లేబుళ్లు

3, మార్చి 2015, మంగళవారం

భారతీయత -మారుతున్నవిలువలు - వైరుధ్యాలు



                                         భారతీయత - మారుతున్నవిలువలు - వైరుధ్యాలు
                                         ----------------------------------------------------------------

              ప్రస్తుత భారత ప్రజల జీవనవిధానం, సామాజిక పరిస్థితులను గమనిస్తే,
పెద్దగా గణాంకాల జోలికే వెళ్ళకుండానే అవగతమయ్యే విషయం ఏమంటే 'ఉన్నవారికి పుష్కలమైన సంపద, విలాసవంతమైన జీవితం, సుఖలాలస, అట్టహాసాల జీవిత ప్రదర్శన చేస్తూ పోటీపడి జీవించడమైతే మరొకపక్క కడుపేదరికం - తిండికి, గుడ్డకు, నీడకు కరువు;
వీటికై  నిరంతర జీవనపోరాటం'. ఈ జీవన వైరుధ్యాల సంకట పరిస్థితులతో కుల,మత చట్ర బంధ సమ్మిళితమైన మన సమాజపరిస్థితి, దిగజారుతున్న విలువలు ఈ దేశ'యువత'ను ఆలోచనలలో గాక అయోమయంలో పడేస్తోందనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నది పచ్చి నిజం.

ప్రపంచీకరణతో ఈదేశంలోకి మరింత చొచ్చుకు వచ్చిన బహుళజాతి  ఉత్పత్తులు, భాష,
బహువేషధారణలు,వాటి పేరిట ముసుగులో దిగజారిన విలువలు ఇవి గాక 'వినోదం' పేరిట 
చిన్న,పెద్ద వ్యాపారుల, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, బహుళజాతి సంస్థల లాభాపేక్ష, విపరీత వ్యాపార దృష్టి. ఇవన్నీ కలిసి స్థూలంగా ఎంతోకొంత
భారతీయ సైద్ధాంతిక,మానవీయ, నైతిక విలువలకు తిలోదకం ఇవ్వడానికి దోహదం చేస్తున్నాయి. కొన్ని ప్రసారమాధ్యమాలు అనగా సినిమా, టివీ, వార్తాపత్రికలు,ఇంటర్నెట్, 
(అంతర్జాలం) యూట్యూబ్, నెట్ ఫ్లిక్, వందలసంఖ్యలో అందుబాటులో ఉన్న వెబ్ సైట్లు,
వాటి వాటి వ్యాపారధోరణిలో కొన్ని మాధ్యమాలు ఒకదానిని మించి మరొకటి పోటీపడి ప్రసారం చేస్తున్న నిషేదిత సినిమాలు, హింస, అసభ్య, అశ్లీల, ఆవేశప్రేరిత ,విషయ సమాచారం, ప్రసారాలు, ప్రచారం మన యువతను పెడదారులు పట్టిస్తూ ,
విలువకట్టలేని, ప్రపంచంలో మరెక్కడా లేని మన భారత దేశ ఆధ్యాత్మిక ఔన్నత్య
సంపదని మంటగలుపుతూ మన ఋషులు, పూర్వీకులు, కవులు, పండితులు, మేధావులు మనకందించిన శాశ్వత విలువలను పునాదివేళ్ళతో సహా పెకిలించి మన సంస్కృతిని
నాశనం చేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ఆ విలువలే మన భారతజాతిని ఇన్నాళ్ళు కాలపరీక్షకు వెన్నుగాచి నిలిచి,
గెలిచిన విభిన్న భారతీయతను 'భిన్నత్వంలో ఏకత్వం' తో ఒకే గాట కట్టిఉంచాయన్న
సత్యాన్ని మరుగుపరిచి ఆ విలువల్నిఅవాస్తవ, 'ప్రతి' పరిశీలనా, విపరీత విమర్శనాత్మక ధోరణులతో అవహేళన చేయడం,కాలరాయడం రోజువారీ కార్యక్రమమయింది.
ఉదాహరణకు మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, గ్రామీణ సేవా వ్యవస్థ,
సేద్యం మొదలయిన గ్రామీణ వ్యవస్థలన్నీఒక్కొక్కటిగా కుంటుబడడమో,
కుప్పకూలడమో జరుగుతోంది.
గ్రామీణ భారతం కులవృత్తులను మాని పొట్టకూటికై పట్టణాలకు పరుగులెత్తుతోంది.
డెబ్బై శాతం ప్రజలు గ్రామీణ భారతంలో వ్యవసాయాధారిత, కులవృత్తులను మాని అనడం కంటే ప్రపంచీకరణతో వారికి ఆదరణ కరువై కుటుంబాలు పొట్టకూటికై, పిల్లలభవిష్యత్తు కోసం పట్టణాలకు వలస బాట పట్టాయి.
దీంతో పట్టణీకరణ మితిమీరింది. వ్యాపారాలు విస్తరిస్తున్నాయి. అంగడిలో వినియోగ
వస్తువులతో బాటు గ్రామాల్లో,అడవుల్లో మాత్రమే లభించేవస్తువులు కూడా పట్టణాల్లో
విరివిగా,కృత్తిమంగా  లభ్యమవ్వడం ప్రారంభమయింది. గ్రామీణభారతంలో తగ్గిన వనరులతో,
ఇక ఈదేశం భవిత 'యువత' ప్రపంచీకరణ ప్రభావంతో ప్రాక్ పశ్చిమ నాగరికత మోజులోపడి,పట్టణాలకు పరుగెడుతూ అర్ధమే పరమార్ధంగా జీవిస్తూ జీవితాల్ని తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళకు గురిచేసుకుని, లక్ష్యసాధన మరిచి తమ తమ జీవితాల్ని దుర్భరం చేసుకుంటున్నారు.
లభ్యమవుతున్న గణాంకాల ప్రకారం 2050 వరకు దేశంలోని గ్రామీణ ప్రజ డెబ్బై శాతంనుంచి ఏభై శాతం వరకు పడిపోతుందన్న లెక్కలు ప్రతి భారతీయుని మదిని తొలిచేదిగానే ఉంది.  

                                          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి