లేబుళ్లు

19, జనవరి 2012, గురువారం

ప్రేమ-దైవత్వం

                                                                         ప్రేమ-దైవత్వం

                         ఉన్నతమైన ఆలోచనలు , ఆశయాలని దరి చేర్చుకునే వారే గొప్పవారు. అందరి మంచితోను అందరి ఆనందం ఉందని గ్రహించినవారే నిజమైన శ్రీమంతులు. అశాశ్వతమైన వేవో, శాశ్వతమైన వేవో భగవంతునికి ఇష్టమైన వేవో  వీరు గ్రహించగలరు. ఇలాంటి మహా వ్యక్తులవల్లనే సామరస్య భావ మాధుర్యాలు జనవాహినిలో జీవం పోసుకుంటాయని లోక హితైషుల ఉద్బోధ.
                         ప్రపంచంలో ధనవంతులు, విద్యాధికులు, అనేకనేక రంగాలలో పేరుప్రఖ్యాతులు పొందినవారు, విజ్ఞాన ఖనులు ఉంటారు. కాని 'మానవప్రేమ'ను గ్రహించి ఆచరణలో పెట్టగలిగే వారికోసం అన్వేషించవలసి  వస్తోంది. మనం వేరు, వారు వేరు అని ధనిక, పేద వర్గాల మధ్య, కులమతాల ప్రాతిప్రదికగా మనుషుల మధ్య అడ్డుగోడలు కట్టేవారు, అలా అలోచించేవారే  శాతమే మనలో ఎక్కువ. పైగా వారి సంకుచిత ధోరణలు, ఇంపైన మాటలు ఆసక్తిగా వినేవారు ఎక్కువమందే  మనలో వున్నారు. ఫలితంగానే ధర్మేతర శక్తులు తలెత్తుతున్నాయని శాంతి కాముకుల ఆవేదన. సాటి మనుషుల్నిప్రేమించడం, కష్టకాలంలో వారిని ఆదుకోవడం, మృదుభాషణం ....ఇవన్నీ అశాశ్వతమైన సంపదకన్నా, వజ్రవైడుర్యాలకన్నావిలువైనవేనన్న మహాత్ముల ప్రభోధాలను ఆచరించడంలో విఫలమవుతున్నారు, విస్మరిస్తున్నారు. మనుషులు 'తమని' ఆరాధించే వారికన్నా బక్క బ్రతుకుల ఆర్తులను ఆదరించేవారిని భగవంతుడు అధికంగా ప్రేమిస్తాడని తత్వవేత్తల అమృతవాక్కు. ఇదే ప్రపంచంలో ఉన్న అన్ని మతాల
పవిత్రభావాలకు జీవ వాయువు. అందువల్లనే హృదయంలో మానవత్వం నిద్రపోతే 'దైవత్వాన్ని' దూరంచేసు కున్నట్లే నని తత్వవేత్తలు, మహర్షులు అన్నారు.  ' ఆర్తులను' ఆదుకునే మనసు, శక్తివంచన లేకుండా సహాయం చేయడమే 'లక్ష్యం'గా చేసుకున్న మనుషులంతా మహనీయులే. అంతేకాక సర్వజనుల సుఖ సంతోషాలు కోరి, ఏనాడు ప్రత్యుపకారం ఆశించని వారి  'మానవసేవ' అభినందనీయమే....అజారామరమే ! వారంతా విశ్వప్రేమ తపస్వులే!               

17, జనవరి 2012, మంగళవారం

మానవదేహం



                                                                        యోగభూమి 
                                                                      ***********

                           ఆధ్యాత్మిక రంగంలో  దేహంపట్ల  విభిన్న అభిప్రాయాలు, ధోరణలు ఉన్నాయి. అది అశాశ్వతమని దానికి   అంతగా మర్యాద ఇవ్వనవసరంలేదని  అంటూనే  పరమపద సాధనకు దేహం ఓ సాధనమని ,ఓ ఉపకరణమని దాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని  అంటుంటారు. ఈ రెండు వాస్తవాలే ! దేనినీ నిరాకరించనవసరం లేదు. నిజానికి దేహం పరమపద  సోపాన  అధిరోహణకు ఏకైక సాధనం. 
                          అసలు ఈ 'దేహం' ఏమిటి ? కైవల్య సాధనలో దాని పాత్ర ఏమిటి ? మనిషి జన్మించాక  తనదంటూ ఉన్నది, తనకంటూ ఉన్నది 'దేహం' మాత్రమే ! ప్రాపంచికమైనా , పారమార్ధిక మైనా ఆయా సాధనలకు మన దగ్గర ఏమున్నా లేకున్నా, అవసరమనుకున్నది లభ్యమైనా , కాకపోయినా దేహం మాత్రం మనతోనే ఉంటుంది. అదృష్ట వశాత్తు భగవత్సాధనకు అవసరమైన దేహాన్ని మాత్రం భగవంతుడు అప్రయత్నంగానే మనదగ్గరేముందో  దాన్నే మన సాధనోపకరణంగా మనకు నిర్దేశించాడు. బహూకరించాడు. ఇది ఓ అద్భుతం. అదృష్టం !
                           మరి అలాంటి ఈ దేహంతో మనం ఏమిచేయగలం ? ఆలంకరించు కోగలం తినగలం. తాగగలం.
నిద్రించగలం. సుఖభోగాలనుభచగలం. చివరకు  'దేహాన్ని'మరణించడం. అంతేనా....? అంతే......... దేహాన్ని దాని సృజనోద్దేశ్యాన్ని ఆహార నిద్రాభయ మైధునాల కోసం మాత్రమే అని ఆలోచించే వారికి, ఆమేరకే వినియోగించే వారికి  అంతే...............! వాస్తవంలో  ఈ సృష్టిలో 'దేహ సృష్టి' కి ఓ మహోన్నత  పవిత్రోద్దేశ్యం ఉంది. ఇంత కీలకమైన  దేహాన్ని దానిలోని సకల సారాన్ని కేవలం అజ్జ్ఞాన  స్థితిలో మనకందించాడు 'పరమాత్మ' ! ఎంత విచిత్రం ! ఆ పరమాత్మ అందిం చిన 'దేహంలో ' ఉన్న పరమాత్మను చూడలేని స్థితి మనది. ఆయనే అయిన మనం, మళ్ళీ ఆయనకోసమే అన్వేషించే విచిత్ర వర్తమాన స్థితి. మరి అలాంటి అపురూపమైన ఈ దేహాన్ని, ముఖ్యంగా అనిశ్చిత  మైన ఈదేహాన్నిఎన్ని కళ్ళతో కాపాడుకోవాలి ? ఎంత అప్రమత్తులమై ఉండాలి.  నిజమే.............ఈ దేహం అశాశ్వతమే! కాని దాని  సృజనోద్దేశ్యం ఉత్కృష్టమైనది. దాని కర్తవ్యం నిరుపమాన మైనది ! సౌందర్య వ్యక్త రూపంగా అహంకార ప్రదర్శన వేదికగా దాన్ని మలుచుకోవడం కాని , భావించడంగాని  సరికాదు . అందుకే అవసరాన్ని,ప్రయోజనాన్ని  మించి  దానిని కొలవడం  సరికాదని విజ్ఞులు  సూచిస్తారు. అందుకే దేహాన్ని సాత్విక , మితాహారంతో ఉపయుక్త జీవన విధానంతో దేహాన్ని ఆరోగ్యంగా, బలంగా ,బిగువుగా ఉంచుకోవలసిందే ! శుచి రీత్యా కొంత శారీరక సేవా అవసరమే....అంతవరకే!            

ఆరోగ్యానికి హరివిల్లు



ఆరోగ్యానికి హరివిల్లు
---------------

మనం తినే ఆహారం ఎంత వర్ణ రంజితంగా, వైవిధ్యంగా భరితంగా వుంటే ఆరోగ్యానికి అంత మంచిదని ప్రయోజ నకారి అని, పోషకాహార నిపుణుల ఉద్దేశ్యం. రకరకాల కూరగాయలు, పండ్లతో కూడిన భోజనం కంటికీ,ఒంటికీ కూడా విందు చేస్తుంది. ఈ రంగురంగుల వృక్ష సంబంధమైన ఆహరంలో కీలకపోషకాలైన కెరోటినాయిడ్లు, బయో ఫ్లవనోఇడ్లు వంటివి ఉంటాయి. ఇవి మనశరీరంలో విశ్రుంఖల కణాల (ఫ్రీ రేడికల్స్) దాడిని అడ్డుకుంటాయి. అంతే కాక ఇవి వయసుతో పాటు శరీరంలో, శరీర కణాజాలంలోవచ్చే క్షీణతను నిలవరిస్తూ కణజాలన్ని కాపాడుతూ ఉంటాయి.
                       టొమాటో, పుచ్చకాయ, ద్రాక్ష,అంజీర లాటి ఎర్రటి పండ్లలో ఉండే లైకోపెన్....జీవకణాలలో ఒత్తిడిని తగ్గించే 'యాంటీ ఆక్సిడెంట్' గానే గాక శరీరంలోపల రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
                       బొప్పాయి, క్యారట్లు, చిలగడ దుంప లాటి పసుపు, నారింజ రంగులలో ఉండే పండ్లు కూరగాయల్లో 'బీటా కేరోటిన్లు' అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎప్పటికప్పుడు రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరిచడానికి కావలసిన శక్తిని ఇస్తూ ఆ వ్యవస్థను మెరుగుపరుస్తుంటాయి. విటమిన్ 'ఎ' లోపం రాకుండానే కాక 'కేన్సర్' కారక కణాలను నివారిస్తూ ఉంటాయి.
                      ఇక మసాలా దినుసులు, పసుపు, గ్రీన్ టి, బత్తాయి,నారింజ వంటి పండ్లు, దుంపలు, కూరగాయల్లో అధికంగా ఉండే బయో ఫ్లవనాయిడ్లు గుండె జబ్బులు, పక్షవాతం వంటివి రాకుండా రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇలా సహజంగా లభ్యమయ్యే అన్ని రంగుల పండ్లు, కూరగాయలు, దినుసులు, అన్ని రకాల పదార్ధాలకు ఏదో ఆరోగ్య ప్రయోజనం ఉంది. కాబట్టి సహజంగా లభించే రంగు, రంగుల పదార్ధాలు మితంగా ఎన్ని తింటే అంత మంచిదని గుర్తించండి.
                      ప్రొద్దున మంచి ఉపాహారం, తరువాత మిత భోజనం ఆరోగ్యానికి మంచిదని గుర్తించండి.
పొద్దున్న ఉపాహారం మానేస్తే శక్తి హీనత, మధ్యాహ్నం, రాత్రి భోజనం మానేస్తే మొదటికే మోసమని తెలుసుకోవడం మంచిది.
                     ఉపవాసమనో లేక బరువు తగ్గుదామనో చాలామంది తరుచు ఉపవాసం చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టూ ముడతాయని గుర్తుంచుకోండి. ఖాళీ కడుపుతో ఉండడం వల్ల బలహీనత, అసిడిటి, అలసిపోవడం, తీవ్ర తలనొప్పులు వంటి బాధలు వేధిస్తాయి.
                      కొందరు తినడం మొదలెడితే గొంతు దాకా ఆబగా తినేస్తుంటారు....ఎవరో తరుముతున్నట్లు గబగబా వేగంగా తినేస్తుంటారు. ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. ఆహారం నెమ్మదిగా నమిలి, రుచిని అస్వాదిస్తూ తినడం మంచిది. వేగంగా తినే వాళ్లకి ఎంత తిన్నా కడుపు నిండిన భావన ఉండదట. ఎందుకంటే మన కడుపు ఖాళీగా ఉందా లేక ఇంకా తినాలా లేదా కడుపు నిండిందా....వంటి సమాచారాన్ని మన మెదడుకు చేరవేయడానికి మన శరీరంలోనే ఒక 'వ్యవస్థ' ఉంది. ఆ సమాచారం మెదడుకు అందించడానికి ఆ వ్యవస్థకు దాదాపు 20 నిముషాల వ్యవధి కావాలి. కొందరు ఆలోపునే భోజనం ముగిస్తారు. దాంతో  గబా గబా తినే వారిలో ఈ ప్రక్రియ అంతా అస్తవ్యస్తమవుతుంది. వారికి కడుపు నిండిందా లేదా అన్న విషయం తెలీక ఆకలి తగ్గిందని మెదడుకు సరైన సమాచారం అందక ఇంకా తినేస్తు ఉంటారు. ఫలితంగా కావలసిన దానికన్నా ఎక్కువ తినడం, ఊబకాయం బారిన పడడం తధ్యం.
                    అందుకే ఆహారాన్ని నింపాదిగా నమలడం,  మితంగా తినడం పిల్లలకు నేర్పండి. భారత దేశంలో కూడా 'ఫాస్ట్ ఫుడ్'  అలవాట్ల మూలంగా 'ఊబకాయ' లక్షణాలు కన్పిస్తున్న పిల్లలు, పెద్దలు  ఎక్కువవుతున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. అందువల్ల ఆహారం తినడం విషయంలో ఈ జాగ్రత్తలు అలవాటు చేసుకుంటే ప్రతి మనిషికి అవి మేలు చేస్తాయి.
                    తరువాత ముఖ్యంగా 'నీరు'......తిన్నది గొంతు దిగడానికి మాత్రమే అన్నట్లు వ్యవహరించే వారు మన దేశంలో ఎక్కువే. వారంతా గమనించి పాటించవలసిన విషయమేమంటే నీరు త్రాగడం ఆరోగ్యానికి అతి అవసరం. మనం జీవించడానికి గాలి ఎలా అవసరమో నీరు కూడా అంతే అవసరమని గుర్తించండి. మన శరీరంలో మలినాల విసర్జన మీరు తాగే నీటి పరిమాణం మీదే అధారపడుతుందని గ్రహించండి. రోజుకి కనీసం రెండు లీటర్ల నీరు శరీరానికి అవసరం. నిజానికి దాహమయినప్పుడు శరీరం కోరుకునేది 'నీరు' అన్నది తెలుసుకోవడం మంచిది. ఎ కూల్ డ్రింకు లో త్రాగి ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే శుభ్రమైన నీరు త్రాగడం కంటే ఉత్తమ మైనది లేద్దని గ్రహించండి.