటి?" వరుసగా ప్రశ్నలు వేసి " మీరు మాట్లాడేముందు పోలీసు ఇన్ స్పెక్టర్ ని కూడా పిలవడం మంచిది కదా!" అన్నారు. 
వెంటనే శ్రీహర్ష  షర్టు లోపల దాచిన డబ్బు జిప్ బ్యాగు తీసి "ఈ బ్యాగును గుర్తించగలరా?" అని అడిగాడు చంద్రకుమార్  ని. . .
చంద్రకుమార్ ఒక్క గెంతు తో శ్రీహర్ష దగ్గరికి వచ్చి ''ఈ బ్యాగు నాదే. ఆటోలో వస్తుంటే ఈ కేష్  బ్యాగుని  దొంగలు కొట్టేశారు'' అన్నాడు ఆత్రంగా.
''మీరు ఏమనుకోకపోతే ఈ బ్యాగులో ఉన్నఎంత డబ్బువుంది? ఇంకా ఏమి ఉన్నాయి చెప్పగలరా?" అనడిగాడు శ్రీహర్ష. 
''మొత్తం తొమ్మిది లక్షల అరవై వేలరూపాయలు తార్నాక స్టేటు బ్యాంకులో డ్రా చేశాను. బ్యాగులో  ఒక 'ఐ' ఫోను' ఉండాలి. పోలీసు కంప్లైంట్ లోనూ ఇదే  వ్రాశాను" అన్నాడు చంద్రకుమార్. 
ప్రొఫెసరు గారికి ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. అంతా మాయగా, ఏదో మేజిక్  షో' చూస్తున్న అనుభూతితో కన్నార్పకుండా వాళ్ళ వంక చంద్రకుమార్  'ట్రాన్స్' లో ఉన్నట్లు చూస్తూ ఉండి పోయారు.
శ్రీహర్ష బ్యాగు జిప్ తీసి "చంద్రకుమార్ గారు! చూసుకోండి మీ డబ్బు, వస్తువులు అన్నీ సరిగ్గా  ఉన్నాయా చెక్ చేసుకోండి" అని బ్యాగ్ చంద్రకుమార్ చేతికి ఇచ్చాడు. 
చంద్రకుమార్ బ్యాగులో ఉన్న డబ్బు కట్టలన్నీ గ్లాస్ టేబుల్ మీద బోర్లించి, లెక్క చూసి 
''మై గాడ్' డబ్బు అంతా ఎలా బాగ్ లో పెట్టానో అలాగే ఉంది.  ఐ ఫోను కూడా ఉంది. 
నోట మాట రావడం లేదు"  మీ ఇద్దరికి ఎలా థాం క్స్  చెప్పాలో అర్ధంకావడం లేదు" అంటూ 
వారికి నమస్కారం చేసి, చేతులు ముఖం మీద కప్పుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు.
''బాబాయ్! పోయిన డబ్బుఅంతా దొరికింది. వీళ్ళేవరో మనుషులు కారు. దేవుళ్ళు'' ఇంకా ఏదో నోట్లోనే గొణుక్కుంటూ పదే పదే  రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ పట్టరాని సంతోషంతో  అతని కళ్ల వెంట నీరు ధారాపాతంగా కారుతోంది. 
చంద్రకుమార్ , ప్రొఫెసర్  రంగ, శ్రీహర్ష  ని కూర్చోమని చెప్పి  ఇద్దరు  ఇంటి సభ్యులతో ఈ విషయం చెప్పడానికి లోనికి వెళ్ళాడు.
రెండు, మూడు నిముషాల తరువాత ఇంటిల్లపాది తిరిగి డ్రాయింగ్  డ్రాయింగు  రూం లోకి వచ్చేసరికి రూమ్ లో ఎవరు కనిపించలేదు. గేటు బయటకు వచ్చి చూసినా  వారికి ఎవరు కనిపించలేదు.
                                                            ---------xXx----------

                             
రచన:
కేశిరాజు వెంకట  వరదయ్య.
Mobile No. 9849118254