లేబుళ్లు

5, మార్చి 2011, శనివారం

జీవితం జీవించడానికే !

                                                  జీవితం జీవించడానికే !

సికిందరాబాదు రైల్వే స్టేషన్ వచ్చి వెళ్ళే జనంతో కోలాహలంగా వుందారోజు. నేను,మావారు,మా అత్తగారు, ఇంకా కొంతమంది చుట్టాలతో 8 వ.నంబరు ప్లాట్ ఫారం మీదకు వచ్చాం. మా అత్తయ్య గారికి 83 ఏళ్ళు నిండాయి.
తను  పోయే లోపులో 'కాశీ'లో  తొమ్మిది రాత్రులు నిద్రచేయాలని ఆవిడ ఒకటే గొడవచేసింది. అందుకే
'కాశీ' బయలుదేరాం! తన ఆరోగ్యం అంతంత మాత్రమే! ఆమెతో బాటు ఆమె తోటి కోడళ్ళు,మరిది,మా ఆడపడుచు ఇంకా దగ్గరిచుట్టాలు  కొందరు పెద్దవాళ్ళు  మొత్తం 11 మందిమి పాట్నా ఎక్స్ ప్రెస్ 3 tier ఎ.సి బోగీ లో 'కాశీ'  బయలు దేరాం. ట్రైన్ ఉదయం సరిగ్గా 10 గంటలకు బయలుదేరింది. మరుసటి రోజు సాయంత్రం 3 గంటలకు వారణాసి చేరుతుంది ఎక్కాడ లేటు లేకుండా వెళ్తే. 
దాదాపు అందరు పెద్ద వయసు వారే, ఆరోగ్యాలు అంతంత మాత్రమే!  వీళ్ళందరినీ తీసుకుని 'కాశి' బయలుదేరాం!ఈ పెద్దవాళ్ళఅందరితో ఎలా నెగ్గుకోస్తామన్నభయంతోనే ప్రయాణం మొదలయింది. మాకు పరీక్ష  ట్రైన్లోనే మొదలయింది. రైల్వే వారు మాకు ముచ్చటగా మూడు మాత్రమే క్రింద బెర్తులు మాత్రమే ఇచ్చారు. మాకు కనీసం 7  క్రింద బెర్త్ లు కావాలి. తోటి ప్రయాణీకులని బతిమిలాడి, బామాలి  సర్దుకున్నాం.
నా సీట్ పక్కనే మధ్య వయస్కులు భార్య భర్త లా వున్నారు. వాళ్ళ క్రింద బెర్త్ కూడా మాకు ఇచ్చారు.
వాళ్ళ ముఖాలు చూస్తె ఏదో కొండంత భారం మోస్తున్న వారిలా మొహాలు పీక్కుపోయి, రోజులు తరబడి తినని వారిలా, బ్రదుకులో శూన్యంతప్ప ఏమీలేని వారిలావున్నారనిపించింది. ఎందుకలా వున్నారని అడగాలనిపించినా
భావ్యం కాదని, వారేదైనా బాధలో వుంటే ఇంకా బాధ పెట్టినదాన్నవుతానని అడగలేదు.  ట్రైన్ ప్రయాణం అందునా 30 గంటలు ప్రయాణం అంటే పక్కన కూర్చున్నవారు, ఎదురుగా కూర్చున్న వారు పరిచయం కాకుండా వుండరు మరీ అడవి మనుషులైతే తప్ప. అలాగే మా ఎదురుగా ఇంకో వయస్సు మళ్ళినజంట వాళ్ళ పిల్లలచదువుల గురించి, ఎంసెట్ లో వాళ్ళ రేంక్ ల గురించి,వాళ్ళ విదేశీ ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడుతూనే  వున్నారు.
నన్ను కూడా పిల్లగురించి అడిగారు. పక్కన వాళ్ళ అనాసక్తి  గమనించి  నేను ముక్తసరిగా చెప్పాను. చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెట్టేలా వున్న వారి  వాగ్దోరణిని  నేనూ హర్షించలేకపోయాను. అందుకే వారి 'అతికి' అడ్డు కట్ట వేయడానికి నేను మూడు సార్లు అమెరికా వెళ్లోచ్చాను, మా పిల్లలు అక్కడే వున్నారు అని చెప్పాక కాని వారి అతి వాగుడు  తగ్గలేదు. నేను గమనిస్తూనే వున్నాను. ఎదురావిడ మాట్లాడినంత సేపు నాపక్కన వాళ్ళ ముఖాల్లో చెప్పుకోలేని తీవ్ర బాధ,నిరాశ, నిస్పృహ, కళ్ళలోనీళ్ళు సుళ్ళు తిరగడం  ఆవిడ మాటి మాటి కి కళ్ళు తుడుచుకోవడం   స్పష్టంగా గమనించాను. ట్రైన్ దిగే లోపున వాళ్ళ బాధ తెలుసుకుని కొంతయినా ఊర డించాలని పించింది. మధ్యాన్నం రెండు గంటలకల్లా తెచ్చుకున్న భోజనం అయిందనిపించాము.
ట్రైన్ లో 'పేంట్రీ' కారు ఉందేమో కాఫీ, టీ లుబావున్నాయి. గంట, రెండు గంటల కోసారి బోగీ అంత క్లీన్ చేస్తున్నారు. 
ఇండియన్  రైల్వేస్ ఇంతబాగు పడిందేమిటి అనుకున్నాను. బోగీ క్లీన్ చేస్తున్న వారిని అడిగితే చెప్పారు.....ఈ క్లీనింగ్ కొన్ని సెలెక్టేడ్ ట్రైన్స్ లో మాత్రమే వుందట. పోనీలే ఇప్పటికయినా మనవారు ఇటు దృష్టి పెట్టారు అనుకున్నాను.సాయంత్రం నాలుగంటలయింది. ట్రైన్ మహారాష్ట్ర విదర్భ ప్రాంతం లో పరుగెడుతోంది. చంద్రపూర్ దాటింది. బాగా ఇండస్ట్రియల్ ఏరియాలా వుంది. పక్కనావిడ బయటకు వెళ్ళింది. ఇంతలో మా అత్తగారు బాత్రూం కి వెళ్ళాలంది. 
ఆవిడను తీసుకుని బయటకు వెళ్లాను. నా పక్కనావిడ అక్కడే  కొంగు నోటికడ్డం పెట్టుకుని  దిగాలుగా                   ఓ పక్కగా నిలబడి  వుంది. మా అత్తయ్య గారిని లోపల దింపి మళ్ళీ బయటకు వెళ్లాను. ఆవిడ అక్కడే వుంది.
నాకు ఆపరిస్థితిలో తనతో  ఎలా వ్యవహరించాలోఅర్ధం కాలేదు. అందునా ఏదో బాధలో వున్న వ్యక్తి! 
అయినా ధైర్యం చేసుకుని లేని చొరవతో  ఏంటండీ ...... ఇందాకట్నుంచి ఇక్కడే వున్నారు. ఏదైనా 'ప్రాబ్లం' నా? 
మీరేదో చాల బాధలో ఉన్నట్లున్నారు!  ముఖం కడుక్కోండి. కొద్దిగా  రిలీఫ్ వస్తుంది.....అంటూ ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి పక్కనే వున్న వాష్ బేసిన్  దగ్గరగా తీసుకెళ్ళాను. ఆవిడ ముఖం కడుక్కున్నాక మా సీట్ దగ్గరికి వచ్చి మావారికి  లేచి వెళ్ళమని సైగ చేశాను .ఆయన అర్ధచేసుకుని వెంటనే లేచి వెళ్లారు.
మాది సైడ్ బెర్త్  కావడంతో  తనని కూర్చోమని తనని కూర్చోమని నేనూ కూర్చున్నాను.
పక్కన వాళ్ళంతా పడకలు వేశారు.ఎ.సి కోచ్ కావడంతో పెద్దగా శబ్దం లేదు.
నేనే సంభాషణ మొదలెట్టాను. ఎక్కడదాక వెళ్తున్నారని అడిగాను.
ఆవిడ అలహాబాద్ త్రివేణి సంగమానికి వెళ్తున్నామని, తమకి  ఒక్కడే        కొడుకని అతను ఇక లేడని అతని ఆత్మ శాంతికోసమే త్రివేణి సంగమానికి వెళ్తున్నామని,
సీట్ క్రింద సంచి వంక చేయి చూపుతూ  
దుఖ్ఖం ఆపుకోలేక బావురుమంటూ  రెండుచేతులతో   ముఖం కప్పుకుందావిడ. ఇంతలో 'టీ'వచ్చింది. తనకి ఒక 'టీ' ఇచ్చి నేనూ ఒక 'టీ' తీసుకున్నాను.
నేను తనని సముదాయిస్తూ కష్టం మనిషికే వస్తుందని, చావు, పుట్టుకలు మన చేతిలో లేవని నాకు తెలిసిన రెండు మాటలు చెప్పాను.తను 'టీ' త్రాగింది.
తను కొద్దిగా తేరుకున్నాక అసలే మయిందని అడిగాను. తమకు ఒకే కొడుకని ఇంటర్ కాగానే ఎంసెట్ వ్రాశాడని మంచి రేంక్ రాకపోవడంతో ఇంజినీరింగ్ లో సీట్ రాలేదని,
మళ్ళీ మరుసటి సంవత్సరం దాకా ప్రిపేర్  అయ్యి మళ్ళీ ఎంసెట్ వ్రాసిన మంచి రేంక్ రాలేదని తమకు మేనేజ్ మెంటు కోట సీట్ తాహతు లేదనీ డిగ్రీ లో చేరమని, ఇంజినీరింగ్ ఒక్కటే చదువు కాదని,డిగ్రీ చదివి సివిల్ పరీక్షలు వ్రాయవచ్చని,
మొదల్నుంచి వాళ్ళ నాన్నగారు చెపుతున్నా వినిపించుకోకుండా మళ్ళీ ఇంకో సంవత్సరం ఆగి మళ్ళీ ఎంసెట్ వ్రాసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి వాళ్ళ బలవంతం
తో డిగ్రీ లో చేరినా మనిషి డిప్రెషన్  లోకి వె ళ్లాడని  ఇంకొక
సంవత్సరానికి తన ఫ్రెండ్స్ ఇంజినీరింగ్ అయిపోతుందని , వారిక అమెరికా వెళ్లి పోతారని,
ఇక తను బ్రతకడం  వేస్ట్
అని మీరాలం చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇక తమ జీవితాలు వ్యర్ధమని,
తాము ఇంకా ఎందుకు బ్రతికి ఉండాలో అర్ధం కావడంలేదని  చెప్పింది.
ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకున్నాడా ....ఏమవుతోంది...ఈ యువతకి... చదువులు, ప్రేమలు ...విఫలమవుతే ఆత్మహత్యలేనా...వారనుకున్న లక్ష్యం నేరవేరకపోతేనో, ప్రేమ విఫలమవుతోనో ఆత్మ హత్యలే శరణ్యమా? ఇక వేరే జీవితం లేదా? అందరు ఇంజినీర్లె జీవిస్తున్నారా? ఇంజినీర్ కావాలనుకుని కాలేక పోయినవాళ్ళు జీవితం చాలించాలా? ఏమిటీ పిచ్చి? పిల్లల పెంపకం లో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? పిల్లలు   15 -18  ఏళ్ళ వయస్సు వచ్చాక వాళ్ళ మనసుకు నచ్చే చదువుల్లో చేరవచ్చు. అది నెరవేరని పరిస్థితి లో వాళ్లకి నచ్చచెప్పి వేరే మార్గంలోకే మళ్ళించే ప్రయత్నం గట్టిగా చేయాలి. వినకపోతే స్నేహితులతోనో, వేరే ప్రయత్నాలతో వారి మనస్సు మార్చాలి. వారి మంకు పట్టు మార్చాలి. సరైన మార్గంలో    పెట్టే   దాక తల్లి తండ్రులు పట్టు వదల కూడదు, కొంత వరకైనా సరైన నిర్ణయాలు,సరైన సమయంలో  తీసుకుని  
 వారిని సరైన త్రోవలో పెట్టాలి. .వారిని మందలించి ఊరుకోవడమో, వారి నిర్ణయాలకు వదిలేయదమో చేస్తే ఇదిగో  పరిణామాలు ఇలాగే విపరీతంగా వుంటాయి.
అంతేకాదు.పిల్లలూ ఇక్కడ ఒక్క విషయం గమనించండి. పిల్లలు  కోరుకున్న చదువులు, ప్రేమలు,పెళ్ళిళ్ళు మాత్రమే కాదు జీవితం. జీవితాల్లో ఇవి ఒక భాగం మాత్రమే.
మీరు జీవితాలు చాలిస్తే మీ తలితండ్రులు ఎంత క్షోభకు గురవుతారో, వారి బ్రతుకులు ఎలా చిన్న భిన్నమవుతాయో, ఆలోచించండి. బ్రతకడానికి వేయి మార్గాలు.
కోరుకున్న చదువు, కోరికలు, స్వప్నాలు నేరవేరేకపోతే మనిషి తనువు చాలించాలంటే
ఇక ప్రపంచం యుగాంతానికి వచ్చినట్లే.
జీవితంలో ఒక మార్గం మూసుకుపోతే ఇంకావందల  మార్గాలు వుంటాయి. నేటి యువత ఇది గమనించి మెలగాలి.
క్షణికావేశంలో చేతులారా నిండు  ప్రాణాలు తీసుకోకండి!మీ కన్నవారి ఆశలు అడియాశలు  చేయకండి! "జీవితం జీవించడానికే గాని ప్రశ్నించడానికి కాదు" అన్నారు స్వామి వివేకానందుదు.ఆయన చెప్పిన చెప్పిన ఈ మాటలు ప్రతి విద్యార్ధి , ప్రతి ప్రేమికులు పాటించాలి.
కేశిరాజు రజని.
              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి